breaking news
Hindi teacher
-
ఈ హిందీ టీచర్ రూటే సపరేట్..!
సాక్షి, సోమశిల(నెల్లూరు): సాధారణంగా విద్యార్థులకు పాఠశాలకు రాకపోతే ఉపాధ్యాయులు ఆబ్సెంట్ వేస్తారు. వారం, పదిరోజులు రాకపోతే ఎవరో ఒక విద్యార్థి ద్వారా వాకబు చేస్తారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని పీకేపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న హిందీ పండిట్ కె.అనిల్ రెండు, మూడురోజులు విద్యార్థులు రాకపోతే వారింటికెళ్లిపోతాడు. సరైన కారణం ఉంటే సరేసరి. లేకపోతే తల్లిదండ్రులతో మాట్లాడి స్వయంగా బైక్పై పాఠశాలకు తీసుకెళతాడు. ఉదయగిరి శైలజ (మూడో తరగతి), కుంచం పద్మావతి (రెండో తరగతి)లు రెండురోజులుగా ఆరోగ్యం బాగోలేదని చెప్పి బడికి రాలేదు. ఈ విషయాన్ని గుర్తించిన అనిల్ గురువారం వాళ్ల ఇంటికెళ్లాడు. విద్యార్థులు బాగానే ఉండటంతో తల్లిదండ్రులతో మాట్లాడి వారిని బడికి తీసుకెళ్లాడు. రకరకాల కారణాలతో డ్రాపౌట్స్ పెరుగుతున్నారని, అయితే విద్యార్థుల చదువు ఆగకూడదని తల్లిదండ్రులకు నచ్చజెప్పి తీసుకెళుతున్నట్లు ఈ సందర్భంగా అనిల్ తెలిపారు. -
మమతా బెనర్జీకి హిందీ టీచర్ కావాలట!
న్యూఢిల్లీ: దేశంలో పెద్ద నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా జాతీయ రాజకీయాల్లో ఒక్కసారిగా దూసుకొచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది కంట్రీ’ అయ్యారు. ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై నిన్న పార్లమెంట్ సమావేశాలు స్తంభించడం ద్వారా, తన అనుమతి లేకుండానే తన రాష్ట్రంలోకి సైన్యాన్ని ఎలా పంపిస్తారంటూ నేడు కేంద్రాన్ని నిలదీస్తూ సచివాలయం నుంచి కదలనంటూ మమత భీష్మించడం ద్వారా విస్త్రృత ప్రచారమే పొందారు. కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర వహించాలనుకుంటున్న మమతా బెనర్జీ వీలైనప్పుడల్లా వచ్చిన మేరకు హిందీలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు హిందీలోనే ట్వీట్ చేస్తున్నారు. ఇప్పటికే బెంగాలి-హిందీ డి క్షనరీని కొనుక్కురని, హిందీ కవిత్వం కూడా చదువుతున్నారని వార్తలు వస్తుండగా, హిందీ బోధించే మంచి టీచరు కోసం ఆమె వెతుకుతున్నారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే, ప్రధాన మంత్రి లాంటి ఉన్నత పదవులు వరించాలంటే హిందీ భాష రావడం ముఖ్యమనే అభిప్రాయం జాతీయ రాజకేయాల్లో ఎప్పటి నుంచో వేళ్లూనుకొని ఉంది. యూపీ నుంచే తొలి ప్రధాని... ఈ కారణం వల్లనే హిందీని మాతృభాషగా కలిగిన ఉత్తరప్రదేశ్కు జాతీయ రాజకీయాల్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటి వరకు దేశానికి 14 మంది ప్రధాన మంత్రులు ప్రాతినిధ్యం వహించగా వారిలో 12 మంది ఉత్తరప్రదేశ్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. దేశ తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ యూపీకి చెందిన వారే (ఎప్పుడో కశ్మీరీ నుంచి వచ్చి స్థిరపడిన కుటుంబం వారిది). ఆయన హిందీలోనూ, ఇంగ్లీషులోనూ అనర్గళంగా మాట్లాడేవారు. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్కు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆరెస్సెస్ నేపథ్యం వల్ల ఆయనకు హిందీలో మాట్లాడడం బాగా వచ్చింది. హిందీ భాష రాని ఏకైక ప్రధాని ఇప్పటి వరకు ప్రధాన మంత్రులైన వారిలో హిందీ మాట్లాడడం రాని ఏకైక వ్యక్తి కర్నాటకకు చెందిన హెచ్డీ దేవెగౌడ. 1996 పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో మూడవ ఫ్రంట్ తరఫున రాజీ అభ్యర్థిగా ప్రధాని పదవికి దేవెగౌడ ఎంపికయ్యారు. అప్పుడు కూడా ఆయన మొదటి ఛాయిస్ కాదు. వీపీ సింగ్, జ్యోతిబసులు నిరాకరించడంతో ఆయన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. అయితే 11 నెలల్లోనే దేవెగౌడ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన ప్రధాని హోదాలో ఎర్రకోట పైనుంచి స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని హిందీలో ఇవ్వాల్సి వచ్చినప్పుడు కన్నడంలో రాసుకొని చదివారు. కామరాజు అందుకే ప్రధాని కాలేకపోయారు... 1954 నుంచి 1963 వరకు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామి కామరాజు, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1964లో చనిపోయే నాటికి కేంద్ర కాంగ్రెస్లో చాలా బలమైన నాయకుడు. అప్పడు ప్రధాని రేసులోవున్న మురార్జీ దేశాయ్, బాబూ జగ్జీవన్రామ్లను అడ్డుకొని లాల్ బహదూర్ శాస్త్రీని నెహ్రూ వారుసుడిని చేసిందీ కామరాజే. రెండేళ్లలో శాస్త్రీ కూడా మరణించడంతో ఆయన స్థానంలో ఇందిరాగాంధీని ఎంపిక చేయడంలో కూడా కామరాజు కీలక పాత్ర పోషించారు. వెనకబడిన కులానికి చెందిన కామరాజు పార్టీలో ఎంతో పలుకుబడి ఉన్నప్పటికీ ఎందుకు ప్రధాన మంత్రి పదవిని ఆశించరని మీడియా ప్రశ్నించగా, ‘నో హిందీ, నో ఇంగ్లీష్’ అని సమాధానం ఇచ్చారు. ప్రధాని కావాలంటే ఈ రెండు భాషలు రావడం తప్పనిసరి అని చెప్పారు. హిందీ భాష ప్రాబల్యానికి వ్యతిరేకంగా 1960లో తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చెలరేగాయి. ప్రణబ్ ముఖర్జీకి కూడా హిందీ రాకపోవడమేనట... 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురైనప్పుడు ఆమె స్థానంలో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధాని అవుతారని ఊహాగానాలు వెలువడ్డాయి. ‘నీకు సరైన హిందీ రాకపోతే నీవు ప్రధాన మంత్రివి కాలేవు. కొన్ని పదవులకు కొన్ని నైపుణ్యాలు అవసరం’ అంటూ ప్రణబ్ ఆ ఊహాగానాలకు తెరదించారు. -
ప్రేమ.. ఓ విద్యార్థి.. ఓ టీచర్.. హత్య
రాంఛీ: ప్రేమ పేరుతో తమ కూతురు వెంటపడుతున్నాడనే కారణంతో ఏడో తరగతి బాలుడిని ఓ టీచర్ హత్య చేసిన ఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది. గత శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సఫైర్ ఇంటర్నేషనల్ స్కూల్లో వినయ్ మహతో అనే విద్యార్థి ఏడో తరగతి చదువుతున్నాడు. ఆ స్కూల్లోనే పనిచేస్తున్న 30 ఏళ్ల నజ్మా ఖతూన్ అనే హిందీ టీచర్కు పదకొండేళ్ల కూతురు ఉంది. గత కొద్ది రోజులుగా వినయ్ ఆమె కూతురు వెంటపడటం ప్రారంభించాడు. దీంతో ఆ బాలిక తమ తల్లిదండ్రులకు చెప్పడంతో సహించలేని ఆ టీచర్, ఆమె భర్త విద్యార్థిని కొట్టి చంపేశారు. దీని ఆధారాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ప్రకారం శుక్రవారం అర్థరాత్రి 1.09గంటల ప్రాంతంలో ఆ విద్యార్థి తన హాస్టల్ భవనం దాటి తన టీచర్ ఉండే నివాసం వైపు కదిలాడు. ఆ తర్వాత అర్థగంటలోనే అతడు టీచర్స్ హాస్టల్స్ మెయిన్ ఎంట్రెన్స్ గేట్ వద్ద తీవ్ర గాయాలతో స్పృహ లేకుండా పడి ఉన్నట్లు మరో టీచర్ గుర్తించింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఎవరైనా ఆ విద్యార్థిపై లైంగికదాడికి ప్రయత్నించి అనంతరం హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తూ కేసు నమోదు చేశారు. కానీ, మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత అలాంటి కోణంలో ఏ విధమైన ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో ఆ బాలుడి ప్రవర్తన గురించి తెలుసుకున్న పోలీసులు ప్రేమ కోణంలో దర్యాప్తు చేయగా అసలు విషయం తెలిసింది. ఆ రోజు రాత్రి విద్యార్థి తమ ఇంటికి వస్తాడని ముందే తెలుసుకొని మాటువేసి ఉన్న ఆ బాలిక తల్లిదండ్రులు అతడిని తీవ్రంగా కొట్టి మొదటి అంతస్తుపై నుంచి కిందపడేశారు. ఈ కారణంగానే ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబం మొత్తాన్ని పోలీసులు అరెస్టు చేశారు.