breaking news
Homo erectus
-
నిప్పును రాజేసింది అప్పుడే.. షాకిస్తున్న ఆవిష్కరణ!
ప్రెటోరియా: మానవ పరిణామ చరిత్రను తిరగరాసే ఒక అద్భుతమైన ఆవిష్కరణ వెలుగుచూసింది. ఆది మానవుడు ఇప్పటివరకు మనం భావించిన దానికంటే దాదాపు 80,000 సంవత్సరాల ముందే నిప్పుపై నియంత్రణ సాధించాడని శాస్త్రవేత్తలు గుర్తించారు. సౌత్ ఆఫ్రికాలోని ప్రసిద్ధ ‘వండర్వర్క్ గుహ’లో జరిపిన తాజా పరిశోధనల్లో 1.79 మిలియన్ల (దాదాపు 18 లక్షల) సంవత్సరాల క్రితం నాటి కాలిపోయిన క్షీరదాల ఎముకలు లభ్యమయ్యాయి. ‘ప్లోస్ వన్’ (PLOS One) జర్నల్లో ప్రచురితమైన ఈ అంతర్జాతీయ పరిశోధన, హోమో ఎరెక్టస్ (Homo erectus) జీవన విధానంపై పలు వివరాలను తెలియజేసింది.గుహ లోపల దొరికిన కీలక ఆధారాలుఅంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం గుహలో లభించిన 161 చిన్న క్షీరదాల శిలాజపు ఎముకలను క్షుణ్ణంగా విశ్లేషించింది. ఇవన్నీ గుడ్లగూబలు అవశేషాలు కావడం విశేషం. ఈ ఎముకలు తీవ్రమైన వేడికి గురైనట్లు స్పష్టమైన సంకేతాలు కనిపించాయి. గుహ లోపలికి దాదాపు 100 అడుగుల లోతులో ఇవి లభించాయి. అంత లోపలికి సహజసిద్ధమైన అడవి మంటలు వ్యాపించడం అసాధ్యం కాబట్టి, ఆది మానవులే ఉద్దేశపూర్వకంగా ఈ ఎముకలను నిప్పుపై ఉంచారని పరిశోధకులు నిర్ధారించారు.నిప్పును రాజేయడం కాదు.. దాచుకోవడంఅయితే ఆ కాలంలో హోమో ఎరెక్టస్లకు సొంతంగా నిప్పును సృష్టించడం (కనుగొనడం) తెలియదని పరిశోధనలు చెబుతున్నాయి. పిడుగుపాట్లు లేదా అడవి మంటల వల్ల సహజంగా ఏర్పడిన నిప్పును వారు సేకరించి గుహల్లోకి తెచ్చేవారు. ఆ మంటలు ఆరిపోకుండా ఉండేందుకు గుడ్లగూబల అవశేషాలను ఇంధనంగా వాడేవారు. ఒక చిన్న నిప్పుకణికను వీటిపై వేసి, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా, ఒకే చోట సుదీర్ఘకాలం పాటు ఉండేలా చూడటంలో వారు విజయం సాధించారు.ఆధునిక సాంకేతికతతో వీడిన రహస్యంఖనిజాల వల్ల ఈ ఎముకలు నల్లగా మారాయనే అనుమానాలను శాస్త్రవేత్తలు పూర్తిగా తిరస్కరించారు. దీనికోసం వారు సరికొత్త ‘నాన్-డిస్ట్రక్టివ్ లూమినిసెన్స్’ సాంకేతికతను ఉపయోగించారు. ఆప్టికల్ ఫిల్టర్ల ద్వారా ప్రత్యేకమైన నీలిరంగు కాంతిని ఈ ఎముకలపై ప్రసరింపజేసినప్పుడు, అవి ఒక రకమైన ఎరుపు రంగు కాంతిని వెదజల్లాయి. కాలిన ఎముకలు మాత్రమే ఇలాంటి కాంతిని ఇస్తాయని, సాధారణ ఎముకలు ఇవ్వవని శాస్త్రవేత్తలు నిరూపించారు. మానవ సంస్కృతి, ప్రకృతి మధ్య బంధాన్ని మార్చిన మైలురాయిగా ఈ పరిశోధన నిలిచిందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: ‘సుశాంత్ సింగ్ లాగే నా చెల్లిని బలితీసుకున్నారు’ -
సోమరి.. అంతరించిపోరా మరి..
- ఎవరీయన? ఈయనా.. మన పూర్వీకుడే.. ముత్తాతలకు ముత్తాత.. ఆ ముత్తాతలకు ముత్తాతకు దగ్గరి బంధువు టైపు రిలేషనన్నమాట.. దాదాపు 19 లక్షల ఏళ్ల క్రితం వాడు.. ఈయన జాతి పేరు..హోమో ఎరెక్టస్.. - ఏం పాపం.. డల్లుగా ఉన్నాడు? ఉండడా మరి.. వీళ్లు బద్ధకస్తులట.. సోమరిపోతులట.. మేమనడం లేదు.. శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన ఓ అధ్యయనం తేల్చింది. వీళ్ల జాతి అంతరించిపోవడానికి అది కూడా ఓ కారణమని చెప్పింది. అందుకే బాబు.. కాస్త డల్లుగా ఉన్నాడు.. - పూర్తిగా చెప్పరాదా.. ఈ హోమో ఎరెక్టస్లు సుదూర ప్రయాణికుల టైపు. ఆఫ్రికా నుంచి శ్రీలంక, చైనా, ఇండోనేసియా, జార్జియా వంటి ప్రాంతాలకు వలస వెళ్లారు. దాదాపు 1,40,000 ఏళ్ల క్రితం ఈ జాతి అంతరించిపోయింది. దీనిపై ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఓ పరిశోధన జరిపారు. ఇందులో భాగంగా హోమో ఎరెక్టస్ నివసించిన ప్రాంతాలను పరిశీలించారు. ఇందులో భాగంగా సౌదీ అరేబియాలో కూడా పరిశోధనలు చేశారు. ఇందులో తేలిందేమిటంటే.. వీరు బేసిక్గా బద్ధకస్తులు. వనరులను సమీకరించుకోవడంలో.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మార్చుకోవడం వంటి విషయాల్లో క్రియాశీలకంగా లేకపోవడం వంటి వాటి వల్ల ఈ జాతి నెమ్మదినెమ్మదిగా అంతరించిపోయిందని వారు తేల్చారు. అంతేకాదు.. వీరు తయారుచేసిన పనిముట్లు కూడా తక్కువ నాణ్యత కలిగినవి. ‘తమకు చుట్టుపక్కల ఏ రాయి దొరికితే దానితో పని కానిచ్చేసేవారు. హోమో ఎరెక్టస్లు తయారు చేసిన పనిముట్లు అది నాణ్యమైనదా కాదా అన్నదానితో పనిలేదు. సౌదీ అరేబియాలో మాకు దొరికిన పని ముట్లను పరిశీలిస్తే.. ఆ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే.. అక్కడికి దగ్గర్లోనే ఓ కొండ ఉంది. అక్కడ నాణ్యమైన రాయి ఉంది. కానీ.. అక్కడ దొరికిన పనిముట్లలో ఆ రాయితో చేసినవి ఏమీ లేవు. అలాగని.. కొండ వద్ద తవ్విన ఆనవాళ్లూ లేవు. కొండ కింద పడిన వాటిని ఏరుకుని.. పనిముట్లు తయారుచేసుకున్నారు. దగ్గర్లో దొరుకుతున్నాయిగా.. కష్టపడటమెందుకు అనుకున్నారు’ అని పరిశోధకుల బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ షిప్టన్ అన్నారు. అదే తొలితరం హోమోసేపియన్లు, నియాండర్తల్లు వేరేగా ఉండేవారని.. వీరు కొండలు ఎక్కి మరీ, నాణ్యమైన రాళ్లను ఎంపిక చేసుకునేవారని..అవసరమైతే సుదూర ప్రాంతాలకు తరలించేవారని ఆయన చెప్పారు. ‘అంతేకాదు.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా హోమో ఎరెక్టస్లు తమ జీవిత విధానాన్ని మార్చుకోలేదు.. మూస పద్ధతులనే అనుసరిస్తూ పోయారు.. ప్లానింగ్ కూడా సరిగా ఉండేది కాదు. దీంతో క్రమేణా అంతరించిపోయారు’ అని చెప్పారు. అదండీ.. సంగతి.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడరైన మనోడి గతి.. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
దూరపుచుట్టం
టూకీగా ప్రపంచ చరిత్ర 22 ఆ తరువాతి చరిత్రకు విశాలమైన గండి ఏర్పడింది. రెండవ హిమానీ శకం నాటి ‘హోమో ఎరెక్టస్’ దగ్గరి నుండి మన నడక నాలుగవ హిమానీశకం నాటి ‘నియాండర్తల్’ మానవుని దగ్గరికి ఒక్క దూకులో గెంతేసింది. నియాండర్తల్ అనేది జర్మనీలో ఒక లోయ. అక్కడ దొరికిన పుర్రె ఆధునిక మానవునికి అత్యంత చేరువగా ఉండేది. అందువల్ల ఆ పుర్రె యజమానినీ, అతని జాతినీ ‘హోమో నియాండర్తలెన్సిస్’ అనే పేరుతో పిలిచారు. ఆ తరువాత ఇలాంటి అవశేషాలు బెల్జియం తదితర పశ్చిమ యూరోపియన్ ప్రాంతాల్లో కొల్లలుగా దొరికాయి. విడివిడి అవశేషాలు కాకుండా పూర్తి అస్థిపంజరాలే దొరకడంతో ఆనాటి స్థితిగతులు మరింత వివరంగా తెలుసుకునే వీలు కలిగింది. నియాండర్తల్ మానవుని ఎత్తు సగటున ఐదడుగులా మూడు అంగుళాలు. పుర్రె సైజు పెద్దది, దాని ఎముకలు దళసరి. మెదడు భరిణ ఆధునిక మానవునికి ఉండేకంటే మరికాస్త పెద్దదే. పుర్రె ఎత్తు తక్కువైనందున తల చప్పిడిగా కనిపిస్తుంది. నుదురు ఏటవాలు, కనుబొమలు ఉబ్బెత్తు. ముక్కు వెడల్పాటిది. బలమైన దవడలూ, బలమైన మెడ. మెడభాగం చాలా కురచగా ఉండడంతో తల నేరుగా భుజాల మీద మోసినట్టుంటుంది. మెదడులో కుడిసగం కంటే ఎడమసగం ప్రస్ఫుటంగా కనిపించడాన్ని బట్టి అతనిది మనలాగే కుడిచేతివాటమని చెప్పొచ్చు. చూపు, స్పర్శలను గ్రహించే పుచ్చెభాగం ఎంత బలకొందో మాటకూ ఆలోచనకూ పీఠమైన ముందుభాగం అంత బలహీనంగా కనిపిస్తుంది. పెపైచ్చు అతని గొంతు కూడా ఇరుకుగా, మాటలు తిరిగేందుకు అసౌకర్యంగా ఉండడంతో, నియాండర్తల్ మనిషికి భాష లేదని కచ్చితంగా చెప్పొచ్చు. మహా ఉంటే చిలుకకు మల్లే కొన్ని మాటల వరకు పలికుండొచ్చు. వేట నియాండత లెన్సిస్ జీవన విధానం. అయితే కేవలం అతడు మాంసాహారి మాత్రం కాదు; కాయలూ, పండ్లూ, రుచించే ఆకులూ, పుట్టగొడుగులూ వంటివి అతని శాకాహారం, చేపలు కూడా ఆహారంలో భాగమే. అయితే, వాటిని పట్టేందుకు ‘గాలం’ వంటి సాధనం అతనికి అందుబాటులో లేదు. అందువల్ల, నీటిలో చేపను ఎలుగుబంటి ఎంత వడుపుగా నోటితో పట్టేస్తుందో అలా నియాండర్తల్ నరుడు చేతులతో చేపలు పట్టుకునేవాడై వుండాలి. లేదా బద్దలాగా చివిరిన కొయ్య టేగ (18-20 అంగుళాల పొడవుండే మొద్దుకత్తి)తో తలమీద కొట్టి, చచ్చిన చేప నీటి మీద తేలగానే సేకరించుకోనుండొచ్చు. టేగతో ఈవిధంగా చేపలను వేటాడే పద్ధతి ఇప్పటికీ మనప్రాంతాల్లో కనిపిస్తుంది. నియాండర్తల్ గుహల్లో బొచ్చు ఏనుగూ, దుప్పి, కణితి వంటి పెద్ద జంతువుల ఎముకలు దొరికిన దాన్నిబట్టి ఆ నరుడు వాటిని వేటాడినట్టు ఊహించారుగానీ, అతనికున్న కొయ్యబరిసె, బడితెల వంటి ఆయుధాలతో అంత పెద్ద జంతువులను వేటాడటం సాధ్యమని నమ్మలేం. పైగా ఆ దశలో మానవుడు పెద్ద జంతువులకు ఇంకా ‘వేట’గా ఉన్నాడే తప్ప, వేటగాడు కాలేదు. అతని శక్తికి అవి లోబడేది ఏ పోట్లాటలోనో గాయపడినప్పుడో, ఆరోగ్యంగా లేనప్పుడో, లేదా బురద గుంటల్లో ఇరుక్కున్నప్పుడో మాత్రమే. వేట వాళ్ళకొక సామూహిక యజ్ఞం. జంతువును చంపినచోటనే విందు చేసుకోవడం నియాండర్తల్ అలవాటులా కనిపిస్తుంది. తినగా మిగిలిన మాంసాన్నీ, మూలుగులుండే ఎముకలనూ గుహకు చేర్చుకుంటారు. అందుకే వాళ్ళ గుహల్లో తొడ ఎముకలూ, కాలి ఎముకలు మాత్రమే ఉంటాయిగానీ పక్కటెముకలవంటివి కనిపించవు. రాతి పనిముట్లు చెక్కుకోవడంలో నైపుణ్యం పెరిగింది. పనిముట్ల వైవిధ్యం పెరిగింది. పలురకాల అవసరాలకు వేరువేరు పనిముట్లు వాడకానికొచ్చాయి. గొడ్డళ్ళూ, గునపాలూ, కత్తులూ, రాతితోనే తయారవుతున్నాయి. వాటితోపాటు కొయ్య సామగ్రిని కూడా వాడినట్టు తెలుస్తుందిగానీ, అవి శిధిలమయ్యేవి కావడంతో మనకు దొరికే అవకాశం లేదు. వస్తువుల ఆకారాలను గురించిన విజ్ఞానం పెరగడంతో, ఏ అవసరానికి ఏ ఆకారం అనువుగా ఉంటుందో అదే ఆకారంలో పనిముట్టును తయారుజేసుకున్న లాఘవం కనిపిస్తుంది. రాతి పనిముట్టును చెక్కేముందు కొయ్యనమూనాను ఆధారం చేసుకున్నట్టు గూడా తెలుస్తూంది. ఇనుపరాయిని చెకుముకిరాయితో కొట్టి నిప్పు రాజేసే విధానం అమలులోకి వచ్చింది. రచన: ఎం.వి.రమణారెడ్డి


