-
ఖండాలు దాటిన ఖ్యాతి
తెలంగాణ తొలిదశ పోరాటం నుంచి మలిదశ ఉద్యమం వరకు తన కలం, గళంతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన ప్రజాకవి గూడ అంజయ్య. ప్రజలను ఆలోచింపజేసే ఎన్నో పాటలు రాశారాయన. ప్రస్తుతం భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన రాసిన పాటల్లో నిత్యం చిరంజీవిలా వెలుగొందుతూనే ఉంటారు. నేడు గూడ అంజయ్య 65వ జయంతి. దండేపల్లి (మంచిర్యాల) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన గూడ అంజయ్య 1954 నవంబర్ 1న గూడ లస్మయ్య– లస్మమ్మ దంపతులకు ఐదో సంతానంగా జన్మించారు. ఫార్మసిస్టుగా ఆ దిలాబాద్ జిల్లాలోని ఊట్నూర్లో ప్రభుత్వ ఉద్యోగంలో చే రారు. అనంతరం కొద్ది రోజులు ఆదిలాబాద్లోనూ పని చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన ఆయన సినిమా పాటల రచనలో భాగంగా హైదరాబాద్కు వెళ్లారు. అనంతరం అనారోగ్యానికి గురికావడంతో సాహిత్యానికి దూరమయ్యారు. ఖండాలు దాటిన ఖ్యాతి అంజయ్య రాసిన పాటల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. 1970లో అంజయ్య రచించి, స్వయంగా పాడిన ‘ఊరు మనదిరా.. ఈ వాడమనదిరా..’ పాట మన దేశంతో పాటు విదేశాల్లోనూ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. 20 దేశాల్లో ఈ పాటను వివిధ భాషల్లోకి అనువదించారు. ఎమర్జెన్సీ సమయంలో 1975లో విద్యార్థులు ఢిల్లీ వెళ్లే సమయంలో రాసిన పాట ‘భద్రం కొడుకో.. నా కొడుకో కొమురన్న.. జర పైలం కొడుకో..’ అన్న పాటతో తెలంగాణ పాటకు అంజయ్య మరింత పదునెక్కించారు. పాటల్లో సామాజిక సందేశం అంజయ్య రాసిన పాటల్లో సామాజిక సందేశాలు నిండి ఉన్నాయి. ఒక్కో పాటకు ఒక్కో ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రాసిన అనేక పాటలు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని ప్రేరేపించాయి. ‘రాజిగ ఒరె రాజిగా.. ఒరి ఐలపురం రాజిగా’, ‘అయ్యోనివా నువ్వు అవ్వోనివా.. తెలంగాణకు తోటి పాలోనివా..’ అనే పాటలు ఉద్యమకారుల్లో స్ఫూర్తిని రగిల్చాయి. అంతేకాకుండా అంజయ్య తన పాటలతో సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. రచనలు.. కళ్లెదుటే జరిగిన అన్యాయాలతో చలించిపోయిన అంజయ్య 1970లో రచయితగా మారారు. 1970 నుంచి 1978 వరకు అంజయ్య రచించిన, పాడిన పాటలను కవితా సంకలనం పేరిటా పుస్తకం విడుదల చేశారు. 1999లో ఆయన స్వీయరచనలో రూపొందించిన ‘ఊరు మనదిరా’ పుస్తకాన్ని విడుదల చేశారు. ‘ది వాయిస్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో ఆయన పాటల సీడీ రూపొందించారు. పాటలతో పాటు అనేక రకాల నవలలు, నాటకాలు కూడా రచించారు. కవిగా, గాయకునిగా కాకుండా సినిమా నటునిగా కూడా రాణించారు. అంజయ్య రాసిన పాటలను ఆర్. నారాయణమూర్తి ఎక్కువగా తన సినిమాల్లో వాడుకున్నారు. అంజయ్య ఎర్రసైన్యం, మా భూమి, దండోరా, చీకటి సూర్యులు వంటి పలు చిత్రాల్లో కూడా నటించారు. అనారోగ్యంతో.. అంటరానితనం, బానిసత్వాన్ని పారదోలేలా పాటలతో తూటాలు పేల్చిన విప్లవ కవి, గాయకుడు గూడ అంజయ్య. ఆయన కలం, గళం ఆగిపోయి నాలుగేళ్లు గడిచింది. విప్లవ గేయాల రచయితగా ముద్రపడిన అంజయ్య మూత్రపిండాలు, కామెర్ల వ్యాధితో అనారోగ్యానికి గురై 2016 జూన్ 21న హైదరాబాద్లో కన్నుమూశారు. -
మలిసంధ్యలో మాడే కడుపుతో..!
