లారీ ఢీకొని వృద్ధురాలు మృతి
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్లలోని నాలుగు రోడ్ల కూడలిలో లారీ ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె పట్టణంలో చాలా కాలం నుంచి దుకాణాలు, హోటళ్ల వద్ద భిక్షాటన చేస్తూ జీవించేది. ఈ క్రమంలో శనివారం ఉదయం రోడ్డుపై వెళ్తున్న ఆమెను ముద్దనూరు వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైంది. బాధితురాలిని స్థానికులు 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు 60 ఏళ్లు ఉండవచ్చని వారు పేర్కొన్నారు. మృతురాలి ఆచూకీ తెలియకపోవడంతో గుర్తు తెలియని మహిళ మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నారాయణయాదవ్ తెలిపారు.