breaking news
Hiralal
-
ఔరా.. హీరా!
ఆయనో 35 ఏళ్ల యువకుడు. దీనికితోడు ప్రతిష్టాత్మక ఎయిమ్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం. ఆకర్శణీయమైన జీతం, ప్రశాంతమైన జీవితం. కానీ ఏదో వెలితి. తన వర్గానికి ఏమీ చేయలేకపోతున్నాననే ఆవేదన. వెరసి ఆరేళ్ల ప్రయత్నం తర్వాత రాజకీయ పార్టీ పుట్టింది. ఆదివాసీల్లో పట్టు సంపాదించి.. ఇప్పుడు ఏకంగా గిరిజనుడు ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ఆ యువకుడు దూసుకెళ్తున్నాడు. ఇది ఏయిమ్స్ రుమటాలజీ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హీరాలాల్ అలావా గురించిన ఇంట్రడక్షన్. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా ఓ మారుమూల గ్రామానికి చెందిన హీరాలాల్.. స్థానికంగా ఉండే ’భిల్’ అనే ఓ గిరిజన తెగకు చెందిన యువకుడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదిగినా.. తన ఊరికి, గిరిజనులకు సరైన న్యాయం జరగడం లేదనే కారణంతో కార్యాచరణ ప్రారంభించాడు. మొదటగా ఫేస్బుక్ పేజీని ప్రారంభించిన హీరాలాల్.. ఇప్పుడు జై ఆదివాసీ యువ శక్తి (జేస్)అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసేందుకు రిజిస్ట్రేషన్ సంబంధింత సాంకేతిక అడ్డంకులు ఎదురవడంతో.. ప్రస్తుతానికి కాంగ్రెస్ సహకారంతో ఆయన ఒక్కరే పోటీ చేస్తున్నారు. అయితే.. చట్టసభల్లో గిరిజన ప్రతినిధుల సంఖ్య పెరగటం, గిరిజనుడిని మధ్యప్రదేశ్కు సీంను చేయడమే జేస్ లక్ష్యమని పేర్కొన్నారు. ఆరేళ్ల ‘ఫేస్బుక్’ పోరాటం కొడితే గట్టి దెబ్బే కొట్టాలనే సూత్రాన్ని డాక్టర్ హీరాలాల్ బాగా అర్థం చేసుకున్నారు. అందుకే తన సత్తా చాటేందుకు ఆరేళ్లుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ‘యువ శక్తి’పేరుతో ఫేస్బుక్ పేజీ రూపొందించి.. గిరిజనుల చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లో విద్యుత్ లేకపోవడం, నిర్వాసితులవుతున్న గిరిజనులు, ఆదీవాసీల కోసం స్కూళ్లు లేకపోవడం, పౌష్టికాహారలోపం తదితర అంశాలను ఆ ఎఫ్బీ పేజీలో ప్రస్తావించేవారు. ‘ఈ పేజీకి ఆదీవాసీ యువతలో మంచి గుర్తింపు వచ్చింది. 2013, మే 16న బద్వానీ గ్రామంలో ఏర్పాటుచేసిన ఫేస్బుక్ పంచాయతీలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి మా పేజీని ఫాలో అయ్యేవారు చాలా మంది హాజరయ్యారు. చాలా అంశాలపై ఆరోజు ఆసక్తికర చర్చ జరిగింది. అదే ఏడాది ఇండోర్లో అంతర్జాతీయ ఫేస్బుక్ పంచాయతీని నిర్వహించాం’ అని హీరాలాల్ పేర్కొన్నారు. -
6.74 కిలోల నగలు స్వాధీనం
సికింద్రాబాద్: నగరంలో అక్రమంగా విక్రయించేందుకు ముంబై నుంచి తెచ్చిన రూ. 1.75 కోట్ల విలువ చేసే 6.74 కిలోల బంగారు ఆభరణాలను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ కర్నూలు కోటిరెడ్డి, వెస్ట్జోన్ ఇన్స్పెక్టర్ వై.భాస్కర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.... శనివారం ఉదయం వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు లాడ్జీల్లో తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో సీతారాంబాగ్లోని డీలక్స్ లాడ్జిలో ముంబై నుంచి నగరానికి ఈనెల 14న వచ్చి బస చేస్తున్న అరీఫ్ పఠాన్ (27), హీరాలాల్ (28) వద్ద పెద్దమొత్తంలో బంగారు ఆభరణాలు లభించాయి. టాస్క్ఫోర్స్ పోలీసులు విచారించగా తాము ముంబైకి చెందిన నకోడా జ్యుయలరీలో ఉద్యోగులమని చెప్పారు. షాపు యజమాని అశ్విక్జైన్ తమకు పది కిలోల బంగారు ఆభరణాలను ఇచ్చి నగరంలోని దుకాణాల్లో విక్రయించమన్నారని తెలిపారు. నగరానికి చేరుకున్న రోజే 1.25 కిలోల ఆభరణాలు విక్రయించి, మిగిలింది తమవెంటే ఉంచుకున్నామని వివరించారు. రెండ్రోజుల్లో మరికొన్ని దుకాణాలకు అందించాల్సిందన్నారు. ఇదిలా ఉండగా సదరు బంగారానికి సంబందించిన ధ్రువపత్రాలు, ప్రభుత్వ సుంకం చెల్లించిన రుజువులు అడగగా వాటి వివరాలు తమకు తెలియదని పేర్కొన్నారు. ఈ ఆభరణాలకు సంబంధించి నకోడా జ్యుయలరీ యజమాని సుమారు రూ. 55 లక్షల సుంకం చెల్లించాల్సి ఉన్నట్టు టాస్క్ఫోర్స్ పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసును తదుపరి విచారణ నిమిత్తం ఆదాయపుపన్ను శాఖ అధికారులకు బదలాయించినట్లు అదనపు డీసీపీ కోటిరెడ్డి విలేకరులకు తెలిపారు.