breaking news
Filling stations
-
టెర్మినల్ నుంచి బంక్ దాకా ప్రతీ చుక్కకూ లెక్క!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనంలో ఇంధనం కావాల్సి వస్తే సమీపంలోని ఫిల్లింగ్ స్టేషన్కు వెళతాం. పెట్రోల్ లేదా డీజిల్ కావాల్సినంత కొట్టించి డబ్బులు కట్టి బయటకు వస్తాం. ఇందులో కొత్తేమి ఉంది అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం.. ఎక్కడో తయారైన ఇంధనం వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి మనదాకా వస్తోంది. ఈ ప్రయాణంలో నాణ్యత, పరిమాణంలో ఎటువంటి రాజీ లేకుండా కస్టమర్కు కల్తీ లేని ఇంధనం చేరేందుకు చమురు కంపెనీలు, డీలర్లు నిరంతరం తీసుకుంటున్న చర్యల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? రిఫైనరీ నుంచి టెర్మినల్.. అక్కడి నుంచి ఫిల్లింగ్ స్టేషన్ (Filling Station). ఇలా వినియోగదారుడి వాహనంలోకి ఇంధనం చేరే వరకు కంపెనీల నిఘా కళ్లు వెంటాడుతూనే ఉంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు. తేడా వస్తే రద్దు చేస్తారు.. చక్రం తిరిగితేనే వ్యవస్థ పరుగెడుతుంది. ఇంధన అమ్మకాలు పెరిగాయంటే ఆర్థిక వ్యవస్థ బాగున్నట్టు. అందుకే ఆయిల్ కంపెనీలు బాధ్యతగా వ్యవహరిస్తున్నాయి. సాంకేతికతను ఆసరాగా చేసుకుని దేశంలోని మారుమూలన ఉన్న పల్లెకూ నాణ్యమైన ఇంధనాన్ని చేర్చాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాయి. పరిమాణంలో తేడా రాకుండా న్యాయబద్ధంగా కస్టమర్ చెల్లించిన డబ్బులకు తగ్గట్టుగా ఇంధనం అందిస్తున్నాయి. పైగా ప్రభుత్వ నియంత్రణలోనే చమురు వ్యాపారాలు సాగుతుంటాయి. దీంతో రెవెన్యూ, పోలీసు, తూనికలు కొలతల శాఖకు చెందిన అధికారులు సైతం తనిఖీలు చేపడుతుంటారు. ఈ క్రమంలో ఏమాత్రం తప్పు జరిగినా ఆయిల్ కంపెనీలు కఠిన చర్యలకు దిగుతున్నాయి. ఫిల్లింగ్ స్టేషన్లో స్టాక్లో కొద్ది తేడా వచ్చినా భారీ జరిమానా లేదా డీలర్షిప్ రద్దుకు వెనుకాడడం లేదు. ఇంధనం రవాణా చేసే ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తే బ్లాక్ లిస్టులో పెడతాయి. దేశవ్యాప్తంగా ఉన్న 88 వేల బంకుల్లో ఎక్క డో ఒక దగ్గర జరిగిన తప్పును మొత్తం పరిశ్రమకు ఆపాదించకూడదన్నది కంపెనీలు, డీలర్ల వాదన. ఫిల్లింగ్ స్టేషన్లలో ఇవి తప్పనిసరి → మంచి నీరు → వాష్ రూమ్స్ → ఫిర్యాదుల పుస్తకం → ఫస్ట్ ఎయిడ్ → ఫ్రీ ఎయిర్ కోసం టైర్ ఇన్ఫ్లేటర్ → సీసీ కెమెరాలు → ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఇసుకటెర్మినల్ నుంచి బంక్ దాకా.. అయిల్ కంపెనీకి చెందిన టెర్మినల్స్ నుంచి వివిధ ప్రాంతాల్లోని బంకులకు ఇంధనం సరఫరా అవుతుంది. ఇంధనం కేటాయించగానే సంబంధిత ఫిల్లింగ్ స్టేషన్ (బంక్) యజమానికి ఆయిల్ టెర్మినల్ నుంచి సందేశం వెళుతుంది. అలాగే ట్యాంకర్ బయలుదేరగానే, బంక్కు చేరిన వెంటనే మెసేజ్ వస్తుంది. టెర్మినల్ నుంచి బంక్ వరకు ట్యాంకర్ ప్రయాణాన్ని జీపీఎస్ (GPS) ఆధారంగా ట్రాక్ చేస్తారు. ఇచ్చిన రూట్ మ్యాప్లోనే ట్యాంకర్ వెళ్లాలి. మరో రూట్లో వెళ్లినట్టయితే తదుపరి లోడ్కు అవకాశం లేకుండా ఆ వాహన ఏజెన్సీని బ్లాక్ చేస్తారు. నిర్ధేశించిన ప్రాంతంలోనే డ్రైవర్లు భోజనం చేయాల్సి ఉంటుంది. మార్గ మధ్యలో వాహనం ఆపినా కారణం చెప్పాల్సిందే. ఇక బంక్ వద్దకు ట్యాంకర్ చేరగానే నిర్ధేశించిన స్థలంలో కాకుండా మరెక్కడైనా పార్క్ చేసినా ఫిల్లింగ్ స్టేషన్పై చర్యలుంటాయి. బంక్ యజమాని ఓటీపీ ఇస్తేనే ట్యాంకర్ తెరుచుకుంటుంది. అన్లోడ్ అయ్యాక ట్యాంకర్లో నిల్ స్టాక్ అని కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఫిల్లింగ్ స్టేషన్లో ఇలా.. బంకులోని ట్యాంకులో ఎంత ఇంధనం మిగిలి ఉంది, లోడ్ ఎంత వచ్చింది, అమ్మకాలు.. అంతా పారదర్శకం. గణాంకాలు అన్నీ ఎప్పటికప్పుడు కంపెనీ, డీలర్ వద్ద ఆన్లైన్లో దర్శనమిస్తాయి. ట్యాంకర్ తీసుకొచ్చిన స్టాక్లో తేడా ఉంటే ఇన్వాయిస్పైన వివరాలు పొందుపరిచి కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఇలా ప్రతీ చుక్కకూ లెక్క ఉంటుంది. మీటర్ తిరిగిన దానికి తగ్గట్టుగా బంకు ట్యాంకులో ఖాళీ కావాలి. స్టాక్లో తేడా 2 శాతం మించకూడదు. మించితే జవాబు చెప్పాల్సిందే. అంతేకాదు రూ.3 లక్షల వరకు పెనాల్టీ భారం తప్పదు. తరచుగా కంపెనీకి చెందిన సేల్స్ ఆఫీసర్ తనిఖీ చేస్తుంటారు. థర్డ్ పార్టీ నుంచి, అలాగే ఇతర ఆయిల్ కంపెనీల నుంచి కూడా తరచూ తనిఖీలు ఉంటాయి. ఆ మూడు సంస్థలదే.. దేశంలో మొత్తం ఇంధన రిటైల్ పరిశ్రమలో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలైన బీపీసీఎల్, ఐవోసీఎల్, హెచ్పీసీఎల్ వాటా ఏకంగా 90% ఉంది. కంపెనీల వెబ్సైట్స్ ప్రకారం ఐవోసీఎల్కు 37,500లకుపైగా, బీపీసీఎల్కు 22,000ల పైచిలుకు, హెచ్పీసీఎల్కు 17,000 లకుపైగా ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రైవేటు సంస్థలు జియో–బీపీ, నయారా, షెల్ సైతం ఈ రంగంలో పోటీపడుతున్నాయి. చదవండి: రోడ్డుపై, నీటిపై నడిచే వెహికల్దేశవ్యాప్తంగా నిర్వహణ మాత్రమే బంకుల యజమానులది. మౌలిక వసతుల ఏర్పాటు, మెషినరీ, ఇంధనంపై సర్వ హక్కులూ పెట్రోలియం కంపెనీలదేనని వ్యాపారులు చెబుతున్నారు. నిర్వహణకుగాను ప్రతి నెల డీలర్కు వేతనం కింద కంపెనీలు రూ.27,500 చెల్లిస్తున్నాయి. డీలర్లకు లీటరు పెట్రోల్ అమ్మకంపై రూ.3.99, డీజిల్పై రూ.2.51 కమిషన్ ఉంటుంది.వేగానికీ పరిమితులు.. ట్యాంకర్ గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని మించకూడదు. ఒక్క వాహనం నిబంధనలు అతిక్రమించినా ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీనే రద్దు చేస్తారు. టెర్మినల్ నుంచి సుదూర ప్రాంతంలో ఫిల్లింగ్ స్టేషన్ ఉన్నట్టయితే.. డ్రైవర్లకు భోజనానికి 45 నిముషాలు, టీ తాగడానికి 15 నిముషాలు సమయం ఇస్తారు. నిర్ధేశిత సమయం మించితే కంపెనీ నుంచి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ యజమానికి మెయిల్, ఎస్ఎంఎస్ వెళుతుంది. ఆలస్యానికి కారణం తెలపాల్సిందే. రాత్రి 12 నుంచి ఉదయం 5 మధ్య రవాణా నిషేధం. వయబిలిటీ స్టడీలో లోపాలు.. మోసాలకు తావు లేకుండా కస్టమర్లకు నాణ్యమైన ఇంధనం అందుతోందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం ఇచ్చే ప్రకటనలో సంబంధిత ప్రాంతంలో ఇంత మొత్తంలో విక్రయాలు జరుగుతాయని కంపెనీ ఇచ్చే అంకెలకు, వాస్తవ అమ్మకాలకు భారీ వ్యత్యాసం ఉంటోంది. వయబిలిటీ స్టడీ సక్రమంగా జరగడం లేదు. ప్రకటన ఆధారంగా ముందుకొచ్చి బంక్ ఏర్పాటు చేసి నష్టాలు మూటగట్టుకుంటున్న యజమానులు ఎందరో. – మర్రి అమరేందర్ రెడ్డి, తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్. బంకు యజమానులే బాధ్యులా? డ్రైవర్లు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వర్షాకాలంలో ట్యాంకర్ లోపలికి నీరు చేరే అవకాశం ఉంది. ఇథనాల్ మిశ్రమంలో తేడాలున్నా సమస్యకు దారి తీస్తుంది. బంకుల్లోని ట్యాంకులు స్టీలుతో తయారయ్యాయి. తుప్పు పడితే ట్యాంకులో చెమ్మ చేరుతుంది. ఇదే జరిగితే ఆ నీరు కాస్తా బంకులోని ట్యాంకర్కు, అక్కడి నుంచి కస్టమర్ వాహనంలోకి వెళ్లడం ఖాయం. ఈ సమస్యకు పరిష్కారంగా హెచ్డీపీఈతో చేసిన ట్యాంకులను బంకుల్లో ఏర్పాటు చేయాల్సిందిగా విన్నవిస్తున్నా కంపెనీల నుంచి స్పందన లేదు. రవాణా ఏజెన్సీ తప్పిదం, మౌలిక వసతుల లోపం వల్ల సమస్య తలెత్తినా బంకు యజమానిని బాధ్యులను చేస్తున్నారు. – రాజీవ్ అమరం, జాయింట్ సెక్రటరీ, కన్సార్షియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్. -
షాకింగ్: క్యాన్లో పెట్రోల్ పోయించుకుంటూ ఉండగా ఒక్కసారిగా మంటలు
