-
డూప్లి 'కేటుగాళ్లు'
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలోని పాయకాపురంలో గీత అనే మహిళ పేరిట ఆస్తికి సంబంధించిన ఓ డాక్యుమెంట్ ఉంది. దీనిని గుర్తించిన కేటుగాళ్లు అదే ప్రాంతంలో నివశిస్తున్న విజయలక్ష్మి పేరును ఆధార్ కార్డులో గీతగా మార్పించి.. రూ.12 లక్షల విలువైన ఇంటిస్థలాన్ని ఇతరులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించారు. భవానీపురంలో మేర కోటేశ్వరరావు అనే వ్యక్తి రిజిస్ట్రార్ కార్యాలయంలో లభ్యం కాని డాక్యుమెంట్లను గుర్తించి.. వాటిని వేరే వారి పేరుతో ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశాడు. సదరు ఆస్తులను తన కొడుకు శ్రీనివాసులు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. కొందరు లేఖరుల సాయంతో దర్జాగా సాగిపోతున్న దందాలు విశాఖపట్నంలో లాగిన తీగతో విజయవాడలో వెలుగులోకి వచ్చాయి. ఇలా బయటపడింది.. విశాఖపట్నానికి చెందిన ఎన్.వెంకటేశ్వరావు అనే వ్యక్తి తన స్థలానికి సంబంధించి ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) కోసం దరఖాస్తు చేయగా.. తన స్థలాన్ని ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి రాజు చైతన్య అనే వ్యక్తికి విజయవాడలోని గాంధీనగర్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో తనఖా రిజిస్ట్రేషన్ చేసినట్టు వచ్చింది. దీంతో వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా మొత్తం డొంక కదిలింది. ఈ ఫిర్యాదుతో మేల్కొన్న సబ్ రిజిస్ట్రార్లు తెలివిగా వ్యవహరించి నిందితుడిని పిలిపించి, రిజిస్ట్రేషన్ రద్దు చేయించారు. తిరిగి అతనిపైనే గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని నకిలీ డాక్యుమెంట్లను ఎలా తయారు చేస్తున్నారు, దీనికి సహకరిస్తున్న వ్యక్తులెవరనేది కూపీ లాగుతున్నారు. కాగా, ప్రస్తుతం గుణదలకు చెందిన రాజుచైతన్య పోలీసుల అదుపులో ఉన్నాడు. అతనికి ముగ్గురు వ్యక్తులతో కూడిన బృందం సహకరిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించారు. దొంగ రిజిస్ట్రేషన్లు ఇలా.. ప్రధానంగా ఆధార్ కార్డులో పేరు మార్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఆధార్ కార్డుల మార్పిడి ఇందిరాగాం«ధీ స్టేడియం సమీపంలో సాగుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఒరిజనల్ రికార్డుల మాదిరి డాక్యుమెంట్లు సృష్టించడంలో నిష్ణాతులు ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా హత్యానంతర పరిణామాలతో సబ్రిజిస్ట్రార్ కార్యాలయ రికార్డులు దగ్ధమయ్యాయి. దీంతో కొందరు కేటుగాళ్లు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో తరచూ కొన్ని ఆస్తులకు సంబంధించిన ఒరిజనల్ డాక్యుమెంట్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఆ డాక్యుమెంట్ లేకపోతే సంబంధిత సిబ్బంది ‘నాట్ ఫౌండ్’ అని సమాచారమిస్తారు. దీంతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన మేర కోటేశ్వరావు అనే వ్యక్తితో కూడిన బృందం ఆరితేరినట్టు గుర్తించారు. కోటేశ్వరరావు విజయవాడలోని దేవీపేటలో నివాసం ఉంటున్నట్టు గుర్తించారు. ఈ తరహాలో ఇప్పటికే నున్న, గాంధీనగర్, మైలవరం, గుణదల, పటమట, మైలవరం సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నకిలీ డాక్యుమెంట్లతో పలు రిజిస్ట్రేషన్లు జరిగినట్టు సమాచారం. నున్న ప్రాంతంలో రెవెన్యూ శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి ఫేక్ డాక్యుమెంట్ల తయారీకి సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీరికి ప్రధానంగా కొంతమంది రెవెన్యూ సిబ్బంది, దస్తావేజు లేఖరులు, సబ్రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, కొందరు సబ్రిజిస్ట్రార్లు సైతం సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకులకు 3,316 కోట్ల ఎగవేత
సాక్షి, హైదరాబాద్: నకిలీ పత్రాలు సృష్టించి జాతీయ బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు తీసుకొని చెల్లించకుండా మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉప్పలపాటి హిమబిందును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్ (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయింది), కార్పొరేషన్ బ్యాంక్ల కన్సార్షియం నుంచి వీఎంసీ డైరెక్టర్లు భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు. కానీ తిరిగి చెల్లించకపోవడంతో.. ఇప్పుడు బకాయిల మొత్తం ఏకంగా రూ. 3,316 కోట్లకు చేరింది. దీనితో కన్సార్షియం బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. భారీ మొత్తంలో రుణాలు తీసుకోవడానికి వీఎంసీ డైరెక్టర్లు నకిలీ పత్రాలు సృష్టించారని తెలిపాయి. ఈ నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఆ సమయంలోనే తమకు బీఎస్ఎన్ఎల్ లిమిటెడ్ నుంచి రూ.262 కోట్ల మేరకు బకాయిలు రావాల్సి ఉందని, ఆ డబ్బులు వచ్చిన తర్వాత రుణాలు చెల్లిస్తామని డైరెక్టర్లు నమ్మబలికారు. అయితే వీఎంసీకి బీఎస్ఎన్ఎల్ నుంచి రావాల్సిన మొత్తం రూ.33 కోట్లు మాత్రమేనని తేలింది. ఈ క్రమంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గత నెల 20వ తేదీన వి.హిమబిందు, వి.సతీష్, వి.మాధవి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పత్రాలు, 40 ఎక్సటర్నల్ హార్డ్ డిస్క్ల్లో నిక్షిప్తమైన డిజిటల్ డేటాతో పాటు, ఆరు మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా వీఎంసీ సంస్థ కన్సార్షియం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను అనుబంధ సంస్థలకు తరలించినట్లు ఆడిట్ నివేదికల్లో బయటపడిందని ఈడీ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. బీఎస్ఎన్ఎల్ నుంచి టెండర్లు దక్కించుకోవడంలో పీఐఎస్ఎల్ అనే సంస్థకు ఎలాంటి పాత్ర లేకపోయినా మూడు శాతం కమీషన్ను వీఎంసీఎల్ చెల్లించినట్లు తేలిందని వివరించింది. పీవోఎంఎల్ కోర్టులో హాజరు హిమబిందు రూ.692 కోట్ల మేరకు డమ్మీ లెటర్ ఆఫ్ క్రెడిట్ లు (ఎల్వోసీ) సృష్టించినట్లు ఈడీ పేర్కొంది. విదేశాల్లో త మ బంధువులు నడిపిస్తున్న సంస్థలకు పెద్ద మొత్తంలో నిధు లు మళ్లించినట్లు తెలిపింది. దర్యాప్తునకు సహకరించ లేదని, విదేశీ లావాదేవీల గురించి అవాస్తవాలు చెబుతున్న నేపథ్యం లో ఆమెను అరెస్టు చేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ కోర్టు లో హాజరుపర్చినట్లు ఈడీ తెలిపింది. కోర్టు ఈనెల 18వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్కు ఆదేశించినట్లు వివరించింది. -
రూ.311 కోట్లకు బురిడీ
భీమవరం: బ్యాంకులకు నకిలీపత్రాలు చూపించి రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు వేల కోట్లు స్వాహా చేసే సంఘటనలే మనం చూస్తున్నాం. ఈ జాడ్యం నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా ఐడీబీఐ బ్యాంకును ఎంచుకుని చేపలు, రొయ్యల చెరువుల సాగు పేరుతో రూ.311 కోట్లు నకిలీ పత్రాల ద్వారా కొట్టేశారు కొందరు మోసగాళ్లు. 2018 మార్చిలో 16 మందిపై కేసు నమోదైంది. రుణాలు చెల్లించకపోగా వారి చిరునామాలే దొరక్కపోవడంతో బురిడీ బాగోతం వెలుగుచూసింది. భీమవరం ఐడీబీఐ బ్యాంకు బ్రాంచి ద్వారా రాజమండ్రి ఐడీబీఐ కార్యాలయం కూడా ఈ రుణాల మంజూరులో కీలకపాత్ర పోషించినట్లు చెబుతున్నారు. రుణాలు పొందిన వారికి అప్పటి బ్యాంకు అధికారులు కొంతమంది సహకారం అందించినట్లు సమాచారం. సీబీఐ దర్యాప్తు సందర్భంలో విషయాలు వెల్లడించకపోయినా భీమవరం లోని ఒక ఫ్యాన్సీ షాపు యజమాని ఈ రుణాల మంజూరుకు అప్పట్లో చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో ఉన్నతాధికా రులు ఆరా తీయడం ప్రారంభించారు. దీనికి అన్ని అర్హతలున్నా రుణం లభించని స్థానికులు కొందరు అక్రమ రుణాల విషయం ఉన్నతాధికారులకు చేరవేసినట్లు చెబుతున్నారు. రుణాలు పొందిన వారిలో భీమవరం, కాకినాడ, హైదరాబాద్, ఆకివీడు, విజయవాడ తదితర ప్రాంతాలకు చెందినవారుండడం విశేషం. కేసు బిగుస్తుందని తెలిసిన కొంతమంది రాజకీయ ప్రముఖులతో బేరసారాలు చేయించి కొంత మొత్తం చెల్లించగా ఇంకా పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయి. దీంతో సీబీఐ ఉచ్చు బిగించి బాకీదారుల ఆస్తుల స్వాధీనానికి, అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. నకిలీ పత్రాలు చూపించిన భూముల వివరాలను సీబీఐ అధికారులు జీఐఎస్ ట్రాకింగ్ ద్వారా కూపీ లాగితే మొత్తం భూములు కొల్లేరు ప్రాంతానికి చెందినవిగా గుర్తించినట్లు తెలిసింది. -
‘క్రిమినల్ చర్యలు ఎంతవరకు వచ్చాయి?’
సాక్షి, హైదరాబాద్: గుడి మల్కాపూర్లోని సర్వే నంబర్ 284/6లోని భూమికి కొన్ని నకిలీ పత్రాల ఆధారంగా ఎన్వోసీ జారీ చేసిన వ్యవహారంలో బాధ్యులపై శాఖాపరమైన చర్యలు ఎంతవరకు వచ్చాయో తెలపాలని హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. నకిలీ పత్రాలు సమర్పించిన వారిపై క్రిమినల్ చర్యలు ఎంతవరకు వచ్చాయో కూడా చెప్పాలంది. దీనికి సంబంధించి ఓ స్థాయీ నివేదికను తమ ముందుంచాలని న్యాయమూర్తులు జస్టిస్ రామసుబ్రమణియన్, జస్టిస్ కేశవరావుల ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను జూన్కి వాయిదా వేసింది. గుడిమల్కాపూర్లో తాను కొన్న 5,262 చదరపు గజాల స్థలానికి ఇతరుల పేరుతో ఎన్వోసీ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ శాంతి అగర్వాల్ అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి, ఎన్వోసీ జారీ నిబంధనలకు అనుగుణంగా జరగలేదని తేల్చారు. ఎన్వోసీ జారీ కమిటీ చైర్మన్గా ఉన్న నవీన్ మిట్టల్, సభ్యులైన జాయింట్ కలెక్టర్ దుర్గాదాస్ తదితరులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. నకిలీ పత్రాలు ఇచ్చిన సయ్యద్ అబ్దుల్ రబ్ తదితరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై ధర్మాసనం విచారణ జరిపింది. -
