breaking news
Electronics Gadgets
-
గాడ్జెట్స్ మార్కెట్ జోరు,ఎక్కువగా ఏం కొంటున్నారంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో వేరబుల్స్ (మన శరీరానికి నేరుగా కాంటాక్ట్తో ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్) మార్కెట్ జోరుగా సాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో 1.12 కోట్ల యూనిట్ల స్మార్ట్వాచెస్, రిస్ట్ బ్యాండ్స్, ఇయర్వేర్ అమ్ముడయ్యాయి. ఇందులో ఇయర్వేర్ 92 లక్షలు, రిస్ట్ బ్యాండ్స్ 3.72 లక్షలు, స్మార్ట్వాచెస్ 16 లక్షల యూనిట్లు ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 118.2 శాతం వృద్ధి. దేశీయ కంపెనీలు పెద్ద ఎత్తున ఇయర్వేర్, వాచెస్ విక్రయం కారణంగా ఈ వృద్ధి సాధ్యపడిందని ఐడీసీ వెల్లడించింది. ‘2021 జనవరి–మార్చితో పోలిస్తే సెకండ్ వేవ్ మూలంగా జూన్ త్రైమాసికంలో విక్రయాలు 1.3 శాతం తగ్గాయి. గతేడాదితో పోలిస్తే మార్కెట్ ఈ ఏడాది త్వరితగతిన రికవరీ అయింది. పండుగల సీజన్లో డిమాండ్ విపరీతంగా ఉండనుంది. కంపెనీలు ఉత్పత్తుల ధరలను సవరించనున్నాయి. గతేడాదితో పోలిస్తే 2021 జూలై–డిసెంబరు కాలంలో 35 శాతం అధికంగా అమ్మకాలు నమోదయ్యే అవకాశం ఉంది. రిస్ట్వేర్ విభాగంలో వాచెస్ వాటా ఏకంగా 81.2 శాతం ఉంది. ఈ విభాగం మరింత పుంజుకోనుంది. రిస్ట్వేర్ విభాగం 35 శాతం వృద్ధి చెందింది. ఇయర్వేర్ రెండింతలైంది. యూనిట్ల పరంగా ఈ విభాగానిదే పైచేయి’ అని ఐడీసీ వివరించింది. -
పాత ఫోన్లు, లాప్ట్యాప్లు అమ్మేస్తారా? ఇది మీకోసమే..
సాక్షి, వెబ్డెస్క్: వేల రూపాయలు పెట్టి కొన్న గాడ్జెట్లు నెలలు తిరగకుండానే ఓల్డ్ మోడల్ అవుతున్నాయి. ఇయర్ ఫోన్స్ మొదలు స్మార్ట్ఫోన్ల వరకు , కీబోర్డు మొదలు టచ్ ల్యాప్టాప్ల వరకు వెంట వెంటనే అప్డేట్ వెర్షన్లు వచ్చేస్తున్నాయి. కొత్త వెర్షన్ వస్తువు కొందామంటే.. పాతది ఏం చేయాలని? ఎలా రీజనబుల్ ధరకు అమ్మేయాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఈ సమస్యను తీరుస్తూ.. పాత ఎలక్ట్రానిక్ వస్తువుల కొనడమే పనిగా ఈ-కామర్స్లోకి అడుగుపెట్టింది క్యాషిఫై. పాతవి అమ్మాలంటే మార్కెట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ విషయంలో వెనువెంటనే మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల విషయంలో ఇది మరీ ఎక్కువ. వారం తిరక్కుండానే కొత్త ఫీచర్లతో తక్కువ ధరలో మంచి ఫోన్లు వస్తున్నాయి. దీంతో కొత్త ఫోన్లు చాలా త్వరగా ఓల్డ్ వెర్షన్ అయిపోతున్నాయి. వీటిని అమ్మి కొత్తది తీసుకుందామంటే మనకు తెలిసిన మార్కెట్లో సరైన ధర రావడం కష్టంగా మారింది. ఇలాంటి వారికి చక్కని వేదికగా మారింది క్యాషిఫై. ఈ-కామర్స్కు కొత్త భాష్యం చెబుతూ రీ-కామర్స్గా పాత ఎలక్ట్రానిక్ వస్తువులని ప్రజల నుంచి కొనుగోలు చేస్తుందీ వెబ్ పోర్టల్. రీ-కామర్స్ ఇది ఈ-కామర్స్ కాదు.. రీ-కామర్స్. అంటే పాత వస్తువుల్ని కొనడమే వీళ్ల పని. ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్, స్మార్ట్వాచ్, స్మార్ట్ స్పీకర్, డీఎస్ఎల్ఆర్ కెమెరా, ఇయర్బడ్స్ తదితర వస్తువులన్నీ ఈ సైట్లో అమ్మే అవకాశం ఉంది. క్యాషిఫై వెబ్సైట్కి వెళ్లి అక్కడున్న ఆప్షన్లను అనుసరిస్తే మీ దగ్గరున్న ప్రొడక్టుకి ఎంత ధర వస్తుందో తెలియజేస్తుంది. ఆ తర్వాత మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాక.. ఫైనల్ ధర ఎంతో నిర్ధారిస్తుంది. అందుకు ప్రొడక్టు ఓనర్ అంగీకరిస్తేనే డీల్ ముందుకు వెళ్తుంది. ఎక్సేంజీ కంటే మేలు ప్రముఖ ఈ కామర్స్ సైట్లలో సైతం ఎక్సేంజ్ ఆఫర్లు రెగ్యులర్గా ఉంటాయి. అయితే ఎక్సేంజ్ ఆఫర్లలో కంపెనీలు పాత ఫోన్లకు చాలా తక్కువ ధరను ఆఫర్ చేస్తుంటాయి. పైగా అన్ని రకాల పాత మోడళ్లపై ఎక్సేంజీ ఆఫర్ వర్తించవు. అంతేకాదు మనకు నచ్చిన వస్తువలపై ఎక్సేంజీ ఆఫర్ ఉండకపోవచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా క్యాషిఫైలో పాత గాడ్జెట్స్ అమ్మేయోచ్చు. ఆఫ్లైన్లో కూడా ఇప్పటి వరకు ఆన్లైన్లోనే వ్యాపారం చేస్తూ వచ్చిన క్యాషిఫై తాజాగా ఆఫ్లైన్లోకి వచ్చింది. రిటైల్ చైయిన్ యూనిషాప్తో ఒప్పందం చేసుకుంది. దీంతో ఢిల్లీ, బెంగళూరు, ముంబై ఏరియాల్లో 60కి పైగా రిటైల్ షాప్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా టైర్ టూ సిటీలకు కూడా విస్తరించేలా క్యాషిఫై ప్రణాళిక సిద్దం చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఆఫ్లైన్ సౌకర్యం హైదరాబాద్ని పలకరించే అవకాశమూ ఉంది. -
ఉపాధికి మార్గం వేసే డిజిటల్ శిక్షణ
టాప్ స్టోరీ ప్రపంచం మొత్తం డిజిటల్ యుగం దిశగా దూసుకెళ్తోంది. అందివస్తున్న సాంకేతికత, చౌక ధరలకే లభ్యమవుతున్న ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్తో నవతరం డిజిటల్ వైపు మొగ్గుచూపుతోంది. రాబోయే కాలంలో విద్య, ఉద్యోగ సంబంధిత అంశాలతోపాటు ప్రభుత్వ పథకాలు, దైనందిన కార్యకలాపాలను అధిక శాతం డిజిటల్ మాధ్యమమే శాసించే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అందరూ సాంకేతిక సాధికారత సాధించేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమమే.. నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్(ఎన్డీఎల్ఎం). తద్వారా పట్టణాలు, గ్రామాల్లోని యువత ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవచ్చు. 2015 చివరి నాటికల్లా 10 లక్షల మందికి డిజిటల్ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఈ శిక్షణ ద్వారా ప్రయోజనాలపై ఫోకస్... డిజిటల్ లిటరసీ అంటే.. అందరూ కంప్యూటర్ పరిజ్ఞానం అనుకుంటారు. వాస్తవానికి కావాల్సిన సమాచారాన్ని ఉపయోగించడం, నిక్షిప్తం చేయడం, విశ్లేషించే క్రమంలో డిజిటల్ సాంకేతికత, కమ్యూనికేషన్ టూల్స్/నెట్వర్క్ను ప్రభావవంతంగా వినియోగించే సామర్థ్యాన్ని కలిగి ఉండడమే డిజిటల్ లిటరసీ. వివరంగా చెప్పాలంటే.. సంప్రదాయ కంప్యూటర్లతోపాటు పీసీ, ల్యాప్టాప్ వంటి వాటి వినియోగంపై అవగాహన, కంప్యూటర్కు సంబంధించిన ప్రాథమిక పరికరాలపై పనిచేసే నేర్పు, కంప్యూటర్ నెట్వర్క్స్, ఈ-మెయిల్, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వంటివి వాడే విధానంపై స్పష్టత, కొన్ని సాఫ్ట్వేర్, హార్డ్వేర్ల వినియోగం వంటి అంశాల్లో నైపుణ్యాన్ని కలిగి ఉండటమే డిజిటల్ లిటరసీ. 2020 నాటికి.. ప్రపంచ డిజిటల్ ఎకానమీలో భారతదేశం అగ్రభాగాన నిలిచేలా నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ దోహదపడుతుంది. రూరల్, అర్బన్ ప్రాంతాల ప్రజలు సాంకేతికంగా సాధికారత సాధించేలా చూడడమే దీని ప్రధాన ఉద్దేశం. డిజిటల్ సాంకేతికతతో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, ఈ-గవర్నెన్స్ ప్రాజెక్ట్లలో ప్రజలు చురుగ్గా పాల్గొనేలా చూడడం కూడా మరో లక్ష్యం. అంతేకాకుండా దేశంలోని గ్రామ పంచాయితీలను కూడా డిజిటల్ మాధ్యమం ద్వారా అనుసంధానించే కార్యక్రమం సైతం కొనసాగుతోంది. ఈ క్రమంలో 2020 నాటికి ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా డిజిటల్ సంబంధిత అంశాల్లో నైపుణ్యం సాధించేలా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ను ప్రారంభించారు. 18 నెలల కాలంలో 10 లక్షల మందికి దేశంలో వచ్చే 18 నెలల కాలంలో 10 లక్షల మందిని డిజిటల్ టెక్నాలజీలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డైటీ) ఏర్పాటు చేసిన సీఎస్సీ-ఎస్పీవీ కం పెనీతో ద నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) ఫౌండేషన్ చేతులు కలిపింది. ఈ మేరకు నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్(ఎన్డీఎల్ఎం) తొలి దశ లక్ష్యాన్ని సాధించే దిశగా ఇరు సంస్థలూ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. పీపీపీ పద్ధతిలో పబ్లిక్-ప్రైవేట్-పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో ఈ విభిన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలో సీఎస్సీ-ఎస్పీవీ పాఠ్యాంశాలను రూపొందిస్తుంది. నాస్కామ్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. దీని కోసం సైయంట్, కాగ్నిజెంట్, గూగుల్, ఇంటెల్ తదితర సంస్థలతో ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు కేంద్రాలు నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్లో భాగంగా.. నాస్కామ్.. జెన్సర్ టెక్నాలజీస్, డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ ఏడాది హైదరాబాద్, పుణెలలో కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో ఈ ఏడాది జూలైలో, పుణెలో ఈ నెల ఆరో తేదీన ప్రారంభించిన కేంద్రాల్లో దాదాపు 3 వేల మందికి శిక్షణనిస్తారు. ఇందులో ప్రతి కుటుంబంలో ఒక్కరైనా డిజిటల్ విభాగాల్లో నైపుణ్యం సాధించేలా డిజిటల్ లిటరసీ, జాబ్ ఓరియెంటెడ్ ఇంగ్లిష్ ప్రోగ్రామ్, డీటీపీ, యానిమేషన్ సాఫ్ట్వేర్ డిజైన్, బిజినెస్- ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగామ్స్, వివిధ సామాజిక సమస్యలకు సంబంధించి అవగాహన, చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇవి లెక్చర్ సెషన్, గ్రూప్ ప్రాజెక్ట్, మోటివేషన్ సెషన్స్గా ఉంటాయి. డిజిటల్ లిటరసీ వీక్ నేషనల్ డిజిటల్ లిటరసీలో భాగంగా నాస్కామ్ తన భాగస్వామ్య కంపెనీలతో కలిసి సంయుక్తంగా డిసెంబర్ 8 నుంచి 12 వరకు డిజిటల్ లిటరసీ వీక్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా వాలంటీర్ల రూపంలో ఐటీ ఉద్యోగుల సేవలను వినియోగించుకుని ఈ అంశంపై అవగాహన కల్పించనుంది. 2012లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 25వేల మందికి కంప్యూటర్ బేసిక్ స్కిల్స్ను నేర్పించారు. నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ వెబ్సైట్: www.ndlm.in సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక ప్రయోజనాలు ‘‘నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత (డిజిటల్ లిటరసీ)పై అవగాహన పెంపొందిస్తారు. అంతేకాకుండా కంప్యూటర్ ఆధారితంగా పని చేసే పౌర సేవలను సులువుగా ఉపయోగించుకునే విధంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరికి కంప్యూటర్ లేదా ఇతర డిజిటల్ సాధనాలను ఉపయోగించే విధానం, ఈ-మెయిల్ పంపడం.. చూసుకోవడం, ఈ-గవర్నెన్స్ ప్రాజెక్ట్లో చురుగ్గా పాల్గొనడం, కావాల్సిన సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి పొందే పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ప్రధానంగా యువత, మహిళలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీని ద్వారా ఆయా వర్గాలకు సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి. ఈ కార్యక్రమాన్ని సైయంట్ ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్లోని కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో అమలు చేస్తారు. ఈ శిక్షణ కార్యమ్రాలకు సంబంధించిన మాడ్యూల్స్ను నాస్కామ్ ఫౌండేషన్ రూపొందిస్తుంది. ఇందులో ఆరోగ్యం, విద్య, అక్షరాస్యత, జీవన విధానాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి’’ -డాక్టర్ బి.వి. మోహన్ రెడ్డి, ఫౌండర్ అండ్ ట్రస్టీ, సైయంట్ ఫౌండేషన్.