breaking news
Hakimullah Mehsud
-
పాక్ ‘శాంతి’ రగడ
అమెరికా, పాకిస్థాన్ల కలహాల కాపురం ఇలా కుదటపడిందో లేదో అలా మళ్లీ రచ్చకెక్కింది. పాకిస్థాన్ ప్రధాని నవాజ్షరీఫ్ గత నెలలో (20-23) అమెరికాలో పర్యటించారు. పాక్ భూభాగంపై అమెరికా ద్రోన్ విమాన దాడులను తక్షణమే నిలిపివేయాలని అధ్యక్షుడు బరాక్ ఒబామాను కోరారు. ఇరు దేశాలకు సంతృప్తిని కలిగించిన ఆ పర్యటనలో ఒబామాకు పట్టనిది అది ఒక్కటే. అందుకు నవాజ్ చింతించిందీ లేదు. 2014లో అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా సేనల నిష్ర్కమణ తదుపరి ద్వైపాక్షిక సహకారానికి వీలుగా పరిస్థితిని చక్కదిద్దగలిగామని ఒబామా ప్రభుత్వం సంతృప్తిని వ్యక్తం చేసింది. వారం తిరిగే సరికే కథ అడ్డం తిరిగినట్టయింది. ప్రభుత్వమూ, ప్రతిపక్షాలు కలిసి అమెరికాపై నిప్పులు కక్కుతున్నాయి. కార ణం నవంబర్ 2న జరిగిన మరో ద్రోన్ దాడి. అమెరికా 2004 నుంచి పాక్ వాయవ్య ప్రాం తంలోని ఖైబర్ ఫక్తున్ఖ్వా రాష్ట్రంలోనూ, కేంద్రపాలిత తెగల ప్రాంతంలోనూ ద్రోన్ దాడులు సాగిస్తూనే ఉంది. పాక్ నుంచి అప్ఘాన్లో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులపై దాడుల పేరిట వందలాదిగా అమాయక పౌరులను బలిగొంటోంది. గ్రామాలకు గ్రామాలనే బుగ్గి చేస్తోంది. అమెరికా అధికారిక ప్రకటనల ప్రకారమే ఒక్కో మిలిటెం టును హతమార్చడానికి సగటున పది మంది పౌరులు బలి కావాల్సివస్తోంది. ఇంతకూ నవాజ్ ప్రభుత్వం అలకకు కారణం ద్రోన్ దాడుల కొనసాగింపు కానేకాదు... ఆ దాడిలో పాక్ తాలిబన్గా పిలిచే ‘తెహ్రిక్ ఎ తాలిబన్ పాకిస్థాన్’ (టీపీపీ) అగ్రనేత హకీముల్లా మెహసూద్ మృతి చెందడం. ద్రోన్ దాడుల్లో హతమవుతున్న పౌరుల గురించి మొసలి కన్నీళ్లు కార్చే పాక్ ప్రభుత్వం... ‘అత్యంత ప్రమాదకర ఉగ్రవాది’గా అమెరికా ముద్ర వేసిన హకీముల్లా హతమైనందుకు రభస చేయడంలో అర్థం లేకపోలేదు. నవాజ్ ప్రభుత్వం హకీముల్లాతో శాంతి చర్చలు నడుపుతోంది. సహచరులతో శాంతి చర్చలపై సంప్రదింపుల కోసమే ఉత్తర వజీరి స్థాన్కు అతను వచ్చాడు. ఆ సమావేశంపై అమెరికా ద్రోన్ దాడికి పాల్పడింది. ఇది ‘శాంతి ప్రక్రియని హత్య చేయడమే’నని పాక్ హోంమంత్రి చౌధరీ నిస్సార్ సోమవారం మండిపడ్డారు. అఫ్ఘాన్లోని అమెరికా, నాటో సేనలకు పాక్ గుండా జరిగే సరఫరాలను వెంటనే నిలిపివేయాలని తెహ్రిక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ఖాన్ కోరారు. ఖైబర్ ఫక్తున్ఖ్వాలోని అధికారపార్టీ అదే. హకీముల్లా హత్యతో శాంతి చర్చలకు విఘాతం కలిగిందని నవాజ్ పార్టీ (పీఎమ్ఎల్-ఎన్) ఆందోళన చెందుతోంది. ‘శాంతి చర్చలు పాక్ అంతర్గత సమస్య’ని, వాటితో తమకు ఎలాం టి సంబంధం లేదని అమెరికా తేల్చిపారేసింది. అదే సూత్రం ప్రకారం పాక్ మిలిటెన్సీ సమస్య కూడా ఆ దేశ అంతర్గత వ్యవహారమే కావాలి. ఎవరి అనుమతితో అమెరికా ద్రోన్ దాడులతో జోక్యం చేసుకుంటున్నట్ట్టు? దానికి ఎవరి అనుమతి అక్కర్లేని మాట నిజమే. కానీ కనీసం 2007 నుంచి పాక్ ప్రభుత్వ అనుమతితోనే ద్రోన్ దాడులు సాగుతున్నాయని ఇటీవలే ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక వెల్లడించింది. ఇక హకీముల్లా హత్యకు సంబంధించి... నవా జ్ ప్రభుత్వ ఆగ్రహానుగ్రహాలతో అమెరికాకు పనిలేదు. అందుకు ‘ఇవ్వవలసిన వారి’ అనుమతే ఉంది. ఆర్మీ చీఫ్ జనరల్ అష్ఫాక్ కయానీ కూడా ‘శాంతి’నే కోరుతున్నారు. కాకపోతే శ్రీలంక తరహాలో ముందుగా తాలిబన్లను సైనికంగా నిర్మూలించాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన ఈ చేత్తో శాంతి చర్చల కోసం అఖిలపక్ష సమావేశం నిర్వహ ణకు నవాజ్కు పచ్చజెండా చూపి, మరో చేత్తో హకీముల్లా ఆనుపానులు అమెరికాకు అం దేట్టు చేశారు. అమెరికా గూఢచార సంస్థ సీఐఏకూ, పాక్ సైన్యం, ఐఎస్ఐలకూ మధ్య ఈ విషయంలో ఉన్న సహకార సంబంధాలను కూడా ‘వాషింగ్టన్ పోస్ట్’ వెల్లడించింది. కయానీతో ఏకీభవించే మితవాద రాజకీయ పక్షాలు విస్పష్టంగా ‘మంచి మిలిటెంట్లు’, ‘చెడ్డ మిలిటెంట్లు’ అనే విభజన రేఖను గీసా యి. అఫ్ఘాన్లో మాత్రమే దాడులకు పాల్పడే సలాఉద్దీన్ అయూబీ, హఫీజ్ గుల్ బహదూర్, హఖానీ గ్రూపులు మంచి మిలిటెంట్లు. పాక్లో బాంబు దాడులకు, ఆత్మహుతి దాడులకు పాల్పడే టీపీపీ చెడ్డ మిలిటెంట్లు. ఇక భారత్లో దాడులకు పాల్పడే ‘లష్కరే తోయి బా’, ‘లష్కరే జంగ్వీ’, ‘జైషే మొహ్మద్’ సం స్థలు ముఖ్య ‘వ్యూహాత్మక సాధనాలు లేదా మిత్రులు’. అఫ్ఘాన్లోనే దాడులకు పాల్పడే మిలిటెంట్లతో అమెరికాకు పేచీ. శాంతి చర్చలతో టీపీపీ ప్రధాన రాజకీయ స్రవంతిలోకి రావడం కయానీ లాంటి సైనిక నేతల ఆధిపత్యానికి ప్రమాదం. అందుకే అమెరికా, కయానీలకు మధ్య మునుపెన్నటికంటే బలమైన ఏకీభావం నెలకొంది. ‘శాంతి హత్య’తో అమెరికా పాక్ బంధానికి వచ్చిన ముప్పేమీ లేదు. నవాజ్ నిమిత్తమాత్రుడు. - పి.గౌతమ్ -
పాక్ తాలిబన్ చీఫ్ హతం
పెషావర్/ఇస్లామాబాద్: ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంపై అమెరికా ద్రోన్ విమానం జరిపిన దాడిలో పాకిస్థాన్ తాలిబన్ అధినేత హకీముల్లా మెహసూద్ మరణించినట్లు ఆ దేశ మీడియా శుక్రవారం రాత్రి వెల్లడించింది. మెహసూద్ సహా మొత్తం ఆరుగురు ఈ దాడిలో మరణించినట్లు పేర్కొంది. దాండే దర్పఖేల్ ప్రాంతంలోని ఓ ఆవరణ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు పాక్ ఇంటిలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ డాన్ పత్రిక తెలిపింది. రెండు క్షిపణులు ఢీకొట్టడంతో ఆవరణ పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో పాకిస్థాన్ తాలిబన్ల సమావేశం జరుగుతోందని ఆ కథనం వివరించింది. ఈ ఆవరణను మెహసూద్ తరచు ఉపయోగిస్తుంటాడని