తుమకూరు (కర్ణాటక): తల్లీకూతురు పెట్రోల్ బంకులో క్యాన్లో పెట్రోల్ పోయించుకుంటూ ఉండగా మంటలు చెలరేగి గాయపడ్డారు. వారిలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలూకాలోని దొడ్డెరి దగ్గర బడవనహళ్ళి చెక్పోస్ట్ వద్ద పెట్రోల్ బంక్లో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్యాన్లో పెట్రోల్ నింపుతూ ఉండగా.. మహిళ రత్నమ్మ (46), ఆమె కుమార్తె భవ్య (18) తమ ఇంటి వద్ద చిల్లరగా పెట్రోల్ను అమ్ముతూ ఉంటారు. ఇందుకోసం ఎక్కువ మొత్తంలో పెట్రోల్ కొనడానికి క్యాన్ తీసుకుని మోపెడ్ మీద బుధవారం మధ్యాహ్నం పెట్రోల్ బంక్కి వచ్చారు. పెట్రోల్ పోస్తూ ఉండగా మోపెడ్ మీద కొంత ఒలికింది, ఎండ వేడిమికి వెంటనే మంటలు చెలరేగడంతో తల్లీకూతురు మంటల్లో చిక్కారు. బంకు సిబ్బంది మంటలను ఆర్పివేసి ఇద్దరినీ శిర ఆస్పత్రికి తరలించగా కూతురు భవ్య శుక్రవారం మృతి చెందింది. తల్లి రత్నమ్మను మెరుగైన చికిత్స కోసం బెంగళూరు విక్టోరియ ఆస్పత్రికి తరలించారు. బడవనహళ్ళి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలకు చిక్కడంతో ఆ వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. కాగా, పెట్రోల్ పోస్తూ ఉండగా మొబైల్ఫోన్ ఉపయోగించడం వల్ల మంటలు చెలరేగాయని మరో వాదన ఉంది. -
ట్యాంకర్ల కేటాయింపులో గోల్మాల్!
గిరాకీ ఉన్న ఫిల్లింగ్ కేంద్రాల కోసం పక్కదారులు... భారీగా ముడుపులు చెల్లిస్తున్న వైనం కొందరికే ‘గిరాకీ కేంద్రాల’ కేటాయింపు చోద్యం చూస్తున్న జలమండలి అధికారులు సిటీబ్యూరో: జలమండలి ట్యాంకర్లకు నీటి ఫిల్లింగ్ కేంద్రాల కేటాయింపు వ్యవహారంలో అవినీతి చోటుచేసుకుంటోంది. చేతులు తడిపిన వారికే గిరాకీ అధికంగా ఉన్న ఫిల్లింగ్ కేంద్రాలను కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహా నగరం పరిధిలో జలమండలికి ఉన్న 53 ఫిల్లింగ్ కేంద్రాల వద్ద సుమారు 900 ట్యాంకర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మంచినీటి కొరత ఉన్న కాలనీలు, బస్తీల్లో ఉన్న గృహ వినియోగదారులు, వాణిజ్య సముదాయాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఆయా ఫిల్లింగ్ కేంద్రాల వద్ద నీటిని సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన ట్యాంకర్ యజమానులకు కొందరు అధికారులు చుక్కలు చూపుతున్నారు. తమను ప్రసన్నం చేసుకున్నవారికే అధికంగా గిరాకీ(ట్యాంకర్ బుకింగ్లు)ఉన్న ఫిల్లింగ్ కేంద్రాలను కేటాయిస్తున్నట్లు పలువురు యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కూకట్పల్లి, మాదాపూర్, భరత్నగర్, మియాపూర్, ఎన్టీఆర్నగర్, వైశాలీనగర్ తదితర ఫిల్లింగ్కేంద్రాల వద్ద తిష్టవేసేందుకు కొందరు ట్యాంకర్ యజమానులు ట్యాంకరుకు రూ.25 వేల చొప్పున అధికారులకు ఆమ్యామ్యాలు ఇస్తూ ప్రసన్నం చేసుకుంటున్నారని తెలిసింది. దీంతో వారికే తొలిప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది.ఇటీవల ఆన్లైన్ ద్వారా ట్యాంకర్లకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఫిల్లింగ్ కేంద్రాల కేటాయింపుల్లో మాత్రం పారదర్శకంగా వ్యవహరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ అక్రమాల జాతర... అధిక గిరాకీ ఉన్న ఫిల్లింగ్ కేంద్రాల వద్ద తిష్టవేసేందుకు కొందరు ట్యాంకర్ యజమానులు ఉన్నతాధికారుల చేతులు తడుపుతున్నారు. డిమాండ్ అధికంగా ఉండే ఫిల్లింగ్ కేంద్రం వద్ద ఒక్కో ట్యాంకరుకు రోజుకు సగటున 8 నుంచి 10 ట్రిప్పుల గిరాకీ ఉంటుంది. మరోవైపు బహుళ అంతస్తుల భవంతులు, మాల్స్, ఆస్పత్రులు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, మెస్లు,సినిమా, ఫంక్షన్హాళ్లకు అదనంగా నీటిని సరఫరా చేసి అందినకాడికి దండుకునే వెసులుబాటు ఉంటుంది. అంతగా గిరాకీ లేని ఫిల్లింగ్ కేంద్రం వద్ద గరిష్టంగా ఐదు ట్రిప్పులు మాత్రమే దక్కుతాయి. దీంతో ట్యాంకర్ యజమానులు గిరాకీ అధికంగా ఉండే ఫిల్లింగ్ కేంద్రం వద్దే తిష్ట వేసేందుకు ముందుకొస్తారు. ఇదే అదనుగా సదరు యజమానుల నుంచి కొందరు అధికారులు లంచం తీసుకుని సదరు ఫిల్లింగ్ కేంద్రాన్ని కేటాయిస్తున్నట్లు తెలిసింది. ఇక అధికారుల కనుసన్నల్లో మెలిగే ట్యాంకర్ యజమానులు గృహవినియోగానికి సరఫరా చేసే ట్యాంకరు(ఐదువేల లీటర్ల సామర్థ్యం)ను వాణిజ్య అవసరాలకు తరలించి అదనంగా దండుకుంటున్నా అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం. సాధారణంగా గృహవినియోగానికి ఐదువేల లీటర్ల నీటిని తరలించే ట్యాంకర్కు రూ.400, వాణిజ్య అవసరాలకు సరఫరా చేస్తే ప్రతి ట్రిప్పుకు రూ.700 వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ గృహవినియోగ ట్యాంకర్ను వాణిజ్య అవసరాలకు తరలిస్తే ఒక్కో ట్రిప్పుపై రూ.500 వరకు యజమానికి గిట్టుబాటవుతుంది. ఇలా సగటున ఐదు ట్రిప్పులను పక్కదారి పట్టిస్తే నిత్యం ఒక్కో ట్యాంకరుకు రూ.2500 అదనంగా దండుకునే అవకాశం ఉంటుంది. మా దృష్టికి రాలేదు జలమండలి పరిధిలో ఉన్న ఫిల్లింగ్ కేంద్రాల వద్ద ఎన్ని ట్యాంకర్లు అవసరమో స్థానిక జనరల్ మేనేజర్లు నిర్ణయిస్తారు. కానీ ట్యాంకర్లకు ఫిల్లింగ్ కేంద్రాలను కేటాయించే ప్రక్రియ ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయం నుంచే జరుగుతుంది. గిరాకీ లేనందునే కొన్ని ఫిల్లింగ్ కేంద్రాల వద్ద అదనపు ట్యాంకర్లను అనుమతించడంలేదు. ఈవిషయంలో పారదర్శకంగానే వ్యవహరిస్తున్నాం. అక్రమాలు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. ట్యాంకర్ల సంఖ్య అధికంగా ఉండడంతో ప్రస్తుతానికి నూతనంగా ఎవరికీ అవకాశం ఇవ్వడంలేదు. ఆన్లైన్లో స్వీకరించిన పలు దరఖాస్తులు మావద్ద పెండింగ్లో ఉన్నాయి. - పీఎస్.సూర్యనారాయణ, జలమండలి రెవెన్యూ విభాగం డెరైక్టర్