breaking news
India-China ties
-
దలైలామాపై భగ్గుమన్న చైనా.. భారత్కు అల్టిమేటం!
-
చైనాకు వ్యతిరేకంగా భారత్ నన్ను వాడుకోలేదు!
న్యూఢిల్లీ: తన అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బౌద్ధమత గురువు దలైలామా స్పందించారు. చైనాకు వ్యతిరేకంగా భారత్ తననెప్పుడు వాడుకోలేదని ఆయన అన్నారు. టిబేట్ ప్రాంతానికి అర్థమంతమైన స్వయం పరిపాలన, స్వతంత్రతను చైనా అందించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. 'చైనాలో భారత్ను ప్రేమించేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ కొంతమంది సంకుచిత దృక్పథం కలిగిన రాజకీయా నాయకులు నన్ను రాక్షసుడిగా చూస్తున్నారు' అని అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న దలైలామా బుధవారం మీడియాతో పేర్కొన్నారు. దౌత్యపరంగా చైనాను సవాల్ చేసేందుకే దలైలామాను భారత్ వాడుకుంటున్నదని ఆ దేశం చేస్తున్న వాదనను దలైలామా తోసిపుచ్చారు. 'భారత్కు నేను చాలా సుదీర్ఘకాలపు అతిథిని. నన్ను చైనాకు విరుద్ధంగా భారత్ వాడుకోలేదు' అని అన్నారు. అరుణాచల్లో దలైలామా పర్యటనను వెంటనే నిలిపివేయాలని భారత్ను చైనా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ 'వివాదాస్పద ప్రాంతం'లో దలైలామా పర్యటనకు అనుమతించడం ద్వారా భారత్ తమతో సంబంధాలను చెడగొట్టుకునే సాహసం చేసిందని డ్రాగన్ మండిపడింది. -
దలైలామాపై భగ్గుమన్న చైనా.. భారత్కు అల్టిమేటం!
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్లో కొనసాగుతున్న బౌద్ధ మత గురువు దలైలామా పర్యటనపై చైనా భగ్గుమంది. 'వివాదాస్పద ఆ ప్రాంతం'లో దలైలామా పర్యటనను వెంటనే నిలిపివేయాలని భారత్కు అల్టిమేటం జారీచేసింది. అరుణాచల్ ప్రదేశ్లో దలైలామా పర్యటనకు అనుమతించడం ద్వారా భారత్ తమతో సంబంధాలను చెడగొట్టుకునే సాహసం చేసిందని మండిపడింది. 81 ఏళ్ల టిబేట్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా మంగళవారం నుంచి వారం రోజులపాటు అరుణాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దలైలామా పర్యటన భారత్ అంతర్గత విషయమని, ఈ విషయంలో రాద్ధాంతం చేయడం తగదని భారత్ ఇప్పటికే చైనాకు హితవు పలికింది. అయితే, అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబేట్లో భాగమని మొండిగా వాదిస్తున్న చైనా.. సరిహద్దుల్లో ఆ వివాదాస్పద ప్రాంతానికి దలైలామాను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది. 'తప్పుడు చర్యలను వెంటనే మానుకోవాలని భారత పక్షాన్ని కోరుతున్నాం. సున్నితమైన విషయాలను రెచ్చగొట్టదు. భారత్-చైనా సంబంధాల వృద్ధికి దోహదపడే సమగ్ర చర్యలు తీసుకోవాలి' అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హు చున్యింగ్ బుధవారం మీడియాతో అన్నారు. దలైలామా ఆధ్యాత్మిక కారణాలతోనే ఈ పర్యటన చేస్తున్నారన్న భారత వాదనను సైతం చైనా తోసిపుచ్చింది. వివాదాస్పద ప్రాంతంలో దలైలామా ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్నారంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని వ్యాఖ్యానించింది. '14వ దలైలామా పాత్ర ఏమిటో భారత్కు చాలా బాగా తెలుసు. వివాదాస్పద ప్రాంతంలో ఈ పర్యటనకు అనుమతించడమంటే.. టిబేట్ విషయంలో భారత్ చిత్తశుద్ధికి వ్యతిరేకమే అవుతుంది. అంతేకాకుండా సరిహద్దుల్లో వివాదాన్ని రేపుతుంది' అని చున్యింగ్ పేర్కొన్నారు. తమ అభ్యంతరాలను బేఖాతరు చేసి మరీ దలైలామా పర్యటనను అనుమతించినందుకు భారత్కు తమ నిరసనను తెలుపుతామని చైనా పేర్కొంది. ఇది ఇరుదేశాల సంబంధాలను దారుణంగా దెబ్బతీయడమే కాకుండా సరిహద్దు వివాదంలో ఉద్రిక్తతలు పెంచవచ్చునంటూ సంకేతాలు ఇచ్చింది.