breaking news
Garam film
-
సాయికుమార్, ఆది వల్లే ఆ షాక్ నుంచి తేరుకున్నా!
‘ఆ నలుగురు’ సినిమా ఒక్కటి చాలు... రచయితగా మదన్ టాలెంట్ గురించి చెప్పడానికి. ‘పెళ్లైన కొత్తలో’ చిత్రంతో దర్శకునిగా కూడా భేష్ అనిపించుకున్నారాయన. ఆది, అదా శర్మ జంటగా ఆయన డెరైక్ట్ చేసిన ‘గరం’ ఈ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మదన్తో జరిపిన భేటీ... * మీ ఇమేజ్ దృష్ట్యా ‘గరం’ టైటిల్తో మీ నుంచి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు? (నవ్వుతూ) యాక్చువల్గా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్రీనివాస్ గవిరెడ్డి ఈ లైన్ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. గరం అంటే కోపానికి పర్యాయ పదం అనుకుంటారు. ఇందులో రొమాన్స్ ఉంది. ఆ ఫీల్ని కూడా గరం అనొచ్చు. ఫ్యామిలీ ఎమోషన్స్ను కూడా అలా అనొచ్చు. ఈ సినిమాలో ప్రేమ, రొమాన్స్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. * ఈ సినిమా మధ్యలో ఆగడం, ఆ తర్వాత సాయికుమార్ టేకప్ చేయడం.. ఈ ప్రాసెస్ గురించి చెబుతారా? 2014లో ఓ షెడ్యూల్ చేశాం. ఆ తర్వాత జరిగిన యాక్సిడెంట్ వల్ల సినిమా ఆగింది. ఒక మంచి కథతో తీస్తున్న సినిమా ఆగడం నచ్చక హీరో ఆది తన తండ్రి సాయికుమార్ని ఒప్పించి, ఈ చిత్రాన్ని నిర్మించేలా చేశాడు. సాయికుమార్ ప్రాజెక్ట్ని టేకప్ చేశాక కేక్ వాక్లా అయ్యింది. నిర్మాతలు సురేఖ, వసంతా శ్రీనివాస్ల సహకారం మర్చిపోలేనిది. ఏది అడిగినా కాదన కుండా సమకూర్చి, సినిమా బాగా రావడానికి కారణమయ్యారు. మళ్లీ నా కెరీర్లో సాయికుమార్ అంతటి బెస్ట్ ప్రొడ్యూసర్ దొరుకుతారో లేదో? * ఇంతకూ ఆ యాక్సిడెంట్ గురించి చెప్పలేదు? ‘గరం’ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి కారణం నా మిత్రుడు నాగిరెడ్డి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత, నా రైట్ హ్యాండ్లాంటివాడు. ఈ చిత్రానికి సంబంధించిన పనుల మీద వెళుతూ జరిగిన యాక్సిడెంట్లో చనిపోయాడు. నేను చాన్నాళ్లు ఆ షాక్లోనే ఉండిపోయాను. సాయికుమార్, ఆది, నా కుటుంబ సభ్యులు, మిత్రుల వల్లే ఆ షాక్ నుంచి బయటపడగలిగాను. ఆది నమ్మకమే స్ఫూర్తిగా... ఈ సినిమా కోసం ఇటలీలోని గోర్మిటి అనే ఎత్తై ప్రదేశంలో ఒక సీన్ తీశాం. ఎముకలు కొరికే చలి. ఒంటి మీద పల్చని షర్ట్, ఫ్యాంట్తో ఆది ఆ సీన్ చేయాలి. మేమంతా కింద ఉన్నాం. తను పైకి ఎక్కాడు. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ అక్కడే నిలబడ్డాడు. వాతావరణం అనుకూలించక ఆ రోజు షాట్ తీయలేదు. మర్నాడు మేం ఎక్కడ ఆ షాట్ వద్దంటామేమోనని ముందే కొండ ఎక్కేశాడు. అంత డెడికేషన్. ఈ చిత్రంపై ఆది పట్టుదల, నమ్మకం నాకు చాలా స్ఫూర్తిగా నిలిచాయి. కచ్చితంగా మా అందరికీ మంచి ఫలితం దక్కుతుందనే నమ్మకం ఉంది. * మంచి కంటెంట్తో సినిమాలు తీసే దర్శకుడు మీరు. మరి.. ఆదిలాంటి కమర్షియల్ హీరోకి కావాల్సిన ఎలిమెంట్స్ ఈ కథలో ఉన్నాయా? ‘పెళ్లైన కొత్త’లోని తీసుకుంటే.. వైవాహిక అనుబంధాన్ని కమర్షియల్గానే డీల్ చేశాను. బేసిక్గా నేను సోల్ లేకుండా సినిమా చేయడానికి ఇష్టపడను. ‘గరం’ ప్రేమ నేపథ్యంలో సాగే చిత్రం. వరాలు పాత్రను ఆది నరనరాన జీర్ణించు కుని చేశాడు. ఇప్పటివరకు చేసిన చిత్రాల ద్వారా ఆది బాగా డ్యాన్సులు, ఫైట్లు చేయగలడని ప్రూవ్ చేసుకున్నాడు. నటనాపరంగా కూడా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. ఈ సినిమా నటుడిగా తనకు ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. డైలాగ్ డెలివరీకి ప్రత్యేకంగా ప్రశంసలు లభిస్తాయి. ఆది హార్డ్ వర్క్, నమ్మకమే ఈ సినిమా. * సినిమా సినిమాకీ గ్యాప్ తీసుకుంటున్నారు.. కారణం ఏంటి? ఒకానొక దశలో సినిమా పరిశ్రమ నుంచి వెళ్లిపోదామనుకున్నాను. దానికో కారణం ‘ప్రవరాఖ్యుడు’ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడం. ఆ సినిమా విడుదలైన రెండో రోజుకే రాజకీయాలపరంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. అప్పటికి ఆంధ్రా సైడ్ మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత అక్కడా థియేటర్లు మూతపడ్డాయి. ఒక మంచి సినిమా అలా ఇగ్నోర్ అయిపోయినందుకు బాధపడ్డా. సినిమాలు ఎందుకులే? అనుకోవడానికి అదో కారణం. ఆ తర్వాత చేసిన రెండు వ్యాపారాలు వర్కవుట్ కాలేదు. దాంతో సినిమా పరిశ్రమే కరెక్ట్ అనిపించింది. * మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించలేదనే బాధ ఏదైనా ఉందా? మొదట్లో ఉండేది. ఆ తర్వాత అలా ఆశించడం సరికాదని తెలుసుకున్నా. గుర్తింపు రావడం అంటే ఏంటి? నలుగురూ అభినందించడమే కదా. ఇప్పుడు నేనో మంచి సినిమా చూశాననుకోండి.. ‘బాగుంది’ అనుకుంటాను తప్ప స్వయంగా ఫోన్ చేసి చెప్పను. అంటే.. ఆ సినిమా తీసినవాళ్లకు గుర్తింపు లేనట్లా? అలాగే నాకు స్వయంగా ఫోన్ చేయకపోయినా మనసులో అభినందించి ఉండొచ్చు. అసలెవరూ గుర్తించకపోతే అప్పుడు మన ఎఫర్ట్లో లోపం ఉన్నట్లు లెక్క. * మీ తదుపరి చిత్రాలు? ‘గరం’ మీద ఆధారపడి ఉంటుంది. ఆ సినిమాకి వచ్చే మార్కెట్ని బట్టి నాకు ఫోన్ కాల్స్ వస్తాయి (నవ్వుతూ). -
ఆల్ ది బెస్ట్
పరీక్షలు బాగా రాసినప్పుడు ఫలితం బాగుంటుందనే నమ్మకం కలుగుతుంది. ఆది ఆ నమ్మకంతోనే ఉన్నారు. అదా శర్మతో కలిసి మదన్ డెరైక్షన్లో ‘గరం’ అనే పరీక్ష రాశారు ఆది. ఈ చిత్రాన్ని పరీక్ష అని ఆది ఎందుకు అంటున్నారంటే కథ విపరీతంగా నచ్చి, తన తండ్రి సాయికుమార్ని ఒప్పించి, నిర్మించేలా చేశారు. వసంతా శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాస సాయి స్క్రీన్స్ పతాకంపై పి. సురేఖ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయికుమార్ మాట్లాడుతూ - ‘‘ఆది నటించిన 7వ చిత్రమిది. తన కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. అన్ని కమర్షియల్ హంగులూ ఉన్నాయి. తొలిసారి అమెరికా, కెనడాలో ఈ చిత్రం భారీగా విడుదలవుతోంది. 2016వ సంవత్సరం చాలా మంచి ఊపుతో మొదలైంది. కొత్త ఏడాదిలో విడుదలైన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. అన్ని సినిమాలూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే వాణ్ణి నేను’’ అన్నారు. ‘‘మంచి సినిమా చేశాం. విడుదల దగ్గర పడుతోంటే నెర్వస్గా, ఎగ్జయి టింగ్గా ఉంది. సినిమా సమస్యల్లో ఉన్నప్పుడు నాన్న నా భుజం తట్టి ప్రోత్సహించారు. చిత్రం చూసిన ప్రేక్షకులు డిజప్పాయింట్ కారు’’ అని ఆది పేర్కొన్నారు. సీనియర్ నరేష్ మాట్లాడుతూ - ‘‘పదహారు రకాల కూరలతో విందు భోజనం చేసినట్లుంటుందీ చిత్రం. ప్రతి ప్రేక్షకుడూ ఈ కథలో తనను తాను చూసుకుంటాడు. నేను చేసిన తండ్రి పాత్రకు మంచి పేరొస్తుంది. ఫ్యామిలీస్తో అందరూ చూసే మంచి సినిమా ఇది. సాయికుమార్ ‘బెస్ట్ ఫాదర్’. ఆది అందమైన హీరో. మంచి మనసున్న వాడు. కెరీర్వైజ్గా తనను మరో పదిమెట్లు ఎదిగేలా చేసే సినిమా ఇది. అతని కెరీర్ బెస్ట్ఫిల్మ్కు నా ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు. అదా శర్మ, సహ నిర్మాత బాబ్జీ పాల్గొన్నారు. సంగీతం: అగస్త్య, కెమెరా: సురేందర్ రెడ్డి. -
గరం మూవీ పోస్టర్స్
-
ఆది, ఆదా జోడీగా ‘గరమ్’!
‘‘పవన్కల్యాణ్ ఏడో సినిమా ‘ఖుషి’... మహేశ్బాబు ఏడో సినిమా ‘ఒక్కడు’... ఎన్టీఆర్ ఏడో సినిమా ‘సింహాద్రి’...ఈ మూడూ ఎంతటి ఘనవిజయాలను సొంతం చేసుకున్నాయో తెలిసిందే. అప్పట్నుంచీ ఏ హీరోకైనా ఏడో సినిమా హిట్ అనే సెంటిమెంట్ చిత్రపరిశ్రమలో బలంగా ఉంది. అందుకే మేము నిర్మిస్తున్న ‘గరమ్’ చిత్రం హిట్ కావడం ఖాయం. ఎందుకంటే ఇది హీరో ఆది ఏడో సినిమా’’ అంటున్నారు రాజ్కుమార్ యం. ఆయన నిర్మాతగా.. మదన్ దర్శకత్వంలో ఆది, ఆదా శర్మ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘గరమ్’. ఈ సినిమా హైదరాబాద్లో ఆరంభమైంది. ముహూర్తపు దృశ్యానికి పారిశ్రామికవేత్త టి. వెంకట్రావు కెమెరా స్విచాన్ చేయగా, చిత్రనిర్మాత రాజ్కుమార్ కుమార్తె రాజశ్రీ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ఆది మాట్లాడుతూ -‘‘మంచి కథ, చక్కని సంభాషణలు కుదిరిన చిత్రం ఇది. వాణిజ్య అంశాలు మెండుగా ఉన్నాయి’’ అని చెప్పారు. మదన్ మాట్లాడుతూ -‘‘నా సహాయ దర్శకుడు శ్రీనివాస్ ఈ కథ ఇచ్చారు. జీవన ప్రయాణంలో ఎన్ని అవాంతరాలొచ్చినా... అవన్నీ పక్కకు నెట్టేసి ముందుకు తీసుకెళ్లిపోయే తత్వం ఇందులో హీరోది. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి కుర్రాడు ఒకడుండాలి అనిపించేలా హీరో పాత్ర ఉంటుంది జీవితమనే వాహనం చివరిదాకా ప్రయాణించాలంటే ‘ప్రేమ’ అనే ఇంధనం అవసరమని తెలిపే కథాంశంతో ఈ చిత్రం రూపొందిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రంలో సంగీతానికి మంచి అవకాశం ఉందనీ, మ్యూజికల్ హిట్టయ్యే పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు అగస్త్య తెలిపారు. ఆదికి వంద శాతం నప్పే పాత్ర ఇదని రచయిత శ్రీనివాస్ గవిరెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: టి. సురేంద్రరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగిరెడ్డి బి., లైన్ ప్రొడ్యూసర్: హరికృష్ణ జి.