-
డయాగ్నోస్టిక్ సేవల మార్కెట్ @ 22,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మారుతున్న జీవనశైలితో కొత్తకొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. మనిషినిబట్టి చికిత్స మారుతోంది. దీంతో వైద్య సేవల రంగంలో ఇప్పుడు రోగ నిర్ధారణ పరీక్షలదే కీలకపాత్ర అయింది. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు (డయాగ్నోస్టిక్ సెంటర్లు) ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ఆసుపత్రుల అవసరాలకు తగ్గట్టుగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఇవి నూతన టెక్నాలజీని సొంతం చేసుకుంటున్నాయి. ముందస్తు పరీక్షల పట్ల ప్రజల్లో అవగాహన అంతకంతకూ పెరుగుతుండడం కూడా ల్యాబొరేటరీల విస్తరణకు కారణం అవుతోంది. 70 శాతం ప్రత్యేక పరీక్షల కోసం ఆసుపత్రులు పెద్ద ల్యాబ్లపై ఆధారపడుతున్నాయంటే వీటి ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. రూ.22,000 కోట్ల విలువైన భారత రోగ నిర్ధారణ పరీక్షల విపణిలో క్రమంగా వ్యవస్థీకృత రంగం పైచేయి సాధిస్తోంది. ఇదీ భారత మార్కెట్.. దేశంలో రోగ నిర్ధారణ పరీక్షల మార్కెట్ రూ.22,000 కోట్లుంది. అవ్యవస్థీకృత రంగంలో దేశవ్యాప్తంగా ఒక లక్ష వరకు ల్యాబ్లు ఉంటాయని సమాచారం. వ్యవస్థీకృత రంగం వాటా 15 శాతం మాత్రమే. అయినప్పటికీ ఈ విభాగం వృద్ధి రేటు ఏకంగా 22 శాతం ఉంది. ఈ రంగంలో డాక్టర్ లాల్ పాథ్ల్యాబ్స్, థైరోకేర్ ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఇటీవలే లిస్ట్ అయిన మెట్రోపోలిస్ హెల్త్కేర్ ఆరు రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయిందంటే పరిశ్రమలో ఉన్న అవకాశాలను అంచనా వేయొచ్చు. ఎస్ఆర్ఎల్ డయాగ్నోస్టిక్స్ 397 కేంద్రాలతో పలు రాష్ట్రాల్లో విస్తరించింది. ఇక ప్రతి రాష్ట్రంలో మూడు నాలుగు పెద్ద కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టెనెట్, విజయ, ఎల్బిట్ వంటివి ప్రాచుర్యంలో ఉన్నాయి. కీలక పరీక్షల కోసం గతంలో ముంబై, ఢిల్లీ ల్యాబొరేటరీలపై తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రులు ఆధారపడేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ రంగంలో ల్యాబొరేటరీలను అనుసంధానించే అగ్రిగేటర్లూ రంగ ప్రవేశం చేశాయి. మొత్తంగా పరిశ్రమలో రూ.15,000 కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చినట్టు సమాచారం. వ్యవస్థీకృత రంగంవైపు.. మార్కెట్ క్రమంగా వ్యవస్థీకృత రంగంవైపు మళ్లుతోంది. దీనికి కారణం పెద్ద ల్యాబొరేటరీలు నాణ్యత ప్రమాణాలు పాటించడమే. నిపుణులైన వైద్యులు, టెక్నీషియన్లను నియమించుకుంటున్నాయి. ఈ రంగంలో చాలా ల్యాబొరేటరీలకు ఎన్ఏబీఎల్ ధ్రువీకరణ ఉంది. అత్యంత నాణ్యత ప్రమాణాలు పాటించే సంస్థలకే ఈ ధ్రువీకరణ లభిస్తుంది. పైగా వ్యవస్థీకృత రంగ సంస్థలు ఎఫ్డీఏ, సీఈ ధ్రువీకరణ ఉన్న మెడికల్ కిట్స్నే వినియోగిస్తున్నాయి. ఇక పీసీఆర్, తదుపరి తరం సీక్వెన్సింగ్ టెక్నాలజీ, మల్టీప్లెక్స్ పీసీఆర్, ఎల్సీఎంఎస్ వంటి ఖరీదైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద సంస్థలు వినియోగిస్తున్నాయి. ఈ టెక్నాలజీ రాకతో రోగ నిర్ధారణ పరీక్షలు త్వరితగతిన పూర్తి కావడంతోపాటు కచ్చితత్వం ఉంటోంది. ఔషధ పరీక్షలు