breaking news
employees mass leave
-
ఐఏఎస్ల సస్పెన్షన్.. ఉద్యోగుల సామూహిక సెలవు
ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల సస్పెన్షన్ వ్యవహారం ఢిల్లీ ప్రభుత్వంలో మంటలు రేపుతోంది. ఈ సస్పెన్షన్లకు నిరసనగా 200 మంది అధికారులు సామూహిక సెలవు పెట్టాలని నిర్ణయించుకోవడంతో ఏం చేయాలో ప్రభుత్వానికి పాలుపోవడం లేదు. ఉద్యోగులు ఇలా సామూహిక సెలవులో వెళ్లడం కుట్రేనని రాష్ట్ర హోం మంత్రి సత్యేంద్ర జైన్ మండిపడ్డారు. అసలు తనకు సమ్మె గురించి ఎలాంటి సమాచారం లేదని ఆయన అన్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయకపోవడం వల్లే వాళ్లను సస్పెండ్ చేశారని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం జారీచేసే కొన్ని ఉత్తర్వులను నిలుపుదల చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కు ఉంటుంది గానీ, మొత్తం ఉత్తర్వులే పనికిరావని చెబితే మాత్రం దాన్ని ఆమోదించేది లేదన్నారు. అయినా ఉద్యోగులకు ఏవైనా సమస్యలుంటే ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాలి తప్ప లెఫ్టినెంట్ గవర్నర్ వద్దకు కాదని సత్యేంద్రజైన్ తెలిపారు. స్పెషల్ సెక్రటరీ (ప్రాసిక్యూషన్) యశ్పాల్ గార్గ్, స్పెషల్ సెక్రటరీ (ప్రిజన్స్) సుభాష్ చంద్రలను ఢిల్లీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల జీతాల పెంపునకు సంబంధించిన ఫైలుపై లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండా తాము సంతకాలు పెట్టేది లేదని అనడంతో వీళ్లను సస్పెండ్ చేశారు. దీంతో కేంద్రానికి.. కేజ్రీ సర్కారుకు మధ్య మరోసారి గొడవ మొదలైంది. ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో పనిచేసే ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కు మాత్రమే ఉంటుంది. దానికి కూడా ముందుగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుమతి తప్పనిసరి. ఇదేమీ లేకుండానే సీనియర్ ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చేయడంతో.. ఇప్పుడు అక్కడంతా గందరగోళం నెలకొంది. -
చిన్న తిరుపతిలో ఉద్యోగుల సామూహిక సెలవు
చిన్న తిరుపతిగా పేరొందిన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఉద్యోగుల సస్పెన్షన్ వివాదం ముదురుతోంది. జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు వ్యతిరేకంగా ధర్నా చేశారంటూ ఏఈవో సహా నలుగురు ఉద్యోగులను ఈవో సస్పెండ్ చేశారు. ఈవోకు మద్దతుగా అందరూ ధర్నా చేస్తే కేవలం ఐదుగురిని సస్పెండ్ చేయడం ఏంటని ఉద్యోగులు మండిపడ్డారు. అయితే.. సస్పెన్షన్ వెనుక కుల రాజకీయాలు ఉన్నాయంటూ కొత్త వాదన ఒకటి వస్తోంది. ధర్నాలో దాదాపు వంద మందికి పైగా పాల్గొన్నారని, కానీ కేవలం కాపులనే టార్గెట్ చేస్తూ వారినే సస్పెండ్ చేశారని కాపు సంఘాలు మండిపడుతున్నాయి. ద్వారకా తిరుమలలో ధర్నా చేయాలని నిర్ణయించాయి. సస్పెన్షన్ వ్యవహారాన్ని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు దృష్టికి ఉద్యోగ సంఘాల నాయకులు తీసుకెళ్లారు. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే రేపటి నుంచి ధర్నాలు చేస్తామని దేవాదాయ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.