breaking news
He for She
-
మీటూ ఉద్యమం : మగవాళ్లూ బయటకు రావాలి!
సాక్షి, న్యూఢిల్లీ : సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం తీసుకురావాలనే లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం ‘హీ ఫర్ షీ’ ఉద్యమం ప్రారంభమైంది. మహిళలపై జరుగుతున్న హింస గురించి ఈ ఉద్యమంలో చర్చ మొదలయింది. దాన్ని మహిళల సమస్యగా భావించి పురుషులు అంతగా స్పందించలేక పోయారు. లైంగిక వేధింపులపై కూడా చర్చ జరిగింది. చివరకు బాధితురాలి భద్రతకు ఆమెనే బాధ్యత వహించాలనే అభిప్రాయానికి స్త్రీ, పురుషులు రావడంతో ‘హీ ఫర్ షీ’ ఉద్యమం కాస్త చల్లారిపోయింది. ఇప్పుడు భారత్లోని అన్ని రంగాల్లో ముఖ్యంగా బాలీవుడ్, మీడియాలో ‘మీ టూ’ ఉద్యమం ఊపందుకుంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ దగ్గరి నుంచి మీడియా మాజీ ఎడిటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఎంజే అక్బర్ వరకు అందరిపైన లైంగిక వేధింపుల ఆరోపణల పరంపర కొనసాగుతోంది. కొందరేమో క్షమాపణలు చెబుతున్నారు. మరి కొందరు స్పందించేందుకు తిరస్కరిస్తున్నారు. ఇంకొందరు ఖండిస్తున్నారు. పదేళ్ల క్రితం, ఇరవై ఏళ్ల క్రితం జరిగిన లైంగిక వేధింపుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లు వారు ఎందుకు మాట్లాడలేదు ? మహిళలకు మరింత భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ‘సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్, రెడ్రెస్సల్) యాక్ట్-2013’ లో తీసుకొచ్చినప్పటికీ వారు ఎందుకు కేసు పెట్టలేదు? అప్పుడు పరువు పోతుందని భయపడ్డారా? ఆ పరువు మరి ఇప్పుడు పోదా? ఈ వయస్సులో పోయినా ఫర్వాలేదా? ‘మీ టూ’ ఉద్యమం కారణంగా ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చామని చెబుతున్నారా? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాజంలో వర్క్ ప్లేస్లో మహిళలు మాత్రమే లైంగిక వేధింపులకు గురవుతున్నారా? మగవాళ్లు గురవడం లేదా? మగవాళ్లు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారని లైంగిక వివక్ష అంశాలపై ఆసక్తికరమైన ఆర్టికల్స్ రాసే మహిళా జర్నలిస్ట్ సుభుహీ సాఫ్వీ చెబుతున్నారు. ఈ సందర్భంగా తన ఒకానొక మిత్రుడికి జరిగిన అనుభవం గురించి ఆమె చెప్పుకొచ్చారు. ఓ మీడియాలో లేడీ బాస్ దగ్గర అతను పనిచేసేవాడట. ఆ లేడీ బాస్ ప్రతి రోజు అతన్ని లైంగికంగా వేధిస్తూ రావడంతో ఓ రోజు అతగాడు హెచ్ఆర్ విభాగానికి ఫిర్యాదు చేశారట. ‘ఇంతకాలం ఎంజాయ్ చేసి, మోజు తీరాక వచ్చి ఫిర్యాదు చేస్తున్నావా?’ అంటూ అతని ఫిర్యాదును స్వీకరించేందుకు వారు తిరస్కరించారట. దాంతో అతగాడు ఉద్యోగం మానేసి మరో మీడియాకు మారిపోయాడట. ‘మీ టూ’ ఉద్యమానికి నాంది పలికిన హాలీవుడ్ నిర్మాత హార్వీ విన్స్టైన్ ఇప్పుడు కోర్టులో కూడా ఇలాగే వాదిస్తున్నారు. ‘నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. సినిమా అవకాశాలు పొందారు. ఇష్ట పూర్వకంగానే పడక సుఖం పొందారు. అన్ని తీరాక ఇప్పుడు లేట్ వయస్సులో నాపై అభాండాలు వేస్తున్నారు’ అని ఆయన అమెరికా కోర్టు ముందు చేసిన వాదనలో బలం ఉందా? ఉంటే ఆ వాదన మన బాలీవుడ్ పురుష పుంగవులకు వర్తించదా? అన్నది ఒక్క పక్క చర్చ అయితే, లైంగిక వేధింపులకు గురైన మగవాళ్లు కూడా ఉంటారని, వారంతా ఇప్పుడు ‘వుయ్ టూ’ అంటూ ముందుకు రావాలని సుభుహీ సాఫ్వీ పిలుపునిచ్చారు. డెమీ మూర్, మైఖేల్ డగ్లస్ నటించిన హాలీవుడ్ హిట్ చిత్రం ‘డిస్క్లోజర్’ ఇతివత్తం కూడా మహిళా బాస్ లైంగికంగా వేధించడమే కదా! -
సమానత్వం కోసం వినూత్న యత్నం
హి ఫర్ షి స్త్రీ, పురుష సమానత్వం కోసం ప్రపంచ దేశాలలోని అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు) చాలాకాలంగా కృషిచేస్తున్నాయి. కొన్ని దేశాల్లోనైతే లైంగిక సమానత్వం కోసం ప్రభుత్వమే ప్రణాళికలను చేపడుతోంది. సమానత్వం ఉన్న చోట సమాజంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి ఉంటుంది. అందుకే ఈ ప్రయత్నాలు. ఈ క్రమంలో ఇప్పుడు ఐరాస మహిళా విభాగం ఇటీవల న్యూఢిల్లీలో స్త్రీ, పురుష సమానత్వ ప్రచారోద్యమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ఆ ఉద్యమం పేరు ‘హి ఫర్ షి’. పేరులోనే కాదు, ఉద్దేశంలోనూ నవ్యత ఉన్న కార్యక్రమం ఇది. 2030ని ఒక గడువుగా పెట్టుకుని ఆనాటికల్లా స్త్రీ, పురుష సమానత్వం సాధించడం కోసం అంతర్జాతీయంగా బాలురు, పురుషుల సహాయంతో ముందుకెళ్లాలని 'హ ఫర్ షి’ ద్వారా సమితి సంకల్పించింది. ‘హి ఫర్ షి’ అంటే.. ఆమె కోసం అతడు అని. ఈ నినాదంతో మహిళా సంక్షేమం కోసం, మహిళల అభివృద్ధి కోసం పురుషుల సేవలను, సహకారాన్ని తీసుకుని తద్వారా లైంగిక సమానత్వం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమితి మహిళా ప్రతినిధి రెబెక్కా టవేర్స్’ ప్రకటించారు. ఇందుకోసం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ‘మెన్ఎంగేజ్’ అనే సంస్థ నేతృత్వంలో బాలురు, పురుషుల సహాయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. తొలుత ఈ ఏడాది సెప్టెంబరు 20న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రారంభమైన ‘హి ఫర్ షి’ ప్రచారోద్యమాన్ని, మనదేశంలో అక్టోబర్ 18న కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మనేకా గాంధీ ప్రారంభించారు. ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా లక్ష మంది బాలురు, పురుషుల నుంచి ప్రతిజ్ఞా సంతకాన్ని సమితి సేకరించింది. అందులో 4000 మంది భారతీయులు ఉన్నారు. ఇలా ప్రతిజ్ఞ చేసినవారు స్త్రీల హక్కుల కోసం తమ వంతుగా పాటు పడవలసి ఉంటుంది. స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలలో తమ గళం వినిపించవలసి ఉంటుంది. స్త్రీల సమస్యలపై మగవాళ్లలో సహానుభూతి కల్పించి, లైంగిక సమానత్వం సాధించడం కోసం గత నాలుగు మాసాలుగా భారత మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని చెబుతూ, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన బృహత్తర కార్యక్రమం కూడా లైంగిక సమానత్వానికి మరింతగా తోడ్పడుతుందని మనేకా గాంధీ అన్నారు. బాలురు, పురుషులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ‘హి ఫర్ షి’ లో పాలుపంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మరోవైపు ‘మెన్ ఎంగేజ్’ సంస్థ నవంబర్ 10 నుంచి 13 వరకు నాలుగురోజుల పాటు తన రెండవ అంతర్జాతీయ సదస్సును ఢిల్లీలో నిర్వహించబోతోంది. ‘లైంగిక సమానత్వం కోసం బాలురు, యువకులు’ అనే ప్రధానాంశంగా ఈ సదస్సు జరగనుంది. దీనిపై ‘సెంటర్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ జస్టిస్’ ప్రతినిధి అభిజిత్ మాట్లాడుతూ... ‘‘స్త్రీల సమస్యల పట్ల సహానుభూతి కలిగి ఉండడమే అసలైన పురుషత్వం అనే భావనను బాలురు, పురుషులలో కలిగించ డమే ‘మెన్ ఎంగేజ్’ లక్ష్యం అని అన్నారు. ఇంత ఉన్నతమైన లక్ష్యానికి దేశంలోని బాలురు, పురుషులంతా సహకరిస్తే, తమ మద్దతు ప్రకటిస్తే స్త్రీ పురుష సమానత్వాన్ని గడువులోపలే సాధించవచ్చు. మగవాళ్లకు అవగాహన కల్పించాలి స్త్రీ, పురుష సమానత్వ సాధనలో పురుషుల భాగస్వామ్యమే కీలకం. స్త్రీలు ఎదుర్కొంటున్న సామాజిక ఆంక్షలు, కుటుంబ అవరోధాలపై గనుక బాలురకు, పురుషులకు అవగాహన కలిగించగలిగితే లైంగిక అసమానతలు త్వరలోనే రూపుమాసిపోతాయి. - మనేకాగాంధీ, కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి