తాజ్మహల్ చూద్దామని వెళ్లి..
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తాజ్మహల్ అందాలు చూద్దామని ఎంతో ఆశగా జపాన్ నుంచి వచ్చారు. కానీ తీరా ఇక్కడకు వచ్చిన తర్వాత.. తాజ్మహల్ మెట్ల మీద నుంచి జారిపడి, ప్రాణాలు కోల్పోయారు. హెచ్.ఉయెదా (66) అనే ఆ జపనీస్ పర్యాటకుడికి తలమీద తీవ్రమైన గాయం కావడంతో ఆయన మరణించారు. తాజ్ గంజ్ పోలీసులు వెంటనే ఆయనను సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినా, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు చెప్పారు.
ఆయనతో పాటు వచ్చిన మరో స్నేహితుడు కూడా మెట్ల మీద నుంచి జారి పడిపోయారు. ఆయనకు కాలు విరిగింది. తాజ్మహల్ వెళ్లేందుకు ముందు వాళ్లు ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ తదితర ప్రాంతాలు చూశారు. ఈ ప్రమాదం గురించి ఢిల్లీలో ఉన్న జపాన్ రాయబార కార్యాలయానికి పర్యాటక శాఖ అధికారులు సమాచారం అందించారు.