జరిపే కంపెనీలు పెద్ద ల్యాబొరేటరీల సాయం తీసుకుంటున్నాయి. క్లినికల్ డేటా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి వైద్య పరిశోధనలకు ల్యాబొరేటరీల్లో ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలన్నది కంపెనీల మాట. భవిష్యత్లో భారత్ నుంచి.. వైద్య సేవల రంగం మాదిరిగా రోగ నిర్ధారణ పరీక్షల రంగంలో కూడా వచ్చే రెండేళ్లలో భారత్ కేంద్ర బిందువు కానుంది. ఇప్పటికే మధ్యప్రాచ్య దేశాల్లోని ఆసుప్రతుల నుంచి రోగ నిర్ధారణ పరీక్షల కోసం శాంపిళ్లు ముంబై, ఢిల్లీకి వస్తున్నాయి. భవిష్యత్తులో యూరప్ ఆసుపత్రులకు భారత్ సేవలందించే అవకాశాలు ఉన్నాయని టెనెట్ డయాగ్నోస్టిక్స్ చైర్మన్ దేవినేని సురేశ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘యూరప్తో పోలిస్తే ఇక్కడే వ్యయం తక్కువ. ఇప్పటికే అక్కడి నుంచి టెనెట్కు ఎంక్వైరీలు వస్తున్నాయి. ఆఫ్రికాకు కూడా భారత్ సేవలు అందించనుంది. వచ్చే అయిదేళ్లలో ఈ పరిశ్రమలో కఠిన నిబంధనలు అమలులోకి వస్తాయి. దీంతో నాణ్యత ప్రమాణాలు పాటించని చిన్న ల్యాబొరేటరీలు దాదాపు కనుమరుగవుతాయి. వ్యవస్థీకృత రంగంలో కాన్సాలిడేషన్ జరుగుతుంది. పోటీ పెరగడంతోపాటు అవకాశాలు అదే స్థాయిలో ఉంటాయి. కొత్త టెక్నాలజీని సొంతం చేసుకునే కంపెనీలే మిగులుతాయి’ అని వివరించారు. -
సంస్కరణలు మరింత వేగవంతం
విదేశీ ఇన్వెస్టర్లకు ప్రధాని నరేంద్ర మోదీ హామీ కౌలాలంపూర్: పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కల్పించే దిశగా భారత్లో సంస్కరణలను మరింత వేగవంతంగా, సాహసోపేతంగా అమలు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అలాగే పన్ను విధానాలు పారదర్శకంగా, నిలకడగా ఉండేలా చూడటంతో పాటు మేథోహక్కులను పరిరక్షించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలంటూ విదేశీ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. ఆగ్నేయాసియా దేశాల కూటమి ఆసియాన్-భారత్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. 7.5 శాతం వృద్ధి రేటుతో ప్రస్తుతం భారత్.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశమని మోదీ చెప్పారు. సమీప భవిష్యత్లో మరింత అధిక వృద్ధి రేటు సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఆసియాన్ వ్యాపార, పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న మోదీ.. గడిచిన 18 నెలల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. స్థూల దేశీయోత్పత్తి, విదేశీ పెట్టుబడుల రాక మెరుగుపడ్డాయన్నారు. భారత్ ముఖచిత్రాన్ని మార్చడమే అంతిమ లక్ష్యమని, ఆ దిశగా చేసే సుదీర్ఘ ప్రయాణంలో సంస్కరణలు చిన్న చిన్న మజిలీలని మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి అధిక ద్రవ్యోల్బణం, నిల్చిపోయిన ప్రాజెక్టులు, భారీ ద్రవ్య లోటు తదితర సమస్యలతో ఎకానమీ అస్తవ్యస్తంగా ఉందని ఆయన చెప్పారు. ఆ తరుణంలో సంస్కరణల లక్ష్యం కేవలం జీడీపీ వృద్ధిని పెంచుకోవడం మాత్రమే కాకూడదని, దేశ ముఖచిత్రాన్ని మార్చేవిగా ఉండాలని నిర్దేశించుకున్నట్లు మోదీ తెలి పారు. దానికి అనుగుణంగానే ఏడాదిన్నర కాలంగా పలు సంస్కరణలు చేపట్టినట్లు వివరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement