India test cricket team
-
‘విరాట్’ పరుగుల పర్వాలు
‘నేను టెస్టు క్రికెట్ను రోజంతా ఒకే తరహా తీవ్రతతో ఆడాలని భావిస్తా. 88వ ఓవర్లో కూడా బ్యాటర్ షాట్ ఆడితే నేను సింగిల్ ఆపేందుకు అవసరమైతే డైవ్ కూడా చేస్తా. నా దృష్టిలో టెస్టు క్రికెట్ అంటే అదే’... ఇది విరాట్ కోహ్లికి టెస్టు ఫార్మాట్పై ఉన్న అభిమానాన్ని చూపిస్తోంది. ‘నేను నా మనసును, ఆత్మను కూడా టెస్టు క్రికెట్ కోసమే ఇచ్చా. ఈ ఫార్మాట్లో ఫిట్నెస్ కోసమే ఎన్నో త్యాగాలు చేశా’... 100 టెస్టులు పూర్తయిన సందర్భంగా అతను తన సంతృప్తిని ప్రదర్శించిన వ్యాఖ్య ఇది. ‘ఈ రోజంతా మనిద్దరమే బ్యాటింగ్ చేద్దాం.అవతలి జట్టులో ఒక్కొక్కడికి పగిలిపోవాలి’... ఇది మైదానంలో ప్రత్యర్థులపై అతను ప్రదర్శించిన దూకుడుకు ఒక చిన్న ట్రైలర్... టెస్టు క్రికెట్కు ఆదరణ తగ్గిపోతోందని అనిపించినప్పుడల్లా మైదానంలో కోహ్లిని చూస్తే అలాంటి భావనే కనిపించదు. అతను టెస్టుల్లో భారీగాపరుగులు మాత్రమే చేయలేదు. అతను ఎన్నో లెక్కలను కొత్తగా తిరగరాశాడు. సాంప్రదాయ ఫార్మాట్లో ఎన్నో సాంప్రదాయాలను బద్దలు కొట్టాడు. క్రమశిక్షణ, పట్టుదల, పోరాటపటిమ, ఫిట్నెస్, ఎక్కడా వెనక్కి తగ్గని తత్వం టెస్టుల్లోనే ఎక్కువగా బయట పడింది. కోహ్లిలాంటి టెస్టు క్రికెటర్ ఇకపై రాకపోవచ్చు. ఈ ఫార్మాట్లో అది ఎవరూ పూరించలేని లోటు. –సాక్షి క్రీడా విభాగం ‘భారత్ తరఫున ఆడుతున్న ఆ్రస్టేలియన్’... విరాట్ కోహ్లి దూకుడును ఆసీస్ గడ్డపై చూసిన తర్వాత విశ్లేషకులు ఇచ్చిన పేరు ఇది. మైదానంలో దూకుడు, ఢీ అంటే ఢీ అనే తత్వం, అటు బ్యాటర్గా, ఇటు కెపె్టన్గా అతని శైలి కోహ్లి ప్రత్యేకతను నిలబెట్టాయి. ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గను అన్నట్లుగా తెల్ల దుస్తుల్లో యుద్ధానికి సిద్ధమైన ఒక సైనికుడిలా అతను కనిపించేవాడు. 2014లో ఆస్ట్రేలియా గడ్డపై నాటి టాప్ పేసర్ మిచెల్ జాన్సన్తో అతను తలపడిన తీరును అభిమానులు ఎవరూ మర్చిపోలేరు.తన బౌలింగ్లో అద్భుతమైన కవర్ డ్రైవ్లు, పుల్ షాట్లతో కోహ్లి విరుచుకుపడుతుంటే జాన్సన్ మాటల యుద్ధానికి దిగగా, కోహ్లి ఎక్కడా తగ్గకుండా తాను అదే తరహాలో దీటుగా నిలబడ్డాడు. ఈ సిరీస్లో ఏకంగా 4 సెంచరీలతో 692 పరుగులు చేసిన అతను తన సత్తాను ప్రదర్శించాడు. అంతకుముందు దాదాపు మూడేళ్ల క్రితమే కోహ్లి దూకుడును ఆసీస్ చూసింది. 2011–12 టెస్టు సిరీస్లో భాగంగా జరిగిన పోరులో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంభీర్వంటి స్టార్ బ్యాటర్లంతా విఫలం కాగా భారత్ నుంచి ఒకే ఒక సెంచరీ నమోదైంది. అది కోహ్లి బ్యాట్ నుంచి వచి్చంది. ఇది కోహ్లి కెరీర్లో ఎనిమిదో టెస్టు. రెండు టెస్టుల క్రితం సిడ్నీలో క్రమశిక్షణారాహిత్యంతో శిక్షకు గురైన కోహ్లి... ఈ మ్యాచ్లో తన దూకుడును పరుగులుగా మలచి కసి తీర్చుకున్నట్లుగా అనిపించింది. అలా మొదలై... వన్డేల్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల తర్వాత గానీ కోహ్లి తొలి టెస్టు ఆడలేదు. సచిన్ గైర్హాజరులో అతనికి 2011లో వెస్టిండీస్ వెళ్లే అవకాశం లభించింది. అక్కడ పెద్దగా ఆకట్టుకోకపోయినా... ఆ తర్వాత ముంబైలో విండీస్తోనే రెండు ఇన్నింగ్స్లలో అర్ధ సెంచరీలు చేయడంతో కాస్త నిలదొక్కుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆ్రస్టేలియా సిరీస్ అవకాశం దక్కగా అడిలైడ్లో చేసిన సెంచరీతో కొత్త తరం ప్రతినిధిగా అతని ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత స్వదేశంలో నిలకడ కొనసాగగా... 2013 దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రదర్శన కోహ్లి స్థాయిని పెంచింది. ఆపై కివీస్పై వెల్లింగ్టన్లో చేసిన శతకంతో అతని బ్యాటింగ్ విలువ అందరికీ కనిపించింది. ఇక్కడి వరకు కోహ్లి టెస్టు కెరీర్ సాఫీగా సాగిపోయింది. తొలి 24 టెస్టుల్లో 46.71 సగటుతో 1721 పరుగులు చేయగా అందులో 6 సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత వచి్చంది ఇంగ్లండ్ పర్యటన. ఆరేళ్లు అద్భుతంగా... విరాట్ టెస్టు కెరీర్ అక్టోబర్ 2014 నుంచి డిసెంబర్ 2019 వరకు అత్యద్భుతంగా సాగింది. ఈ సమయంలో అతని కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనలు వచ్చాయి. అటు ఆటగాడిగా, ఇటు కెపె్టన్గా కూడా ఈ సమయంలో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. భారత అభిమానుల కోణంలో చూస్తే ఈ సమయంలో కోహ్లి అసలైన టెస్టు మజాను చూపించాడు. జట్టును తన బ్యాటింగ్తో బలమైన స్థితిలో నిలపడమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు అసాధారణ బ్యాటింగ్తో టెస్టులను ఎలా ఆడాలో అతను చేసి చూపించాడు.ఈ ఆరేళ్ల కాలంలో 55 టెస్టులు ఆడిన కోహ్లి ఏకంగా 63.65 సగటుతో 5347 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ సమయంలో గణాంకాలు అతడిని నంబర్వన్ టెస్టు బ్యాటర్గా నిలిపాయి. ముఖ్యంగా ఒక 18 నెలలు అతని బ్యాటింగ్ శిఖరానికి చేరింది. కేవలం 34 ఇన్నింగ్స్ల వ్యవధిలో కోహ్లి ఏకంగా 6 డబుల్ సెంచరీలు నమోదు చేయడం విశేషం. 34 ఇన్నింగ్స్ల వ్యవధిలో చూస్తే ఒక్క బ్రాడ్మన్ (8) మాత్రమే అతనికంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. కాస్త పదును తగ్గి... అసాధారణ బ్యాటింగ్ తర్వాత 2020 ఆరంభం నుంచి అతని టెస్టు బ్యాటింగ్లో పదును కాస్త నెమ్మదించింది. కోవిడ్ కారణంగా మ్యాచ్ల సంఖ్య తగ్గడంతో పాటు ఒకే తరహా జోరును కొనసాగించడంలో కోహ్లి విఫలమయ్యాడు. సెంచరీ మొహం చూసేందుకు మూడేన్నరేళ్లు పట్టాయి. 2021 ఇంగ్లండ్ పర్యటన కేవలం 2 అర్ధసెంచరీలతో నిరాశగా ముగియగా, 2023–24 దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా అతని ముద్ర కనిపించలేదు. ఇటీవల ముగిసిన ఆ్రస్టేలియా సిరీస్లోనైతే పెర్త్ మినహా అతని బ్యాటింగ్ చూస్తే కెరీర్ ముగింపునకు వచి్చనట్లే అనిపించింది. జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆడిన 39 టెస్టుల్లో కోహ్లి కేవలం 30.72 సగటుతో 2028 పరుగులు సాధించాడు. 3 శతకాలు మాత్రమే నమోదు చేయగలిగాడు. గత రెండేళ్లుగా అతని బ్యాటింగ్ సగటు 32.56 మాత్రమే. ఎలా చూసుకున్నా ఇది ఒక ప్రధాన బ్యాటర్కు సంబంధించి పేలవ ప్రదర్శనే. టెస్టు బ్యాటర్గా తన అత్యుత్తమ దశను ఎప్పుడో దాటిన కోహ్లి ఇప్పుడు కెరీర్ను హడావిడి లేకుండా ముగించాడు. పడి... పైకి లేచి... కోహ్లి వైఫల్యం గురించి చెప్పాలంటే అందరికీ గుర్తుకొచ్చేది 2014లో ఇంగ్లండ్లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్. స్వింగ్కు అనుకూలించిన అక్కడి పరిస్థితుల్లో సరైన ఫుట్వర్క్ లేక ఒకే తరహాలో పదే పదే అవుట్ అవుతూ కోహ్లి అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు. భారత నంబర్వన్ బ్యాటర్గా అక్కడ అడుగు పెట్టి అద్భుతాలు చేస్తాడనుకుంటే పూర్తిగా చేతులెత్తేశాడు. 10 ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 134 పరుగులతో ఘోరంగా విఫలం కావడమే కాదు... అప్పటి బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా గర్ల్ఫ్రెండ్ అనుష్క శర్మను టూర్కు తీసుకెళ్లి తీవ్ర విమర్శలపాలయ్యాడు.అయితే నాలుగేళ్లు తిరిగాయి... కోహ్లి ఆట మారింది. వ్యక్తిగా కూడా ఎంతో మారాడు. లోపాలను సరిదిద్దుకొని 2018లో మళ్లీ ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టాడు. ఏ బౌలర్నూ లెక్క చేయకుండా నాటి గాయాలూ మానేలా చెలరేగిపోయాడు. 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో ఏకంగా 593 పరుగులు సాధించి సిరీస్ టాపర్గా నిలిచాడు. ఇది కోహ్లిలోని పట్టుదలను, తాను విఫలమైన చోట మళ్లీ తానేంటో చూపించుకోవాలనే కసిని చూపించింది. ⇒ 4 భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సచిన్ (15,921), ద్రవిడ్ (13,288), గావస్కర్ (10,122) తర్వాత నాలుగో స్థానంలో నిలిచిన కోహ్లి (9230)... అత్యధిక శతకాల జాబితాలో కూడా సచిన్ (51), ద్రవిడ్ (36), గావస్కర్ (34) తర్వాత 30 శతకాలతో నాలుగో స్థానంలోనే ఉన్నాడు. ⇒ 4 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెపె్టన్ల జాబితాలో గ్రేమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41) తర్వాత కోహ్లి (40) నాలుగో స్థానంలో నిలిచాడు. ⇒ 7 కోహ్లి డబుల్ సెంచరీల సంఖ్య. ఓవరాల్ జాబితాలో బ్రాడ్మన్ (12; ఆస్ట్రేలియా), సంగక్కర (11; శ్రీలంక), లారా (9; వెస్టిండీస్) తర్వాత వాలీ హామండ్ (7; ఇంగ్లండ్), జయవర్ధనే (7; శ్రీలంక)లతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. -
‘కష్టమే... కానీ సరైన నిర్ణయమే’
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి తన మనసులో మాటకే కట్టుబడ్డాడు... టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలనుకున్న తన నిర్ణయంపై ఎలాంటి పునరాలోచన చేయలేదు... అతడిని ఒప్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. టెస్టుల నుంచి రిటైర్ అవుతున్నట్లు కోహ్లి సోమవారం అధికారికంగా ప్రకటించాడు. భారత టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా, సారథిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతను 14 ఏళ్ల కెరీర్కు గుడ్బై చెప్పాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం త్వరలోనే టీమ్ను సెలక్టర్లు ప్రకటించనున్న నేపథ్యంలో తన రిటైర్మెంట్ సమాచారాన్ని ముందుగానే బీసీసీఐకి తెలియజేయడం సరైందని విరాట్ భావించాడు. ఈ నిర్ణయం తీసుకోవడం కష్టంగానే అనిపిస్తున్నా అది సరైందేనని అతను పేర్కొన్నాడు. 2011 జూలైలో కింగ్స్టన్ వేదికగా వెస్టిండీస్తో తన తొలి టెస్టు ఆడిన కోహ్లి... 2025 జనవరిలో సిడ్నీలో ఆ్రస్టేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. గత ఏడాది వరల్డ్ కప్ విజయం తర్వాత టి20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన కోహ్లి ఇకపై వన్డేల్లోనే కొనసాగనున్నాడు. గత మంగళవారం రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా, ఆ్రస్టేలియా సిరీస్ మధ్యలోనే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుకోవడంతో తక్కువ వ్యవధిలో ముగ్గురు భారత సీనియర్లు ఈ ఫార్మాట్ నుంచి ని్రష్కమించినట్లయింది. ఎందుకీ వెనకడుగు? రోహిత్ టెస్టులకు గుడ్బై చెబితే పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు గానీ ఇప్పుడు కోహ్లి అనూహ్యంగా రిటైర్మెంట్ అనేశాడు. నిజానికి సవాళ్లను ఎదుర్కొనేందుకు కోహ్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కీలకమైన ఇంగ్లండ్ పర్యటన కోసం అతను కూడా సన్నద్ధమైనట్లు కనిపించింది. ఆస్ట్రేలియా టూర్ ముగిసిన తర్వాత ఐపీఎల్ ఆరంభానికి ముందు తన టెస్టు బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకునేందుకు ఎర్ర బంతితో సంజయ్ బంగర్ పర్యవేక్షణలో అతను తీవ్రంగా సాధన చేయడాన్ని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు టెస్టుల నుంచి తప్పుకోడని అర్థమైంది. అతని అద్భుతమైన ఫిట్నెస్ ఒక కారణం కాగా, ఇంగ్లండ్లో తన అనుభవంతో జట్టుకు మార్గదర్శిగా నిలిచే సత్తా అతనిలో ఉంది. రిటైర్మెంట్పై సరైన కారణంగా బయటికీ ఎవరికీ తెలియకపోయినా... వేర్వేరు కారణాలు అతడిని రిటైర్మెంట్ వైపు నడిపించాయి. తాను ఆశించినప్పుడు టెస్టు కెప్టెన్సీ మళ్లీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురయ్యాడనని చెబుతున్నా... నాయకత్వం లేకపోతే ఆడలేనని చెప్పే తక్కువ స్థాయి కాదు అతనిది. జట్టు కోసం వంద శాతం శ్రమించే అతనికి ఇది పెద్ద విషయం కాదు. అయితే ప్రస్తుత స్థితిలో కొన్ని అంశాలు అతను తప్పుకోవడానికి కారణంగా కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్ సిరీస్తో కొత్తగా 2025–27 వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ సైకిల్ మళ్లీ మొదలవుతోంది. వచ్చే రెండేళ్ల పాటు కోహ్లి కొనసాగడం కష్టం కావచ్చు. యువ ఆటగాళ్లతో ప్రణాళికలు రూపొందించుకునే విధంగా తాను తప్పుకోవడమే సరైందని అతను భావించాడు. ఆ్రస్టేలియాతో తొలి టెస్టు సెంచరీ తర్వాత మిగతా 7 ఇన్నింగ్స్లు కలిపి 85 పరుగులే చేశాడు. ఇదే వైఫల్యం ఇంగ్లండ్లో కొనసాగితే మరింత చెడ్డపేరు రావచ్చు. ప్రస్తుత స్థితిలో మళ్లీ ఫామ్ను అందుకొని చెలరేగిపోగలననే నమ్మకం అతనిలో తగ్గినట్లుంది. బీసీసీఐ సూచనల మేరకు రంజీ ట్రోఫీ ఆడినా అక్కడా హిమాన్షు సాంగ్వాన్లాంటి సాధారణ బౌలర్ బంతికి క్లీన్బౌల్డ్ అయిన తీరు కూడా తన ఆటపై సందేహాలు రేకెత్తించి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కోరినట్లు ఇంగ్లండ్తో సిరీస్ వరకు ఆడినా కొత్తగా అతను సాధించేదేమీ ఉండదు. పైగా తీవ్ర ఒత్తిడి, అంచనాలు కూడా. రోహిత్ శర్మలాంటి బ్యాటర్ కూడా తప్పుకోవడంతో అందరి కళ్లూ ఇప్పుడు తన బ్యాటింగ్పైనే ఉంటాయి. అంత ఒత్తిడి అనవసరం అని అతను భావించి ఉంటాడు.టెస్టు క్రికెట్లో తొలిసారి బ్యాగీ బ్లూ ధరించి 14 ఏళ్లయింది. ఈ ఫార్మాట్ నాపై ఇంతగా ప్రభావం చూపిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. టెస్టు క్రికెట్ నన్ను పరీక్షించింది. తీర్చిదిద్దింది. జీవితానికి కావాల్సిన పాఠాలు నేర్పించింది. టెస్టులు ఆడటంలో వ్యక్తిగతంగా ఎంతో తృప్తి ఉంది. అందులోని తీవ్రత, సుదీర్ఘ రోజులు, కొన్ని కీలక క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడం కష్టంగా అనిపిస్తోంది. కానీ సరైన నిర్ణయమే. టెస్టు క్రికెట్కు నేను ఎంతో ఇచ్చాను. నేను ఆశించిన దానికంటే ఇది ఎక్కువ నాకు తిరిగి ఇచ్చింది. ఈ ఆటకు, నాతో కలిసి ఆడిన వారికి, అండగా నిలిచిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా టెస్టు కెరీర్ పూర్తి సంతృప్తితో ముగిస్తున్నా. #269 వీడ్కోలు. –వీడ్కోలు ప్రకటనలో విరాట్ కోహ్లి‘కెప్టేన్ ఫైర్’టీమిండియాను విదేశీ గడ్డపై కూడా వెన్నెముక ఉన్న జట్టుగా సౌరవ్ గంగూలీ నిలబెడితే ఎమ్మెస్ ధోని ‘కూల్ కెప్టేన్’గా జట్టును నడిపించి చూపించాడు. కానీ విరాట్ కోహ్లి అలాంటివాడు కాదు. అతను నాయకుడిగా ఒక రగులుతున్న అగ్నిపర్వతంలాంటివాడు. అప్పటి వరకు ఉన్న స్క్రిప్ట్ను తగలబెట్టిన అతను కొత్త నాయకత్వ లక్షణాలను రచించాడు. తన బౌలర్లు, ఫీల్డర్లనుంచి అతను వంద శాతంకు మించి ప్రదర్శనను ఆశించాడు. అందరికంటే ముందు తానే అది చేసి చూపించాడు. తన బౌలింగ్, ఫీల్డింగ్ను నమ్ముకొని ‘60 ఓవర్లు వీరికి నరకం కనిపించాలి’ అని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ను ఆడుకున్న తీరు మర్చిపోలేనిది.కోహ్లికి ముందు చూస్తే బ్యాటర్లయినా భారీ స్కోరుతో జట్టును గెలిపించాలి లేదా స్పిన్నర్లపై భారం ఉండేది. కానీ స్వదేశమైనా, విదేశీ పిచ్ అయినా పేసర్లను అద్భుతంగా వాడుకొని గెలిపించిన తీరు అసాధారణం. ఒక బ్యాటర్ను తగ్గించి అయినా అదనపు బౌలర్ను తీసుకొని ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం, మ్యాచ్ గెలవడమే ముఖ్యంగా కోహ్లి వ్యూహరచన సాగింది. కోహ్లి కెప్టేన్సీలో పేస్ బౌలర్లు కేవలం 26 సగటుతో 591 వికెట్లు పడగొట్టారు. 80ల్లో వివ్ రిచర్డ్సన్ నాయకత్వంలో మాత్రమే పేసర్ల సగటు (22.89) ఇంతకంటే మెరుగ్గా ఉంది. 68 టెస్టుల్లో 40 మ్యాచ్లు గెలిపించి భారత అత్యుత్తమ కెప్టేన్గా అతను నిలిచాడు. ప్రతికూలతలను దాటి ఆ్రస్టేలియా గడ్డపై తొలి సారి టెస్టు సిరీస్ గెలిపించిన సారథిగా (2018–19) కోహ్లి చరిత్రలో నిలిచిపోయాడు. మరచిపోలేని కొన్ని ఇన్నింగ్స్ 115, 141 (అడిలైడ్, 2014): ధోని గైర్హాజరులో కెప్టెన్గా తొలి టెస్టు మ్యాచ్లో కోహ్లి అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో ఆసీస్కు భారీ ఆధిక్యం దక్కకుండా చేసిన అతను రెండో ఇన్నింగ్స్లో 364 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి వరకు పోరాడాడు. 119, 96 (జొహన్నెస్బర్గ్, 2013): తొలి ఇన్నింగ్స్లో విరాట్ సెంచరీతో భారత్కు ఆధిక్యం దక్కగా, రెండో ఇన్నింగ్స్ స్కోరుతో జట్టుకు గెలుపు అవకాశం సృష్టించాడు. 153 (సెంచూరియన్ 2018): కఠినమైన పిచ్పై 379 నిమిషాల పాటు పట్టుదలగా నిలబడి సాధించిన సెంచరీ. జట్టులో తర్వాతి అత్యుత్తమ స్కోరు 46 అంటే ఈ ఇన్నింగ్స్ విలువ అర్థమవుతుంది. 123 (పెర్త్, 2018): చేతి వేళ్లకు గాయాలు, హెల్మెట్కు దెబ్బలు, బ్యాటర్లంతా కుప్పకూలుతున్నారు. ఇలాంటి స్థితిలో అత్యుత్తమ పేస్, సీమ్ బౌలింగ్ను అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్పై ఎదుర్కొని చేసిన శతకం. ఇరు జట్లలో కలిపి ఇతర బ్యాటర్ల అత్యధిక స్కోరు 70 మాత్రమే. 254 నాటౌట్ (పుణే, 2019): కెరీర్లో అత్యధిక స్కోరు. స్వదేశంలో సఫారీ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ చేసిన డబుల్ సెంచరీలతో జట్టుకు విజయం. సచిన్ ‘100’ పదిలం!అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డు ఇక ఎప్పటికీ చెరిగిపోకపోవచ్చు. ఈ ఘనతను అధిగమించగల సత్తా ఉన్న ఒకే ఒక బ్యాటర్గా విరాట్ కోహ్లి కనిపించాడు. ఒక దశలో వరుస శతకాలు బాదుతున్న సమయంలో అతను చేరువగా వచ్చినట్లే అనిపించింది. ఆపై ఫామ్ కోల్పోయి కొంత కాలం సెంచరీ లేక విరాట్ కాస్త వెనుకబడ్డాడు. అయితే 2023 వన్డే వరల్డ్ కప్లో మూడు సెంచరీలు కొట్టిన కోహ్లి...ముంబైలోనే 50వ సెంచరీతో వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు.ఆపై పెర్త్ టెస్టులో వంద బాదిన అతను... చాంపియన్స్ ట్రోఫీలో పాక్పై సెంచరీతో సచిన్ రికార్డును కూడా దాటాడు. దీంతో ఓవరాల్గా కోహ్లి సెంచరీల సంఖ్య 82కు చేరింది. కనీసం మరో రెండేళ్లు అటు టెస్టులు, ఇటు వన్డేలు ఆడి నిలకడైన ప్రదర్శన కనబరిస్తే 100 కష్టం కాదనిపించింది. కానీ ఇప్పుడు టెస్టులను కోహ్లి తప్పుకున్నాడు. తన ఫిట్నెస్, ఇష్టమైన ఫార్మాట్ దృష్ట్యా 2027 వన్డే వరల్డ్ కప్ కొనసాగి ఆపై రిటైర్ అయ్యే ఆలోచనతో కోహ్లి ఉండవచ్చు. ఆ మెగా టోరీ్నలోగా భారత్ వేర్వేరు జట్లతో మొత్తం 27 వన్డేలు ఆడాల్సి ఉంది. కోహ్లి వీటిల్లో ఎంత బాగా ఆడగలడనేది చెప్పలేం. ఎంత అద్భుతమైన ఫామ్, చెలరేగి ఆడినా సరే 27 వన్డేల్లో 18 సెంచరీలు దాదాపు అసాధ్యం! అలా చూస్తే సెంచరీల సెంచరీ రికార్డులు ఢోకా లేదు. నీ క్రికెట్ ప్రస్థానం ఎంతో మంది చిన్నారులు ఆటను ఎంచుకు⇒ నేందుకు స్ఫూర్తిగా నిలిచింది. నీ టెస్టు కెరీర్ నిజంగా చాలా అద్భుతంగా సాగింది. నువ్వు భారత క్రికెట్కు పరుగులు మాత్రమే ఇవ్వలేదు. కొత్తతరం వీరాభిమానులను, క్రికెటర్లను అందించావు. అభినందనలు. –సచిన్ టెండూల్కర్⇒ నువ్వు రిటైర్ అయ్యావంటే నమ్మలేకపోతున్నా. ఆధునిక క్రికెట్ దిగ్గజంగా, ఆటకు అసలైన రాయబారిగా నిలిచావు. మనం కలిసి పని చేసినప్పుడు ఎప్పటికీ మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలను అందించావు. –రవిశాస్త్రి⇒ ఆధునిక క్రికెట్ యుగంలో టెస్టు ఫార్మాట్ కోసం అన్నీ ఇచి్చన అతి పెద్ద బ్రాండ్ కోహ్లి. టెస్టు క్రికెట్ అతనికి ఎంతో రుణపడి ఉంది. –సంజయ్ మంజ్రేకర్ ⇒ సింహంలాంటి పోరాటతత్వం ఉన్నవాడు. ఇకపై నీ లోటు కనిపిస్తుంది. –గౌతమ్ గంభీర్⇒ ‘నేను ఈ నిర్ణయాన్ని ఊహించలేదు. మరికొంత కాలం టెస్టులు ఆడగల సత్తా కోహ్లిలో ఉంది. అతనికి ఘనంగా మైదానంలో వీడ్కోలు దక్కాల్సింది. –అనిల్ కుంబ్లే -
భజ్జీ వచ్చేశాడు
►భారత టెస్టు జట్టులో హర్భజన్ సింగ్ ►రవీంద్ర జడేజా వన్డేలకే పరిమితం ►టెస్టులకు కోహ్లి, వన్డేలకు ధోని సారథ్యం ►బంగ్లాదేశ్ పర్యటనకు జట్టు ఎంపిక ►భారత్, బంగ్లాదేశ్ల మధ్య ఏకైక టెస్టు ఫతుల్లాలో జూన్ 10 నుంచి 14 వరకు జరుగుతుంది. ►జూన్ 18, 21, 24 తేదీల్లో మిర్పూర్లో మూడు వన్డేలు జరుగుతాయి. ముంబై : రెండేళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ... అందుబాటులో ఉన్న ప్రతి టోర్నీ ఆడుతూ... భారత జట్టులోకి రావడానికి హర్భజన్ చేసిన విశ్వప్రయత్నాలు ఫలించాయి. బంగ్లాదేశ్లో పర్యటించే భారత జట్టులో 34 ఏళ్ల ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్కు చోటు దక్కింది. సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ బుధవారం సమావేశమై టెస్టులకు, వన్డేలకు జట్టును ఎంపిక చేసింది. టెస్టు జట్టులోంచి రవీంద్ర జడేజాను తప్పించారు. వన్డేలకు ధోని, టెస్టులకు కోహ్లి సారథ్యం వహిస్తారు. ప్రపంచకప్ ఆడిన జట్టులో ఉన్న షమీ గాయం నుంచి కోలుకోకపోవడంతో... ఆ టోర్నీలో రిజర్వ్గా వ్యవహరించిన ధావల్ కులకర్ణి జట్టులోకి వచ్చాడు. ఇంతకుమించి ఎలాంటి మార్పులు, సంచలనాలు లేకుండా భారత జట్టును ప్రకటించారు. ‘మళ్లీ భారత జట్టులోకి రావడం నాకు కొత్త ఆరంభం. ఈ ఇన్నింగ్స్ను ఆత్మవిశ్వా సంతో ప్రారంభిస్తా. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటా. నన్ను ఇష్టపడే అనేకమంది ఆశీస్సులు నాతో ఉన్నాయి. రెండేళ్లుగా ఈ రోజు కోసమే కష్టపడుతున్నా. మళ్లీ జట్టులోకి వస్తాననే నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. మరో నాలుగైదేళ్లు ఆడే సత్తా నాలో ఉంది. కాబట్టి రిటైర్మెంట్ ఆలోచన ఎప్పుడూ రాలేదు. సచిన్, కుంబ్లే ఇద్దరూ నాలో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారు. కచ్చితంగా నేను తిరిగి జట్టులోకి వస్తానని సచిన్ ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. కష్టకాలంలో నాకు అండగా నిలబడ్డ వాళ్లందరికీ కృతజ్ఞతలు.’ -హర్భజన్ ‘బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్లో ఎక్కువ మంది ఎడంచేతి వాటం ఆటగాళ్లు ఉన్నందున జట్టులో ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు ఉండాలని భావించాం. ఈ విషయంలో కెప్టెన్ కోహ్లి అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం. అదే సమయంలో ఇతర యువ ఆఫ్ స్పిన్నర్ల గురించి కూడా చర్చించినా, హర్భజన్వైపే మొగ్గు చూపాం. యువరాజ్ గురించి చర్చ జరగలేదు. సెలక్షన్ కమిటీ దేశంలోని క్రికెటర్లందరికీ న్యాయం చేయాలి. ఇందులో భావోద్వేగాలకు తావులేదు. విశ్రాంతి కావాలని సీనియర్ క్రికెటర్లెవరూ కోరలేదు. అందరూ అందుబాటులో ఉన్నందున పూర్తిస్థాయి జట్టును ఎంపిక చేశాం.’ -సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ ‘హర్భజన్ మంచి ఫామ్లో ఉన్నాడు. జట్టులో చోటుకు తను అర్హుడు. 700 అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్ ఎవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. బాగా ఆడితే సీనియర్లు కూడా తిరిగి జట్టులోకి రావచ్చనే సంకేతం వచ్చింది. ఇటీవల బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడుతోంది. కాబట్టి పూర్తిస్థాయి జట్టుతో వెళ్లడమే మంచిది’ - గవాస్కర్ టెస్టు జట్టు : కోహ్లి (కెప్టెన్), విజయ్, ధావన్, కేఎల్ రాహుల్, పుజారా, రహానే, రోహిత్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, హర్భజన్, కరణ్ శర్మ, భువనేశ్వర్, ఉమేశ్, ఆరోన్, ఇషాంత్. వన్డే జట్టు: ధోని (కెప్టెన్), రోహిత్, రహానే, ధావన్, కోహ్లి, రైనా, రాయుడు, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, భువనేశ్వర్, ఉమేశ్, మోహిత్ శర్మ, స్టువర్ట్ బిన్నీ, ధావల్ కులకర్ణి. ‘మార్పు’ కలిసొచ్చిందా? సరిగ్గా 2 సంవత్సరాల 2 నెలల 15 రోజులు... హర్భజన్ సింగ్ భారత జట్టు తరఫున చివరి టెస్టు 2013 మార్చిలో హైదరాబాద్లో ఆస్ట్రేలియాతో ఆడాడు. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. మళ్లీ తిరిగి హర్భజన్ జట్టులోకి వస్తాడనే అంచనా కూడా పెద్దగా ఎవరికీ లేదు. సెహ్వాగ్, గంభీర్, యువరాజ్లతో పాటు భజ్జీ అంతర్జాతీయ కెరీర్ కూడా ముగిసినట్లే అని భావించారు. కానీ అనూహ్యంగా ఈ ‘టర్బోనేటర్’ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీని వెనక కారణాలు ఏంటి? ► జట్టుకు దూరమయ్యాక హర్భజన్ ప్రదర్శన అంత పేలవంగా లేదు. ఐపీఎల్ మూడు సీజన్లూ బాగానే బౌలింగ్ చేశాడు. ఇదే సమయంలో రంజీల్లో పెద్దగా ఆడలేదు. 3 మ్యాచ్లు ఆడి ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. నిజానికి ఐపీఎల్లో బౌలింగ్ బాగా చేస్తే వన్డే జట్టులోకి లేదంటే టి20 జట్టులోకి రావాలి. కానీ టెస్టు జట్టులోకి వచ్చాడు. ► ఐపీఎల్ ప్రదర్శనే కారణమనుకుంటే 2013లో 24 వికెట్లు తీశాడు. గత ఏడాది 14, ఈసారి ఇప్పటికి 16 వికెట్లు తీశాడు. అంటే ఈ ప్రదర్శన ఆధారంగా జట్టులోకి వచ్చేదుంటే 2013లో జట్టులో స్థానం పోకూడదు. ఎందుకంటే ఆ సీజన్ రంజీల్లో భజ్జీ 5 మ్యాచ్ల్లో 22 వికెట్లతో రాణించాడు. ఈసారి ఐపీఎల్లో తనతో పోలిస్తే ఆశిష్ నెహ్రా ఇంకా బాగా బౌలింగ్ చేశాడు. కాబట్టి