డాక్టర్ కవితగా..!
‘‘నేను సీరియల్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, అనుకోనివి జరగడమే జీవితం’’ అని అక్కినేని అమల అన్నారు. ప్రస్తుతం ఆమె చెన్నయ్లో ఉన్నారు. తమిళ ధారావాహిక ‘ఉయిర్మెయ్’లో నటిస్తూ బిజీగా ఉన్నారు. నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు ఫుల్స్టాప్ పెట్టేసి, ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ బ్లూ క్రాస్ కార్యకలాపాలు చూసుకుంటూ గడిపేవారు అమల. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ద్వారా, ఇరవయ్యేళ్ల విరామం తర్వాత వెండితెరపై మెరిశారామె.
అయితే ఆ సినిమా విడుదలై రెండేళ్లవుతోంది కానీ, వేరే సినిమాలేవీ అమల అంగీకరించలేదు. కానీ, ‘ఉయిర్మెయ్’ ధారావాహికను మాత్రమే అంగీకరించి, ఆ సీరియ్ల్లో నటించడానికి గల కారణాన్ని అమల చెబుతూ -‘‘ఈ కథ, కథనం చాలా బాగున్నాయి. పైగా ప్రతి ఎపిసోడ్లోనూ ప్రేక్షకులను ఆలోచింపజేసే మంచి సందేశం ఉంది. అందుకే చేస్తున్నా. ఇందులో నా పాత్ర పేరు డాక్టర్ కవిత. ఎమర్జెన్సీ కేర్కి హెడ్ని అన్నమాట.
కేవలం మందుల వల్ల మాత్రమే అనారోగ్యం దూరం కాదని, రోగి పట్ల ప్రేమాభిమానాలు కనబర్చడం కూడా ముఖ్యం అని నా పాత్ర చెబుతుంది’’ అన్నారు. గత నెల 18న ఈ ధారావాహిక ప్రసారం ఆరంభమైంది. తమిళ చిత్రం ‘మైథిలీ ఎన్నయ్ కాదలి’ ద్వారానే అమల కథానాయికగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత, ‘మెల్ల తిరందదు కదవు’, ‘వేలైక్కారన్’, ‘వేదం పుదిదు’, ‘సత్య’... ఇలా పలు చిత్రాల్లో నటించారామె. ఆ విధంగా తమిళనాడులో బోల్డంత మంది అభిమానులను సంపాదించుకున్నారు అమల. వాళ్లందరికీ అమల మళ్లీ తెరపై కనిపించడం ఆనందంగా ఉంది.