సమాచారం. నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ)కు నేతృత్వం వహిస్తున్న మెహసూద్తో పాటు మెహసూద్ బంధువు, వ్యక్తిగత బాడీగార్డ్ అయిన తారిక్ మెహసూద్, డ్రైవర్ అబ్దుల్లా మెహసూద్ మరణించినవారిలో ఉన్నారు. భద్రతా దళాలను ఉటంకిస్తూ జియో న్యూస్ కూడా మెహసూద్ మరణ వార్తను ప్రకటించింది. అనంతరం తాలిబన్ వర్గాలు కూడా మెహసూద్ మృతిని ధ్రువీకరించాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మిరాన్షా ప్రాంతంలో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపాయి. తాలిబాన్, ఆల్ కాయిదా అగ్ర నాయకత్వానికి తగులుతున్న వరుస ఎదురుదెబ్బల్లో ఇది తాజా సంఘటన అవుతుందని భావిస్తున్నారు. అమెరికా ద్రోన్లు పాక్ గిరిజన ప్రాంతం లక్ష్యంగా పదేపదే దాడులకు దిగుతున్న సంగతి విదితమే. తాజా దాడి అనంతరం పరిణామాలపై పాక్ హోం మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తోనూ, ఇతర రాజకీయ నేతలతోనూ చర్చించారు. దేశంలో శాంతిని నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. గత నెలలో షరీఫ్ అమెరికా పర్యటన అనంతరం ద్రోన్ దాడి జరగడం ఇది రెండోసారి. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయిన షరీఫ్ సీఐఏ ప్రేరేపిత ద్రోన్ దాడుల గురించి ప్రస్తావించారు. దాడులు నిలిపివేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అఫ్ఘానిస్థాన్లో టీటీపీ డిప్యూటీ చీఫ్ లతీఫ్ మెహసూద్ను అమెరికా ప్రత్యేక దళాలు పట్టుకున్న తర్వాత కొద్దిరోజులకే తాజా దాడి జరగడం విశేషం. బాంబులు, ఆత్మాహుతి దాడులతో టీటీపీ పాక్ దళాలపై విరుచుకుపడుతోంది. దేశవ్యాప్తంగా వేలాదిమంది ఈ దాడుల్లో మరణించారు. మెహసూద్కు ముందు టీటీపీ చీఫ్గా వ్యవహరించిన బైతుల్లా మెహసూద్ కూడా ద్రోన్ దాడిలోనే మరణించాడు. బైతుల్లా మరణానంతరం 2009లో హకీముల్లా టీటీపీ పగ్గాలు చేపట్టాడు. -
యూఎస్ భద్రత దళాల అదుపులో తాలిబన్ కమాండర్
తాలిబాన్ తీవ్రవాద సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ లతీఫ్ మసూద్ను అమెరికా మిలటరీ దళాలు పట్టుకున్నట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి మేరి హర్ఫ్ వెల్లడించారు. తేహ్రిక్ - ఈ - తాలిబాన్ (టీటీపీ) అగ్రనేత హకిముల్లా ముసూద్కు లతీప్ అనుచరుడని పేర్కొంది.అయితే భద్రతా దళాల గాలింపు చర్యల్లో భాగంగా అతడిని పట్టుకున్నట్లు చెప్పారు. అంతకు మినహా లతీఫ్ను ఎక్కడ,ఎప్పుడు పట్టుకున్నది సమాచారం తెలియలేదని తెలిపారు. 2010లో యూఎస్లో టైమ్స్ స్కేర్ వద్ద బాంబు పేలుళ్లలో ఘటనకు పాల్పడింది తామేనని టీటీపీ ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.యూఎస్లో మరోసారి దాడులకు పాల్పడేందుకు టీటీపీ ప్రయత్నిస్తుందని నిఘా వర్గాల ద్వారా తమకు సమాచారం అందిందని తెలిపారు.