breaking news
IT Minister Priyank Kharge
-
ఏపీలా చేస్తే రాష్ట్రం సర్వనాశనం
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు ఏపీ స్థాయిలో ప్రోత్సహకాలు ఇవ్వలేమని, అలా చేస్తే రాష్ట్రం ఆర్థికంగా సర్వ నాశనం అయిపోతుందని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ మల్లికార్జున ఖర్గే (Priyank Kharge) స్పష్టం చేశారు. బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ ప్రోత్సాహకాలను ఇచ్చిందన్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని చెబుతున్నారే కానీ... అక్కడ అది ఏర్పాటు కావడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందనే విషయాన్ని ఎవరూ చెప్పటం లేదన్నారు. గూగుల్ డేటా సెంటర్ (Google Data Center) కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.22,000 కోట్ల ప్రోత్సాహకాలను ఇచ్చిందని చెప్పారు. ఇవికాకుండా వాళ్లకు 25 శాతం తక్కువ ధరకు భూమిని కేటాయించిందని, స్టేట్ జీఎస్టీలో 100 శాతం మినహాయింపు, 100 శాతం ఉచితంగా ట్రాన్స్మిషన్, నీళ్ల టారిఫ్లో 25 శాతం డిస్కౌంట్ ఇచ్చిందన్నారు. ఈ స్థాయిలో ప్రోత్సాహకాలు ఇచ్చే పరిస్థితి తమకు లేదని, ఒక వేళ ప్రకటిస్తే ఒక కంపెనీ కోసం రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వ నాశనం చేస్తారా అంటూ అందరూ నిలదీస్తారన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో బెంగళూరు నగరం ఐదవ స్థానంలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్తో నుంచి కూడా ఇక్కడికి ఉద్యోగాల కోసం వస్తున్నారని చెప్పారు. అందుకే బెంగళూరు నగరం ఓవర్ క్రౌడ్ అవుతోందని లోకేశ్ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చినా, ఏపీ ప్రజలు ఇక్కడికే వస్తారని.. ఎందుకంటే ఏఐలో నైపుణ్యం ఇక్కడే ఉందని చెప్పుకొచ్చారు. కాగా, ఖర్గే వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ‘ఎక్స్’ వేదికగా పరోక్షంగా స్పందించారు. ‘వారు ఆంధ్ర ఫుడ్ చాలా స్పైసీగా ఉందంటున్నారు. ఇప్పుడు పెట్టుబడులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మా పక్క వాళ్లు కొంత మంది ఆ మంటను ఫీల్ అవుతున్నారు’ అని పోస్ట్ చేశారు. -
బెంగళూరులో ‘ఐఫోన్’ అసెంబ్లింగ్!
నెల రోజుల్లో ప్రారంభించనున్న యాపిల్ కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే బెంగళూరు: యాపిల్ కంపెనీ నెలరోజుల్లో తన ఐఫోన్లను బెంగళూరు ప్లాంట్లో అసెంబ్లింగ్ చేయడాన్ని ఆరంభించనుంది. ఈ ప్లాంట్లో యాపిల్ కంపెనీ హై ఎండ్ ఐఫోన్ల అసెంబ్లింగ్ను నెలలోపే ప్రారంభిస్తుందన్న విషయాన్ని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ధ్రువీకరించారు. ఐఫోన్ల అసెంబ్లింగ్లో యాపిల్ కంపెనీకి తైవాన్కు చెందిన కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ విస్టర్న్ కార్ప్ తోడ్పాటునందిస్తుందని తెలిపారు. ఇక్కడే ఐఫోన్లను తయారు చేయడం వల్ల భారత్లో ఐఫోన్ల ధరలు దిగివస్తాయని, ఫలితంగా వేగంగా వృద్ధి చెందుతున్న భారత మొబైల్ మార్కెట్లో యాపిల్ కంపెనీ మార్కెట్ వాటా పెరగగలదని వ్యాఖ్యానించారు. రాయితీలు ఇవ్వాలి... చైనా, తైవాన్లకు గట్టి పోటీనివ్వడానికి యాపిల్ కంపెనీకే కాకుండా శామ్సంగ్, లెనొవొ తదితర కంపెనీలకు కూడా రాయితీలివ్వాలని ఖర్గే సూచించారు. అన్ని కంపెనీలకు సమాన అవకాశాలు కల్పించేందుకు గాను యాపిల్తో సహా పలు కంపెనీలకు నిర్దేశిత గడువు వరకూ కొన్ని సబ్సిడీలను, ప్రోత్సాహకాలను ఇవ్వాలని చెప్పారు. స్థానిక మార్కెట్ నుంచే విడిభాగాలను సమీకరించుకొని, ఫోన్లను పూర్తిగా ఇక్కడే తయారు చేసుకోవడానికి ప్రతి కంపెనీకి పదేళ్ల గడువును ఇవ్వాలన్నారు. స్టార్టప్లు భారత చట్టాల ప్రకారమే పనిచేయాల్సి ఉంటుందని ‘స్టేజిల్లా’ స్టార్టప్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. బకాయిలు చెల్లించలేదంటూ చెన్నైకి చెందిన ఒక ప్రకటనల కంపెనీ కేసు దాఖలు చేయడంతో స్టేజిల్లా స్టార్టప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన యోగేంద్ర వాసుపాల్ అరెస్టవడం తెలిసిందే.


