విజయంపైనే గురి
విజయవాడ స్పోర్ట్స్ : శాతవాహన కళాశాల ఆధ్వర్యంలో కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాల ఆర్చరీ పోటీలు (స్త్రీ, పురుష) శనివారం కళాశాలలో జరిగాయి. ఈ టోర్నీని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.రవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ టోర్నీ నుంచి కృష్ణా యూనివర్సిటీ ఆర్చరీ జట్లను ఎంపిక చేయనున్నారు. టోర్నీలో గుడివాడ ఎన్ఆర్ఆర్ కళాశాల, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల, మాంటిస్సోరి మహిళా కళాశాల, పీబీ సిద్ధార్థ, కేవీఎస్ఆర్ సిద్ధార్థ కళాశాల, శాతవాహన కళాశాల జట్లు పాల్గొన్నాయి. 70 మీటర్ల రికర్వు పురుషుల విభాగంలో కె.పిచ్చయ్య (శాతవాహన కళాశాల), పి.గోపీచంద్ (ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల), ఎన్.పృథ్వీనాథ్ (గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల) వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. 50 మీటర్ల కాంపౌండ్ విభాగం పురుషుల విభాగంలో నవీన్కుమార్, ఈజీఎన్ దీపు, ఓవీకే చైతన్య వరుసగా మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో కృష్ణా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నాగేశ్వరశర్మ, ఏపీ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ, టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి, కళాశాల పీడీ బీసీహెచ్ సంగీతరావు, కళాశాల మేనేజర్ కె.శ్రీధర్, వైస్ ప్రిన్సిపాల్ కె.వాసుదేవ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.