breaking news
fax
-
అప్పుల బాధతోనే సుధాకర్ ఆత్మహత్య
నిర్ధారించిన తహశీల్దార్ గుంతకల్లు టౌన్ : ‘మండలంలోని వైటీ చెరువు గ్రామానికి చెందిన కె.సుధాకర్ వ్యవసాయంపైనే ఆధారపడి జీవించేవాడు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అతని పేరుపై పట్టాదారు పాసుపుస్తకం లేదు. రూ.2.50 లక్షల అప్పులు ఉన్నట్లు మా విచారణలో తేలింది. ఈ వివరాలను కలెక్టర్కు ఫ్యాక్స్ ద్వారా నివేదించాం. రైతు కుటుంబానికి జిల్లా అధికారులు న్యాయం చేస్తార’ని గుంతకల్లు తహశీల్దార్ వసంతబాబు తెలిపారు. ‘సాయం పొందే అర్హత ఈ తల్లికి లేదా?’ అన్న శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా రెవెన్యూ అధికారులు స్పందించారు. కలెక్టర్, డీఆర్ఓ ఆదేశాల మేరకు గురువారం ఉదయాన్నే మండల తహశీల్దార్ వసంతబాబు, వీఆర్ఓలు వైటీ చెరువు గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సుధాకర్ ఆత్మహత్యకు గల కారణాలను భార్య రామాంజినమ్మను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి కుటుంబం కావడంతో ఆస్తి పంపకాల్లో తన భర్త పేరిట ఒకటిన్నర ఎకరా పొలం వచ్చిందని, కానీ పట్టాదారు పాసుపుస్తకం చేయించుకోలేదని ఆమె వివరించింది. ఎనిమిది బోర్లు వేయించినా చుక్క నీరు పడలేదని, చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక, పంటలు చేతికి రాక మనస్తాపానికి గురై పొలంలోనే పురుగు మందు తాగి మృతి చెందాడని తెలిపింది. తనకు ముగ్గురు కూతుళ్లు రమాదేవి, అంజలి, రూపా ఉన్నారని.. ప్రభుత్వం ఆదుకోకపోతే వీరి పోషణ భారమవుతుందని కన్నీరుమున్నీరైంది. ధైర్యంగా ఉండి పిల్లల్ని బాగా చదివించాలని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తహశీల్దార్ భ రోసా ఇచ్చారు. కనీసం రేషన్ కార్డు కూడా లేని ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ ఎంపీటీసీ బాలాంజనేయులు తహశీల్దార్ను కోరారు. -
వెళ్తున్నా..వెళ్తున్నా..
చెమర్చిన కళ్లతో రాజీనామా లేఖపై సంతకం ఏకవాక్యంతో రాజీనామా లేఖ అధినేతకు ఫ్యాక్స్ అవమానాలు, తన ప్రత్యర్థులకు ప్రాధాన్యమే కారణం టీఆర్ఎస్లో చేరడం లాంఛనప్రాయమే ఆయనతో పాటే అగ్రనేతలు, అనుచరులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా.. 32 ఏళ్ల అనుబంధానికి చరమగీతం మారనున్న జిల్లా రాజకీయ ముఖచిత్రం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం...మొదటి ఎన్నికల్లోనే ఓటమి..ఆ తర్వాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం...వెంటనే మంత్రిపదవి...మరో రెండు సార్లూ అమాత్యయోగం..మళ్లీ ఓటమి..ఆ తర్వాత విజయం..ఆపై ఓటమి...పార్టీ, తాను అధికారంలో ఉన్నప్పుడు ఆయనదే జిల్లాలో ఏకఛత్రాధిపత్యం...ఎన్నో ఉత్థానపతనాలు...అయినా మూడు దశాబ్దాలుగా ఒకటే పార్టీ... పార్టీ ఆవిర్భావం నుంచి వైదొలగేంతవరకు క్రియాశీలకమే..ఓటమి ఎదురైనా ప్రజల్లోనే జీవితం...ఇదంతా తుమ్మల నాగేశ్వరరావు 32 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం...జిల్లా రాజకీయ క్షేత్రంలో చెరిగిపోని ముద్ర వేసుకున్న ఆయన దశాబ్దాల పాటు పార్టీని ఒంటి చేత్తో నడిపించారు...టీడీపీ అంటే తుమ్మల... తుమ్మల అంటే టీడీపీ అనేస్థాయిలో వెలుగొందారు...కానీ, తాను నమ్ముకున్న పార్టీలోనే తనకు అవమానాలు...తన మాటకు విలువ లేకుండా పోయిన వైనం..ప్రత్యర్థికి పెద్దపీట వేయడం...పార్టీ అధినాయకుడి చిన్నచూపు...అన్నీ కలగలిపితే జిల్లా రాజకీయ చరిత్రలో అనూహ్య అంకానికి తెరలేచింది. ఎప్పుడూ ఎవరూ ఊహించని విధంగా తుమ్మల నాగేశ్వరరావు టీడీపీని విడిచిపెట్టేశారు. పార్టీతో తనకున్న మూడు దశాబ్దాల అనుబంధాన్ని చెమర్చిన కళ్లతో రాజీనామా లేఖపై చేసిన సంతకంతో తెంచేసుకున్నారు. ఉత్కంఠకు తెర పడింది..జిల్లాలో కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం వాస్తవరూపం దాల్చింది. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఆయన పార్టీని వీడివెళుతున్నారన్న ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఎక్కడా మాట్లాడని తుమ్మల శనివారం తన రాజీనామా లేఖనే అస్త్రంగా ప్రయోగించారు. ‘నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను..దయచేసి ఆమోదించగలరు.’ అని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాసిన ఏకవాక్య రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపి పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. వచ్చే నెల ఐదో తేదీన తెలంగాణ భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో తుమ్మల గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆయనకు త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ స్థానం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే, జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉద్వేగానికి గురైన తుమ్మల రాజీనామా సందర్భంగా తుమ్మల భావోద్వేగానికి గురయ్యారు. రాజీనామా లేఖపై ఆయన సంతకం పెడుతున్న సందర్భంలో కళ్లు చెమర్చాయి. దుఃఖాన్ని ఆపుకుంటూ ఆయన సంతకం చేశారు. మూడు దశాబ్దాల అనుబంధం ఉన్న పార్టీని వీడివెళ్లిపోతున్న సమయంలో ఆయన గుంభనంగా కనిపించారు. ఉద్వేగం ఆయన ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. రాజీనామా అనంతరం తన స్వగ్రామం దమ్మపేట మండలం గండుగులపల్లికి పయనమయ్యారు. తన రాజీనామా లేఖపై మాజీ శాసనసభ్యులు అని మాత్రమే రాశారు. మంత్రిగా పనిచేసినప్పటికీ మాజీ ఎమ్మెల్యే హోదాలో రాజీనామా చేయడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. అయితే, తనకు తొలుత ఎన్టీఆరే మంత్రిపదవి ఇచ్చినా తనకు మంత్రిగా గుర్తింపు వచ్చింది చంద్రబాబు కేబినెట్లోనేనని, బాబు ఇచ్చిన మంత్రి పదవి పెట్టుకున్న దానికన్నా ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే హోదాలోనే రాజీనామా చేయాలని తుమ్మల భావించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తుమ్మలతోనే తమ్ముళ్లు తుమ్మలకు ఆది నుంచి అండగా ఉన్న పార్టీ జిల్లా అగ్రనేతలంతా ఆయనతో నడవాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలో తుమ్మల వర్గం నాయకులుగా గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తొలుత తుమ్మలతోనే ఉండి ఆ తర్వాత నామా శిబిరానికి వెళ్లిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరావు, ఇటీవలే జడ్పీ చైర్పర్సన్గా గెలిచిన గడిపల్లి కవిత, అవసరమైతే పదవిని వదిలేస్తాను కానీ పార్టీని వీడనని చెప్పిన డీసీసీబీ అధ్యక్షుడు మువ్వా విజయ్బాబు, డీసీఎంఎస్ చైర్మన్ ఎగ్గిడి అంజయ్య, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావులు తుమ్మలతోనే ఉన్నారు. వీరంతా ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. తుమ్మల వర్గంలో ముఖ్య నాయకుడిగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాత్రం ఆయనతో కలిసిరావడం లేదు. కార్యకర్తలతో సమావేశాలు కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని చెప్పిన తుమ్మల తన వర్గానికి చెందిన నాయకులతో సమావేశం ఏర్పాటు చేయిస్తున్నారు. ముందుగా సత్తుపల్లిలోని లక్ష్మీప్రసన్న ఫంక్షన్హాల్లో ఆదివారం మధ్యాహ్నం ఐదు నియోజకవర్గాల సమావేశం నిర్వహిస్తున్నారు. అశ్వారావుపేట, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, పినపాకలకు చెందిన నేతలు, కార్యకర్తలు హాజరయ్యే ఈ సమావేశంలో తాను పార్టీని వీడేందుకు గల కారణాలను తెలపడంతోపాటు టీఆర్ఎస్లో చేరాల్సిన ఆవశ్యకతను ఆయన వివరిస్తారు. టీఆర్ఎస్లో చేరే అంశంపై అందరి అభిప్రాయాలను కూడా తీసుకుంటారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. కాగా, మరో ఐదు నియోజకవర్గాల సమావేశాన్ని త్వరలోనే ఖమ్మంలో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సమావేశాల అనంతరం ఐదో తేదీన టీఆర్ఎస్లో చేరేందుకు భారీ ఏర్పాట్లు చేయాలని తుమ్మల శిబిరం భావిస్తోంది. టీడీపీకి కోలుకోలేని దెబ్బ తుమ్మల నిష్ర్కమణ జిల్లా తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బ తీయనుందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఆయనకు బలమైన అనుచర గణం ఉంది. వారంతా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. తుమ్మలతో పాటు జిల్లా కేంద్రం ఖమ్మం నుంచి తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు బీరెడ్డి నాగచంద్రారెడ్డి, రైతు అధ్యక్షుడు మందడపు సుధాకర్, తెలుగు విద్యార్థి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతనిప్పు కృష్ణచైతన్య, సీనియర్ నేతలు మదార్సాహెబ్, కాసర్ల వీరభ ద్రం, గాజుల ఉమామహేశ్వరరావు, అజ్మీరా వీరూనాయక్, మాలోతు శాంతి, మద్దినేని వెంకటరమణ, కొత్తగూడెం నుంచి జిల్లా పరిషత్ వైస్చైర్మన్ బరపాటి వాసు, బిక్కసాని నాగేశ్వరరావు, ఇల్లెందు నుంచి బోడేపూడి రమేశ్బాబు, కనగాల పేరయ్య, గౌరిశెట్టి సత్యనారాయణ, నలమాస రాజన్న, వైరా నియోజకవర్గం నుంచి ఆకుల ప్రసాద్, కృష్ణార్జునరావు, వీరేందర్, దావ్లానాయక్, మాధవి, చిట్టిబాబు, పోట్ల శ్రీను, పినపాక నుంచి కోలేటి భవానీ శంకర్, ఎండీ.అతహర్, పాలేరు నియోజకవర్గం నుంచి మద్ది మల్లారెడ్డి, ధరావత్ రామ్మూర్తి, వీరవెళ్లి నాగేశ్వరరావు, రామచంద్రునాయక్, వెన్నపూసల సీతారాములు, ఆలదాసు ఆంజనేయులు, మధిర నియోజకవర్గం నుంచి పార్టీ నేతలు పంబి సాంబశివరావు, పొనుగోటి రత్నాకర్, సామినేని రమేశ్, చావా రామకృష్ణ, చీదిరాల వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట నుంచి బండి పుల్లారావు, పైడి వెంకటేశ్వరరావు, ఆలపాటి రామచంద్రప్రసాద్, పానుగంటి సత్యం, బోయినపల్లి సుధాకర్, భద్రాచలం నుంచి యశోద రాంబాబు, తోటకూర రవిశంకర్, సత్తుపల్లి నుంచి గాదె సత్యం, చల్లగుళ్ల నర్సింహారావు, తాళ్లూరి ప్రసాద్, బండి గుర్నాథరెడ్డి, పల్లా నర్సారెడ్డి, అత్తునూరి రంగారెడ్డి, చీకటి రామారావు తదితరులు పార్టీని వీడి వెళ్లిపోతారనే చర్చ జరుగుతోంది. వీరితో పాటు పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ మండల, గ్రామ స్థాయి నాయకులు కూడా తుమ్మల బాటలోనే పయనిస్తామని చెపుతున్నారు. తుమ్మల ప్రస్థానం ఇదీ.... జిల్లా రాజకీయాల్లో తుమ్మలది విశిష్ట స్థానమనే చెప్పాలి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీని ఒంటిచేత్తో మూడు దశాబ్దాల పాటు ఆయన నడిపించారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. తన అనుచరులను ఎందరినో నాయకులుగా తీర్చిదిద్దారు. 1982 సెప్టెంబర్లో చర్ల మండలం ఏటుపాక గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది సత్తుపల్లి నియోజకవర్గం. పూర్వ సత్తుపల్లి నియోజకవర్గంలోని దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామానికి చెందిన ఆయన తన రాజకీయాలను అక్కడి నుంచే ప్రారంభించారు. తెలుగుదేశం స్థాపించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఓటమి చవిచూశారు. మళ్లీ ఏడాదిన్నరకే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పుడే ఆయనకు ఎన్టీఆర్ కే బినెట్ ర్యాంకు ఇచ్చారు. చిన్నతరహా నీటిపారుదల శాఖామంత్రిగా ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తర్వాత 1994, 1999 ఎన్నికల్లో గెలిచిన తుమ్మల చంద్రబాబు కేబినెట్లో కీలకమైన ఎక్సైజ్, భారీనీటిపారుదల, ఆర్అండ్బీ శాఖలు నిర్వహించారు. మంత్రిగా ఉన్న కాలంలో జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్న పేరు సంపాదించుకున్నారు. 2004 ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. మళ్లీ తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా ఖమ్మం నుంచే పోటీచేసి ఓడిపోయారు. -
టీడీపీ అధినేతకు ఫ్యాక్స్లు
చోడవరం : రుణ మాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మీ నమేషాలు లెక్కిస్తుండడంతో ఆందోళన చెం దుతున్న రైతులు, సహకార సంఘాలు పార్టీ అధినేతకు ఫ్యాక్స్ సందేశాలు పంపుతున్నారు. జిల్లాలో రూ. వెయ్యి కోట్ల రుణాలున్నట్లు అంచనా. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోనే రూ.300 కోట్ల అప్పు రైతుల నెత్తిపై ఉంది. రుణ మాఫీ ప్రకటనతో సక్రమంగా బకాయిలు చెల్లించే రైతులు కూడా మాఫీ జరుగుతుందన్న ఆశతో చెల్లింపులు నిలిపివేశారు. ఈ పరిస్థితుల్లో రుణ మాఫీపై ప్రభుత్వం ఎటువంటి మెలిక పెట్టినా బ్యాంకులు మునిగిపోక తప్పదు. జాతీయ బ్యాంకుల మాటెలాఉన్నా సహకార బ్యాంకు, సంఘాల పుట్టి మునగడం ఖాయం. ప్రమాణ స్వీకారం సందర్భంగా తొలి సంతకం మాఫీపైనే అని టీడీపీ అధినేత చెబుతున్నా అందులో ఏం మెలిక పెడతారో అన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. మరోవైపు ఖరీఫ్ ముంచుకు వస్తుండడంతో కొత్త రుణా ల పరిస్థితి ఏమిటన్న సందిగ్దం కనిపిస్తోంది. 2014 మార్చి నెలాఖరు వరకు ఇచ్చిన వ్యవసాయ సాధారణ, బంగారు రుణాలన్నీ మాఫీ చేస్తే పర్వాలేదుగాని, ఆంక్షలు విధిస్తే 70 శాతంపైగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఈ భయంతోనే సంపూర్ణ రుణ మాఫీ కోరుతూ రైతులు చంద్రబాబునాయుడుకు వినతులు పంపుతున్నారు. సంఘా ల అత్యవసర సమావేశాలు నిర్వహించి వ్యవసాయ రుణాలన్నింటినీ ఎటువంటి ఆంక్షలు లేకుండా పూర్తిగా మాఫీ చేయాలని కోరుతూ తీర్మానం చేసి వాటిని అధినేతకు ఫ్యాక్స్ చేస్తున్నాయి. ఆదర్శ సొసైటీగా పేరొందిన జుత్తా డ సభ్యులంతా ఇప్పటికే ఇటువంటి తీర్మానాన్ని బాబుకు ఫ్యాక్స్ చేశారు. ఇదే బాటలో కెజెపురం, మాడుగుల, విజయరామరాజు పేట, గోవాడ, రావికమతం, కొత్తకోట, బుచ్చెయ్యపేట, చీడికాడ, కె.కోటపాడుతోపాటు అన్ని ప్రాథమిక సహకార సంఘాల రైతులు నడిచేందుకు సిద్ధమవుతున్నారు. జుత్తాడ పీఏసీఎస్ అధ్యక్షుడు డి.సన్యాసినాయుడు మాట్లాడుతూ వాయిదా మీరిన రుణాలన్నింటినీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని కోరుతూ కొత్త ప్రభుత్వానికి ఫ్యాక్స్ పంపినట్లు చెప్పారు. -
ఎమ్మెల్యే పదవికి యడ్యూరప్ప రాజీనామా
సాక్షి, బెంగళూరు : మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గత శాసన సభ ఎన్నికల్లో యడ్యూరప్ప శికారిపుర నియోజక వర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో తిరిగి మాతృ పార్టీ బీజేపీలో చేరి శివమొగ్గ పార్లమెంటు స్థానం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా మూడు రోజుల క్రితం స్పీకర్ కాగోడు తిమ్మప్పకు పంపారు. ఈ విషయంపై స్పీకర్ కాగోడు తిమ్మప్ప బెంగళూరులో మీడియాతో ఆదివారం మాట్లాడుతూ...యడ్యూరప్ప శాసనసభ స్థానానికి రాజీనామా చేశారని దీనిని ఆమోదించాల్సి ఉందన్నారు.