breaking news
Eamcet-2 exam
-
తప్పెవరిది? శిక్షెవరికి?
సమకాలీనం ఇంటర్ ప్రశ్నపత్రం లీకైనందుకు మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అంతకుముందు, పదోతరగతి పరీక్షాపత్రాలు లీకయ్యాయనే కారణంగా నాటి సీఎం ఎన్టీఆర్ మంత్రి చిక్కాల రామచంద్ర రావును మంత్రివర్గం నుంచి తప్పించారు. నైతిక బాధ్యత అంటే, లేకున్నా ఉన్నట్టు భ్రమ పడే దేవతా వస్త్రాలనుకుంటే చెప్పగలిగేదేమీ ఉండదు. బయటకు కనబడకపోయినా ఉండే చంద్రమతి మాంగల్యం లాంటిదనుకుంటేనే ప్రభుత్వాలు స్పందిస్తాయి, స్పందించాలి. వాస్తు బాగోలేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావే చెబుతున్న సచివాలయంలో గురువారం తాడు లాగారు. ఎమ్సెట్-2 రద్దు చేయొద్దని ఒక బృందం, రద్దు చేసి తిరిగి పరీక్ష జరపండని మరొక బృందం. ఎర్రవల్లి ఫామ్హౌజ్లో ధర్మగంట మోగింది. శుక్రవారం ముఖ్యమంత్రి తీర్పు చెప్ప నున్నారు. ప్రశ్నపత్రం లీకైన మెడికల్ ఎమ్సెట్-2 ను రద్దు చేసి మళ్లీ పరీక్ష పెట్టడమా? లీకేజీ బాధ్యులు, అనుచిత ప్రయోజనం పొందిన పిల్లలు- తల్లి దండ్రులపై చర్య తీసుకొని మిగిలిన విద్యార్థుల ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరపడమా? ఇదొక ధర్మ సంకటం. తీర్పు ఏదైనా పాపం పిల్లలకే శిక్షా! మరి ప్రభుత్వ నైతిక బాధ్యత సంగతి? ఇదేం పరీక్ష? విద్యార్థి హృదయ వేదన ఒక సీటు కోసం ఎన్నిమార్లు పరీక్ష రాయాలి? ఇది సగటు విద్యార్థి ప్రశ్న. అన్నీ, వారి పాత్ర-ప్రమేయం లేని నిర్వహణా లోపాలు, తప్పిదాల వల్ల జరుగుతున్నవే! నీట్ విషయం ఎటూ తేలట్లేదు ఈలోపు మెడికల్-డెంటల్ కాకుండా వ్యవసాయ, ఫార్మా సీట్ల కోసం రాయండంటే ఎమ్సెట్-1 రాశారు. జాతీయ కొత్త విధానంలో తప్పదు, రాయాల్సిందే అంటే నీట్-1 రాశారు. కాదూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి ఈ ఒక్కసారికి వెసు లుబాటు కల్పిస్తోంది- స్థానికంగా మెడికల్, డెంటల్ సీట్ల కోసం ఇదే చివరి అవకాశం రాసుకోండంటే ఎమ్సెట్-2 రాశారు. రాష్ట్ర విభజన కారణంగా అవకాశం కోల్పోవద్దని పొరుగు రాష్ట్రం ఏపీలో అక్కడి ఎమ్సెట్ రాశారు. యాజమాన్య-ఎన్ఆర్ఐ సీట్ల కోసం నీట్-2 రాశారు. వెరసి అయిదు పరీక్షలు రాసిన విద్యార్థులు, ఇప్పుడు ఎమ్సెట్-2 రద్దు చేస్తే ఆరోసారి ప్రవేశ పరీక్ష రాయాల్సి వస్తోంది. ఇదేం శిక్ష! పలు ఒత్తిళ్ల నడుమ పరీక్షలన్నీ ముగిశాయి, ఆశించిన ర్యాంకులొచ్చాయి, ఇక కౌన్సెలింగ్ ముగిసి మెడికల్ కాలేజీల్లో చేరడమే తరువాయి అనుకుంటుంటే, మళ్లీ పరీక్ష రాయాలంటే మాకెంత క్షోభ అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మానసిక ఒత్తిడిలో తిరిగి అవే ర్యాంకులు వస్తాయో? లేదో! తెలియదు. చేయని నేరానికి మాకెందుకీ శిక్ష అన్నది వారి ఆవేదన. ‘‘ఏపీ ఎమ్సెట్లో 199, తెలంగాణ ఎమ్సెట్-1లో 192, ఎమ్సెట్-2లో 44 ర్యాంకు వచ్చింది. స్థానికంగానే సీటు వస్తున్నపుడు ఏపీకెందుకులే అని కౌన్సెలింగ్కు వెళ్లకుండా ఆ సీటు వదు లుకున్నాను. ఇప్పుడు మళ్లీ పరీక్షంటే నా పరిస్థితి ఏంటో మీరే ఆలో చించండి’’ అంటున్న కరీంనగర్ విద్యార్థి సుష్మారెడ్డి ప్రశ్నకు సమాధానం చెప్పేవారు లేరు. ‘తప్పు జరిగింది నిజమే, అందుకు బాధ్యులైన వారిపై చర్యతో శిక్షించండి, లీకు పత్రాల ఆధారంగా ర్యాంకులు గడించిన వారి పేర్లు తొలగించి మిగిలిన వారికి కౌన్సెలింగ్ జరిపి సీట్లు భర్తీ చేయండ’నేది మంచి ర్యాంకులు తెచ్చుకున్న వారి ప్రతిపాదన. గతంలోనూ ఈ పద్ధతి అనుసరిం చారు. లీక్తో లబ్ధిపొందిన విద్యార్థులు పరిమిత సంఖ్యలో ఉండి, వారెవరో విస్పష్టంగా తెలిసినపుడు ఆ పేర్లు తొలగించి మిగిలినవారికి కౌన్సెలింగ్ జరి పారు. ప్రస్తుత కుంభకోణంలో డబ్బుకట్టి ప్రశ్నపత్రం పొంది లబ్ధిదారులైన విద్యార్థులెందరో కచ్చితంగా తెలియటం లేదు. దర్యాప్తు ఇంకా కొనసాగు తూనే ఉంది. బుధవారం మధ్యాహ్నానికి 30 అన్న ఈ విద్యార్థుల సంఖ్య సాయంత్రానికి 72 మందికి, గురువారం సదరు ఆ సంఖ్య 76కి చేరింది. ఇంకా పెరగదనే గ్యారంటీ ఏం లేదు! అలాంటప్పుడు, ఎన్ని పేర్లు తొలగించి కౌన్సెలింగ్ జరపాలి? అలా జరిపాక, అయిదు, పది ర్యాంకుల తేడాతో సీట్లు కోల్పోయిన వారు, లీకేజీ వల్లే తమకు అన్యాయం జరిగిందనొచ్చు. లీక్తో లబ్ధి పొందిన వారందర్నీ సీఐడీ సరిగ్గా గుర్తించి ఏరివేస్తే తమకు సీటు తప్పక లభించేదనే వాదనతో కొందరైనా కోర్టుల్ని సంప్రదించే ఆస్కారముంది. పబ్లిక్ ఎగ్జామ్స్, ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ చట్టం-1987 ప్రకారం న్యాయ స్థానం సానుకూలంగా స్పందించొచ్చు. అప్పుడేంటి పరిష్కారం? నిందితులకు లబ్ధి, నిరపరాధులకు శిక్షా?? ఇప్పటికిప్పుడు ఎమ్సెట్-2 రద్దు చేసి మరో ఎమ్సెట్ నిర్వహిస్తే లాభ మెవరికి? స్వయం ప్రతిభతో మెరుగైన ర్యాంకులు తెచ్చుకున్న వారి సంగ తేంటి? కుట్రతో, కుంభకోణంతో ఏ మాత్రం సంబంధం లేని వారందరికీ ఇది శిక్షే! బిహార్ 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఒకటి రెండు వాక్యాలు కూడా రాయలేని వారు ర్యాంకర్లుగా నిలిచారు. వారి అరెస్టు వివాదాస్పదమైంది. కుంభకోణం బాధ్యులైన దళారులు, అధికారులు, రాజకీయనేతల్ని వదిలిపెట్టి విద్యార్థుల్ని బలిపెట్టడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న తలెత్తింది. అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి ఉపేంద్ర కుశ్వా హానే ఈ ప్రశ్న లేవనెత్తారు. ప్రస్తుత కుంభకోణంలో కోచింగ్ సెంటర్లూ పాత్రధారులే అంటున్నారు. మళ్లీ ఎమ్సెట్ అంటే కనీసం 40 రోజుల వ్యవధి కావాలంటున్నారు. కనుక, కోచింగ్ సంస్థలు తిరిగి బోర్డులు పెడతాయి, స్వల్ప వ్యవధిలోనూ బోలెడంత సొమ్ము చేసుకుంటాయి. పదహారేళ్లుగా ఈ కళలో ఆరితేరిన రాజగోపాల్ వంటి వారికి మరో అవకాశం. డబ్బుకు కక్కుర్తి పడే పలుకుబడి కలిగినవారు ఇప్పటికే ఆయన్ని, ఆయన సహాయకుల్ని బెయిల్పై విడిపించే ప్రయత్నాల్లోనూ ఉండి ఉంటారు. 