breaking news
iiit colleges
-
నా కొడుకును కొట్టి చంపేశారు!
శ్రీకాకుళం క్రైమ్/ఎచ్చెర్ల: ట్రిపుల్ ఐటీ విద్యార్థి మరణంతో ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎంపురంలో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రాంగణంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సుమారు మూడు వేల మంది విద్యార్థుల ధర్నాలు, నినాదాలతో హోరెత్తింది. తోటి విద్యార్థి సృజన్ బుధవారం ఆత్మహత్య చేసుకోవడంతో ఇన్నాళ్లు వారిలో దాగి ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓ మంచి విద్యార్థిని అన్యాయంగా చంపేశారనే భావన వారిని తీవ్రంగా కలచివేసింది. దీంతో కొన్నేళ్లుగా కళాశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్లు చేస్తున్న ఆగడాలు బట్టబయలవ్వడమే కాక కళాశాలలో ఇన్నాళ్లు గుట్టుగా జరుగుతున్న అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏమీ తెలియదట.. విద్యార్థి సృజన్ను రాత్రంగా సీనియర్లు కొట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నా.. మరుసటి రోజు ఉదయం సృజన్ ఆత్మహత్య చేసుకున్నా అంబులెన్సు వస్తే గానీ తనకు తెలియదని క్యాంపస్ డైరెక్టర్ చెప్పడం అక్కడి యాజమాన్య నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. గతంలోనూ ఆత్మహత్య ఘటనలు జరగడంతో పోలీసుల సాయంతో ఈ సారి కూడా గొడవను సద్దుమణిగేలా చేద్దామని యాజమాన్యం తీవ్రంగా ప్రయతి్నంచింది. కానీ విద్యార్థుల ఆగ్రహం, ఆందోళనల ముందు ఇటు పోలీసులు, అటు కళాశాల యాజమాన్యం తలొగ్గక తప్పలేదు. కుటుంబసభ్యులు, విద్యార్థులు ఆ రాత్రి కొట్టింది తొమ్మిది మంది అని చెప్పినప్పటికీ పోలీసులు ఎట్టకేలకు 8 మందిని అదుపులోకి తీసుకోవడంతో కాస్త శాంతించి వెనుదిరిగారు. బుధవారం రాత్రే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్రంలోని రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించినా.. శుక్రవారం విద్యార్థులు, సృజన్ కుటుంబీకుల ఆందోళనలు సద్దుమణిగాకే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు ఘటనకు బాధ్యులైన ఎనిమిది మంది విద్యార్థులు వై.అమిత్, ఎస్కే అనీష్ అహ్మద్, బి.అభిష్క్, జె.చిన్నబాబు, షేక్ అజీల్, ఎస్కే మస్తాన్, ఎస్కే సమీర్, ఎ.భానుప్రకాష్లను సస్పెండ్ చేశారు. తప్పుడు ప్రచారంపై మండిపాటు.. యాజమాన్యం పూర్తి నిర్లక్ష్య ధోరణి కనిపించడం.. మీడియా ముందు వాస్తవాలు చెప్పేందుకు కూడా ఆంక్షలు పెట్టడంతో విద్యార్థులు తట్టుకోలేకపోయారు. దీనికితోడు ‘సృజన్ బ్యాక్లాగ్స్ ఉంచేశాడు.. కళాశాలలో ఉన్న అమ్మాయితో చెడుగా ప్రవర్తించాడు.. అమ్మాయి సోదరుడు ఒక్కరే రెండు చెంపదెబ్బలు కొట్టాడు..’ వంటి తప్పుడు వదంతులు సృష్టించారంటూ మండిపడ్డారు. ఉదయం నుంచే ధర్నా.. సృజన్ తల్లిదండ్రులు, కుటుంబీకులు గురువారం ఉదయం 6 గంటలకు వచ్చారు. పరిస్థితి అదుపు తప్పక ముందే డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ ఎం.అవతారం, ఎస్ఐ వి.సందీప్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో విద్యార్థులు రెండు బృందాలుగా విడిపోయి ధర్నాకు దిగారు. తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని సృజన్ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ లోగా కళాశాల యాజమాన్యం సమక్షంలో సృజన్ తల్లిదండ్రులతో డీస్పీ వివేకానంద, సీఐ అవతారంలు చర్చించారు. విద్యార్థుల ఆందోళనను విరమించేలా చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకోవడం, సృజన్ తల్లిదండ్రులు సైతం విజ్ఞప్తి చేయడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.అవన్నీ అబద్ధాలే.. సృజన్ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. బ్యాక్లాగ్స్ ఉంచేశాడని, మంచివాడు కాడని, చదువు వల్ల చనిపోయాడన్నది నిజం కాదు. సీనియర్స్ దాడి చేశారన్నది నిజం. ముందు రోజు సృజన్పై దాడి ఎవరికీ తెలియదు. ఆత్మహత్య చేసుకున్నాక తప్పుగా పోలీసులకు వెళ్లింది. 11వ తేదీ రాత్రి 11 నుంచి 3 గంటల వరకు సీనియర్లు 9 మంది కొట్టి వేధించారు. తెల్లవారేసరికి అంతా పరీక్షలకు వెళ్లాం. సృజన్ రాలేదు. వచ్చేసరికి ఆత్మహత్య చేసుకున్నాడు. సృజన్ జూనియర్ విద్యారి్థనిని చెల్లి అని పిలుస్తాడు. అదే భావంతో ఉంటాడు. నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యారి్థని కజిన్కు ఈ విషయం నచ్చేది కాది. సృజన్ను హెచ్చరించాడు కూడా. అయినప్పటికీ సృజన్ చనిపోయే ముందు అమ్మాయి పిలిచి మాట్లాడటం వేరే వాళ్ల ద్వారా వారికి తెలిసింది. అందుకే ఇలా జరిగింది. – సృజన్ క్లాస్మేట్స్ ఏం ప్రయోజనం.. ఎంతమంది ధర్నాలు చేస్తే ఏంటి.? ఎంతమంది పోలీసులు వస్తే ఏంటి..? చెట్టంత కొడుకుపోయాడు. – జ్యోతి, సృజన్ తల్లి చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు.. మా మేనల్లుడు సృజన్ కుర్చీ వేసుకుని ఫ్యాన్కు ఉరేసుకున్నాడన్నారు. అది నిజం కాదు. వాడి ఎత్తు 5.9 అడుగులు. ఫ్యాన్ కూడా అందేస్తుంది. రాత్రి 11 నుంచి 3 వరకు హింసించి, కొట్టి చంపేశారు. అలా తెచ్చి ఫ్యాన్కు ఉరేసినట్లు కట్టారు. – చుక్కా శంకరరావు, మేనమామ కొట్టి చంపేశారు... నేను ఆటోడ్రైవర్ను. ఇంటర్ నుంచి ఇదే కళాశాలలో సృజన్ను చదివిస్తున్నాను. కుమారుడిని అన్యాయంగా కొట్టి చంపేశారు. కొట్టినవారిలో ఐదారుసార్లు డిబార్ అయినవారు కూడా ఉన్నారు. మీ సృజన్ అటువంటి వాడు కాదని, కావాలనే చెడు వ్యక్తిగా చిత్రీకరించారని 2వేల మందికి పైగా విద్యార్థులు అంటున్నారంటే మావాడు ఏమీ తప్పు చేయలేదని గ్రహించాలి. పోలీసులు న్యాయం చేయాలి. – శివకృష్ణ ప్రసాద్, సృజన్ తండ్రి -
సృజన్ ఆత్మహత్య వెనుక అసలు కారణం ఏమిటి?
