ఈఓ కార్యాలయ రికార్డులు స్వాధీనం
గోపాలపురం: గోపాలపురంలో వేంకటేశ్వర సీతారామ దేవస్థానం ఆలయ ఈఓగా పనిచేస్తున్న టీవీకే మోహన్రావు విధులకు గైర్హాజరయ్యారంటూ మంగళవారం దేవాదాయ అధికారులు అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ దుర్గాప్రసాద్ నేతృత్వంలో కార్యాలయ తాళాలు పగులకొట్టి బీరువాలో రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే ఇదంతా జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. డెప్యూటీ కమిషనర్ ఆదేశాలు లేకుండా కార్యాలయ తాళాలు పగులకొట్టి రికార్డులు స్వాధీనం చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై దేవాదాయ అధికారులను విలేకరులు ప్రశ్నించగా ఆర్డర్ కాపీ ఫ్యాక్స్లో వస్తుందని చెప్పారు. అయితే ఆర్డర్ రాకుండానే వీఆర్వో మాటేటి గోపాలరావుతో పంచానామా నిర్వహించారు. పంచానామాపై స్థానికులు అధికారులను నిలదీసినా ఎటువంటి సమాధానం లేదు. దీనిపై ఈఓ టీవీకే మోహనరావును ఫోన్లో వివరణ కోరగా కార్యాలయ తాళాలు పగులకొడుతున్నట్టు తనకెలాంటి సమాచారం ఇవ్వలేదని, ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. కోర్టు పరిధిలో ఉండగా తాళాలు పగులకొట్టడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్నారు. తాను విధుల్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. తాను మరలా కోర్టును ఆశ్రయిస్తానన్నారు. అసిస్టెంట్ కమిషనర్ కూడా తనను సంప్రదించలేదని విమర్శించారు.
రాజకీయ ఒత్తిళ్లతోనే..!
కొద్దిరోజుల క్రితం వెంకటేశ్వర సీతారామస్వామి ఆలయ పరిధిలోని భూముల, షాపులు వేలం నిర్వహించారు. వేలాన్ని కొందరు రాజకీయ నాయకులు నిలుపుదల చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు పాలకవర్గానికి ఎన్నిక నిర్వహించారు. పాలకవర్గాన్ని సబ్మిట్ చేసే సమయం పూర్తికావడంతో ఎన్నిక చెల్లదంటూ ఈఓ మోహన్రావు దేవాదాయ అధికారులకు తెలియజేశారు. దీంతో రాజకీయం రంగు పులుముకుంది. అప్పటినుంచి ఈఓ మోహన్రావుపై కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే కార్యాలయ తాళాలు పగులకొట్టించారనే విమర్శలు ఉన్నాయి. తొమ్మిది నెలలుగా ఈఓ, కార్యాలయ సిబ్బందికి జీతాలు మంజూరు చేయకపోవడంతో మోహన్రావు కోర్టును ఆశ్రయించారు. కనీసం కార్యాలయ ఇంటి యజమానికి కూడా సమాచారం ఇవ్వకుండా దేవాదాయ అధికారులు తాళాలు పగులకొట్టించడం వివాదాలకు తావిస్తోంది.