స్కూలు స్థలం... సొంత‘లాభం’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు యత్నించే వాళ్లను తరచూ చూస్తుంటాం. అయితే రెండు కంపెనీలకు చెందిన వారు మాత్రం ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని తనఖా పెట్టి రూ.4 కోట్లు ‘లాభం’ పొందారు. ఆ స్థలంపై నకిలీ పత్రాలను సృష్టించి వాటి ఆధారంగా మహారాష్ట్ర బ్యాంకు కు టోకరా వేశారు. ఈ రెండు సంస్థలూ ఒకే ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని దర్జాగా తనఖా పెట్టడం విశేషం. వాయిదాల చెల్లింపులు నిలచిపోవడంతో విషయం గుర్తించిన బ్యాంకు అధికారులు రెవెన్యూ, నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసుల్ని ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. దీనిపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ క్రాస్రోడ్స్ సమీపంలో ఉన్న గోల్కొండ క్రాస్రోడ్స్ చిరునామాతో బేకీస్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉంది. దీనికి పి.నారాయణ మేనేజింగ్ డైరెక్టర్, రాయపూడి రమాదేవి డైరెక్టర్గా ఉన్నారు. వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం రుణం కోసం ఖైరతాబాద్లోని మహారాష్ట్ర బ్యాంకును ఆశ్రయించారు. దీనికోసం హామీగా బీకే గూడలోని సర్వే నెం.155లో 500 గజాల విస్తీర్ణంలో ఇల్లు ఉన్నట్లు, అది తమ కంపెనీకి చెందినదేనని.. చూపే రిజిస్ట్రేషన్ సేల్డీడ్ను (నెం.435/2013) చూపించారు. దీని ఆధారంగా ఆ ఆస్తిని తనఖా పెడుతూ 2013 ఫిబ్రవరిలో రూ. 2 కోట్ల రుణం తీసుకున్నారు. మరో వ్యవహారం కూడా... బేకీస్ ఫుడ్స్ బాటలోనే... అన్నా ఇకో లాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ఇలాంటి వ్యవహారమే నడిపింది. ఈ సంస్థ శానిటరీ నాప్కిన్స్, మెటర్నిటీ ప్యాడ్స్ తదితరాలు తయారు చేసి అమ్ముతుంది. వీటితో పాటు నేచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, క్రైసెస్ మేనేజ్మెంట్, ఉమెన్ ఎన్పవర్మెంట్, చిల్డ్రన్ డెవలప్మెంట్ తదితర కార్యక్రమాలు చేపడుతుంటుంది. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే అనేక స్వచ్ఛంద సంస్థలతో సంబంధాలు పెట్టుకుంది. దీని డైరెక్టర్లు జి.శ్రీకర్, వై.వెంకటేశ్లు రుణం పొందాలని భావించారు. వీరూ ఖైరతాబాద్లోని మహారాష్ట్ర బ్యాంకు శాఖనే ఆశ్రయించారు. ఎస్ఆర్నగర్ బీకేగూడలో 500 గజా ల స్థలంలో ఉన్న ఇల్లు తమదేనంటూ అందుకు చెంది న డాక్యుమెంట్స్ (నెం.437/13) దాఖలు చేశారు. దీన్ని తనఖా పెట్టి ప్యానల్ అడ్వకేట్తో న్యాయ సలహా కోసం బ్యాంకునకు అందించారు. దీంతో బ్యాంకు వారికీ 2013లో ఫిబ్రవరిలోనే రూ.2 కోట్లు మంజూరు చేసింది. రూ.4 కోట్ల రుణం పొందిన రెండు సంస్థలూ వాయిదాలు చెల్లించకపోవడంతో నిబంధనల ప్రకారం తనఖా పెట్టిన ఆస్తిని వేలం వేసే ప్రక్రియను అధికారులు మొదలు పెట్టారు. ఈ క్రమంలో రుణం తీసుకున్న వారు తమ బ్యాంకులో తనఖా పెట్టిన డాక్యుమెంట్ల వివరాలతో అమీర్పేట తహసీల్దార్కు లేఖ రాశారు. ఆ ఆస్తులకు చెందిన పూర్తి రికార్డులు కోరుతూ డీమార్క్ చేయాలని అభ్యర్థించారు. ఈ రెండు కంపెనీలు బ్యాంకునకు తనఖా పెట్టిన ఆస్తుల పత్రాలను పరిశీలించిన రెవెన్యూ అధికారులు ఆయా సర్వే నంబర్లలోని స్థలాలు రహమాన్ మంజిల్ ప్రభుత్వ పాఠశాలతో పాటు, సయ్యద్ పటేల్ భాషాలకు చెందిన స్థలాలుగా రికార్డులో ఉన్నాయని బ్యాంకుకు తెలిపారు. దీంతో నకిలీ పత్రాలతో బ్యాంకును మోసం చేశారని గుర్తించిన బ్యాంకు జోనల్ మేనేజర్ సీసీఎస్ పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. కేసులు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement