breaking news
fresher salaries
-
ఇక ఫ్రెషర్లకూ భారీ జీతాలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు అనుబంధ ఆధునిక సాంకేతికతలలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఫ్రెషర్లకు హెచ్సీఎల్ టెక్ (HCLTech) భారీ ఎంట్రీ లెవల్ జీతాలు ఆఫర్ చేస్తోంది. డేటా & ఏఐ, డిజిటల్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ స్కిల్స్ వంటి విభాగాల్లో నైపుణ్యం ఉన్న ఈ ఫ్రెషర్లను కంపెనీ అంతర్గతంగా ‘ఎలైట్ కేడర్’గా పిలుస్తోంది.జనవరి 12న జరిగిన డిసెంబర్ త్రైమాసిక ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్లో హెచ్సీఎల్ టెక్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామ్ సుందరరాజన్ మాట్లాడుతూ.. ‘రెండు త్రైమాసికాల క్రితమే ఎలైట్ ఇంజనీర్లపై మా దృష్టిని స్పష్టంగా వెల్లడించాం. రెగ్యులర్ ఫ్రెషర్ నియామకాలతో పోలిస్తే, ఎలైట్ కేడర్కు 3 నుంచి 4 రెట్లు ఎక్కువ జీతాలు అందిస్తున్నాం. ఇది సంవత్సరానికి రూ.18 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు ఉంటుంది’ అని తెలిపారు.ఎలైట్ కేడర్కు అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించాలంటే పోటీ జీతాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. 2025 జూలైలో సుందరరాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం ఫ్రెషర్ నియామకాలలో ఎలైట్ కేడర్ వాటా సుమారు 15–20 శాతం ఉంటుంది. కంపెనీ ఇకపై పరిమాణం కంటే నాణ్యత, ప్రత్యేక నైపుణ్యాలపై ఎక్కువగా దృష్టి పెట్టనుంది. హెచ్సీఎల్ టెక్ మాత్రమే కాదు.. ప్రత్యర్థి సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఇటీవల ఫ్రెషర్ల జీతాలను గణనీయంగా పెంచడం గమనార్హం.క్యూ3 ముగింపు నాటికి హెచ్సీఎల్ టెక్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,26,379లకు చేరింది. ఈ త్రైమాసికంలో కంపెనీ హెడ్కౌంట్ స్పల్పంగా 261 తగ్గింది. డిసెంబర్ త్రైమాసికంలో 2,852 మంది ఫ్రెషర్లను జోడించినప్పటికీ, అట్రిషన్, సెలెక్టివ్ రేషనలైజేషన్ కారణంగా మొత్తం వర్క్ఫోర్స్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు చేర్చుకున్న మొత్తం ఫ్రెషర్ల సంఖ్య 10,032 గా ఉంది.హెచ్సీఎల్ టెక్ క్యూ3 ఫలితాలునోయిడా కేంద్రంగా పనిచేస్తున్న హెచ్సీఎల్ టెక్ నికర లాభం డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో 11% తగ్గి రూ.4,076 కోట్లకు పరిమితమైంది. ఏకీకృత ఆదాయం 13.3% పెరిగి రూ.33,872 కోట్లు నమోదు చేసింది. -
ఫ్రెషర్ల జీతాలు పెరగకుండా ఐటీ సంస్థల కుమ్మక్కు
ఇన్ఫీ మాజీ సీఎఫ్వో మోహన్దాస్ పాయ్ హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కుప్పతెప్పలుగా అందుబాటులో ఉండటాన్ని దేశీయంగా పెద్ద ఐటీ కంపెనీలు అలుసుగా తీసుకుంటున్నాయని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో మోహన్దాస్ పాయ్ ఆరోపించారు. ఆయా సంస్థలు కుమ్మక్కై గత 7–8 ఏళ్లుగా ఫ్రెషర్స్ జీతాలు తక్కువ స్థాయిలోనే ఉంచుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘దేశీ ఐటీ పరిశ్రమలో సమస్య ఇదే. భారతీయ ఐటీ రంగం ఫ్రెషర్స్కి సరైన జీతాలు ఇవ్వడం లేదు. వారి జీతాలు పెరగనివ్వకుండా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడబలుక్కుని వ్యవహరిస్తున్నాయి‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా సర్వీస్ కంపెనీలు కుమ్మక్కు కావడం భారతీయ ఐటీ పరిశ్రమకు మంచిది కాదని పాయ్ పేర్కొన్నారు. మెరుగైన జీతభత్యాలు ఇవ్వకపోతే .. ప్రతిభగల ఫ్రెషర్స్ చేరేందుకు ముందుకు రారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఐటీ సేవల సంస్థల్లో చేరుతున్నవారిలో మెజారిటీ భాగం ద్వితీయ శ్రేణి కాలేజీల నుంచి వస్తున్నప్పటికీ .. నైపుణ్యాలున్న వారేనని పాయ్ చెప్పారు. అయితే, ప్రథమ శ్రేణి కాలేజీల నుంచి కూడా ఇంజనీర్లు రావాల్సిన అవసరం ఉందన్నారు. గణాంకాల ప్రకారం ఫ్రెషర్స్కి రెండు దశాబ్దాల క్రితం వార్షికంగా రూ.2.25 లక్షల ప్యాకేజీ ఉండగా.. ప్రస్తుతం కేవలం రూ. 3.5 లక్షలకు మాత్రమే పెరిగింది. ఈ నేపథ్యంలో పాయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