2006 నుంచి వరు సగా అనేక ప్రశ్నపత్రాల లీకుల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఈ నేరగాడు, అతని బృందం ఎమ్సెట్-3 లీక్ చేయదన్న భరోసా ఏమీలేదు. అందుకు అధికార వ్యవస్థా సహకరించింది. జేఎన్టీయూలో ఎవరో దొంగలు లేకుండా ప్రింటింగ్ ప్రెస్ గురించి లీకువీరులకు తెలిసే ఆస్కారమే లేదు. ‘అవును సార్, ప్రశ్న పత్రం లీకై గందరగోళం జరిగింది.. మమ్మల్ని మళ్లీ పరీక్ష రాయమంటు న్నారు. సరే! రాస్తాం, రేపు అదీ లీకు కాదనే గ్యారెంటీ ఏంటి?’ అని ఉబికి వస్తున్న కన్నీళ్లతో మీడియాను అడిగిన వరంగల్ విద్యార్థిని ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. నిజమే! లీకైనా అవొచ్చు! గతంలో తప్పు చేసిన వాళ్లే మళ్లీ చేశారు. సమస్య మూలాలకెందుకు వెళ్లరు? వైద్య విధాన పరిషత్ నిర్వహించిన మెడికల్ పీజీ ప్రవేశ పరీక్ష, 2014 ప్రశ్న పత్రం లీకేజీలోనూ రాజగోపాల్ నిందితుడు. అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. ‘మొన్నటి ఎమ్సెట్-1 కూడా లీక్ చేశాను, ఎవరికీ అనుమానం రాలేదు, విషయం బయటపడలేద’ని విచారణ సందర్భంగా అతనే అంగీ కరించాడు. అంతకు ముందే, కర్ణాటకలో మూడు లీకేజీ కేసుల్లో ఆయన నింది తుడు. మళ్లీ చేశాడు. అనుమానం రాకుండా ప్రశ్నపత్రం లీక్ చేయడంలో, ప్రశ్నలు కొనుక్కునే విద్యార్థుల ఎంపికలో, తలిదండ్రుల సంప్రదింపుల్లో, కాల్ డేటా భద్రత విషయంలో, డబ్బు వసూళ్లలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో తెలిసి దర్యాప్తు అధికారులే ఆశ్చర్యపోతున్నారు. వ్యవస్థను కొల్లగొడుతున్న వాడిలో సగం జాగ్రత్తలు... ప్రజాధనం నుంచి జీతాలు పొందే మన ఎమ్సెట్ నిర్వాహకులు తీసుకున్నా ఈ లీక్ జరక్కపోయేది. ఇప్పుడింత తతంగం బయటపడి, గగ్గోలు లేపుతున్న ఈ వ్యవహారం మన భద్రత, దర్యాప్తు వ్యవస్థ స్వయంగా పొడిచి సాధించిన ఘనకార్యమేం కాదు! ఎవరో రవి అనే సివిల్ ఇంజనీర్ తన కూతురి చదువు పట్ల ఉన్న శ్రద్ధతో, ఆమె కన్నా తక్కువ తెలివి తేటలున్న విద్యార్థులకు అసాధారణ ర్యాంకులు వచ్చినపుడు... ఓ సందేహం, ఒక లాజిక్ ఆధారంగా జరిపిన పరిశీలనలో తీగ దొరికింది. ఆయన కథనంతో మేల్కొన్న మన దర్యాప్తు సంస్థ లాగితే ఈ డొంకంతా కదిలింది. ఆ రవికే సందేహం కలిగి ఉండకపోతే! చొరవ తీసుకొని నాలుగడుగులు ముందుకేయ కుంటే.... ఏమీ జరగనట్టే, కౌన్సెలింగ్తో సహా అంతా నిక్షేపంగా జరిగిపో యేది. ఓ విద్యార్థి తలిదండ్రులు 60, 70 లక్షల రూపాయలిచ్చి, లీకైన ప్రశ్న పత్రంతో తమ పిల్లల్ని గట్టెక్కించాలని ఎందుకు అర్రులు చాస్తున్నారు? ప్రభుత్వ పెద్దలకు ఈ ప్రశ్న తలెత్తదా? మెడికల్ విద్య అంత ఖరీదు ఎందు