మంచిర్యాల సిటీ: ప్రముఖ కవి, దివంగత గూడ అంజయ్య మాతృమూర్తి పరిస్థితి దయనీయంగా మారింది. మలిసంధ్యలో ఉన్న ఆమె అర్ధాకలితో అలమటిస్తోంది. పదెకరాల భూమి ఉన్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె భిక్షాటన చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఇది గమనించిన మాలమహానాడు నాయకులు సోమవారం జాయింట్ కలెక్టర్ వై. సురేందర్రావు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయం వెలుగుచూసింది. పదెకరాల భూమికి సంబంధించిన వివరాలు ఇస్తే న్యాయం చేస్తానని జేసీ ఆమెకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన లస్మవ్వ విలేకరులతో మాట్లాడుతూ తన గోడును వెళ్లబోసుకున్నది. ‘నాకు పదెకరాల భూమి ఉండేది. దాంతోనే ఆరుగురు కొడుకులను, ఒక బిడ్డను పెంచి పెద్ద చేసిన. వాళ్లకు అన్నీ దగ్గరుండి చూసుకున్న. కొడుకులు చచ్చిపోయిండ్రు. ఒక్క బిడ్డ మాత్రమే ఉన్నది. కొడుకుల పిల్లలు ఉన్నరు. ఆరుగురిలో ఒకడు పదెకరాలను వాని పేరునే చేయించుకున్నడు. అంజయ్య రెండేళ్ల కిందటనే చచ్చిపాయే. అంజయ్య బతికి ఉన్నప్పుడే ఎవరు పట్టించుకోకపాయే. నేను కట్టుకున్న ఇంటిని కూడా వాళ్లే ఉంచుకున్నరు. అక్కడిక్కడ అడుక్కొని యాన్నో ఓ కాడ ఉంటున్న. ఎవలన్న పాపమని బుక్కెడు పెడితే తింటున్న. లేదంటే కడుపు మాడ్చుకొని ఉంటున్న. ఈ వయసులో ఎసంటోళ్లకు కూడా ఇసొంటి తిప్పలు రావద్దు. ఎవరైనా ఎన్ని రోజులు పెడుతరు బిడ్డ. ఎందుకు బతుకుతున్నా అని బాధపడుతున్న. దేవుడు జెప్పన తీసుకపోతే మంచిగుండు..’అంటూ లస్మవ్వ ఆవేదన వ్యక్తం చేసింది. -
గాంధేయవాదానికి వారసుడు ‘బోవెరా’
టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి గూడ అంజయ్యకు ‘బోవెరా’ స్మారక అవార్డు ప్రదానం కరీంనగర్ కల్చరల్: దివంగత బోయినపల్లి వెంకటరామారావు గాంధేయవాదానికి వారసుడని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. బోయినపల్లి వెంకటరామరావు 97వ జయంతి, సారస్వత జ్యోతి మిత్రమండలి స్థాపన దినం, బోవెరా కవితా పురస్కార ప్రదానోత్సవం శుక్రవారం కరీంనగర్లోని ‘బోవెరా’ భవన్లో నిర్వహించారు. కార్యక్రమంలో ఘంటా చక్రపాణి స్మారకోపన్యాసం చేశారు. బోవెరాతో 35 ఏళ్ల పరిచయం ఉందని తెలిపారు. ప్రభుత్వ చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కరీంనగర్లో బోవెరా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బొవేరా కవితా పురస్కారాన్ని ప్రజాకవి, గాయకుడు గూడ అంజయ్యకు మరణానంతరం ప్రదానం చేయగా ఆయన సతీమణి గూడ హేమనళిని స్వీకరించారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ప్రముఖ వాగ్గేయ కారులు గోరటి వెంకన్న, తెలంగాణ అమరవీరుల స్తూపం రూపకర్త ఎక్కా యాదగిరిరావు, సాహితీవేత్తలు ఎంవీ.నర్సింహ రెడ్డి, దాస్యం సేనాధిపతి, గండ్ర లక్ష్మణ్రావు, సుంకె వెంకటాద్రి, మాడిశెట్టి గోపాల్, కాళ్ల నారాయణ, తోట లక్ష్మణ్రావు, వాల భద్రరావు, సజ్జన కమలాకర్, బోవెరా సంస్థల అధ్యక్షుడు బోయినపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాకవి గూడ అంజన్న ఆశయాలను కొనసాగిద్దాం
హన్మకొండ కల్చరల్ : ప్రజాకవి గూడ అంజన్న ఆశయాలను కొనసాగించాల్సి బాధ్యత నేటి తరంపై ఉందని వరసం జిల్లా కన్వీనర్ నల్లెల్ల రాజయ్య అన్నారు. బహుజన సాంస్కృతిక సమాఖ్య అధ్వర్యంలో హన్మకొండలోని శ్రీరాజరాజనరేంద్ర బాషా నిలయంలో ఆదివారం మధ్యాహ్నం సమాఖ్య వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సుధమల్ల అశోక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు యువకవులు మాట్లాడుతూ అంజన్నకు రావల్సిన గుర్తింపు రాలేదని అన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు రమాదేవి, బందెల సదానందం, బొడ్డు కుమారస్వామి, పోలాటి రాజు, ముత్యం రాజు, సామల శ్రీధర్, గురిమిల్ల రాజు, బూజుగుండ్ల శ్రీనివాస్, కుడికాల శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువకులు పాడిన పాటలు అలరించాయి. -
అంజయ్యకు కన్నీటి వీడ్కోలు
♦ గద్దర్, ఆర్.నారాయణమూర్తి తదితరుల నివాళి ♦ అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం బాధాకరం: మందకృష్ణ దండేపల్లి: ప్రజా కవి, గాయకుడు, రచయిత గూడ అంజయ్య (62)కు అభిమానులు బుధవారం అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో మంగళవారం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచిన ఆయన పార్థివ దేహాన్ని బుధవారం తెల్లవారుజామున స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్ కు తీసుకొచ్చారు. ప్రజలు, కుటుంబీకులు, బంధువులు, అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు ఉంచారు. ప్రజాకవి గద్దర్, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటి కొండ రాజయ్య, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, సీపీఎం నేతలు రాములు, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు, దుబ్బాక ఎమ్మెల్యే ఎస్.రామలింగారెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, పలు దళిత సంఘాల నాయకులు, తెలంగాణ సాంస్కృతి సారథి కళాకారులు మృతదేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. అనంతరం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంతక్రియలు నిర్వహించారు. కవిగా, గాయకునిగా దేశవ్యాప్త గుర్తింపు, ప్రజాదరణ పొందిన అంజయ్య అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం చాలా బాధాకరమని మంద కృష్ణమాదిగ ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచ్చారు. ఆయన ఇతర సామాజికవర్గానికి చెంది ఉంటే అంత్యక్రియలను ఎలా నిర్వహించి ఉండేవారో చెప్పనవసరం లేదన్నారు. తీరని లోటు: నారాయణమూర్తి కవి, గాయకుడు దళిత జాతి ముద్దుబిడ్డ గూడ అంజయ్య మరణం దేశానికే తీరని లోటని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. ఆయన రాసిన పాటలతో తన సినిమాలు విజయం సాధించాయన్నారు. అంజయ్యతో తనది విడదీయరాని అనుబంధమని గుర్తు చేసుకున్నారు. ‘దండేపల్లి’కి అంజయ్య పేరు: గద్దర్ అభిమానుల కోరిక మేరకు దండేపల్లి మండలానికి అంజన్న పేరు పెట్టాలని గద్దర్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని బాల్క సుమన్ చెప్పారు. అంజయ్య కొన ఊపిరి దాకా సమాజం గురించే ఆలోచించిన మహోన్నతుడని సీపీఎం నేత రాములు పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement