ధరల సెగ..
సత్తెనపల్లి, న్యూస్లైన్ : సంక్రాంతి పండగ అంటే ఆ సందడి మాటల్లో చెప్పేది కాదు. అన్ని పండగల కంటే భిన్నంగా, పెద్ద పండగగా చేస్తారు. ఇక పిండి వంటలు ఘుమ ఘుమలాడుతుంటాయి. ఈ పండగకు అరిసెలు, బూరెలు, చక్రాలు, నువ్వుల లడ్డూలు ఇలా పలు ర కాల ప్రత్యేక వంటకాలు ప్రతి ఇంట్లో తయారుచేసుకొంటారు. అయితే ప్రస్తుతం పిండి వంటలకు అవసరమయ్యే బియ్యం నుంచి బెల్లం,నెయ్యి వరకు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వాటిని అందుకోలేక పండగకు పిండి వంటల కోసం పేదలు, మధ్య తరగతి ప్రజలు సతమతమవుతున్నారు.సంక్రాంతి అంటేనే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది అరిసెలు. అవి చేయనిదే పండగ లేనట్టే భావిస్తారు. ఈ సారి చాలా మంది ఇళ్ళల్లో అరిసెలు ఎప్పటిలా కాకుండా కొద్ది మొత్తంలో చేస్తున్నారు. వాటి తయారీకి అవసరమైన ప్రతి వస్తువు ధర భారీగా పెరిగింది.