శ్రీకాకుళం క్రైమ్/ఎచ్చెర్ల : జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో బుధవారం ఉదయం ప్రత్తిపాటి సృజన్ (21) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. తోటి విద్యార్థుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యార్థి మృతిపై స్థానికంగా విభిన్న కథనాలు వినిపిస్తుండగా పోలీసులు మాత్రం తల్లిదండ్రులు వస్తే కానీ ఏమీ చెప్పలేమని, ప్రస్తుతం విచారణ చేస్తున్నామని చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన సృజన్ ఎచ్చెర్ల ఎస్ఎంపురం సమీపంలోని ట్రిపుల్ ఐటీ ఇంజినీర్ విభాగంలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులందరితో సరదాగా ఉండే సృజన్ బుధవారం ఉదయం11 గంటలకు కళాశాలలోనే నిర్వహించే పరీక్ష రాయాల్సి ఉంది. ఈలోగా మొదటి అంతస్తులో ఉన్న ఈసీ డిపార్ట్మెంట్ విద్యార్థుల్లో ఒకరికి ఫోన్ చేసి రూంలో ఎవరైనా ఉన్నారా అని సృజన్ అడిగాడు. ఎవరూ లేరని చెప్పడంతో గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. ఎగ్జామ్ నుంచి వచ్చాక గది తలుపులు మూసి ఉండటంతో వెంటిలేటర్ నుంచి గమనించిన విద్యార్థులు ఏదో జరిగిందని అనుకుంటుండగా మెస్ ఆఫీసర్ రావడం.. అంతా చూసేసరికి ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించడంతో అవాక్కయ్యారు. వెంటనే కళాశాల యాజమాన్యం గుంటూరులో ఉన్న సృజన్ తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో వారు హుటాహుటిన బయల్దేరారు. ఎస్ఐ వి. సందీప్ తమ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. విభిన్న కథనాలెన్నో.. కాగా సృజన్ ఆత్మహత్యపై అక్కడ విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. బ్యాక్లాగ్స్ 11 సబ్జెక్టులు ఉండటంతో ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడి వుంటాడని కొందరు అనుకుంటుండగా.. ఓ అమ్మాయితో స్నేహంగా ఉండటం.. ఆమె అన్నదమ్ములు అదే కళాశాలలో చదువుతుండటం.. వారు ఒకట్రెండు సార్లు సృజన్ను హెచ్చరించడం చేశారని తెలిసింది. అంతేకాక మంగళవారం రాత్రి పది మందివరకు కళాశాలలో ప్రవేశించారని, వారి వెనుక ఆ విద్యార్థులున్నారని, సృజన్ను కొట్టారని సమాచారం. ఎస్ఐ సందీప్ మాట్లాడుతూ అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తల్లిదండ్రులు వచ్చేంతవరకు ఏమీ చెప్పలేమన్నారు. ఐదుగురితో పోలీస్ పికెట్ మృతిచెందిన విద్యార్థి దళిత సామాజికవర్గానికి చెందడంతో క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నలుగురు కానిస్టేబుళ్లు, ఒక ఎస్ఐతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
ప్రత్యేక కౌన్సెలింగ్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే సాంకేతిక విద్యా సంస్థల్లో (జీఎఫ్టీఐ) మిగిలిపోయిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు (సీఎస్ఏబీ) నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి రెండు విడతలుగా కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేసింది. దేశంలోని జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐ ప్రవేశాలకు జాయిం ట్ సీట్ అలకేషనల్ అథారిటీ (జోసా) గత నెల 6 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ను ఆరు విడతల్లో నిర్వహించింది. ఆరో విడత సీట్ల కేటాయింపును ఈ నెల 7న ప్రకటించింది. సీట్లు పొందిన విద్యార్థులంతా సోమవారం నుంచి 13వ తేదీలోగా జోసా పోర్టల్ ద్వారా ప్రవేశాల ఫీజును కొంత మొత్తం చెల్లించి సీట్లు ఖరారు చేసుకోవాలని జోసా వెల్లడించింది. ఆ కౌన్సెలింగ్ తరువాత ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో మిగిలిన సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సీఎస్ఏబీ షెడ్యూల్ జారీ చేసింది. -
ట్రబుల్ ఐటీలు
