breaking news
Indian-origin businessman
-
కెనడాలో డ్రగ్స్ సూపర్ల్యాబ్ గుట్టురట్టు
వాంకోవర్: కెనడాలో మాదక ద్రవ్యాల తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏకంగా 485 మిలియన్ డాలర్ల (రూ.4,076 కోట్లు) కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రయోగశాలలో డ్రగ్స్ తయారు చేసి, విక్రయిస్తున్న భారత సంతతి వ్యాపారవేత్త గగన్ప్రీత్ రంధవాను అరెస్టు చేశారు. కెనడాలో బ్రిటిష్ కొలంబియాలోని కామ్లూప్స్కు 50 కిలోమీటర్ల దూరంలో ఫాల్క్ ల్యాండ్ అనే గ్రామీణ ప్రాంతంలో ఈ సూపర్ ల్యాబ్ ఏర్పాటుచేశారు. ఇక్కడ ఫెంటానైల్, మెథ్, కొకైన్, కన్నబీస్ తదితర డ్రగ్స్ పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. సూపర్ ల్యాబ్ గురించి సమాచారం అందుకున్న రాయల్ కెనడియన్ మౌంట్ పోలీసులు దాడి చేశారు. అక్కడి ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయారు. అత్యాధునికంగా ఉన్న ల్యాబ్లో నిషేధిత మాదక ద్రవ్యాలు తయారవుతుండడం చూసి అవాక్కయ్యారు. ఈ దాడిలో 500 కిలోలకుపైగా డ్రగ్స్ లభించాయి. అంతేకాదు కొన్ని ఆయుధాలు, పేలుడు పదార్థాలు సైతం లభ్యమయ్యాయి. ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ల్యాబ్ నిర్వహణలో, డ్రగ్స్ దందాలో గగన్ప్రీత్ రంధవా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తేల్చారు. -
కేరళ : బిజినెస్ టైకూన్ల భూరి విరాళం
ప్రకృతి విలయతాండవానికి కకావికలమైన కేరళీయులను ఆదుకునేందుకు భారతి సంతతి అరబ్ వ్యాపారులు భూరి విరాళాలతో ముందుకు వచ్చారు. దాదాపు రూ.13కోట్ల మేర సహాయాన్ని ప్రకటించారు. తద్వారా కేరళ బాధితులను ఆదుకుంటామని, ఇందుకోసం పలు వ్యాపార సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలతో చెప్పిన యుఏఈ ప్రయత్నాలు భారీ ఫలితాలనే ఇచ్చింది. తాజా మీడియా నివేదికల ప్రకారం కేరళ బాధితులకు అండగా నిలబడిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని భారత సంతతి వ్యాపారులు రూ.12.50 కోట్లను విరాళంగా ప్రకటించారు. ముఖ్యంగా కేరళకు చెందిన వ్యాపారవేత్త, లులు గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసుఫ్ అలీ ఎంఏ రూ.5 కోట్ల విరాళాన్నిచ్చారు. అలాగే ఫాతిమా హెల్త్కేర్ గ్రూప్ చైర్మన్ కేపీ హుస్సేన్ కూడా రూ.5కోట్ల సహాయాన్ని అందించనున్నారు. ఇందులో కోటి రూపాయలు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి చేరనున్నాయని, అంతేగాక తమ వైద్య నిపుణుల్లో కొందరిని వాలంటీర్లుగా వరద బాధిత ప్రాంతాలకు పంపించామని సంస్థ తెలిపింది. వరదలు తీవ్రంగా ముంచెత్తిన ప్రాంతాల్లో డమేరియా, విషజ్వరాలతోపాటు ఇతర అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ విరాళంలో సింహ భాగం మెడికల్ కేర్ కోసం వినియోగించనున్నామని ఫార్మ సంస్థ ప్రకటించడం అభినందనీయం. దీంతోపాటు యూఏఈ ఎక్సేంజ్, యునిమొని చైర్మన్, బిలియనీర్ బీఆర్ శెట్టి రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. భారతీయ ఫిజీషియన్, దాత, ఆస్టర్ డీఎం హెల్త్కేర్ వ్యవస్థాపక చైర్మన్, ఎండీ అజద్ మూపెన్ రూ.50 లక్షల సాయాన్ని ప్రకటించారు. 300లకు పైగా వాలంటీర్లను వైద్య సేవల నిమిత్తం అందుబాటులో ఉంచామన్నారు. ఈ పరిస్థితిని చాలా తీవ్రంగా నిర్వహించాల్సి ఉంది. అత్యవసర చికిత్సలను తక్షణమే అందించాలి. ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి సిఫార్సు మేరకు సహాయక శిబిరాలకు మందులను పంపిణీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు గల్ఫ్మీడియా నివేదించింది. మరోవైపు ఖతార్ చారిటీ రూ.34.89 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. వరదల్లో నిరాశ్రయులైన వారి కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్లు గల్ఫ్ టైమ్స్ తెలిపింది. కాగా గత కొన్ని రోజులు గాడ్స్ఓన్ కంట్రీ కేరళను భారీ వర్షాలు, వరదలు పట్టి పీడిస్తున్నాయి. ప్రస్తుతం పరస్థితి కొంతమెరుగైనా రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టంకూడా భారీగానే నమోదైంది. 3.14 లక్షలకుపైగా వరద బాధితులు రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. రోడ్డు ఇతర రవాణ సంస్థలు ధ్వంసమమ్యాయి. అరటి, కాఫీ, రబ్బరు, కొబ్బరి, నల్ల మిరియం లాంటి ఇతర పలు వాణిజ్యపంటలు నాశనమయ్యాయి. అటు కేరళ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన పర్యాటక ఆదాయం కూడా బాగా పడిపోనుందని అంచనా. యూఏఈ ప్రధాని, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బీన్ రషీద్ అల్ మక్తూం కేరళ వరద బాధితుల సహాయార్థం ముందుకు వచ్చిన సంగతి విషయం తెలిసిందే. తమ సక్సెస్ స్టోరీలో కీలకమైన కేరళీయులను ఆదుకునే బాధ్యతను తీసుకుంది. యూఏఈ జనాభాలో 30 శాతం భారతీయులుండగా, ఎక్కువ శాతం కేరళ ప్రజలే. -
భారత సంతతి వ్యాపారి కాల్చివేత
లండన్: భారత సంతతికి చెందిన ప్రగ్రేత్ సింగ్ (35) అనే వ్యాపారి యూకేలోని మాంచెస్టర్లో దోపిడీదారుల చేతిలో రెండురోజుల కిందట కాల్చివేతకు గురయ్యారు.స్థానిక పోలీసుల కథనం మేరకు సింగ్ తన దుకాణాన్ని మూసివేస్తున్న సమయంలో దుండగులు అతనిపై దాడికి తెగబడ్డారు. వారిని నిరోధించే క్రమంలో నిందితులు అతడ్ని దగ్గరనుంచి కాల్పులు జరపడంతో ఆయన కుప్పకూలాడు. అనంతరం ఆసుపత్రిలో ఆయన ప్రాణాలు విడిచాడు. ఈ సందర్భంగా దోపిడీదారులు భారీ ఎత్తున నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. సన్నిహితులకు చార్లేగా సుపరిచితుడైన సింగ్కు భార్యసుఖవిందర్, రెండు, అయిదేళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.