Grain price
-
కంటితుడుపు ‘మద్దతు’
రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యేది వరి పంట. దీనికి ఈసారి మద్దతు ధరను క్వింటాకు రూ.69 (కిలోకు 69 పైసలు) మాత్రమే పెంచడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఎకరా సాగుకు రూ.28 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు వచ్చిందని చెబుతున్నారు. కూలీల వేతనాలు, ఎరువులు, పురుగుమందుల ధరల్లో పెరుగుదలతో ఈ ఏడాది ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.42 వేల వరకు ఖర్చు రానుందని అంచనా వేస్తున్నారు. సాక్షి, అమరావతి: పంటలకు ‘మద్దతు ధర’ ఏటా ఓ ప్రహసనంగా మారుతోంది. తాజాగా 2025–26 సీజన్కు సంబంధించి కేంద్రం చేసిన ప్రకటనపై రైతులు, రైతు సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంటలకు చాలా స్వల్పంగా, అతి తక్కువగా పండించేవాటికి అరకొరగా మద్దతు ధర పెంచడం పట్ల మండిపడుతున్నారు. ఏటా ప్రకటిస్తున్న మద్దతు ధరలకు.. క్షేత్రస్థాయిలో పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులకు పొంతన లేకుండా పోతోందని విమర్శిస్తున్నారు. పైగా పంట చేతికొచ్చే సమయంలో ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు.కంటితుడుపుగా..ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరి సహా 14 పంటలకు కేంద్రం మద్దతు ధరలు వెల్లడించింది. అత్యధికంగా సాగయ్యే వరికి నిరుటితో పోలిస్తే సాధారణ, గ్రేడ్–ఎ క్వింటాకు రూ.69, మొక్కజొన్నకు రూ.175 పెంచింది. జొన్నలు రూ.328, సజ్జలు రూ.150, రాగులు రూ.596, కందులు రూ.450, పెసర రూ.86, మినుములు రూ.400, వేరుశనగ రూ.480, పొద్దుతిరుగుడు రూ.441, సోయాబీన్ రూ.436, కుసుమలు రూ.579, వలిశలు (గడ్డినువ్వులు) రూ.820, పత్తి రూ.589 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించారు. పెట్టుబడి ఖర్చులతో పోల్చుకుంటే ఇది తక్కువేనని రైతులు పెదవి విరుస్తున్నారు. కూలీల కొరతతో కోతలు, నూర్పిళ్లకు పూర్తిగా యంత్రాలపైనే ఆధారపడాల్సి వస్తోందని... పెట్రోల్ ధరల కారణంగా వీటి అద్దెలు భారీగా పెంచేశారని చెబుతున్నారు. మరోవైపు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రధాన పంటలకు సగటున ఉత్పత్తి ఖర్చులు ఎకరాకు 10–15 శాతం మేర అధికమయ్యాయి. ఆ స్థాయిలో మాత్రం మద్దతు ధరలు పెంచడం లేదని మండిపడుతున్నారు.వీటికి ఒక్క శాతానికి మించలేదు..ప్రధాన వాణిజ్య పంట అయిన మొక్కజొన్న సాగుకు నిరుడు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు ఖర్చు వచ్చింది. ఈ ఏడాది రూ.35 వేలు అవుతోంది. అంటే.. దాదాపు రూ.15 వేలు అధికం. పెరిగిన మద్దతు ధర మాత్రం 7.8 శాతమే. అపరాల పంటలన్నింటికీ పెట్టుబడి ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అధికం కానుండగా.. ఆ స్థాయిలో మద్దతు ధర పెంపు లేదని రైతులు విమర్శిస్తున్నారు. కందికి 1.1 శాతం, పెసరకు 0.9 శాతం, సజ్జకు 0.34 శాతం మాత్రమే పెంచడం గమనార్హం. ఏటా ధాన్యంతో సహా ఏ ఒక్క పంటకూ కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు దక్కడం లేదు. ఉదాహరణకు మినుములుకు రూ.7,400 కాగా రూ.7 వేలకు మించి కొనలేదు. వేరుశనగ రూ.6,783కు గాను దక్కింది రూ.5,500. చిరు ధాన్యాలకు సైతం క్వింటాకు రూ.2,500 దాటి ఇవ్వలేదు. కందులు మద్దతు ధర రూ.7,550 కాగా కొనేవారే కరువయ్యారు.ధాన్యానికి మద్దతు ధర పెంపు 3 శాతమా?గత ఏడాది ధాన్యం సాధారణ, ఏ గ్రేడ్ రకాలకు క్వింటాకు రూ.117 చొప్పున పెంచిన కేంద్రం ఈ ఏడాది మాత్రం ఆశలపై నీళ్లు చల్లింది. నిరుడు ప్రకటించిన ప్రకారం 75 కేజీల బస్తాకు రూ.1,725 దక్కాల్సి ఉండగా, రూ.1,100–రూ.1,400 మధ్య ధర పలికింది. మేలు రకాలకు సైతం రూ.1,400కు మించి దక్కలేదు. అంటే, మద్దతు ధరలోనే 30–40 శాతం మేర రైతులు నష్టపోయారు. కనీసం ఈ ఏడాదైనా క్వింటాకు రూ.500 తక్కువ కాకుండా పెంచుతారని భావించారు. కానీ, అన్నదాతల ఆశలను అడియాశలు చేస్తూ నిరుటితో పోలిస్తే ఈ ఏడాది మద్దతు ధర పెంపును 3 శాతానికి పరిమితం చేశారు. అంటే కిలోకు 69 పైసలకు మించలేదు. ఇలాగైతే బతికేది ఎలాగంటూ ధాన్యం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పెట్టుబడి ఖర్చులకు, పెంపునకు సంబంధం ఉందా?పెట్టుబడులు అన్ని పంటలకు ఒకేలా పెరుగుతున్నాయి. దీనికి... ప్రకటించిన మద్దతు ధరలకు ఏమాత్రం సంబంధం లేదు. రాష్ట్రంలో అత్యధికంగా పండేది వరి. కానీ, ధాన్యం క్వింటాకు రూ.69 మాత్రమే పెంచడం దారుణం. పెసరకూ గత సంవత్సరం కంటే తక్కువ పెంచారు. మిగిలిన పంటలకు గత ఏడాది కంటే ఎంతో కొంత పెంపునకు అనుమతి ఇచ్చారు. – ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ అగ్రి మిషన్ -
63వ నంబరు జాతీయ రహదారి దిగ్బంధం
ఆర్మూర్ రైతులు మరోమారు ఆందోళనబాట పట్టారు. ఎర్రజొన్న, పసుపు పంటలను గిట్టుబాటు ధరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ 63వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. కార్లు, ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లపై తరలి వచ్చారు. ఎనిమిది గంటల పాటు రహదారి పైనే బైఠాయించారు. పలు మార్లు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నేడు మామిడిపల్లి నుంచి అసెంబ్లీకి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఆర్మూర్ / పెర్కిట్: ఎర్రజొన్నలు, పసుపు పంటను గిట్టుబాటు ధరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ ప్రాంత రైతులు మరోమారు 63వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. సోమవారం ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తాలో జాతీయ రహదారిపై బైఠాయించారు. వంటవార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేసారు. మరో వైపు రైతుల ఆందోళన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల్లో ఉన్న రైతు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఇతర మండలాల పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయినప్పటికీ రైతులంతా ఏకమై రహదారి దిగ్బంధాన్ని శాంతియుతంగా కొనసాగించారు. సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు ఉదయం నుంచే ఆర్మూర్ పట్టణంతో పాటు మామిడిపల్లి, పెర్కిట్, జాతీయ రహదారి కూడళ్లలో మోహరించాయి. ఉదయం 11 గంటల నుంచి రైతులు పెద్ద ఎత్తున మామిడిపల్లి చౌరస్తాలోని జాతీయ రహదారి వద్దకు చేరుకున్నారు. పోలీసులు విధించిన 144 సెక్షన్ను లెక్క చేయకుండా డివిజన్ పరిధిలోని 13 మండలాల్లోని గ్రామాల రైతులు కార్లు, ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లపై తరలి వచ్చారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మందికి పైగా జాతీయ రహదారి చౌరస్తాలో బైఠాయించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఎర్రజొన్నను క్వింటాలుకు రూ. 3,500లకు, పసుపునకు క్వింటాలుకు రూ. 15 వేలు చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు. తమ డిమాండ్లు సాధించుకునే వరకు దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. రాత్రి 7 గంటల వరకు రైతులు జాతీయ రహదారి పైనే బైఠాయించారు. మధ్యాహ్నం సమయంలో గ్రామాల వారీగా రైతులు వంట పాత్రలను తెచ్చుకొని పొయ్యి వెలిగించి రహదారిపైనే వంటవార్పు నిర్వహించారు. అనంతరం అక్కడే సహపంక్తి భోజనాలు చేసారు. పోలీసులు వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు. రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ ధర్నా, రాస్తారోకోలో రైతుల డిమాండ్లను తెలియజేస్తూ రైతు నాయకులు ఉపన్యసించారు. ఈ నెల 7, 12, 16 తేదీల్లో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 18న జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావుకు ప్రజావాణిలో విన్నవించినా, ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు అందజేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కరువైందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వం దిగి వచ్చే వరకు రహదారుల దిగ్భందాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. నేడు అసెంబ్లీకి పాదయాత్ర.. పలు మార్లు జాతీయ రహదారులను దిగ్బంధించినా, ధర్నాలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో రైతు నాయకులు చౌరస్తాలోనే సమావేశమై చర్చించారు. సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మంగళవారం మామిడిపల్లి నుంచి హైదరాబాద్లోని అసెంబ్లీకి పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. రైతు నాయకులు, రైతులు సైతం అధిక సంఖ్యలో పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అసెంబ్లీకి పాదయాత్ర చేయాలని నిర్ణయించిన అనంతరం రా>త్రి ఏడు గంటల సమయంలో మామిడిపల్లి చౌరస్తాలో దీక్షను విరమించారు. పోలీసుల భారీ బందోబస్తు.. 2008లో పోలీ స్ శాఖ వైఫల్యం కారణంగా ఎర్ర జొన్న రైతుల ఉద్యమం హింసాత్మకంగా మారి న పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందు కు సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో భారీ పోలీసు బలగాలతో బం దోబస్తు నిర్వహించారు. అడిషనల్ డీసీపీ శ్రీధర్రెడ్డి, ట్రెయినీ ఐపీఎస్ అధికారి గౌస్ ఆలం, ఆ ర్మూర్ ఏసీపీ రాములు, బో ధన్, నిజామాబాద్, ఐఎన్బీ, ట్రాఫిక్ ఏసీపీలు, 14 మంది సీఐలు తమ పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే ఎదుర్కోవడానికి పోలీసులు రహదారికి ఇరువైపులా మోహరించారు. ఆర్మూర్ ఏసీపీ రాములు రైతులతో మాట్లాడుతూ ప్రజలను ఇబ్బం ది పెట్టే ఇలాంటి కార్యక్రమాలను చేయవద్దని విజ్ఞప్తి చేసారు. అయినప్పటికీ రైతులు అంగీకరిం చకుండా రాత్రి వరకు రహదారిపై బైఠాయించారు. పోలీసులు ఉన్నతాధికారుల సూచన మేరకు సంయమనం పాటించారు. దీక్ష చేస్తున్న రైతులు సహనం కోల్పోయిన ప్రతిసారి పోలీసులు వారిని బుజ్జగిస్తూ శాంతియుతంగా దీక్ష చేయడానికి సహకరించారు. పోలీసులు లాఠీలను, ఆయుధాలను గాని తీసుకుని రాకుండా ఫ్రెండ్లీ పోలీస్లా వ్యవహరించడంపై ప్రశంసలను అందుకున్నారు. -
ధాన్యం ధర పతనం
♦ నెల రోజులతో పోలిస్తే రూ. 200 తగ్గుదల ♦ బీపీటీ రూ.1150 లేదా రూ. 1175 మధ్య కొనుగోలు ♦ సాధారణ రకం రూ. 1050 లేదా రూ. 1100 మాత్రమే.. ♦ వచ్చిందే దక్కుదలగా అమ్ముకుంటున్న రైతులు పిట్టలవానిపాలెం : మిల్లర్లు, దళారులు, వ్యాపారుల మాయాజాలంతో ధాన్యం ధర పడిపోతోంది. నెల రోజుల కిందటి ధరతో పోలిస్తే బస్తాకు రూ.200 త గ్గింది. దిగుబడులు వచ్చే సమయంలో ధరలు తగ్గడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అమ్మబోతే ధరలేక, నిల్వ చేస్తే అప్పుల భయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బాపట్ల నియోజకవర్గంలో 67 వేల ఎకరాలలో వరి సాగు చేశారు. బీపీటీ 5204, 1061, 2716 రకాలు సాగు చేశారు. నియోజకవర్గంలో ఇంకా 40 శాతం రైతులు ధాన్యాన్ని పురి, బస్తాల్లో నెట్లు వేసుకుని నిల్వ చేసుకుంటున్నారు. నెల రోజుల క్రితం వరకు బస్తా రూ.1300-రూ.1350 మధ్య వ్యాపారులు, దళారులు కొన్నారు. ప్రస్తుతం రూ.1150 లేదా రూ.1175కు మాత్రమే బీపీటీ రకాన్ని కొనుగోలు చేస్తున్నారు. సాధారణ రకం ధాన్యం గత ఏడాది రూ.1150 -రూ.1200 మధ్య కొనుగోలు చేశారు. ప్రస్తుతం రూ.1100 నుంచి రూ. 1050 మధ్య కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం ధర పడిపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతాయనే భయంతో రైతులు రూ.200 నష్టానికి అమ్ముకుంటున్నారు. దళారులు, వ్యాపారుల ఎత్తుగడ వల్లే ధరలు పతనం.. ధాన్యం ధరలు పడిపోవడానికి దళారులు, వ్యాపారులే ప్రధాన కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మినుము తీత పనులు పూర్తి కావడంతో వరినూర్పిడి పనులు ముమ్మరం చేశారు. ఇప్పటికే మిల్లర్లు, వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. ఒకేసారి ధాన్యం రావడంతో మిల్లర్లు, వ్యాపారులు కలిసి ధాన్యం ధర తగ్గించేశారు. సాగు కోసం అప్పులు చేసిన అధిక శాతం మంది రైతులు ధాన్యాన్ని నిల్వ ఉంచుకునే పరిస్థితి లేక పోవడంతో తెగనమ్ముకుంటున్నారు. కౌలు రైతుల పరిస్థితి దయనీయం... కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ధాన్యం ధర పడిపోవడంతో నూర్పిళ్లు చేసిన కౌలు రైతులు తప్పని సరి పరిస్థితుల్లో ధాన్యాన్ని అమ్మాల్సిన దుస్థితి నెలకొంది. ధర లేదని నిల్వ చేద్దామనుకుంటే భూ యజమానికి తప్పని సరిగా కౌలు చెల్లించాలి. కౌలు రైతుల్లో 80 శాతం మంది అప్పులు తెచ్చి సాగు చేసినవారే. ఈపరిణామాలు కౌలు రైతులను కలచివేస్తున్నాయి.