గ్రామీణ పేద విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్యనందించాలన్నసంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిమూడు ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారు. అందులో ఒకటి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఒంగోలుకు మంజూరుచేసిన ట్రిపుల్ ఐటీ కూడా ఇడుపులపాయలోనే కొనసాగిస్తున్నారు.మూడేళ్లవుతున్నా దీనిని తరలించేందుకు చర్యలు తీసుకోలేదు.స్థలాన్ని సేకరించి తొమ్మిది నెలలు కావస్తోంది.శిలాఫలకం వేసి ఐదు నెలలయింది.అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడేఅన్నట్లు గా తయారైంది పరిస్థితి.ఇబ్బందులు ఎదుర్కొంటూనే ట్రిపుల్ఐటీలలో విద్యార్థులు చదువులుకొనసాగిస్తున్నారు. సాక్షి కడప/వేంపల్లె : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ స్థాపించి దాదాపు పదేళ్లయింది. వైఎఎస్ హయాంలో దీని నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. టీడీపీ సర్కారు వచ్చాక వీటిని పట్టించుకోవడం మానేసిందనే విమర్శలున్నాయి. మూడేళ్ల క్రితం ఒంగోలుకు మంజూరు చేసిన ట్రిపుల్ ఐటీ కూడా ఇక్కడే కొనసాగిస్తున్నారు. దీని తరలింపును సర్కారు విస్మరించింది. రెండు ట్రిపుల్ ఐటీలలో 6 వేల మంది వంతున విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ సంఖ్యకు 450 నుండి 500 మంది ఫ్యాకల్టీ (అధ్యాపకులు) ఉండాలి. 150మంది మాత్రమే ఉన్నారు. ఫ్యాకల్టీ కొరత తీర్చడం లేదు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్యను అందించడం కూడా ఉన్న ఫ్యాకల్టీ్టకి కష్టతరంగా మారుతోంది. ఇది ఆందోళన కలిగించే పరిణామం. వసతులు అంతంతమాత్రమే. ఆహారం కూడా సరిగా లేదని విద్యార్థులు పలుమార్లు రోడ్డెక్కిన çసందర్భాలు ఉన్నాయి. యూనిఫాం, సంరక్షణ గాలికి వదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాంకేతిక సమస్యలు ఉన్నతాశయంతో నెలకొల్పిన సాంకేతిక విద్య విషయంలో సర్కారు అలక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీలలో వేసవికాలంలో విద్యార్థుల సంరక్షణ కరువైంది. నిబంధనల ప్రకారం విద్యార్థులకు ల్యాప్ట్యాప్లలో బోధన సాగించాలి. వాటిని ఎప్పుడు ఏసీలో ఉంచాలి. కానీ విద్యార్థులకు అక్కడ ఫ్యాన్లు, ఏసీలు పనిచేయకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. గతనెల 29 నుంచి పరీక్షలు జరుగుతుండటంతో వేడిని తట్టుకోలేక ఎప్పుడు పరీక్షలు అయిపోతాయా.. ఎప్పుడు ఇంటిదారి పడుతామా అంటూ విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం నిధులు సక్రమంగా ఇవ్వకపోవడంతో నిర్వహణ చాలా అధ్వానంగా తయారైంది. వేసవి చివరి నాటి వరకు ఏసీలను మరమ్మత్తు చేయించలేదు. పరీక్షలు ముగియగానే విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లనున్నారు. ఏసీల మరమ్మతు వ్యవహారంపై కూడా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రిపుల్ ఐటీలలో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఒంగోలు ట్రిపుల్ ఐటీలో కొంతమందిని నోటిఫికేషన్, ఇంటర్వ్యూలు లేకుండానే జూనియర్, సీనియర్ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ట్రిపుల్ ఐటీలోని కొంతమంది ఉన్నతాధికారుల కనుసన్నల్లో పలువురిని నియమించుకుంటున్నట్లు చర్చ నడుస్తోంది. తమ అనుకూల వ్యక్తులకు అకడమిక్, ఎగ్జామినేషన్ తదితర కీలకమైన వాటిలో పోస్టులు భర్తీ చేశారని సమాచారం. ఎటువంటి నియామకాలు జరగలేదు ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఎటువంటి నియామకాలు జరపలేదు. ఎవరో గిట్టనివారు ఆరోపణలు చేస్తున్నారు. ఆర్జీయూకేటీ ఆదేశాల మేరకే ఉద్యోగ నియామకాలు చేపడతాం. వాస్తవానికి సిబ్బంది కొరత ఉంది. వచ్చే ఏడాదికల్లా సిబ్బంది, నియామకాలు జరపాలని ఆర్జీయూకేటీ అధికారులకు ప్రతిపాదనలు పంపాం. వారి ఆదేశాలకు అనుగుణంగా నియామకాలు చేపడతాం. విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాం. – వెంకట్రావ్(ట్రిపుల్ ఐటీ డైరెక్టర్), ఒంగోలు -
ఎన్నికలొస్తున్నాయని...
పామూరు/వేటపాలెం (ప్రకాశం): ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం మండలంలోని దూబగుంట్ల గ్రామంవద్ద ట్రిపుల్ఐటీ కళాశాలకు భూమిపూజ కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను సోమవారం మంత్రి శిద్దా రాఘవరావు, కలెక్టర్ వాడరేవు వినయ్చంద్, ఎమ్మెల్యే కదిరి బాబూరావులు పరిశీలించారు. ఈసందర్భంగా హెలీప్యాడ్, భూమిపూజ ప్రాంతం, పైలాన్ నిర్మాణపనులు, బహిరంగసభ వేదికలను పరిశీలించి ఏర్పాట్లపై వారు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన ఉదయం 9.50 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగుతుందన్నారు. అదేవిధంగా వేటపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30కు రామన్నపేట హెలిప్యాడ్కు చేరుకుని పందిళ్లపల్లి గ్రామంలో చేనేతలతో ముచ్చటించి ఎంపీపీ స్కూలులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సెయింటాన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బహిరంగసభ జరుగుతుంది. ఈ సందర్భంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని స్టేజీ బజారులో ఏర్పాటు చేస్తున్న మగ్గాన్ని జేసీ నాగలక్ష్మి పరిశీలించారు. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు
3 కళాశాలలు రాష్ట్రంలో మూడు ట్రిపుల్ఐటీ కళాశాలలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బాసర, కృష్ణా జిల్లా నూజివీడు, కడప జిల్లా ఇడుపులపాయలో ఏర్పాటు చేశారు. వీటిని 2008 సంవత్సరంలో ప్రారంభించారు. ఇవి రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో పని చేస్తాయి. ఈ విద్యా సంవత్సరంలో తొలి ప్రయత్నంలోనే పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ప్రస్తుతం తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో రెండు, తెలంగాణ ప్రాంతంలో ఏకైక ట్రిపుల్ఐటీ మిగలనుంది. విభజనకు ముందే నోటిఫికేషన్ జారీ చేసిన ఆర్జీయూకేటీ 3 వేల మంది విద్యార్థుల ప్రవేశాలకు కలిపి ఒకే చోట దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు http:///admissions2014.rgukt.in సైట్ ద్వారా అభ్యర్థి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా నమోదు చేసిన దరఖాస్తు పత్రం ప్రింట్ ప్రతిని తీసుకోవాలి. దానిని డీడీ లేదా చలానా లేదా ఏపీ ఆన్లైన్లో చెల్లించిన రూ.150 రశీదు ఒరిజినల్ ప్రతికి అభ్యర్థుల విద్యా ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. వాటినిరిజిస్టార్, ఆర్జేయూకేటీ, వింధ్య సీ-4, గచ్చీబౌలి, హైదరాబాద్-500032 చిరునామాకు రిజిస్టరు పోస్టు గానీ స్పీడ్ పోస్టు ద్వారా గానీ పంపించాలి. 21-05-2014 నుంచి 16-06-2014 వరకు దరఖాస్తులు పంపవచ్చు. ప్రాంగణ నియామకాలు 2008లో నెలకొల్పిన బాసర ట్రిపుల్ఐటీలో 2014 చివరి బ్యాచ్కు మొదటి ప్రాంగణ నియామకాలు జరిగాయి. కార్పొరేట్ కంపెనీలు ట్రిపుల్ఐటీకే చేరుకొని ప్రతిభ ఉన్న విద్యార్థులను సెలెక్ట్ చేసుకుని కొలువులు అందించాయి. చదువుపై ఆసక్తి ఉండి ఆరేళ్ల కోర్సు పూర్తి కాగానే యూనివర్సిటీ నేరుగా క్యాంపస్ నియామకాల కోసం కంపెనీలను ఆహ్వానిస్తుంది. కంపెనీలు వచ్చి ప్రతిభ గల విద్యార్థులకు కొలువులు అందిస్తున్నాయి. ఎంపిక ప్రక్రియ గతంలో మూడు ట్రిపుల్ ఐటీలకు కలిపి ఆరువేల మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించేవారు. రెం డేళ్లుగా ఒక్కో కళాశాలలో 1000 మందికే ప్రవేశం కల్పిస్తున్నారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల మంది విద్యార్థులకు ట్రిపుల్ ఐటీల్లో చేరే అవకాశం ఉంటుంది. ఉస్మానియా, ఆంధ్రా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలను రీజియన్లుగా విభజించి ఒక్కో రీజియన్కు 42:36:22 నిష్పత్తిలో సీ ట్లు కేటాయిస్తారు. 85 శాతం స్థానాలను సంబంధిత విశ్వవిద్యాలయం రీ జియన్ పరిధిలోని స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు. మిగతా 15 శాతం స్థానాలను ఓపెన్ విభాగంలో భర్తీ చేస్తారు. పదో తరగతిలో సాధించిన గ్రేడ్పాయింట్(జీపీఏ)ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రిజర్వేషన్ కేట గిరీ విద్యార్థులకు నిబంధనల మేరకు నిర్ధిష్ట సంఖ్యలో స్థానాలు కేటాయిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెనుకబాటు కింద 0.4 జీపీఏ అదనంగా కలుపుతారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిన వారికి వెనుకబాటు సూచీ పాయింట్లు కలుపరు. జీపీఏ సమానంగా ఉంటే.. ఆ విద్యార్థులకు జీపీఏ సమానంగా ఉంటే గ్రేడ్పాయింట్ల ఆధారంగా విద్యార్థులను ఎంపి క చేస్తారు. సమానంగా పాయింట్లు ఉన్న విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నప్పుడు గణితంలో ఎక్కువ మార్కులు ఉన్న వారికే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. గణితంలోనూ సమాన జీపీఏ ఉంటే భౌతికశాస్త్రం.. అందులోనూ సమానంగా వస్తే రసాయనశాస్త్రం.. అందులోనూ అదే విధానం కనిపిస్తే ఇంగ్లిష్ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఇలాంటప్పుడు కూడా ఎక్కువ మంది విద్యార్థులు సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు ఉన్న వారికి తొలి ప్రాధాన్యాన్నిస్తూ ప్రవేశం కల్పిస్తారు. బోధన రుసుము తక్కువ ఆదాయం ఉన్న పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఇంజినీరింగ్ విద్యను అందించాలన్న సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్ఐటీలను నెలకొల్పారు. ట్రిపుల్ ఐటీల్లో కుటుంబ ఆదాయం రూ.లక్ష లోపు ఉన్న వారందరికీ బోధన, వసతికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. లక్ష రూపాయల లోపు ఆదాయం ఉన్న అన్ని సామాజిక వర్గాల వారికి ఈ విధానం వర్తిస్తుంది. తక్కువ ఆదాయం ఉన్న వారంతా రూ.3వేల కాశన్ డిపాజిట్ చెల్లిస్తే ఇది కూడా కోర్సు పూర్తయ్యాక తిరిగి ఇచ్చేస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్షకు పెరిగితే రూ.36 వేల బోధన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశం తర్వాత... ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం తర్వాత విద్యార్థులు ఆరేళ్ల కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి రెండేళ్లు పీయూసీ కోర్సు చదవాలి. ఈ కోర్సు ఇంటర్మీడియట్తో సమానం. రెండేళ్ల కోర్సు పూర్తయ్యాక ఇతర అవకాశాలు వస్తే విద్యార్థులు బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. ఈ విద్యార్థులకు పీయూసీ ఉత్తీర్ణత పత్రాన్ని కళాశాల అధికారులు అందజేస్తారు. పీయూసీ తర్వాత నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సు ఉంటుంది. ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ట్రిపుల్ ఐటీల ప్రధాన లక్ష్యం కావడంతో విద్యార్థులంతా ఆరేళ్ల కోర్సు ఇక్కడే పూర్తి చేసేందుకు మొగ్గుచూపుతారు. కోర్సుల ఎంపిక ఇలా... ట్రిపుల్ ఐటీల్లో చేరిన విద్యార్థులకు మొదటి రెండేళ్ల పీయూసీ మార్కులే బీటెక్ కోర్సుల కేటాయింపునకు కీలకం అవుతాయి. కళాశాలలో చేరిన విద్యార్థులు మొదటి నుంచే చదువుపై దృష్టిసారించాలి. పాఠశాల స్థాయి దాటాక ట్రిపుల్ ఐటీల్లో చేరే విద్యార్థులకు పరీక్షలు సెమిస్టర్ విధానంలో ఉంటాయి. రెండేళ్ల పీయూసీ శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధిస్తే ఉత్తమ కోర్సులు చదివే అవకాశం ఉంటుంది. ఇక మూడో సంవత్సరం బీటెక్లో విద్యార్థులందరికీ ఒకే కోర్సు ఉంటుంది. రెండేళ్ల పీయూసీ పూర్తయ్యాక మూడో సంవత్సరం బీటెక్ ఆఖరులో కోర్సుల ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఇంజినీరింగ్ విభాగంలో సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెటలార్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్ కోర్సులు మూడు ట్రిపుల్ఐటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆరింటిలో ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీటు కోసం మార్కులను పరిగణలోకి తీసుకోవాలి. బీటెక్ చదివే విద్యార్థులు తప్పనిసరిగా మైనర్ సబ్జెక్టును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్సుతో పాటు మైనర్ సబ్జెక్టు కింద సంగీతం, నృత్యం, హ్యుమానిటీస్, గణితం, ఇంజినీరింగ్ సైన్స్ వంటివి ఎంచుకోవాలి. మేజర్ డిగ్రీతోపాటు అదనంగా విశ్వవిద్యాలయం ఈ మైనర్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.


