breaking news
Jasmine flower
-
వామ్మో.. మల్లె!.. బెంబేలెత్తుతున్న కస్టమర్లు
సాక్షి, చెన్నై: మదురై మార్కెట్లో మల్లె పువ్వుల ధర ఆకాశాన్ని తాకింది. మంగళవారం కిలో మల్లె పువ్వులు రూ. 3 వేలు ధర పలికాయి. అలాగే, ఇతర పువ్వుల ధర సైతం అమాంతం పెరిగింది. వర్షాల నేపథ్యంలో దిగుబడి తగ్గడంతో పువ్వుల ధరలకు రెక్కలొచ్చాయి. మదురై మల్లెకు తమిళునాడులో ప్రత్యేక స్థానం ఉంది. ఈ పువ్వు రెండు రోజుల వరకు మొగ్గగానే ఉంటుంది. ఆలస్యంగా ఈ పువ్వు వాడిపోతుంది. దీంతో మదురై ఫ్లవర్ మార్కెట్లో ఈ పువ్వులకు డిమాండ్ ఎక్కువే. నిన్న మొన్నటి వరకు ఈ మల్లె కిలో రూ. 1500 పలికింది. వినాయక చవితి తర్వాత ధర భారీగా పెరిగింది. మంగళవారం ఉదయాన్నే కిలో మల్లె రూ.3000 పలికింది. మదురై రకం మల్లె పువ్వుల ధర అమాంతంగా పెరగడంతో కొనుగోలు దారులకు షాక్ తప్పలేదు. అలాగే, కనకాంబరం కిలో రూ. వెయ్యికి పైగా పలికింది. రోజా, సంపంగి, చామంతి వంటి పువ్వుల ధరలు కూడా పెరిగాయి. వ్యాపారులు మాట్లాడుతూ వర్షాల కారణంగా పువ్వుల దిగుమతి భారీగా తగ్గిందని అందుకే ఈ పరిస్థితి నెలకొందన్నారు. చదవండి: (పళణి కోటలోకి శశికళ!) -
Jasmine Telugu Songs: పాటతో సేద తీరండి
సెకండ్ వేవ్ అట. మల్లెలు పూసె వెన్నెల కాసే... హాస్పిటల్స్లో బెడ్స్ లేవట. నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి... వాక్సిన్ నో స్టాక్. మల్లెపందిరి నీడలోనా జాబిల్లి... రాత్రిళ్లు కర్ఫ్యూ. మల్లెతీగకు పందిరివోలే.... మసక చీకటిలో ఎన్నెలవోలే... ఏం వింటాం చుట్టూ వార్తలు. హాయిగా పాటలు విందాం. మల్లెలు పూచే కాలం ఇది. ఈ ఆదివారం సినీ మల్లెలకు అర్పితం చేద్దాం. ‘మనసున మల్లెల మాలలూగెనే’... అని రాశారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ‘మల్లీశ్వరి’ కోసం. అసలు మల్లెల మాలలను చూడటమే మనోహరం. మరి అవి మనసున ఊగితే? ప్రేమికులకు అలా ఉంటుందట. భానుమతి, ఎన్.టి.ఆర్లకు అలా ఉందో లేదో కాని మనకు ఉంటుంది విన్న ప్రతిసారీ. మనసు ఊగినట్టు. కాసింత మైమరిచినట్టు. చాలదూ. పాట ఇంతకు మించి ఏం చేయాలి? సుశీలమ్మ గొంతు మరుమల్లెల గుత్తి. పలికిన చాలు పరిమళమే. ‘ఇది మల్లెల వేళయనీ... ఇది వెన్నెల మాసమనీ’... ‘సుఖదుఃఖాలు’లో ఆమె పాడుతుంటే ఏదో ఒక తెలియని వేదన కూడా పరిమళభరితమే అనిపిస్తుంది. ఏం మాటాడబుద్ధి కాదు. కూచున్నచోట నుంచి లేవబుద్ధి కాదు. మనమూ పాటా.. అవి మాత్రమే ఉంటాయి. మరి సి.నారాయణరెడ్డి గారు రాకుండా ఉంటారా? మల్లెల అత్తరును కలంలో పోసుకోకుండా ఉంటారా? ‘అడుగుజాడలు’ సినిమాలో ఎన్.టి.ఆర్, జమునలకు మంచి డ్యూయెట్ రాయలేదూ? దానిని ఘంటసాలతో కలిసి జానకమ్మ పలకలేదూ? ‘మల్లెలు కురిసే చల్లని వేళలో మనసే పలికెను నేడేలనో’... వాహ్. ఎంత హాయి. ఈ సినారేనే ఆ తర్వాత కలర్ సినిమాలు వచ్చాక ‘ఇంటింటి రామాయణం’ కోసం ‘మల్లెలు పూసె వెన్నెల కాసే ఈ రేయి హాయిగా’ అన్నారు. ఆ ఒక్కపాటలో ఉన్నందుకు రంగనాథ్, ప్రభల సినిమా సౌందర్యం శాశ్వతం అయ్యింది. రొమాంటిక్ హీరో అక్కినేని ‘తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము... మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమూ’ అని తరచి అడుగుతారు కృష్ణకుమారిని ‘అంతస్తులు’ సినిమాలో. ఆయనకు తెలియదా.. ఆయన కోసమేనని. అక్కినేనే ‘అమరజీవి’లో ‘మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి’ పాడారు. జయప్రద ఆ పాటలో అచ్చు మల్లెపూవులానే ఉంటుంది. అసలు అక్కినేనికి మంచి హిట్టునిచ్చింది ఆ తర్వాత మల్లెలే ‘అనుబంధం’లో. ఆయన అందులో రాధికతో కలిసి ‘మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన’ పాటను అదరగొట్టేశారు. వేటూరి మల్లెల సుగంధాన్ని తన పాటల్లో వదిలిపెట్టలేదు. ‘పదహారేళ్ల వయసు’లో ‘సిరిమల్లె పువ్వా’ ఆయన పదాలకు పరికిణీ కట్టి గెంతించింది. ‘జ్యోతి’లో ఆయన రాసిన ‘సిరిమల్లెపువ్వల్లే నవ్వు’ నిత్యహాసితం. సూపర్స్టార్ కృష్ణకు సూపర్ మల్లెలు దక్కాయి. ‘మాయదారి మల్లిగాడు’లో కృష్ణకు, మంజులకు పెళ్లయినప్పుడు జయంతి పాడే ‘మల్లెపందిరి నీడలోన జాబిల్లి’ నేటికీ హిట్. ‘బంగారుబావ’లో కృష్ణ స్టేజీ ఎక్కి ‘మల్లికా నవ మల్లికా’ పాడతారు. బాలూ సూపర్బ్ ఆలాపన. ‘అల్లరి బుల్లోడు’లో ‘చుక్కలతోటలో ఎక్కడున్నావో పక్కకు రావే సిరిమల్లె పువ్వా’ పాట ఎంత బాగుంటుంది. ఇక ఆయనకు మాస్ హిట్ ఇచ్చిన ‘ఊరికి మొనగాడు’ పాట అందరికీ తెలిసిందే. ‘ఇదిగో తెల్లచీర... ఇవిగో మల్లెపూలు’. మల్లెలే కాదు మల్లెతీగ కూడా పాటల్లో తన వాటా తీసుకుంది. ‘మల్లెతీగ వాడిపోగ మరల పూలు పూయునా’ పాట ‘పూజ’లో హిట్. ‘మీనా’లో ‘మల్లెతీగ వంటిది మగువ జీవితం’ పాట కూడా హిట్టే. ‘ఒరేయ్ రిక్షా’లో ‘మల్లెతీగకు పందిరివోలే’ అని చెల్లెలి సెంటిమెంట్ పాట ఊరువాడ మోగిపోయింది. ఆ తర్వాతి రోజుల్లో కొత్త సినీ సంగీకారులు, గేయకర్తలు కూడా తెలుగు సినిమాల్లో మల్లెపూలకు చోటిచ్చారు. ‘తీగనై మల్లెలు పూచిన వేళ’ (చిరంజీవి– ఆరాధన), ‘మల్లెల వాన మల్లెల వాన’ (రాజా), ‘మల్లెపూల వాన’ (వినోదం)... ఇక ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ టైటిల్ సాంగ్ ఉండనే ఉంది. డబ్బింగ్ పాటల్లో కూడా ‘మౌనరాగం’లో ‘మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో’, ‘అమృత’లో ‘మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా’... ఇవన్నీ పరిమళం చిందినవే. పాట ఎప్పుడూ ఒక స్ట్రెస్ బస్టరే. పాటను వినగలిగే ఆస్వాదించే హృదయం కాపాడుకుంటే ఆందోళనలను దూరం పెట్టినవారమవుతాము. పాట ఆహ్లాదం. పాట ఆరోగ్యం. పాట... ఈ కరోనా కాలాన ఒక అవసరమైన ఆస్వాదన. ఆస్వాదించండి. – సాక్షి ఫ్యామిలీ -
చిన్నబోయిన 'మల్లె'
కర్నూలు: 'అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి' అన్నట్టుగా తయారైంది గుబాళించే మల్లె పూల పరిస్థితి. మార్కెట్లో మల్లెపూల ధర రోజు రోజుకూ పతనం అవుతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నారు. కర్నూలు జిల్లాలో సుమారు 400 మంది రైతులు.. 500 ఎకరాల్లో మల్లెతోటలను సాగు చేస్తున్నారు. కిలో పూలు తెంచినందుకు రూ. 40 కూలిగా ఇవ్వాల్సి వస్తుంటే.. మార్కెట్లో కిలో ధర రూ. 20 పలుకుతోంది. దీంతో ఆర్థిక భారాన్ని భరించలేక పూలను తోటల్లోనే తెంచకుండా వదిలేస్తున్నారు. కూలీల ఖర్చులను భరించి కొంత మంది పూలను కోయించి హైదరాబాద్ తరలించినా అక్కడ కూడా ధర వెక్కిరిస్తోంది. హోల్సేల్ మార్కెట్లో కిలో రూ.8 ప్రకారం కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.