ఐపీఎల్ ప్రదర్శన భజ్జీ పునరాగమనానికి కారణం కాదు. ► జట్టు ఎంపిక తర్వాత సందీప్ పాటిల్ ఓ కీలక వ్యాఖ్య చేశారు. ‘ప్రత్యర్థి బలం ప్రకారం జట్టులో ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు అవసరం. యువ స్పిన్నర్ల పేరు చర్చకు వచ్చినా కెప్టెన్ కోహ్లి అభిప్రాయాన్నీ పరిగణనలోకి తీసుకున్నాం’ అని చెప్పారు. అంటే హర్భజన్ను కోహ్లి సిఫారసు చేశాడని అర్థమవుతోంది. ► మరోవైపు భజ్జీ కూడా తన శ్రేయోభిలాషుల ఆశీస్సులు తనతో ఉన్నాయని చెప్పాడు. అంటే కోహ్లి తనకు మద్దతు ఇచ్చాడనే విషయం భజ్జీకి కూడా అర్థమైపోయిందనుకోవాలి. ► కెప్టెన్గా ధోని ఎప్పుడూ ‘యువ’మంత్రమే జపిస్తాడు. అతను సారథిగా ఉన్నంతకాలం పాత క్రికెటర్లు మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశమే లేదనే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో ధోని అనూహ్యంగా టెస్టులకు గుడ్బై చెప్పడం, కోహ్లి పగ్గాలు రావడంతో భారత క్రికెట్లో ‘మార్పు’ మొదలైంది. ► మిగిలిన వారి సంగతెలా ఉన్నా యువరాజ్, హర్భజన్ల విషయంలో కోహ్లికి చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది. మైదానంలో, వెలుపలా వీళ్లు ఎక్కడ కలిసినా సరదాగానే ఉంటారు. ఇప్పుడు టెస్టు జట్టు ఎంపికలో కెప్టెన్ నిర్ణయం కూడా కీలకం. సారథిగా కోహ్లి తనకు కావలసిన క్రికెటర్లను కోరుకునే అవకాశం ఉంది. సాధారణంగా సెలక్టర్లు రెండు పేర్లను ఖరారు చేస్తే అందులో కెప్టెన్ కోరుకున్న ఆటగాడే మిగులుతాడు. కాబట్టి భజ్జీ ఎంపికలో కోహ్లి పాత్ర చాలా కీలకం. ► బంగ్లాదేశ్తో ఆడబోయేది కేవలం ఒక్క టెస్టు మాత్రమే. ఇందులో తుది జట్టులో హర్భజన్ ఉండటం దాదాపుగా ఖాయమే. కాబట్టి ఈ మ్యాచ్ను ఈ పంజాబీ క్రికెటర్ జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఆ మ్యాచ్లో గనక రాణిస్తే... మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంటుంది. వన్డే జట్టులోకి తిరిగి రావాలన్నా ఈ టెస్టులో అమోఘంగా రాణించాలి. ► భజ్జీ ఎంపిక యువీ, సెహ్వాగ్, గంభీర్లాంటి క్రికెటర్లలో కూడా స్ఫూర్తిని పెంచే అంశం. నిజానికి ఈ ముగ్గురూ ఈ సీజన్ ఐపీఎల్లో విఫలమయ్యారు. ఒకవేళ యువీ ఈ సీజన్లో గనక బాగా ఆడివుంటే కచ్చితంగా సెలక్షన్ కమిటీ సమావేశంలో చర్చ జరిగేది. చర్చ జరిగే పరిస్థితే వస్తే కోహ్లి ఉంటాడు. మొత్తానికి భారత క్రికెట్లో జరిగిన ‘మార్పు’ వెటరన్ క్రికెటర్లలో కూడా ఆశను పెంచేదే. -సాక్షి క్రీడావిభాగం -
టెస్టు జట్టులో గంభీర్ కు చోటు
ముంబై: టీమిండియా బ్యాట్స్మన్ గౌతమ్ గంభీర్ మళ్లీ జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. ఏడాదిన్నర తర్వాత అతడికి జట్టులో చోటు దక్కింది. టెస్టు జట్టులో గంభీర్ కు స్థానం కల్పించారు. ఇంగ్లండ్ తో జరగనున్న టెస్టు సిరీస్ కు ఎంపిక చేసిన 18 మంది ఆటగాళ్లలో గంభీర్ కూడా ఉన్నాడు. వెటరన్ బౌలర్ జహీర్ఖాన్ కు మొండిచేయి చూపారు. గాయం కారణంగా అతడిని పక్కనబెట్టారు. ఆరుగురు ఫాస్ట్ బౌలర్లకు చోటు కల్పించారు. రాజస్థాన్ కు చెందిన పొడగరి పేసర్ పంకజ్ సింగ్ కు కూడా పిలుపువచ్చింది. జూలై 19 నుంచి ఇంగ్లండ్ తో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. జట్టు: ధోని(కెప్టెన్), విజయ్, ధావన్, గంభీర్, పూజారా, రహానే, కోహ్లి, రోహిత్ శర్మ, జడేజా, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, షమీ, ఈశ్వర్ పాండే, ఇషాంత్ శర్మ, స్టువార్ట్ బిన్నీ, ఆరోన్, సాహా, పంకజ్ సింగ్.