breaking news
GST rollout
-
సీబీఈసీ.. ఇక సీబీఐసీ
♦ జూన్ 1వ తేదీ నాటికి ఏర్పాటు ♦ సీబీఐసీ కింద దేశవ్యాప్తంగా 21 జీఎస్టీ జోన్లు, 102 కమిషనరేట్లు సాక్షి ప్రతినిధి, తిరుపతి: జులై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో కేంద్రంలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెచ్ఆర్డీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్’(సీబీఈసీ) స్థానంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ)ను తీసుకు వస్తున్నారు. జూన్ మొదటి తేదీ లోగా ఇది ఏర్పాటు కానుంది. సీబీఐసీలో ఛైర్మన్తో పాటు జీఎస్టీ అండ్ సెంట్రల్ ట్యాక్స్, ఐటీ లీగల్, ఇన్వెస్టిగేషన్, ట్యాక్స్ పాలసీ, కస్టమ్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ విజిలెన్స్ విభాగాలకు చెందిన ఆరుగురు సీబీఐసీలో కీలక సభ్యులుగా ఉంటారు. ఇకపోతే సీబీఐసీ నూతన స్వరూపంలో దేశవ్యాప్తంగా∙21 జీఎస్టీ జోన్లు, 102 జీఎస్టీ పన్ను చెల్లింపు సర్వీస్ కమిషనరేట్లు ఉండడంతో పాటు 14 జీఎస్టీ సబ్ కమిషనరేట్లు, 768 డివిజన్లు, 3969 రేంజి కార్యాలయాలు పని చేస్తాయి. ఇవి మాత్రమే కాకుండా 49 జీఎస్టీ ఆడిట్ కమిషనరేట్లు, 50 జీఎస్టీ అప్పీల్ కమిషనరేట్లు, 11 కస్టమ్స్ జోన్లు, 60 కస్టమ్స్ కమిషనరేట్లు, 10 కస్టమ్స్ అప్పీల్లు కస్టమ్స్ కమిషనరేట్లు సీబీఐసీ పరిధిలోనే ఉంటాయి. కొత్త సీబీఐసీ క్రింద చిన్నచిన్న కేంద్రాల్లో సైతం జీఎస్టీ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వీటిని విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిల్లో ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చెల్లతో పాటు మరో పట్టణంలో వీటిని ఏర్పాటుచేస్తారన్నది సమాచారం. సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ కమిషనరేట్లు ఇకపై జీఎస్టీ పన్ను చెల్లింపు సర్వీసు కమిషనరేట్లుగా మారనున్నాయి. కొత్తపన్ను చెల్లింపుదారులందరూ కొత్త సీబీఐసీ పరిధిలోకే వస్తారని కేంద్ర ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను వ్యవస్థ విజయవంతం కావాలంటే సంస్కరణలు అవసరమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ భావిస్తోంది. -
సెస్లు రద్దు: రూ.65 వేల కోట్ల నష్టం
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేయబోతున్న జీఎస్టీ ప్రక్రియ తుది దశకు వచ్చేస్తోంది. 16 రకాల సెస్లను, సర్ఛార్జీలను కేంద్ర కేబినెట్ రద్దు చేసింది. జీఎస్టీ అమలుచేయబోతున్న తరుణంలో ఈ సెస్లు భాగమయ్యే కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ చట్ట సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ చట్ట సవరణతో ఎక్సైజ్ సర్వీసు టాక్స్ లపై సేకరించే మొత్తం 16 రకాల సెస్లను, సర్ఛార్జీలను ప్రభుత్వం కోల్పోతుంది. దీంతో ప్రభుత్వానికి 65వేల కోట్ల రూపాయలను నష్టం వాటిల్లనుంది. జూలై 1 నుంచి జీఎస్టీ అమలుచేయాలని ఎంతో కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం ఈ మేరకు వడివడిగా అడుగులు వేస్తోంది. రద్దైన సెస్లలో క్రిషి కల్యాణ్, స్వచ్ఛ్ భారత్ కూడా ఉన్నాయి. దీంతో రూ.65 కోట్ల నష్టాన్ని భరించాల్సి వస్తుందని కేబినెట్ తెలిపింది. ఈ నష్టాన్ని పూరించుకోవడానికి ప్రభుత్వం బడ్జెట్లో పలు ప్రతిపాదనలు తీసుకొచ్చింది. బహుళ పన్నులను జీఎస్టీ తొలగిస్తుందని, ఈ చట్టం అమల్లోకి వచ్చే లోపల పలు రకాల చట్టాలకు సవరణలను లేదా చట్టాలను ఉపసంహరించాల్సి వస్తుందని అధికారిక ప్రకటన వెలువరించింది. కస్టమర్స్ యాక్ట్ 1962కు, కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ 1975కు, సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ 1944ల సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సెంట్రల్ ఎక్సైజ్ టారిఫ్ యాక్ట్ 1985 ఉపసంహరణను ఆమోదించింది.