Indian couple
-
అబుదాబిలో భారత దంపతుల అనుమానాస్పద మృతి
దుబాయ్ : అబుదాబిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఫ్లాట్లో భారత్కు చెందిన దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ మేరకు ఖలీజ్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. మృతులను కేరళ కోజికోడ్ జిల్లాకు చెందిన జనార్ధనన్ పట్టీరీ(57), మినిజ(52) దంపతులుగా గుర్తించారు. అయితే వారి మరణానికి గల కారణాలు తెలియరాలేదు. వీరు 18 ఏళ్ల నుంచి అబుదాబిలో నివసిస్తున్నట్టుగా తెలుస్తోంది. జనార్ధనన్ ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తుండగా, మినిజా చార్టర్ అకౌంటెంట్గా ఉన్నారు. అయితే జనార్ధన్ ఇటీవలే తన ఉద్యోగం కోల్పోయినట్టుగా సమాచారం.(నియంత రాజ్యంలో తొలి కరోనా కేసు) ఈ ఘటనకు సంబంధించి వారి సన్నిహితుడు ఒకరు మాట్లాడుతూ.. ‘జనార్థనన్, మినిజ చాలా మంచివారు. వారికి ఎవరితోనూ ఎటువంటి సమస్య లేదు. జనార్ధనన్ తన ఉద్యోగం కోల్పోయాడు. కొద్ది రోజుల క్రితమే తన కారును కూడా అమ్మేశాడు. ఈ ఘటనపై అతని సహోద్యోగులు, స్నేహితులు షాక్కు గురయ్యారు. ఇలా జరిగి ఉండాల్సి కాదు’ అని పేర్కొన్నారు. కాగా, జననార్ధనన్కు-మినిజ దంపతకుల ఒక కుమారుడు ఉన్నాడు. అతడు అబుదాబిలోనే చదువుకున్నప్పటకీ.. బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు.(అన్లాక్ 3.0 : సినిమా హాళ్లు, జిమ్లకు అనుమతి?) -
దుబాయ్లో భారతీయ దంపతుల హత్య
షార్జా : పాకిస్తాన్కు చెందిన వ్యక్తి చేతిలో భారతీయ దంపతులు హత్యకు గురైన ఘటన దుబాయ్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డబ్బు, నగల కోసమే నిందితుడు వారిద్దరిని హత్య చేసినట్లు తెలుస్తుంది. వివరాలు.. భారత్కు చెందిన హిరెన్ అధియా, భార్య విధి అధియాతో కలిసి రెండు సంవత్సరాల క్రితం దుబాయ్కు వెళ్లి అరేబియన్ రాంచెస్లో నివసిస్తున్నాడు. షార్జాలో వ్యాపారం నిర్వహిస్తున్న హిరెన్ వ్యాపార నిమిత్తం జూన్ 18న యూఏఈకి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కు చెందిన వ్యక్తి హిరెన్, అతని భార్య విధి అధియా నుంచి డబ్బు, నగలు దోచుకొని హత్య చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హత్య చేసిన నిందితుడిని పట్టుకొని అతని వద్ద నుంచి నగలు, సొమ్మును రికవరీ చేశారు. కాగా హిరెన్ దంపతుల హత్యకు సంబంధించి దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్లో సమాచారమందించారు. (మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అనుచరుడి అరెస్ట్) -
చట్టాన్ని పక్కనపెట్టి చిన్నారికి బర్త్ సర్టిఫికెట్
దుబాయ్: హిందూ, ముస్లిం దంపతులకు జన్మించిన ఓ 9నెలల చిన్నారికి జనన ధ్రువీకరణ పత్రం జారీ చేయడం ద్వారా యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ప్రభుత్వం ఔదార్యతను చాటుకుంది. నిబంధనలను పక్కన పెట్టి మరీ భారత్కు చెందిన హిందూ తండ్రి, ముస్లిం తల్లికి జన్మించిన పాపకు బర్త్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు మీడియా తెలిపింది. యూఏఈలోని వివాహ చట్టం ప్రకారం ఓ ముస్లిం వ్యక్తి వేరే మతానికి చెందిన మహిళను వివాహమాడొచ్చు. కానీ ఓ ముస్లిం మహిళ మాత్రం ముస్లిమేతర వ్యక్తిని వివాహం చేసుకోరాదు. హిందువైన కిరణ్ బాబు, ముస్లిం యువతి సనమ్ సాబూ సిద్ధికీ 2016లో కేరళలో వివాహం చేసుకున్నారు. షార్జాలో నివాసముంటున్నారు. వీరికి జూలై 2018లో పాప జన్మించింది. కిరణ్ హిందువు కావడంతో అతని కూతురికి జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది. దీంతో యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్షౖకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో నిబంధనలు మార్చి అధికారులు జనన ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. దేశంలో ఇదే మొదటిసారి అని కిరణ్ పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు సహకరించిన ఇండియన్ ఎంబసీ కౌన్సిలర్ ఎమ్.రాజమురుగన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఔదార్యతను ప్రదర్శించే దేశంగా ముందుండటానికి యూఏఈ 2019 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ టాలరెన్స్గా ప్రకటించింది. రెండు భిన్న సంస్కృతులను కలిపేలా, ఇతర మతంలోని వారిని అనమతించే దిశగా ఈ చర్యలు చేపట్టింది. -
జర్మనీలో భారతీయ జంటపై దాడి
న్యూఢిల్లీ: జర్మనీలోని మ్యూనిక్ నగరంలో భారతీయ దంపతులపై దాడి జరిగింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయం వెల్లడించారు. ‘భారతీయ జంట ప్రశాంత్, స్మితా బసరుర్లపై మ్యూనిక్ సిటీలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దురదృష్టవశాత్తూ తీవ్ర గాయాల పాలైన ప్రశాంత్ మృతి చెందారు. స్మితా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు కారణమైన న్యూగినీకి చెందిన వలసదారుడి(33)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి కారణాలు వెల్లడి కాలేదు’ అని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ప్రశాంత్ సోదరుడు జర్మనీ వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. బాధితుల ఇద్దరు పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవాలని అక్కడి మన దౌత్యాధికారులను కోరాం’ అని ఆమె వివరించారు. దీనిపై ట్విట్టర్ ఫాలోయెర్ ఒకరు.. సహృదయులైన మీరు, పేరుకు ముందుగా చౌకీదార్ అని ఎందుకు ఉంచుకున్నారు? అంటూ ప్రశ్నించారు. దీనికి మంత్రి బదులిస్తూ..‘విదేశాల్లో ఉంటున్న భారతీయుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా చౌకీదారీ(కాపలా) పని చేస్తున్నందునే అలా చేశాను’ అని పేర్కొన్నారు. -
కూతుర్ని నిర్లక్ష్యం చేశారు.. జైలుకెళ్లారు
వాషింగ్టన్ : తమ ఆరు నెలల చిన్నారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారనే నేపంతో అరెస్టయిన భారతీయ దంపతులకు అమెరికా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వివారాలు.. తమిళనాడుకు చెందిన ప్రకాశ్ సెట్టు, మాలా పన్నీర్సెల్వం కొన్ని ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం తమ 6 నెలల చిన్నారి హిమిషాకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఫ్లోరిడాలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి వైద్యులు హిమిషాకు చేయాల్సిన చెకప్ల గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. కానీ వాటి ఖరీదు ఎక్కువ ఉండటంతో హిమిషా తల్లిదండ్రులు సదరు టెస్ట్లు చేపించకుండానే తమ చిన్నారిని ఇంటికి తీసుకువచ్చారు. దాంతో సదరు ఆస్పత్రి యాజమాన్యం హిమిషా తల్లిదండ్రుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. మన దేశంలో అయితే కన్నవారిని, కట్టుకున్న వారిని, కడుపున పుట్టిన పిల్లలను పట్టించుకోకపోవడం పెద్ద వింత కాదు.. నేరం అంతకంటే కాదు. కానీ అమెరికాలాంటి దేశాల్లో మాత్రం ఇలాంటి పనులు చేస్తే అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా హిమిషాకు వైద్య పరీక్షలు చేయడానికి నిరాకరించిన ఆమె తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేయడమే కాక వారిని అరెస్ట్ కూడా చేశారు. ఈ సంఘటన గత శుక్రవారం చోటు చేసుకుంది. నేడు హిమిషా తల్లిదండ్రులకు కోర్టు 30 వేల డాలర్ల పూచికత్తు మీద బెయిల్ మంజూరు చేసింది. ఈ సొమ్ము చెల్లించేంత వరకూ వారు తమ పిల్లలను చూడటానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం హిమిషా, ఆమె కవల సోదరుడు ఇద్దరూ చైల్డ్ ప్రొటక్షన్ అధికారులు సంరక్షణలో ఉన్నారు. ఈ విషయం గురించి హిమిషా అమ్మమ్మ తల్లిబిడ్డలను వేరు చేయడం మహా పాపం అంటూ విమర్శించారు. వైద్య పరీక్షలకు ఎక్కువ సొమ్ము చెల్లించాల్సి రావడం.. అంత మొత్తానికి ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోవడం వల్లే నా కూతురు, అల్లుడు హిమిషాను ఆస్పత్రి నుంచి తీసుకోచ్చారు. ఇప్పుడు బెయిల్ లభించినా కూడా దాదాపు 22 లక్షల రూపాయలు కట్టాలని ఆదేశించారు. మా దగ్గర అంత సొమ్ము లేదు. అందుకే విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు. -
విదేశీ బ్యాంక్పై భారతీయ జంట వేలకోట్ల దావా
మెల్ బోర్న్: భారీ మొత్తంలో నష్టపరిహారాన్ని కోరుతూ భారతీయ వ్యాపారవేత్త అతని భార్య ఓ విదేశీ బ్యాంకు పై పిటిషన్ దాఖలు చేశారు. మూసివేయబడిన వెస్ట్ ఆస్ట్రేలియన్ ఫెర్జిలైజేషన్ కంపెనీలో తమ షేర్లను తక్కువ ధరకు అక్రమంగా విక్రయించారని ఆరోపిస్తూ భారతీయ దంపతులు పంకజ్ ఓస్వాల్, రాధిక ఆస్ట్రేలియన్ బ్యాంకు కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. వేలకోట్ల డాలర్ల పరిహారాన్ని చెల్లించాలని కోరుతూ న్యాయపోరాటానికి దిగారు. ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూప్ (ఏఎన్జెడ్) సుమారు 6733 కోట్ల రూపాయలను చెల్లించాలని కోరుతూ విక్టోరియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. 2010 బర్రప్ ఫెర్టిలైజర్స్ కంపెనీలోని సుమారు 65 శాతం వాటాలను 4వందల మిలియన్ డార్లకు అమ్ముకున్నారని ఓస్వాల్ తరపున సీనియర్ న్యాయవాది టోనీ బనాన్ వాదించారు. ఈ విక్రయం నాటికి ఈ షేర్ల అసలు ధర 9 వందల మిలియన్ల డాలర్లు ఉందని ఆయన తెలిపారు. ఈ పరిణామంతో భారీగా నష్టపోయి అప్పుల్లో కూరకుపోయిన తన క్లయింట్ కు ప్రస్తుత విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించడంతో పాటు, న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే తన గ్రాహకత్వాన్ని వదులుకోవాలని బర్రప్ ఫెర్టిలైజర్స్ ప్రతినిధి బెదిరించారని ఓస్వాల్ దంపతులు ఆరోపించారు. దీంతో మిలియన్ల డాలర్లు ఇతర షేర్లను బలవంతగా అమ్మకోవాల్సి వచ్చిందని తెలిపారు. స్వాన్ రివర్ లో తాజ్ మహల్ గా అభివర్ణించే తమ నివాస నిర్మాణాన్ని సగంలో వదిలేసుకున్నట్టు చెప్పారు. ఖరీదైన జెట్, విలాసవంతమైన కార్లను అమ్ముకున్నామని పేర్కొన్నారు. మరోవైపు ఆస్ట్రేలియన్ టాక్సేషన్ ఆఫీస్ (ఎటో) 136 మిలియన్ డాలర్ల పన్ను బకాయిలు ఉన్నాయని గత నెల నోటీసులిచ్చింది. సదరు పన్నులు చెల్లించకపోతే పంకజ్ ఆస్తులను జప్తు చేస్తామనిడంతో పంకజ్ దంపతుల ఆందోళనలో మునిగిపోయారు. సోమవారం విచారణ ప్రారంభమైన ఈ కేసులో దాదాపు25 మంది లాయర్లు ఇరువైపులా వాదనలు వినిపించారు. ఇప్పటికే మిలియన్ డాలర్లు వెచ్చించిన అతి క్లిష్టమైన ఈ విచారణకు మరో మూడు నుంచి ఆరు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
ప్రవాస భారతీయ దంపతులకు 30 ఏళ్ల జైలు!
వాషింగ్టన్: ప్రవాస భారతీయ దంపతులు రాజు కోసూరి(44), ఆయన భార్య(45) స్మృతి ఝరియాలు హెచ్-1బీ అక్రమ వీసాల కేసులో దోషులుగా తేలారు. వీరికి 30 ఏళ్ల జైలు శిక్ష పడే వీలుందని అమెరికన్ న్యాయ శాఖ తెలిపింది. ఏస్బర్న్లో నివసించే ఈ జంటతోపాటు మరో నలుగురు వీసా అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఫోర్జరీ సంతకాలతో నకిలీ వీసాలను సృష్టించి వీరు ఇప్పటి దాదాపు 20 మిలియన్ డాలర్లు ఆర్జించినట్లు ఆరోపణలు ఉన్నాయని న్యాయశాఖ పేర్కొంది. -
భారత దంపతుల అనుమానాస్పద మృతి
కొలంబో: శ్రీలంకలోని ఒక హోటల్ గదిలో అనుమానాస్పదరీతిలో మరణించిన భారతీయ దంపతుల మృతదేహాలను శుక్రవారం పోలీసులు గుర్తించారు. పురుషుని వయసు 30 ఏళ్లు, మహిళ వయసు 27 ఏళ్లు ఉండవచ్చని తెలిపారు. కొలంబో సమీపంలోని వెల్లవెట్టాలో ఉన్న ఈ హోటల్లో మార్చి 27 నుంచి వీరు ఉంటున్నారని తెలిపారు. మృతుల బంధువులెవరూ లేకపోవడంతో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించలేదని, మృతురాలి తల్లిదండ్రులకు సమాచారమిచ్చినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రినుంచి వీరు బయటకు రాకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ధాయ్లాండ్లో యువ జంట మృతి
-
థాయిలాండ్లో నగర జంట మృతి
విహార యాత్రలో స్పీడ్బోట్ పల్టీ కొట్టడంతో దుర్ఘటన మృతులు సూర్యలత స్పిన్నింగ్ మిల్స్ ఈడీ యుష్ దంపతులు హైదరాబాద్: థాయిలాండ్కు విహార యాత్రకు వెళ్లిన ఓ జంట పడవ ప్రమాదానికి గురై మృతి చెందింది. బంజారాహిల్స్ రోడ్నెంబర్ 12కు చెందిన ప్రముఖ యువ పారిశ్రామికవేత్త, సూర్యలత స్పిన్నింగ్ మిల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ యష్ అగర్వాల్ (27) ఆయన భార్య పంకూరి మిట్టల్ (25) ఈ నెల రెండున థాయిలాండ్ విహార యాత్రకు వెళ్లారు. సోమవారం సాయంత్రం బీచ్కు వెళ్లి అక్కడ స్పీడ్ బోట్ ఎక్కారు. ఉవ్వెత్తున లేచిన సముద్రపు అలల తాకిడికి బోటు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువ జంట గల్లంతైంది. బోటు నడుపుతున్న వ్యక్తికి ఈత రావడంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఆయన ఇచ్చిన సమాచారంతో నౌకాదళ సిబ్బంది సోమవారం అర్ధరాత్రి రెండు మృతదేహాలను స్వాదీనం చేసుకున్నారు. వీరి మరణవార్త విన్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బంజారాహిల్స్లో విషాదం అలుముకుంది. నగరంలో బడా పారిశ్రామిక వేత్తలో ఒకరైన మహేందర్కుమార్ అగర్వాల్ తనయుడైన యష్అగర్వాల్ గత ఏడాది నవంబర్లో ఛండీగఢ్కు చెందిన పంకూరి మిట్టల్ను వివాహం చేసుకున్నారు. కాగా సొంత విమానాలు కలిగి ఉన్న మృతురాలి తండ్రి.. కూతురు, అల్లుడి మృతదేహాలను థాయిలాండ్ నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి తీసుకువస్తున్నారు.