-
ఆర్బీకేలకు నాబార్డు చేయూత
సాక్షి, అమరావతి: ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు రెండు వేల సహకార సొసైటీల పరిధిలో గోదాములు, కోల్డ్ స్టోరేజ్లు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ తీసుకురావడం చాలా ముఖ్యమని, ఆ దిశగా ఆర్బీకే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ను తీసుకు రావడం శుభపరిణామం అని చెప్పారు. సహకార రుణ పరపతి పునర్ వ్యవస్థీకరణపై ఆప్కాబ్, డీసీసీబీ చైర్పర్సన్లతో విజయవాడలో బుధవారం జరిగిన సమీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహకార బ్యాంకుల బలోపేతానికి షేర్ క్యాపిటల్ కావాలంటే ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. ఎంత కావాలంటే అంత సర్దుబాటు చేసేందుకు నాబార్డు సిద్ధంగా ఉందన్నారు. సిబ్బందిలో నైపుణ్యాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర కో ఆపరేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సంస్థ ద్వారా నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా పదోన్నతులు కల్పిస్తే సహకార బ్యాంకులు ప్రొఫెషనల్గా తయారవుతాయని సూచించారు. పెసలు, మినుములు పండించే రైతుకు కిలో రూ.60 వస్తుంటే, ప్రాసెస్ చేసి మార్కెట్లో రూ.200కు పైగా అమ్ముతున్నారని చెప్పారు. ఆ వ్యత్యాసం రైతులకు చేరాలంటే వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి వాల్యూఎడిషన్ చేయడం అవసరమన్నారు. ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారం వాల్యూ చైన్ ఫైనాన్స్ దేశ వ్యాప్తంగా రూ.లక్ష కోట్లు జరుగుతుంటే, మనమిచ్చేది రూ.వెయ్యి కోట్లు మాత్రమేనన్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.58 వేల కోట్లు ఇవ్వగా, దాంట్లో రూ.22 వేల కోట్లు ఏపీ, తెలంగాణాలోనే ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ పథకం 100% రీ పేమెంట్ జరుగుతోందన్నారు. అదే రీతిలో కౌలు రైతులను జాయింట్ లయబులిటి గ్రూప్స్ (జేఎల్జీ)గా ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వొచ్చన్నారు. డీసీసీబీల వర్గీకరణపై అధ్యయనం గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రూ.1000 కోట్ల పావలా వడ్డీ బకాయిల్లో రూ.600 కోట్లు విడుదల చేసి, సహకార బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచిందని మంత్రి కన్నబాబు తెలిపారు. ఆప్కాబ్కు రూ.100 కోట్లు, డీసీసీబీలకు రూ.190 కోట్లు షేర్ క్యాపిటల్ రూపంలో ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించారన్నారు. 3–5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రతి ఉద్యోగిని బదిలీ చేసే విధంగా రూపొందించిన హెచ్ఆర్ పాలసీని త్వరలో అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఆర్బీకే–పీఏసీఎస్లను అనుసంధానించే విషయంలో అధ్యయనం చేసేందుకు టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామని చెప్పారు. కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో డీసీసీబీలను ఇప్పటికిప్పుడు వర్గీకరించాలా.. లేదా అనే అంశం పై అధ్యయనం జరుగుతోందన్నారు. వయబిలిటీ లేకుండా వర్గీకరిస్తే లేనిపోని ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. గ్రామాల్లో పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు త్వరలో ఓ పాలసీని తీసుకొస్తున్నామని తెలిపారు. మండలానికో బ్రాంచ్ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంన్నారు. ఈ సమావేశంలో సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై.మధుసూదనరెడ్డి, కో ఆపరేటివ్ రిజిస్ట్రార్ అహ్మద్ బాబు, ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో ‘క్రెడిట్ గ్యారంటీ స్కీం’
సాక్షి, హైదరాబాద్: నాబార్డ్ ఆధ్వర్యంలో రాబోయే 4, 5 నెలల్లో వ్యవ సాయరంగంలో ‘క్రెడిట్ గ్యారంటీ స్కీం’ను ప్రారం భించనున్నట్టు ఆ సంస్థ చైర్మన్ గోవిందరాజులు చింతల తెలిపారు. ఇప్పటి వరకు వ్యవసాయంలో ఇలాంటి స్కీం లేదని, తొలిసారి నాబార్డ్ ప్రవేశ పెట్టబోతోందని వెల్లడించారు. దీనిద్వారా 85% గ్యారంటీ ఇస్తా మని, దీంతో బ్యాంకులు అనుమానాలు లేకుండా సొసై టీలు, తదితరాలకు సులభంగా రుణాలిచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ‘వ్యవసాయ రంగ వ్యవస్థలోనే బృహత్తర మార్పులకు అవసర మైన చర్యలు చేపడుతున్నాం. రైతులకు రెండింతల ఆదాయం వచ్చేలా సాగు ఖర్చులు తగ్గే దిశగా చర్యల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. వ్యవసాయాన్ని మార్కెట్ కేంద్రీకృతంగా చేసేం దుకు గోడౌన్ల సంఖ్య గణనీయంగా పెంచి స్టోరేజీ నిల్వల సామర్థ్యం పెంపుదల వంటి చర్యలు తీసుకుంటాం’అని ఆయన చెప్పారు. నాబార్డ్ చైర్మన్గా నియమి తులయ్యాక తొలిసారిగా తెలంగాణ ప్రాంతీయ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా జీఆర్ చింతలకు అధికారులు, సిబ్బంది సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాబార్డ్ చేపడుతున్న కార్యక్రమాలు, తదితర అంశాలను వివరించారు. వ్యవసాయానికి కొత్త రూపు.. భారత్లో ‘కలెక్టివ్ ఫార్మింగ్’కు శ్రీకారం చుట్టి.. దీని ద్వారా దేశ వ్యవస్థలో వ్యవసాయానికి కొత్తరూపు నిస్తామని జీఆర్ చింతల చెప్పారు. నాబార్డ్ ఆధ్వర్యంలో క్రెడిట్ రేటింగ్ అండ్ స్కోరింగ్ మ్యాట్రిక్స్ను రూపొందించి, దీంట్లో 60 శాతం దాటిన వారికి బ్యాంకుల ద్వారా రుణాలు లభించేలా రేటింగ్ సిస్టమ్ను రూపొందిస్తామని తెలిపారు. ‘క్రెడిట్ గ్యారెంటీ విధానాన్ని బలోపేతం చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్రాధాన్యతనిచ్చి చిన్నాచితకా కలిపి మొత్తం 98 శాతంగా ఉన్న మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, చిన్నవ్యాపారులకు రుణాలు అందేలా మార్పులు చేపడతాం. కరోనా నేపథ్యంలో మార్చి 1 నుంచి జూలై 31 వరకు రూ.80 వేల కోట్ల వరకు రుణాలిచ్చాం. రూ.25 వేల కోట్లు స్పెషల్ ఈక్విటీ ఫండ్ కింద ఇచ్చాం. ఈ ఏడాది నాబార్డ్ బిజినెస్ రూ.5.32 లక్షల కోట్ల నుంచి రూ.ఆరున్నర లక్షల కోట్ల లక్ష్యాన్ని చేరుకోగలదు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ఇంతటి ఘనతను నాబార్డ్ సాధించింది. ఇందులో 40 నుంచి 42 శాతం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచే బిజినెస్ ఉంటోంది. వాటిలో రూ.44 వేల కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి’అని జీఆర్ చింతల వివరించారు. సహకార, గ్రామీణ బ్యాంక్ల బలోపేతం.. దేశంలోని కోటి 8 లక్షల గ్రూప్లను ఈ–శక్తి ప్లాట్ ఫాం మీదకు తెచ్చి, వారి క్రెడిట్ ఇంటెన్సిటీని 350 శాతం పెంచేందుకు నాబార్డ్ కొత్త కార్యక్రమాలను చేపడుతోందని జీఆర్ చింతల తెలిపారు. నాబార్డ్ బహుముఖ ప్రయత్నాల్లో భాగంగా సహకార, గ్రామీణ బ్యాంక్ల బలోపేతంతో పాటు సహకార రంగంలో పారదర్శకత పెంచేందుకు, రైతులు, కూలీలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ‘సంస్థాగతంగా ఆయా వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా గత 30 ఏళ్లలో జరగనిది కేవలం 90 రోజుల్లోనే సహకార సంఘాలకు 3 శాతం వడ్డీకే రుణాలిచ్చే విధంగా చర్యలు చేపట్టాం. ఆత్మనిర్భర్ భారత్ కింద రైతులు, మహిళల ఆదాయం పెంచడంతో పాటు ఆయిల్సీడ్ ప్రొడక్షన్ చేపట్టాలని ప్రధాని మోదీకి సూచించగా దాని ప్రాతిపదికన వర్కింగ్ గ్రూప్స్ మొదలయ్యాయి. దీని ద్వారా రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. గ్రామీణ బ్యాంక్ల కంప్యూటీకరణ, ఈ వ్యవస్థలో చివరి లింక్ అయిన ప్రైమరీ సొసైటీల వరకు కంప్యూటీకరణ పూర్తికి చర్యలు తీసుకుంటుంన్నాం. ఇందుకోసం సహకార అభివృద్ధి నిధి కింద ప్రతీ రాష్ట్రానికి రూ.5 కోట్లు ఇస్తున్నాం. తెలంగాణలో ఇప్పటికే ఇది పూర్తి అయినా ఆ మొత్తాన్ని ఇస్తున్నాం. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నాబార్డ్ రుణాలిచ్చింది. రెండో ప్రాజెక్టుకు మరో రుణం ఇవ్వబోతున్నాం’అని చెప్పారు. తెలంగాణలో రూ.900 కోట్లతో చెక్ డ్యామ్లను నిర్మిస్తున్నామని, రుణమాఫీ అనేది రాజకీయ నిర్ణయమని, ఈ మాఫీలకు సంబంధించిన డబ్బులు పూర్తిగా బ్యాంకులకు సకాలంలో చెల్లిస్తే సరిపోతుందని ఒక ప్రశ్నకు జీఆర్ చింతల జవాబిచ్చారు. -
‘కరోనా వచ్చాక.. 80 వేల కోట్ల రుణాలు ఇచ్చాం’
సాక్షి, హైదరాబాద్ : కరోనా వచ్చాక మార్చి 1 నుంచి జూలై వరకు 80 వేల కోట్ల రుణాలు మంజూరు చేశామని నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు అన్నారు. ఈ సంవత్సరం 5.30 లక్షల కోట్ల నుంచి 6.5 లక్షల కోట్ల బిజినెస్ టార్గెట్గా పనిచేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళ నాడులనుంచే 42 శాతం బిజినెస్ ఉంటుందన్నారు. ‘కోటి 8 లక్షల మైక్రో గ్రూప్లు ఉన్నాయి. మహిళలకు 2.5 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నాం. దేశంలో కోటి 8లక్షల గ్రూప్లను ఈ శక్తి ప్లాట్ ఫాం మీదకు తీసుకురావాలనుకుంటున్నాం. నాబార్డ్ ద్వారా కొత్త పథకాలు తీసుకురావాలనుకుంటున్నాం. ఆత్మనిర్భర్ భారత్ కింద రైతులు, మహిళ గ్రూప్లను బలోపేతం చేయాలనుకుంటున్నాం. ప్రాథమిక సహకార సంఘాలకు కేవలం 3శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నాం. కోఅపరేటివ్ సొసైటీలను అన్నింటినీ కంప్యూటరైజ్ చేయాలని నిర్ణయించాము. కోఅపరేటివ్, గ్రామీణ బ్యాంకులను బలోపేతం చేస్తున్నాం. రైతుల ఆదాయం పెంపొందించేందుకు నాబార్డు ప్రయత్నం చేస్తోంది. అగ్రికల్చర్లో క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ తీసుకురాబోతున్నాం. పుడ్ ప్రాసెసింగ్ కోసం స్వయం సహాయక గ్రూప్లకు 5శాతానికే లోన్లు ఇస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు డబ్బులు ఇచ్చాం.. రెండో ప్రాజెక్టుకు ఇవ్వబోతున్నాం. తెలంగాణలో 900 కోట్లతో చెక్ డ్యామ్లను నిర్మిస్తున్నాం. రుణమాఫీ అనేది పొలిటికల్ నిర్ణయం. మాఫీ డబ్బులు పూర్తిగా బ్యాంకులకు చెల్లించాలి’ అని గోవిందరాజులు తెలిపారు. -
నాబార్డ్ చైర్మన్గా డాక్టర్ చింతల బాధ్యతలు
సాక్షి, అమరావతి: జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) చైర్మన్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన డాక్టర్ చింతల గోవిందరాజులు బుధవారం బెంగళూరులో పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత చైర్మన్ డాక్టర్ హర్ష్ కుమార్ భన్వాలా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రతిష్టాత్మక ఈ పదవికి ఓ తెలుగు వ్యక్తి ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఆయనతో పాటు రాజమండ్రికే చెందిన డాక్టర్ పీవీఎస్ సూర్యకుమార్ కూడా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా సూర్య కుమార్తో పాటు మరో డీఎండీ కూడా పదవీ బాధ్యతలు స్వీకరించారు. చింతల, సూర్యకుమార్ బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థులు కావడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం అని బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థులు సంఘం కన్వీనర్ వలేటి గోపీచంద్ హర్షం వ్యక్తం చేశారు. పలు బ్యాంకుల ప్రతినిధులు కొత్త చైర్మన్కు అభినందనలు తెలిపారు. ఏజీ బీఎస్సీ వరకు ఏపీలోనే గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరు చెందిన చింతల గోవింద రాజులు పొన్నూరులో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. తర్వాత గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూలు, జేకేసీ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ బీఎస్సీ పూర్తి చేశాక ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్ఐ)లో పీజీ పూర్తి చేశారు. 1985లో క్యాంపస్ సెలక్షన్స్లో నాబార్డ్–బీ గ్రేడ్ ఆఫీసర్గా ఎంపికైన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. ఈ పదవికి సుమారు 30 మంది పోటీ పడగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ శర్మ నాయకత్వంలోని బ్యాంకుల బోర్డు బ్యూరో చింతలను ఎంపికచేసింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ సహా పలువురు బ్యూరో సభ్యులు చింతల పేరును ప్రతిపాదించారు. పీవీఎస్.. ఇంటర్ వరకు రాజమండ్రిలో డిప్యూడీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన పీవీఎస్ సూర్యకుమార్ రాజమండ్రిలో జన్మించారు. కామవరపుకోటలో పదో తరగతి వరకు చదివారు. రాజమండ్రిలో ఇంటర్, బాపట్ల వ్యవసాయ కాలేజీలో అగ్రి బీఎస్సీ చేసారు. 84–86 వరకు ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పీజీ చేశారు. 1986లో నాబార్డులో చేరారు. వీరి తల్లిదండ్రులు వెంకట పేరిశాస్త్రి, నాగమణి. నాబార్డ్ డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో బాపట్ల వ్యవసాయ కళాశాలకు, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి సుమారు మూడు వందల కోట్ల రూపాయల నాబార్డు నిధులు మంజూరు అయ్యేలా చేశారు. బాపట్ల వ్యవసాయ కళాశాల సిగలో మరో కలికితురాయి.... డాక్టర్ చింతల, సూర్యకుమార్ ఇద్దరూ ఈ కళాశాలలో చదివిన వారు కావడం, ఇద్దరూ పదోన్నతులు సాధించడంతో బాపట్ల వ్యవసాయ కళాశాల ఖ్యాతి మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కళాశాలలో చదివిన అనేక మంది పద్మశ్రీ అవార్డులు పొందారు. మరికొందరు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పొందారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఉన్న అజేయ కల్లాం కూడా ఈ కళాశాల విద్యార్ధే కావడం గమనార్హం. కళాశాల పూర్వ విద్యార్థులు ఎంబీఎన్ రావు ఇండియన్ బ్యాంకు, కెనరా బ్యాంక్ చైర్మన్గా పనిచేశారు. -
నాబార్డ్ చైర్మన్గా గోవిందరాజులు
సాక్షి, అమరావతి: జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) చైర్మన్గా గుంటూరు జిల్లా వాసి చింతల గోవింద రాజులు ఎన్నికయ్యారు. ఐఏఎస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సహా మొత్తం 31 మంది ఈ పదవికి పోటీ పడగా ప్రస్తుతం డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న గోవింద రాజులును బ్యాంకుల బోర్డ్ బ్యూరో (బీబీబీ) ఎంపిక చేసింది. గుంటూరు జిల్లా పొన్నూరుకు సమీపంలోని బ్రాహ్మణకోడూరు ఆయన స్వగ్రామం. గుంటూరు నగరంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూలు, జేకేసీ కాలేజీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ (అగ్రీ), ఎంఎస్సీ (అగ్రానమీ) చదివారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో సీడ్ టెక్నాలజీలో పీజీ పూర్తి చేశారు. 1985లో నాబార్డులో నేరుగా గ్రేడ్ బీ అధికారిగా క్యాంపస్ రిక్రూట్ అయ్యారు. 35 ఏళ్లుగా నాబార్డ్లో వివిధ హోదాలలో పని చేశారు. నాబార్డ్ చైర్మన్గా ఎంపికైన సందర్భంగా ఆయన సాక్షి ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇతోధికంగా పాటు పడతానన్నారు. త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తానని చెప్పారు. నాబార్డ్ అందించే పథకాలలో తెలుగు రాష్ట్రాలకు పెద్ద పీట వేసేలా ఏమేమి చేయవచ్చో అదంతా చేస్తానని, నిరుపేదలను అభివృద్ధి పథకాలలో భాగస్వాములను చేసేలా కార్యక్రమాలను రూపొందిస్తామని వివరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement