breaking news
Europa League
-
‘జ్యూస్’ అన్వేషణకు అంకురార్పణ
ఈ విశాల విశ్వంలో మనం ఒంటరివాళ్లమా లేక మనలాగే మనుగడసాగించే బుద్ధిజీవులు వేరే గ్రహాలపై కూడా ఉన్నారా అన్న విచికిత్స ఈనాటిది కాదు. ఆ ప్రయత్నంలో గురువారం మరో అడుగు ముందుకుపడబోతోంది. యూరొపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ) నేతృత్వంలో రూపొందిన ‘జ్యూస్’ (జూపిటర్ అయిసీ మూన్స్ ఎక్స్ప్లోరర్) అంతరిక్ష నౌక దక్షిణ అమెరికాలోని కౌరు దీవి నుంచి ఎనిమిదేళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని ప్రారంభించబోతోంది. 2031లో అక్కడికి చేరుకున్నాక గురు గ్రహానికున్న లెక్కకు మిక్కిలి చందమామల్లో మూడింటిని ఎంచుకుని వాటిల్లో జీవుల ఉనికి సంగతిని తేల్చడం ఈ అంతరిక్ష నౌక లక్ష్యం. అంగారక గ్రహం ఆవల జీవం ఉండటానికి ఏమాత్రం అవకాశం లేదని ఒకప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారణకొచ్చారు. కానీ అంతటితో ఆగిపోతే మానవ జిజ్ఞాసకు అర్థం లేదు. ‘వేరెక్కడో ఒక మహాద్భుతం తనను తాను వ్యక్తపరుచుకోవటానికి వేచిచూస్తూ వుండొచ్చ’ని ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సెగాన్ ఒక సందర్భంలో అన్నారు. ఒక్క ఖగోళ శాస్త్రం అనేమిటి...సమస్త రంగాల్లోనూ మానవాళి సాధిస్తున్న విజయపరంపరకు ఈ భావనే మూలం. 1990లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా గురుగ్రహంపైకి ప్రయోగించిన గెలీలియో ఉపగ్రహం, ఈమధ్యకాలంలో శనిగ్రహానికి పోయిన కేసినీ ఉపగ్రహం శాస్త్రవేత్తల అంచనాలను తలకిందులు చేశాయి. గురుడు, శుక్రుడు, బుధుడు వంటి ఇతరేతర గ్రహాలపై జీవం ఉండక పోవచ్చుగానీ, గురుడు, అంగారకుడు మధ్య కనబడుతున్న చందమామలపై ఏదోమేర, ఏదో రూపంలో జీవం ఉండటానికి అవకాశం ఉన్నదని అవి పంపిన డేటా ఆధారంగా నిర్ధారణ కొచ్చారు. ఆ తర్వాతే ఈ మూడు చందమామలనూ అన్వేషించాలన్న నిర్ణయానికొచ్చారు. గ్రహాలన్నిటిలోనూ గురుగ్రహం చాలా పెద్దది. సంక్లిష్టమైనది కూడా. ఎందుకంటే దీనికి ఒకటీ రెండూ కాదు...ఏకంగా 92 చందమామలున్నాయి. వీటిలో కొన్ని వ్యతిరేక కక్ష్యలో కూడా తిరుగు తుంటాయి. అలాంటి చందమామల్లో పెద్దగా ఉండే యూరోపా, క్యాలిస్టో, గానిమీడ్ అనే మూడింటిని ఎంచుకుని వాటిచుట్టూ జ్యూస్ 35 ప్రదక్షిణలు చేస్తుంది. ఆ తర్వాత 2034లో గానిమీడ్ చుట్టూ నిర్దేశిత కక్ష్యలో కుదురుకుంటుంది. ఈ మూడు చందమామలూ మంచుతో నిండివున్నాయి. ఆ పొరల వెనక మహా సముద్రాలు నిక్షిప్తమైవున్నాయని శాస్త్రవేత్తల అంచనా. అదే నిజమైతే ఏదో రూపంలో అక్కడ జీవం ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా గానిమీడ్పై లవణసముద్రం ఉన్నదని గుర్తించారు. నిజానికి సూర్యకాంతి పడే అవకాశం లేదు గనుక ఈ మూడు చందమామల్లో జీవం ఉనికికి అవకాశం లేదు. కానీ గురుగ్రహానికుండే గురుత్వాకర్షణ ఆ లోటు తీరుస్తోంది. ఈ చందమామల్లోని సముద్రాలు వేడెక్కడానికి దోహదపడుతోంది. గురుగ్రహానికి మన దగ్గర బృహస్పతి అనే నామాంతరం ఉంది. పురాణాల్లో బృహస్పతి దేవగురువు. యాదృచ్ఛికమే కావొచ్చు గానీ... బృహస్పతికి ప్రీతిపాత్రమైన గురువారం రోజునే గురుగ్రహానికి జ్యూస్ ప్రయాణం కడుతోంది. నిజానికి ఇంతవరకూ గురుగ్రహం గురించి మానవాళికి తెలిసింది గోరంతే. దాన్ని దట్టంగా చుట్టుముట్టివుండే వాయుమేఘాలే అందుకు కారణం. అందులో అత్యధికం, అంటే...90 శాతం హైడ్రోజన్ అయితే, మిగిలిన పదిశాతంలో హీలియం, మీథేన్, గంథకం, అమోనియా వంటివి ఉన్నాయి. అయితే ఈ మూలకాల్లో ఎన్ని వాయురూపంలో ఉన్నాయో, మరెన్ని ఘనరూపం దాల్చాయో శాస్త్రవేత్తలు ఇంకా తేల్చలేదు. అసలు గురుగ్రహం నెన్నొసట సిందూరంలా ఎర్రగా మెరిసే బింబం ఒకటుంటుంది. దాని పరిమాణమే మన భూమి కన్నా మూడింతలు కాగా, అది కుదురుగా ఒకచోట ఉండక తిరుగా డుతుంటుంది. గురుగ్రహంపై నిత్యం రేగే పెను అలజడే ఇలా కనబడుతోందని శాస్త్రవేత్తలంటారు. మనం భూమ్మీద క్షేమంగా ఉండగలుగుతున్నామంటే అది గురుగ్రహం చలవే. ఎందుకంటే భూమివైపు దూసుకొచ్చే గ్రహశకలాల్లో, ఉల్కల్లో చాలాభాగాన్ని గురుగ్రహం తనవైపు ఆకర్షించుకుని వాటివల్ల కలిగే కష్టనష్టాలను తానే భరిస్తుంటుంది. నిజానికి గురుగ్రహం చుట్టూ తిరుగాడుతున్న చందమామల్లో అనేకం అటువంటి గ్రహశకలాలే. ఇందులో ఒకటైన గానిమీడ్కు అయస్కాంత క్షేత్రం ఉన్నా, అది బుధుడి కన్నా చాలా పెద్దదైనా గురుడి ప్రభావానికి లోనై చందమామగానే మిగిలి పోయింది. గురుగ్రహం ఆనుపానులు రాబట్టేందుకు ఇంతవరకూ 4 అంతరిక్షనౌకలు వెళ్లాయి. 1972 మార్చిలో ప్రయోగించిన పయొనీర్–10 గురుగ్రహం చుట్టూ 2003 వరకూ చక్కర్లు కొడుతూనే ఉంది. ఆ తర్వాత దాన్నుంచి సంకేతాలు లేవు. మన సౌర వ్యవస్థను దాటి ముందు కెళ్లడానికి 1977లో ప్రయోగించిన వాయేజర్ గురుగ్రహాన్ని దాటుకుంటూ వెళ్తూ దాని ఛాయా చిత్రాలు పంపింది. ఆ తర్వాత 1990లో వెళ్లిన గెలీలియో, 2000లో వెళ్లిన కేసినీ వ్యోమనౌకలు సైతం గురుగ్రహ ఛాయాచిత్రాలు పంపాయి. ఇక 2016లో నాసా ప్రయోగించిన జునో అంతరిక్ష నౌక నిరుడు యూరోపా ఛాయాచిత్రాలు పంపింది. ఇప్పుడు జ్యూస్ ప్రదక్షిణలు చేయబోయే 3 చందమామల్లో యూరోపా ఒకటి. అది 2031–34 మధ్య యూరోపాను రెండుసార్లు, క్యాలిస్టోను 21సార్లు, గాని మీడ్ను 12 సార్లు చుట్టివస్తుంది. అంతరిక్ష నౌకలు పంపే డేటాలో కేవలం రంగుల పొందికే ఉంటుంది. వీటి ఆధారంగా అక్కడ ఏమేం వాయువులున్నాయో, మూలకాలున్నాయో అంచనా కొస్తారు. విశ్వరహఃపేటిక తెరుచుకోవాలంటే నిత్యం ప్రయోగాలు కొనసాగుతూనే ఉండాలి. ఖగోళ శాస్త్ర ఆవిష్కరణలు విశ్వానికి సంబంధించిన మన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు విస్తృతపరుస్తుంటాయి. -
రొనాల్డో ఎఫెక్ట్: ఇకపై బాటిల్స్ ముట్టుకుంటే..
క్రిస్టియానో రొనాల్డో వర్సెస్ కోకా కోలా బాటిల్ వ్యవహారం ఎన్నో పరిణామాలకు దారితీస్తోంది. ప్రెస్ మీట్లో కోక్ బాటిళ్లను పక్కకు జరిపి ‘మంచి నీళ్లే తాగాలంటూ..’ రొనాల్డ్ ఇచ్చిన పిలుపు.. కోలా బ్రాండ్కు ఊహించని స్థాయిలో నష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే రొనాల్డో చర్య తర్వాత మరికొందరు ఆటగాళ్లు.. అతన్నే అనుకరిస్తూ, అనుసరిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ ఫుట్బాల్ అసోషియేషన్స్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. ఇకపై ఆటగాళ్లు బాటిళ్లను జరపడం, పక్కనపెట్టడం చాలా చేష్టలకు పాల్పడితే జరిమానా తప్పదని హెచ్చరించింది. కేవలం బాటిళ్లలోనే కాదు.. స్పానర్లుగా వ్యవహరిస్తున్న కంపెనీల ప్రొడక్టుల విషయంలోనూ ఈ హెచ్చరిక వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘టోర్నమెంట్ నిర్వాహణ కోసం ఆయా బ్రాండ్లతో ఒప్పందాలు జరిగాయని ఆటగాళ్లు గమనించాలి. వాళ్ల భాగస్వామ్యంతోనే యూరప్ దేశాల్లో ఫుట్బాల్ పురోగతికి కృషి జరుగుతోందని గుర్తించాలి’ అని గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది యూఈఎఫ్ఏ. ఇక పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో చర్యను పరోక్షంగా తప్పుబట్టిన టోర్నమెంట్ డైరెక్టర్ మార్టిన్ కల్లెన్.. ఫ్రాన్స్ ఆటగాడు పాల్ పోగ్బా చేసిన పనిని కూడా పరోక్షంగానే సమర్థించాడు. మత విశ్వాసానికి ముడిపడిన అంశం కావడంతో ఆ విషయంలో అతన్ని(పోగ్బా) తప్పుబట్టలేమని పేర్కొన్నాడు. అయితే ఆటగాళ్లకు జరిమానా విధించే విషయంలో యూఈఎఫ్ఏ నేరుగా జోక్యం చేసుకోదని, ఆయా ఆటగాళ్ల ఫుట్బాల్ ఫెడరేషన్లే చూసుకుంటాయని మార్టిన్ స్పష్టం చేశాడు. చదవండి: ప్లీజ్ ఇలాంటివి వద్దు-రొనాల్డో -
యూరోపాపై జీవం ఉండే అవకాశం!
వాషింగ్టన్: గురుగ్రహం చంద్రుల్లో ఒకటైన యూరోపా మీద జీవం ఉండే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. బ్రెజిల్లోని సావో పాలో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు యూరోపాపై సూక్ష్మజీవుల ఆవాస యోగ్యమైన పరిస్థితులపై అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా యూరోపా వాతావరణ పరిస్థితులను పోలిన దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్ దగ్గర ఉన్న మానెంగ్ బంగారు గనుల్లో పరిశోధన చేశారు. సుమారు 2.8 కి.మీ లోతుల్లో సూర్యరశ్మీ అవసరం లేకుండానే బ్యాక్టీరియం కాండిడాటస్ డిసల్ఫోర్డిస్ అడక్స్వేటర్ అనే బ్యాక్టీరియా మనుగడ సాధిస్తున్నట్లు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా యూరోపా భూగర్భంలో దాదాపు 10 కి.మీ లోతులో ఉన్న సముద్రంలోని సూక్ష్మజీవులను పోలి ఉన్నట్లు గుర్తించారు. గనుల్లో లీకవుతున్న నీటి బిందువుల్లో రేడియో ధార్మికత కలిగిన యూరేనియం ఉందని, ఇదీ నీటి అణువులను విడగొట్టి ఫ్రీ రాడికల్స్ను ఉత్పత్తి చేస్తుందని వర్సిటీకి చెందిన గలంటే అనే పరిశోధకుడు తెలిపారు. దీని వల్లే బ్యాక్టీరియా జీవిస్తుందని పేర్కొన్నారు. -
గుర్ప్రీత్ కొత్త చరిత్ర
న్యూఢిల్లీ: యూరోపా లీగ్లో ఆడిన తొలి భారత ఫుట్బాలర్గా గుర్ప్రీత్ సింగ్ సంధూ చరిత్ర సృష్టించాడు. 6.4 అడుగుల గుర్ప్రీత్ గురువారం సాయంత్రం వేల్స్లో జరిగిన యూరోపా లీగ్ క్వాలిఫయర్లో నార్వేకు చెందిన స్టాబేక్ ఎఫ్సీ తరఫున బరిలోకి దిగాడు. అయితే కేవలం 28నిమిషాల పాటే ఆడిన తను చేతి గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్ తర్వాత స్థాయి యూరోపా లీగ్ది. దీంట్లో ఓ టాప్ జట్టు తరఫున ఆడిన తొలి భారత ఆటగాడిగా తను రికార్డు సృష్టించాడు. గతంలో మొహమ్మద్ సలీం, భూటియా, సునీల్ చెత్రి కూడా విదేశీ క్లబ్ల్లో ఆడినా ప్రీమియర్ డివిజన్లో మాత్రం ఆడలేదు.