breaking news
enroll Names
-
17 ఏళ్ల తర్వాత ఓటరుగా..
ఢాకా/న్యూఢిల్లీ: బ్రిటన్లో ప్రవాసజీవితం గడుపుతున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ్ట(బీఎన్పీ) తాత్కాలిక చైర్మన్, మాజీ మహిళా ప్రధాని ఖలీదా జియా తనయుడు తారిఖ్ రెహ్మాన్ పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్లీ బంగ్లాదేశ్ ఓటరుగా తన పేరును నమోదుచేయించుకున్నారు. లండన్ నుంచి ఇటీవల స్వదేశానికి తిరిగొచ్చిన రెహ్మాన్ శనివారం ఓటరు జాబితాలో తన పేరును జతచేయడంతోపాటు జాతీయ గుర్తింపు(ఎన్ఐడీ) కార్డును సంపాదించినట్లు బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ శనివారం ఢాకాలోని ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చిన రహ్మాన్ నుంచి అధికారులు వేలి గుర్తులు, ఐరిస్ స్కాన్ తీసుకుని ఓటర్గా పేరు నమోదుచేశారు. అంతకుముందే రెహ్మాన్ తన ఓటరు దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించారని ఎన్నికల కమిషన్లోని జాతీయ గుర్తింపు నమోదు విభాగ డైరెక్టర్ జనరల్ హుమయూన్ కబీర్ వెల్లడించారు. రెహ్మాన్తోపాటు ఆయన కుమార్తె జైమా సైతం ఎన్ఐడీ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2007–08 రాజకీయ సంక్షోభం తర్వాత ఫక్రుద్దీన్ అహ్మద్ సారథ్యంలోని సైనిక తాత్కాలిక ప్రభుత్వం తొలిసారిగా 2008లో బంగ్లాదేశ్లో ఫొటో, బయోమెట్రిక్ డేటాతో ఓటర్ జాబితాను తయారుచేయడం తెల్సిందే. ఆ కాలంలో రాజకీయ ఖైదీగా ఉన్న రెహ్మాన్ను జైలు నుంచి విడుదలచేయగానే ఆయన 2008 సెపె్టంబర్ 11వ తేదీన లండన్కు వెళ్లిపోయారు. దీంతో ఆయన పేరు ఓట్ల జాబితాలో నమోదుకాలేదు. ఆ తర్వాత వైరి వర్గానికి చెందిన షేక్ హసీనా పార్టీ అధికారంలోకి రావడంతో రెహ్మాన్ ఇంకెప్పుడూ స్వదేశానికి రాలేదు. -
మరో వివాదంలో ప్రశాంత్ కిశోర్.. రెండు చోట్ల ఓటు.. టీఎంసీ ఆఫీసే చిరునామా!
పట్నా: ఎన్నికల వ్యూహకర్త, రాజకీయ నేత, ‘జన్ సురాజ్’ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(పీకే) మరో వివాదంలో చిక్కుకున్నారు. బీహార్, బెంగాల్లలో ఓటరుగా నమోదు చేసుకోవడమే కాకుండా తన చిరునామాగా టీఎంసీ కార్యాలయాన్ని చూపారు.‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’తెలిపిన వివరాల ప్రకారం జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్, బీహార్లలో ఓటరుగా నమోదు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో అతని పేరు 121 కలిఘాట్ రోడ్ చిరునామాతో ఓటరు జాబితాలో కనిపిస్తున్నది. ఇది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజకవర్గం భబానీపూర్లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యాలయం. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిశోర్.. టీఎంసీకి రాజకీయ సలహాదారుగా పనిచేశారు. బి రాణిశంకరి లేన్లోని సెయింట్ హెలెన్ స్కూల్లో అతని పోలింగ్ బూత్లో ఉంది.బీహార్లో ససారాం పార్లమెంటరీ సీటు పరిధిలోకి వచ్చే కార్గహర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా ప్రశాంత్ కిశోర్ తన పేరు నమోదు చేసుకున్నారు. రోహ్తాస్ జిల్లాలోని కోనార్ గ్రామంలో గల మధ్య విద్యాలయంలో అతని పోలింగ్ బూత్ ఉంది. ఇక్కడ ప్రశాంత్ కిశోర్ తండ్రి ఇల్లు ఉంది. కాగా ఈ విషయమై ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ వివరణ కోరగా, దానికి ప్రశాంత్ కిశోర్ సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే బెంగాల్ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిశోర్.. బీహార్లో ఓటరుగా పేరు నమోదు చేసుకున్నారని, అలాగే బెంగాల్లోని అతని ఓటరు కార్డును రద్దు చేయాలని దరఖాస్తు చేసుకున్నాని ‘పీకే’ బృందంలోని సభ్యుడొకరు తెలిపారు.రెండు చోట్ల ఓటరు కావచ్చా?ప్రజాప్రాతినిధ్య చట్టం- 1950లోని సెక్షన్ 17 ప్రకారం, ఏ వ్యక్తి అయినా ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాలలో ఓటరుగా నమోదు చేసుకోకూడదు. అలాగే సెక్షన్ 18 ప్రకారం ఒకే నియోజకవర్గంలో ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేరు నమోదు చేసుకోకూడదు. ఎవరైనా తమ నివాసాన్ని మార్చుకున్నప్పుడు వారు ఫారమ్ 8లో వారి వివరాలను అప్డేట్ చేయాలి. ఇటువంటి సమస్యను పరిష్కరించేందుకే ఎలక్షన్ కమిషన్ ఇటీవల బీహార్తో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను చేపట్టింది. ఫలితంగా దాదాపు 68.66 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు.ఇది కూడా చదవండి: Delhi: నేడు కృత్రిమ వర్షం.. కురిపిస్తారిలా.. ప్రయోజనమిదే.. -
పేర్ల నమోదులో జాగ్రత్త వహించండి
గుంటూరుసిటీ, న్యూస్లైన్ :జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతుల పేర్లు నమోదు చేయడంలో జాగ్రత్తలు వహించాలని జిల్లా ప్రత్యేక అధికారి బి.వెంకటేశం అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో వరద నష్టంపై వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హత కలిగిన ఏ రైతు నుంచీ జాబితాలో తనపేరు నమోదు కాలేదన్న ఫిర్యాదు రాకూడదన్నారు. ఎటువంటి ఒత్తిడులకు లొంగరాదన్నారు. అధికారులు గ్రామాలకు వెళ్లి పంట, గృహాలు కోల్పోయిన వారి జాబితా తయారు చేయాలన్నారు. వారం రోజుల్లో జాబితా అందిస్తే దానిపై ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. జాబితాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి.. జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్కుమార్ మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలకు జిల్లాలో 16 నుంచి 18 మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోందన్నారు. ఈ కారణంగా పంటలు, గృహాలు, పశువులు కోల్పోయిన రైతుల బాధితుల వివరాలు సక్రమంగా నమోదు చేయాలన్నారు. జాబితాను గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ముంపు ప్రాంతాలలో పారిశుధ్యాన్ని పకడ్బందీగా చేపట్టాలని, కాచి చల్లార్చిన నీటిని తాగడం, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి విషయాలపై స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వారంకంటే ఎక్కువగా నీటిలో ఉన్న గృహాలకు చెందిన కుటుంబాలకు దుస్తులు, వంట పాత్రల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 5వేలు ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు. 5వ తేదీ లోపు చేనేత, మత్య్సకారుల జాబితా కూడా సిద్ధం చేయాలన్నారు. ఇటీవల రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి పెదనందిపాడు పర్యటనకు వచ్చిన సమయంలో గైర్హాజరైన ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఈవోపీఆర్డీ, వీఆర్వోలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లు.. నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవవం సందర్బంగా స్థానిక పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్లో వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల సవ రణ కార్యక్రమానికి సంబంధించి స్వీకరించిన క్లెయింలు, అభ్యంతరాలను ఈనెలాఖరులోగా పరిష్కరించాలని సూచించారు. నవంబరు 1వ తేదీ నుంచి ఓటర్ల సవరణ ప్రత్యేక కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, డిఆర్వో కె.నాగబాబు, గుంటూరు, తెనాలి, నరసరావుపేట ఆర్డీవోలు బి.రామమూర్తి, ఎస్.శ్రీనివాసమూర్తి, శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. వరదలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందాలంటే పంట సాగు చేస్తున్న రైతు పేరు మాత్రమే నమోదు చేయాలని కలెక్టర్ ఎస్.సురేశ్కుమార్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన అధికారులతో మాట్లాడారు. ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూసుకోవాలన్నారు. వచ్చేనెల 14 నుంచి 19వ తేదీ వరకూ 7వ విడత భూపంపిణీ కార్యక్రమాన్ని చేపట్ట వలసి ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.