కయింది? అసాధారణ ప్రతిభ గల విద్యార్థి కాకపోతే, తమ పిల్లల్ని కోటి రూపాలు వెచ్చిస్తే గాని ఎమ్బీబీఎస్లో చేర్పించలేని దుస్థితి ఈరోజు తల్లిదం డ్రులెదుర్కొంటున్నారు. దీనికి కారణాలేంటి? ప్రభుత్వ రంగంలో సీట్లు తగ్గి, ప్రయివేటు రంగంలో ఎందుకు పెరుగుతున్నాయి? యాజమాన్యాలు ఇష్ట మైన ధరకు యథేచ్ఛగా మెడిసిన్ సీట్లు అమ్ముకునే మాయా అంగడిని ఎవరు-ఎందుకు సృష్టించారు? డాక్టరవాలనే విద్యార్థుల ఆకాంక్ష, తల్లిదం డ్రుల తపనను సొమ్ము చేసుకుంటున్న కోచింగ్ సెంటర్లు కోట్లలో, వైద్య కళాశాలలు వందల కోట్లలో వ్యాపారాలు చేస్తున్న సంగతి ఎవరికి తెలియదు? ప్రభుత్వం సమగ్ర యోచనతో ఈ సమస్యకు పరిష్కారం చూడాలి. పటిష్ట వ్యవస్థే పరిష్కారం గత అనుభవాల్ని పరిగణనలోకి తీసుకొని లీక్లకు ఆస్కారం లేని పటిష్ట పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న కర్తవ్యం. 1996లో ఎస్వీ యూనివర్శిటీ ఎమ్సెట్ నిర్వహించినపుడు ప్రశ్న పత్రం లీకయింది. 1998లో ఇంటర్ పత్రాలు టోక్ పద్ధతిన లీకయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్-2 నిర్వహిస్తుంటే, డెహ్రాడూన్లో పరీక్ష పేపర్ల లీక్కు యత్నాలు జరిగాయి. ఇలాంటి లీకులు తరచూ జరుగుతు న్నాయి. బయటపడేది కొన్నే, సాక్ష్యాధారాలు లేవంటూ ఆయా కేసుల్లో నేర గాళ్లకు శిక్షలు పడలేదు, నిర్లక్ష్యపు ప్రభుత్వాలు పాఠాలు నేర్వలేదు. ఒకే విశ్వవిద్యాలయం పదే పదే పరీక్షలెందుకు నిర్వహించాలి? ఒకరే కన్వీనర్గా ఎందుకు వ్యవహరించాలి? ఎవరెవరి పాత్ర ఏమిటి? సమాధానాలు సమ కూర్చడంతో సహా ఫ్యాకల్టీ లీకు దొంగలకెలా సహకరించింది? ఇవన్నింటినీ పకడ్బందీగా ఆరా తీయాలి. కారకులకు కఠిన శిక్షలు పడాలి. భవిష్యత్తులో ప్రవేశ పరీక్షల్ని లోపరహితంగా నిర్వహించాలి. బిట్స్ పిలానీలా ఆన్లైన్లో జరి పించినా ఎదుర్కొనేందుకు మన విద్యార్థులు సిద్ధం. పలు ఖండాల్లో నిర్వ హించే ‘జీఆర్ఈ’ ‘టోఫెల్’ వంటి పరీక్షల్లో ఈ లోపాలెందుకు తలెత్తవు? నేతిబీరలో నేయి కాదు నైతికత ప్రత్యక్షంగా పరోక్షంగా విద్యార్థులకు విధిస్తున్న శిక్ష సంగతెలా ఉన్నా, ఇంత ఘోరమైన నిర్వహణా వైఫల్యం జరిగినపుడు ప్రభుత్వం బాధ్యత వహిం చదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ వస్తోంది. సీఎం ఎలా స్పందిస్తారో చూడా లనే ఉత్కంఠ జనాల్లో ఉంది. ఇంటర్ పరీక్షల ప్రశ్నపత్రం లీకైనందుకు మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అంతకుముందు, పదోతరగతి పరీక్షాపత్రాలు లీక య్యాయనే కారణంగా నాటి సీఎం ఎన్టీఆర్ మంత్రి చిక్కాల రామచంద్ర రావును మంత్రివర్గం నుంచి తప్పించారు. నైతిక బాధ్యత అంటే, లేకున్నా ఉన్నట్టు భ్రమపడే దేవతా వస్త్రాలనుకుంటే చెప్పగలిగేదేమీ ఉండదు. బయ టకు కనబడకపోయినా ఉండే చంద్రమతి మాంగల్యం లాంటిదనుకుంటేనే ప్రభుత్వాలు స్పందిస్తాయి, స్పందించాలి. రైలు దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ లాల్బహదూర్ శాస్త్రి రాజీనామా చేయడం, స్వయంగా ఆ దుర్ఘటన ఆయనే చేశారని కాదు. పోనీ, ఆయనలా రాజీనామా చేసిన తర్వాత రైలు ప్రమాదాలే జరుగవనే పూచీకత్తూ కాదు. అదీ, నైతిక బాధ్యత అంటే! వ్యాసకర్త: ఆర్. దిలీప్ రెడ్డి ఈమెయిల్:dileepreddy@sakshi.com -
‘టైమంతా కెమిస్ట్రీకే సరిపోయింది’
సాక్షి, హైదరాబాద్: ‘కెమిస్ట్రీలో సమస్యాపూరక ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడం, వాటికే ఎక్కువ సమయం పట్టింది.. ఫిజిక్స్లో అన్వయ సంబంధ అంశాలపై ప్రశ్నలు వచ్చాయి... బయాలజీలో తికమక పెట్టేలా ప్రశ్నలు ఉన్నాయి. వీటిన్నిటితో వాటికే ఎక్కువ సమయం అయిపోయింది..’. ఇది శనివారం నిర్వహించిన ఎంసెట్-2కు హాజరైన విద్యార్థుల మనోగతం. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన ఎంసెట్-2 పరీక్షకు 90.76 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ప్రశ్నల విషయంలో చూస్తే.. సిలబస్ ప్రకారమే ప్రశ్నలు వచ్చాయని, తెలుగు అకాడమీ పుస్తకాల్లోని ప్రశ్నలనే ఇచ్చారని సబ్జెక్టు నిఫుణలు వెల్లడించారు. ప్రశ్నల్లో తప్పులేమీ లేవని పేర్కొన్నారు. అయితే ఈ ప్రశ్నలకు ప్రతిభావంతులైన విద్యార్థులే వేగంగా జవాబులను గుర్తించి రాయగలిగేలా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక పరీక్ష ప్రాథమిక కీని శనివారం సాయంత్రం ఎంసెట్ కమిటీ విడుదల చేసింది. దానిని ఎంసెట్-2 వెబ్సైట్లో (med.tseamcet.in) అందుబాటులో ఉంచింది. ఈ కీపై ఈనెల 12వ మధాహ్నం 2 గంటల వరకు అభ్యంతరాలను మెయిల్ ద్వారా (keyobjectionstseamcet2016@gmail.com) స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు వెల్లడించారు. ఇక ర్యాంకులను ఈనెల 14న ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదని, ఎలాంటి తప్పులు దొర్లలేదని పేర్కొన్నారు. పరీక్షకు ‘ఆర్’ సెట్ కోడ్ కలిగిన ప్రశ్నాపత్రాన్ని ఉదయం 6 గటలకు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి విడుదల చేశారు. -
రేపే ఎంసెట్-2
- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ - గంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతి - ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష - హాజరుకానున్న 56,188 మంది విద్యార్థులు - ఏపీ నుంచి 17,943 మంది హాజరు - ఈసారి ఓఎంఆర్ కార్బన్లెస్ జవాబుపత్రం అమలు - రేపే ప్రాథమిక కీ విడుదల - 12వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ.. -14న ర్యాంకుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్-2 పరీక్షను ఈనెల 9న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించే ఈ పరీక్షకు 56,188 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో తెలంగాణ నుంచి 38,245 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 17,943 మంది పరీక్ష రాయనున్నారు. తెలంగాణ, ఏపీల్లో కలిపి 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక విద్యార్థుల బయోమెట్రిక్ డాటా, డిజిటల్ ఫొటోలు సేకరించనున్న నేపథ్యంలో విద్యార్థులను గంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని ఎంసెట్-2 కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు వెల్లడించారు. పరీక్ష ప్రారంభ సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఎంసెట్-2 ప్రాథమిక కీ ని పరీక్ష రోజున సాయంత్రమే విడుదల చేస్తామని.. దానిపై 12వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని రమణరావు తెలిపారు. ర్యాంకులను 14వ తేదీన ప్రకటిస్తామన్నారు. ఇక మాల్ ప్రాక్టీస్ నిరోధానికి సమస్యాత్మక కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రూ.5 వేలు, రూ.10 వేలు ఆలస్య రుసుము చెల్లించి దరఖాస్తు చేసిన వారిపై, మళ్లీ మళ్లీ ఎంసెట్ రాస్తున్న అభ్యర్థులకు సంబంధించి వారెందుకు పరీక్షకు హాజరవుతున్నారన్న దానిపై పోలీసు విచారణ చేయిస్తున్నట్లు తెలిపారు. 1970 నుంచి 1994 మధ్య జన్మించిన వారు, గతంలో ఎంసెట్ రాసి, మెడిసిన్ చదువుతూ మళ్లీ ఎంసెట్కు దరఖాస్తు చేసిన వారి వివరాలను కూడా పోలీసు శాఖకు అందజేశామన్నారు. ఇక ఎంసెట్-2 రాసేందుకు 609 మంది విద్యార్థులు ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసిన వారు 406 మంది, రూ.1,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసిన వారు 144 మంది, రూ.5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసిన వారు 30 మంది, రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసిన వారు 29 మంది ఉన్నారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి - పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. - పరీక్షహాల్ నుంచి పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు వెళ్లనీయరు. - బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో పరీక్ష రాయాలి. - విద్యార్థులు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారంపై కలర్ ఫొటోను అంటించాలి. ఆ దరఖాస్తు ఫారాన్ని పరీక్ష హాల్లో అందజేయాలి. - ఈసారి ప్రశ్నలతోపాటు జవాబుల ఆప్షన్లలో కూడా జంబ్లింగ్ అమలు చేస్తున్నారు. - మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, గణిత సంబంధ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు. - ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. - ఈసారి పరీక్ష పూర్తవగానే ఓఎంఆర్ జవాబు పత్రం కింద ఉండే కార్బన్లెస్ జవాబుల కాపీని విద్యార్థులకు ఇస్తారు.