breaking news
eamcet paper leakage
-
తెలంగాణ ఎంసెట్ మెడికల్ లీకు వీరుల అరెస్టు
-
తెలంగాణ ఎంసెట్ మెడికల్ లీకు వీరుల అరెస్టు
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన తెలంగాణ ఎంసెట్-2 (2016) మెడికల్ పేపర్ల లీకేజి కేసులో ప్రధాన సూత్రధారులు శివబహదూర్ సింగ్, అనూప్ కుమార్ సింగ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లో అరెస్టు చేసిన వీళ్లిద్దరినీ ట్రాన్సిట్ వారంటు మీద హైదరాబాద్ తీసుకొచ్చినట్లు తెలంగాణ సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో శివబహదూర్ సింగ్ అలియాస్ ఎస్బీ సింగ్ అలియాస్ పండిట్ ప్రధాన సూత్రధారి. తనకున్న పరిచయాలతో అతడు తెలంగాణ ఎంసెట్ మెడికల్ పేపర్ను బయటకు తీసుకొచ్చాడు. 2005 నుంచి అతడు ఈ తరహాలో వివిధ పేపర్లు లీక్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు లక్నోలో రైల్వే గ్రూప్-డి పేపర్ లీకేజి కేసు, 2008లో అలహాబాద్లో రైల్వే డ్రైవర్స్ పరీక్ష పేపర్ లీకేజి కేసు, 2015లో పంజాబ్లో టీఈటీ పరీక్ష లీకేజి కేసు, పీఎస్సీ పరీక్ష లీకేజికి సంబంధించి రెండు కేసులు, 2015లోనే జమ్ము కశ్మీర్ టీచర్ల ప్రవేశపరీక్ష లీకేజి కేసు, కోల్ ఇండియా కేసు, మహారాష్ట్రలో వార్ధా మెడికల్ కాలేజి పేపర్ లీకేజి కేసు, చండీగఢ్ టీచర్ల ప్రవేశ పరీక్ష కేసు, కోల్కతా టీఈటీ పరీక్ష పేపర్ లీకేజి కేసు, 2016 డిసెంబర్లో డీఎంఆర్సీ పరీక్ష పేపర్ లీకేజి కేసు, చివరగా 2016లో తెలంగాణ మెడికల్ ప్రవేశపరీక్ష పేపర్ లీకేజి కేసు ఇతడి మీద ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాలలో అనూప్ కుమార్ సింగ్ ఇతడికి సహాయకుడిగా ఉండేవాడని పోలీసులు తెలిపారు. -
'లీకు' వీరుల వెనుక అదృశ్య హస్తం ?
-
'లీకు' వీరుల వెనుక అదృశ్య హస్తం ?
► దేశవ్యాప్తంగా నెట్వర్క్ ► ఎంసెట్-2 లీకేజీలో సీఐడీ దర్యాప్తు ముమ్మరం ► రంగంలోకి మరో మూడు బృందాలు ► జేఎన్టీయూహెచ్ పాత్రపైనా విచారణ ► ఎంసెట్ కన్వీనర్ నుంచి వివరాలు కోరిన సీఐడీ ► ప్రింటింగ్ ప్రెస్ పాత్రను నిగ్గు తేల్చేందుకు స్పెషల్ టీమ్ ► భారీ కమీషన్లతో బ్రోకర్లకు ఆశచూపిన రాజగోపాల్రెడ్డి ► సబ్ బ్రోకర్ల ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులపై వల ► ఎగ్జామ్కు ముందు ప్రశ్నలు-జవాబులు ఇచ్చి విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించినట్టు అనుమానాలు ► ఇద్దరి అరెస్టును అధికారికంగా ప్రకటించిన సీఐడీ హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ వెనుక ఒకరిద్దరు సూత్రధారులే ఉన్నారా.. ఇంకా ఏమైనా అదృశ్య శక్తులున్నాయా? లీకేజీ కేవలం ఎంసెట్-2కు మాత్రమే పరిమితమైందా..? దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న ఈ అదృశ్య శక్తులు ఇతర ప్రవేశ పరీక్షలనూ లీక్ చేశాయా..? తెలంగాణ వైద్య విద్య ప్రవేశ పరీక్ష ఎంసెట్-2 లీకేజీపై దర్యాప్తు చేస్తున్న సీఐడీకి ఇవే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో అదృశ్య శక్తుల బాగోతాన్ని పూర్తి స్థాయిలో బట్టబయలు చేసేందుకు సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మరిన్ని బృందాలను రంగంలోకి దించింది. మరోవైపు ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అధికారికంగా వెల్లడించింది. ఏటా ఇదే తంతు? ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం ఈ ఎంసెట్-2కే పరిమితం కాలేదని, ఏటా ఇదే తంతు జరుగుతున్నట్టుగా సీఐడీ అనుమానిస్తోంది. ప్రస్తుతం లీకైన ప్రశ్నపత్రాలు విద్యార్థులకే కాకుండా విద్యా సంస్థలకు కూడా చేరాయా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగిస్తోంది. ప్రవేశ పరీక్షకు సంబంధించిన రెండు సెట్ల ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో.. ఎంసెట్ను నిర్వహిస్తున్న జేఎన్టీయూ(హెచ్) పాత్రపైనా లోతుగా విచారణ జరుపుతోంది. యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సిబ్బంది పాత్రపై కొంత స్పష్టత రావడంతో ఎంసెట్ కన్వీనర్ రమణారావు నుంచి సీఐడీ అధికారులు గురువారం మరిన్ని వివరాలు సేకరించారు. ప్రశ్నపత్రాల తయారీ మొదలుకుని ప్రింటర్ల ఎంపిక, పరీక్ష నిర్వహణ తీరు తదితరాలపై మరింత లోతుగా ఆరా తీశారు. ఒకే ముద్రణ సంస్థకు రెండుసెట్ల ప్రశ్నపత్రాల ముద్రణ బాధ్యత అప్పగించడంపై ప్రశ్నించింది. మరోవైపు ప్రింటింగ్ ప్రెస్ నుంచే ప్రశ్నపత్రం లీకైందనే అనుమానాలు బలపడుతుండటంతో ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ పాత్రపైనా దృష్టి సారించారు. ఇప్పటికే సీఐడీకి చెందిన ఆరు బృందాలు లీకేజీ వ్యవహారంపై విచారణ జరుపుతుండగా.. తాజాగా మరో మూడు బృందాలు రంగంలోకి దిగాయి. ఇందులో ఓ బృందం ఢిల్లీలో ప్రింటింగ్ ప్రెస్ కార్యకలాపాలపై ఆరా తీస్తోంది. లీకేజీలో కీలకంగా వ్యవహరించిన షేక్ నౌషాద్ను అరెస్టు చేసేందుకు మరో రెండు బృందాలు మహారాష్ట్రలో గాలింపు చేపట్టాయి. కళ్లు తిరిగే కమీషన్లతో బ్రోకర్లకు ఎర పరీక్షకు ముందే ప్రశ్నపత్రాలు చేతికి అందడంతో లీకేజీ సూత్రధారి రాజగోపాల్రెడ్డి... బ్రోకర్లకు భారీ క మీషన్ను ఆశగా చూపాడు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎర వేసే బాధ్యతను వారికి అప్పగించాడు. ‘ఒక్కో విద్యార్థి నుంచి కనీసం రూ.35 ల క్షలు మొదలుకుని గరిష్టంగా మీరు ఎంతైనా వసూలు చేయండి. మీరు వసూలు చేసే మొత్తాన్ని బట్టి కమీషన్ ఉంటుంది’ అని హామీ ఇచ్చాడు. తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన అడ్వాన్స్లో కొంత మొత్తం బ్రోకర్లకు కమీషన్గా ఇచ్చాడు. వీలైనంత ఎక్కువ మందిని ముగ్గులోకి లాగేందుకు సబ్ బ్రోకర్ల వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేందుకు గతంలో తమ ద్వారా జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీలను ప్రస్తావించినట్లు సమాచారం. విచారణలో రాజగోపాల్రెడ్డి వెల్లడిస్తున్న అంశాలను విశ్లేషిస్తున్న సీఐడీ.. లీకేజీ కుట్రలో పై స్థాయిలో అదృశ్య శక్తులు ఉన్నట్లు భావిస్తోంది. ఈ నేపథ్యంలో అదృశ్య శక్తుల పాత్రను రూఢీ చేసేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు సీఐడీ నలుగురు బ్రోకర్లను అదుపులోకి తీసుకోగా.. హైదరాబాద్, ఏపీ, బెంగళూరుకు చెందిన మరింత మంది సబ్ బ్రోకర్లను పాత్రను గుర్తించింది. ప్రశ్నలు-జవాబులు ఇచ్చి ప్రాక్టీస్ లీకేజీ వలలో చిక్కిన విద్యార్థులను ఒక్కో బృందంలో 20కి మించకుండా ఈ ముఠా జాగ్రత్తలు తీసుకుంది. పరీక్షకు రెండు మూడు రోజుల ముందు ‘ప్రత్యేక శిక్షణ’ కేంద్రాలకు తరలించింది. హైదరాబాద్తోపాటు బెంగళూరు, పుణె, ముంబై, విజయవాడ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలకు వచ్చిన విద్యార్థుల వద్ద సెల్ఫోన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను బృందాలుగా విభజించి సమాధానాలతో కూడిన ప్రశ్నపత్రాలు అందజేసి.. సాధన చేయించారు. ఒక్కో విద్యార్థికి రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే ప్రశ్నపత్రాన్ని చూసి సాధన చేసే అవకాశం కల్పించినట్లు సమాచారం. విద్యార్థులకు రెండు సెట్లకు సంబంధించి మొత్తం 320 ప్రశ్నలు (ఒక్కో సెట్లో 160 మార్కులు) అందజేశారు. అయితే వీటిలో కొన్ని తప్పుడు ప్రశ్నలను ఉద్దేశపూర్వకంగా చేర్చి విద్యార్థులకు అందజేసినట్లు విచారణలో తేలింది. విచారణలో పొంతనలేని సమాధానాలు ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి ఇప్పటివరకు 74 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరినట్లు ప్రాథమికంగా తేలగా.. 16 మంది తల్లిదండ్రులు మాత్రమే సీఐడీ విచారణకు హాజరయ్యారు. మిగతావారు తాము అందుబాటులో లేమని, సొంత పనులపై ఇతర ప్రాంతాల్లో ఉన్నామంటూ తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తున్నారు. దీంతో పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41 ఎ కింద తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. కాగా, వరంగల్, పరకాల, భూపాలపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది విద్యార్థులను సీఐడీ గురువారం ప్రశ్నించింది. విచారణలో వీరు కూడా తల్లిదండ్రుల తరహాలోనే తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తున్నారు. తొలుత తాము ఎక్కడకీ వెళ్లలేదని బుకాయించిన విద్యార్థులు.. వారి కదలికలకు సంబంధించిన విమాన టికెట్లు తదితర ఆధారాలను ఎదుట పెడుతుండటంతో కంగుతింటున్నారు. తాము ప్రత్యేక శిక్షణ కేంద్రాలకు వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే అక్కడ సాధన చేసిన ప్రశ్నలు ఎంసెట్-2లో రాలేదని చెబుతున్నారు. లీకేజీలో ఇద్దరు అరెస్టు ఎంసెట్-2 లీకేజీలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ గురువారం ప్రకటించారు. హైదరాబాద్కు చెందిన విష్ణుధర్ అలియాస్ విష్ణువర్ధన్, తిరుమల్ అలియాస్ తిరుమల్రావును అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఇద్దరు సుమారు 25 మంది విద్యార్థులు, తల్లిదండ్రులను సంప్రదించి బెంగళూరుకు తీసుకెళ్లినట్లు గుర్తించామన్నారు. సూత్రధారి రాజగోపాల్రెడ్డి.. విద్యార్థులకు బెంగళూరులో ప్రశ్నలు, సమాధానాలపై ప్రత్యేక శిక్షణ ఇప్పించి పంపారన్నారు. తమ విచారణలో రెండు సెట్లకు సంబంధించి 320 ప్రశ్నలు లీకైనట్లు గుర్తించామన్నారు. -
ఎంసెట్ విద్యార్థుల నరకయాతన
హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ వ్యవహారం అనేక మంది విద్యార్థుల జీవితాలను తలకిందులు చేసింది. చేతికందిన మెడికల్ సీటు చేజారిపోయే పరిస్థితి నెలకొనడంతో కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించినవారంతా గొల్లుమంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో డొనేషన్ లేకుండా కేవలం రూ.10 వేలు మొదలు రూ.60 వేల ఫీజుతో చేరే సీటుకు వారు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో విద్యార్థులు మెడికల్ ప్రవేశాల కోసం ఏకంగా 4సార్లు ప్రవేశ పరీక్ష రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. ‘నీట్’పై సుప్రీం తీర్పుతో ఎంసెట్-1ను వ్యవసాయ, ఆయుష్ కోర్సులకే పరిమితం చేశారు. నీట్పై కేంద్రం ఆర్డినెన్స్ తీసురావడంతో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్-2ను నిర్వహించారు. ప్రైవేటులోని మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటా సీట్లల్లో ప్రవేశాలకు నీట్-2 పరీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 3 పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎంసెట్-2 లీకేజీ కారణంగా మరోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎవరో కొందరు చేసిన లీకేజీ పాపానికి తాము బలి అవుతున్నామని గోడు వెళ్లబోసుకుంటున్నారు. మళ్లీ పరీక్ష రాస్తే మంచి ర్యాంకు వస్తుందో రాదోనని మధనపడుతున్నారు. ఇలాంటి విద్యార్థులు ఎందరో.. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ప్రాంతానికి చెందిన సాయిప్రియకు ఎంసెట్-1 పరీక్షలో 152 మార్కులు.. 244 ర్యాంకు వచ్చింది. అది కేవలం వ్యవసాయ, ఆయుష్ కోర్సులకే పరిమితం చేయడంతో ఎంసెట్-2 పరీక్ష రాసింది. 140 మార్కులతో 272వ ర్యాంకు సాధించింది. ఓసీ అయిన సాయిప్రియ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కేవలం రూ.10 వేల ఫీజుతో సీటు పొందే అవకాశం ఉంది. కానీ ఎంసెట్-2 రద్దు అయ్యే పరిస్థితితో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురై బుధవారం సచివాలయానికి వచ్చి మంత్రి లక్ష్మారెడ్డి ముందు తన గోడు వెళ్లబోసుకుంది. లీకేజీ ద్వారా లబ్ధి పొందిన వారి ర్యాంకులను మాత్రమే రద్దు చేసి, తనకు న్యాయం చేయాలని కోరింది. గతేడాది ఎంసెట్ పరీక్షలో సాయిప్రియకు 2 వేల ర్యాంకు రాగా.. ప్రభుత్వ సీటు 1685 ర్యాంకు వరకు వచ్చి ఆగిపోయింది. అందుకే ఈసారి ప్రభుత్వ మెడికల్ సీటు సాధించాలని కష్టపడి మంచి ర్యాంకు సాధించానని కన్నీరు మున్నీరైంది. ఈ అమ్మాయికి ఏపీ ఎంసెట్లోనూ 139 మార్కులు.. 203వ ర్యాంకు రావడం గమనార్హం. -
అక్కడ 24 వేల ర్యాంకు.. ఇక్కడ 704!
తెలంగాణ ఎంసెట్ పేపర్ లీకేజి విషయం నూటికి నూరుపాళ్లు నిజమేనని తేలిపోయింది. కొంతమంది విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ర్యాంకులు, తెలంగాణలో వచ్చిన ర్యాంకులు పోల్చి చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఏపీ ఎంసెట్లో 55వేల ర్యాంకు వచ్చిన విద్యార్థికి టీఎస్ ఎంసెట్-2లో 1502 ర్యాంకు వచ్చింది. అలాగే అక్కడ 24వేల ర్యాంకు వచ్చిన వాళ్లకు ఇక్కడ 704 ర్యాంకు వచ్చింది. అక్కడ 10వేల ర్యాంకు వస్తే, ఇక్కడ ఏకంగా 141వ ర్యాంకు సాధించారు. అలాగే ఏపీలో 25వేల ర్యాంకు వరకు వచ్చిన ఓ విద్యార్థికి ఇక్కడ 952వ ర్యాంకు వచ్చింది. ప్రిపరేషన్ కోసం ఎంత సమయం ఉన్నా.. మరీ ఇంత స్థాయిలో ర్యాంకులు రావడం దాదాపు అసాధ్యమే. అది కూడా మెడికల్ ఎంట్రన్సులో. ఇదే తల్లిదండ్రుల అనుమానాలకు బీజం వేసింది. ఇలా మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు పరీక్షకు రెండు రోజుల ముందు అదృశ్యం కావడం, సరిగ్గా పరీక్ష ఉన్న రోజే విమానంలో హైదరాబాద్కు వచ్చి పరీక్ష రాయడం వాళ్ల అనుమానాలకు కారణమైంది. అలా రాసిన విద్యార్థులను మిగిలినవాళ్లు అడిగినప్పుడు కూడా పొంతనలేని సమాధానాలు చెప్పారు. చివరకు ర్యాంకులు వచ్చిన తర్వాత.. అసలు కోచింగ్ సెంటర్లలో వీళ్ల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేదని, ఇంత మంచి ర్యాంకులు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదని పిల్లలు చెప్పడంతో తల్లిదండ్రులు స్పందించి మంత్రికి ఫిర్యాదు చేశారు. లీకు వీరులు ఎవరో? 2014లో నిర్వహించిన మెడికల్ పీజీ ఎంట్రన్సు పేపర్లు లీకయ్యాయి. ఈ పేపర్లను ఢిల్లీలోని ముద్రణాలయంలో ప్రింట్ చేయించారు. అప్పట్లో ఆ పేపర్ లీకేజి కేసులో వినిపించిన పేర్లే ఇప్పుడు కూడా ఎంసెట్-2 లీకేజి విషయంలో వినిపిస్తున్నాయి. ముగ్గురు వ్యక్తులే ఇందులో కీలక పాత్రధారులని తెలుస్తోంది. ఇప్పటికే ఎంసెట్-2 లీకేజి కేసులో ప్రకాశం జిల్లాకు చెందిన రమేష్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడితో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పరీక్షకు 48 గంటల ముందు 30 మంది విద్యార్థులను బెంగళూరు, ముంబై తరలించారు. అక్కడే వాళ్లతో ప్రాక్టీసు చేయించారంటున్నారు. దీనిపై 24 గంటల్లో ప్రభుత్వానికి నివేదిక అందనుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక 2014 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన అన్ని ప్రవేశపరీక్షల వ్యవహారంపై కూడా దృష్టిపెట్టాలని సీఐడీ నిర్ణయించినట్లు సమాచారం.