breaking news
Hunkar Rally
-
పాట్నా పేలుళ్ల నిందితుల్లో ఒకరు మృతి
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హూంకార్ ర్యాలీ సందర్భంగా పాట్నా నగరంలో ఆదివారం సంభవించిన వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన అయినిల్ అలియాస్ తారిఖ్ శుక్రవారం తెల్లవారుజామున మరణించాడు. పాట్నా నగరంలోని రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు బాంబు పేలుడు సంభవించింది. ఆ బాంబు పేలుడులో తారీఖ్ తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో అతడిని పోలీసులు నగరంలోని ఇందిరాగాంధీ మెడికల్ ఇనిస్టిట్యూట్కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తారీఖ్ కోమాలోకి వెళ్లిన అతడు ఈ రోజు తెల్లవారుజామున మరణించినట్లు వైద్యులు పోలీసులకు వెల్లడించారు. పాట్నా బాంబు పేలుళ్ల కేసులో ఇప్పటి వరకు నలుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కేసును బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది. ఆదివారం పాట్నా నగరంలోని గాంధీ మైదాన్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హూంకార్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తులు మరణించగా, 82 మంది గాయపడిన సంగతి తెలిసిందే. -
పాట్నా గాంధీ మైదాన్లో మరో బాంబు
బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ఈ రోజు ఉదయం మరో బాంబును కనుగొన్నట్లు నగర పోలీసు ఉన్నతాధికారి మను మహారాజ్ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. దాంతో బాంబును నిర్వీర్యం చేసేందుకు పోలీసులు, బాంబు నిర్వీర్య దళం హుటాహుటిన గాంధీ మైదానం చేరుకుని, ఆ బాంబును నిర్వీర్యం చేసేందుకు చర్యలు చేపట్టారని వివరించారు. అందులోభాగంగా ఆ సమీపంలోని ప్రజలను నివాసాల నుంచి ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం గాంధీ మైదాన్లో పాదచారులు నడుస్తున్న సమయంలో ఆ బాంబును కనుగొని, పోలీసులకు సమాచారం అందించారని చెప్పారు. దాంతో పోలీసులు వెంటనే అప్రమత్తమైనట్లు తెలిపారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆదివారం పాట్నాలోని గాంధీ మైదాన్లో హూంకార్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ ప్రారంభానికి కొన్ని గంటల ముందు పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఆ బాంబు పేలుళ్లలో ఇప్పటివరకు 8 మంది మరణించారు. మరో 82 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఆ వరుస బాంబు పేలుళ్ల వెనక ఇండియన్ ముజాహిదీన్ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
'పేదరికాన్ని తరిమికొట్టేందుకు హిందూ, ముస్లింలు ఏకం కావాలి'
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. మోడీ పాల్గొనే హుంకార్ ర్యాలీ సభలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నా.. ఆయన ఆ సభలో పాల్గొన్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగిన సభలో నరేంద్రమోడీ ఉద్వేగంగా ప్రసంగించారు. హుంకార్ ర్యాలీకి లక్షలాది మంది హాజరయ్యారు. హుంకార్ ర్యాలీలో మోడీ మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో బీహార్ కు ప్రత్యేక స్థానం ఉందని, బీహార్ లేకుండా దేశంలో ఎలాంటి మార్పు సాధ్యం కాదని అన్నారు.దేశానికి జయప్రకాశ్ నారాయణ్ లాంటి మహానాయకుడిని బీహార్ అందించిందని చెప్పారు. జయప్రకాశ్ చేయి పట్టుకుని రాజకీయాల్లో నడిచే మహాభాగ్యం తనకు లభించిందని తెలిపారు. తన ప్రసంగం ఆరంభంలో నితీష్ ను టార్గెట్ చేసిన మోడీ.. ఆయనపై తీవ్రమైన విమర్శలు చేశారు. జయప్రకాశ్ నారాయణ సిద్దాంతాలను తుంగలో తొక్కిన నితీష్ కు బీజేపీని వదిలిపెట్టడం అంత కష్టమేమీ కాదు అని మోడీ అన్నారు. బీజేపీని వ్యతిరేకించి నితీష్ కాంగ్రెస్ తో కుమ్మక్కైనారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జీవితాంతం రాం మనోహర్ లోహియా పోరాటం చేశారని, లోహియాను ఆరాధించిన వాళ్లే ప్రస్తుతం ఆయన సిద్ధాంతాలకు వెన్నుపోటు పొడిచారంటూ నితీష్, లాలూను పరోక్షంగా విమర్శించారు. కాంగ్రెస్ తో కుమక్కైన నితీష్ ను జయప్రకాశ్, రాం మనోహర్ లోహియా ఆత్మలు క్షమించవని అన్నారు. అవకాశం వచ్చినపుడల్లా లాలూ నన్నువిమర్శించడానికి ఎన్నడూ వెనుకాడలేదు.. మోడీని ఎన్నడూ ప్రధాని మంత్రిని కానివ్వనూ అని లాలూ అన్నారు.. తనను విమర్శించిన లాలూ.. ఓసారి ప్రమాదానికి గురైప్పుడూ ఫోన్ లో పరామర్శించాను అని మోడీ తెలిపారు. తాను రైళ్లలో టీ అమ్ముకునే స్థితి నుంచి ఈ హోదాకు చేరుకున్నానని.. రైళ్లలో టీ అమ్ముకునే వారి బాధలు తనకంటే ఏ రైల్వే మంత్రికి కూడా తెలియవు అని అన్నారు. రాజకీయాల్లో హిపోక్రసికి కూడా ఓ హద్దు ఉంటుంది అన్నాడు. మోడీ ఎన్ని రకాల అవమానాలకు గురైనా కాని.. బీహార్ లో మరోసారి ఆటవిక రాజ్యం రాకూడదని కోరుకుంటున్నాని అన్నారు. తన ప్రసంగంలో ఆద్యంతం యాదవ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. దేశ రాజకీయాల నుంచి కాంగ్రెస్ పా్ర్టీని తరిమి కొట్టేందుకు పాట్నాలోని గాంధీ మైదానం నుంచే సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు. యూపీఏ ప్రభుత్వ పాలనకు పదేళ్లు పూర్తికానుంది అయితే గత ఎన్నికల్లో వంద రోజుల్లో అధిక ధరలు తగ్గిస్తామని, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది అని.. కాని తన హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.. ధరలు పెరుగుతున్నాయన్నారు. ఇది ర్యాలీ కాదని.. చరిత్రను మార్చే ఓ వేదిక అని వ్యాఖ్యానించారు. పేదరికాన్ని తరిమికొట్టాలంటే హిందూ, ముస్లింలు ఏకం కావాలి అని పిలుపునిచ్చారు. మోడీ పాల్గొన్న వేదిక సమీపంలోనే ఐదు వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచి పాట్నాలో ఆరు బాంబు పేలుళ్లు సంభవించాయి. -
పేదరికాన్ని తరిమికొట్టేందుకు హిందూ,ముస్లీంలు ఏకం కావాలి: మోడీ