breaking news
Division of districts
-
జిల్లా.. ఎలా?
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఓ వైపు ముంచుకొస్తున్న జనాభా లెక్కల ప్రారంభ గడువు.. అది పూర్తి కాగానే శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన.. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న జిల్లాల భౌగోళిక సరిహద్దుల్లో చేర్పులు మార్పులు చర్చనీయాంశమవుతున్నాయి. మార్పులు, చేర్పులు అవసరమైతే ఈ ఏడాది డిసెంబర్ 31లోగా మొత్తం ప్రక్రియను ముగించాలంటూ కేంద్ర ప్రభుత్వం గడువు పెట్టగా..దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో 2016 – 19లలో ఏర్పాటైన కొత్త జిల్లాల కూర్పుపై భిన్నవాదనలు వినిపిస్తుండటంతో ప్రస్తుతం ఉన్నవాటిని యథాతథంగా కొనసాగించటమా? లేక ఒక శాసనసభ నియోజకవర్గం ఒకే జిల్లా పరిధిలోకి వచ్చే విధంగా మార్పులు చేర్పులు చేయటమా? అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, ఇప్పటివరకు ఏమీ తేల్చలేకపోతోంది. ఒక వేళ జిల్లాలను యథాతథంగా ఉంచి జనాభా లెక్కలకు వెళితే.. వచ్చే నియోజకవర్గాల పునర్విభజనను కూడా ప్రస్తుత జిల్లా యూనిట్గానే చేయాల్సి ఉంటుంది. అయితే నేల స్వభావాలు, పర్యావరణం, పంటలు, ఉమ్మడి సంస్కృతి, భాష, యాస, అన్నింటికంటే ముఖ్యంగా ఏకరీతి మానసిక స్థితి.సామాజిక శక్తుల పొందికతో పాటు జీవన శైలి, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, కట్టుబొట్టు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాల ఏర్పాటు చేయాల్సి ఉన్నా..గతంలో కొన్నిచోట్ల వాటిని పాటించలేదన్న అసంతృప్తి ఉంది. ఒక్కప్పుడు రాజధానిగా వెలిగిన వరంగల్ను కూడా అశాస్త్రీయంగా విభజించారని చెబుతూ..ఉమ్మడి వరంగల్ కింద ఉన్న జిల్లాలన్నిటినీ మళ్లీ ఒక్కటి చేయాలన్న డిమాండ్తో ఇటీవల ఏర్పడిన జేఏసీ ఉద్యమ కార్యాచరణకు పిలుపునివ్వడం గమనార్హం. సౌలభ్యం కోసమే అయినా.. కొత్త జిల్లాల ఏర్పాటు.. వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలనను మెరుగుపరచడం, పరిపాలనా సౌలభ్యాన్ని పెంచడం కోసమే జరిగినా, ప్రస్తుతం రాష్ట్రంలో పలు శాసనసభ నియోజకవర్గాలు మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఏ జిల్లా యంత్రాంగానికి పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉండటం లేదు. ఉదాహరణకు పాలకుర్తి నియోజకవర్గం మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాల పరిధిలో ఉండగా, హుస్నాబాద్ నియోజకవర్గం సిద్దిపేట, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల పరిధిలో ఉంది. ఇల్లందు నియోజకవర్గం ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. గిరిజన జనాభా అధికంగా ఉన్న ఖానాపూర్ నియోజకవర్గం సైతం మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో వ్యాపించి ఉంది. తుంగతుర్తి నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో ఉంది. అలాగే చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాలు సైతం మూడేసి జిల్లాల్లో ఉన్నాయి. దీంతో సమాంతర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సమీక్షలకు పలు అడ్డంకులు ఏర్పడుతున్నాయని ఎంపీలు, ఎమ్మెల్యేలు అంటున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో ఉన్న ప్రభుత్వం, జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ఎలాంటి నిర్ణయానికీ రాలేకపోతోంది. ఇదీ జిల్లాల ఏర్పాటు చరిత్ర కుతుబ్షాహీలు మొదలుకుని ఆసఫ్ జాహీల వరకు పరిపాలనా సౌలభ్యం కోసం సర్కార్లు, సుభాలుగా కొనసాగిన ప్రాంతాలను 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన సమయంలోనే.. హైదరాబాద్ స్టేట్లో తెలుగు మాట్లాడే ప్రాంతాలను తెలంగాణలో, మరాఠి మాట్లాడే వారిని బొంబాయి రాష్ట్రంలో, కన్నడ మాట్లాడే వారిని సమీప కన్నడ జిల్లాల్లో విలీనం చేశారు. దశాబ్దాల పాటు తెలంగాణలో 9 జిల్లాలు కొనసాగగా 1978లో కొత్తగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటైంది. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం 2016లో కొత్తగా మరో 21 జిల్లాలు, 2019లో మరో 2 జిల్లాలు ఏర్పాటు చేయటంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య మొత్తం 33కు చేరింది. 1956 తొలి పునర్విభజన – జిల్లాలు ఇలా: హైదరాబాద్ప్రస్తుతం ఉన్న ప్రాంతాలతో పాటు గుల్బర్గా (ప్రస్తుత కర్ణాటకలో) నుండి తాండూరు, మెదక్లోని వికారాబాద్, మహబూబ్నగర్లోని పరిగి ప్రాంతాలను కలిపి హైదరాబాద్ జిల్లాను పునర్వ్యవస్థీకరించారు. 2016 విభజనలో హైదరాబాద్ జిల్లాను యథావిధిగా ఉంచారు. మహబూబ్నగర్పది తాలూకాలతో ఉన్న మహబూబ్నగర్ జిల్లాకు అదనంగా రాయచూర్ (ప్రస్తుత కర్ణాటక) నుండి గద్వాల, ఆలంపూర్, గుల్బర్గా నుండి కొడంగల్ ప్రాంతాలను కలిప్పారు. ఇందులో ఉన్న పరిగిని హైదరాబాద్లో కలిపారు. 2016–2019 విభజనలో కొత్తగా నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలు ఏర్పాటు చేశారు. షాద్నగర్, అమనగల్ తదితర మండలాలను రంగారెడ్డి జిల్లాలో విలీనం చేశారు. నల్లగొండకుతుబ్షాహీల నుండి ఒకే జిల్లాగా కొనసాగిన ఈ జిల్లాలో 1956లోనూ పెద్దగా మార్పులు చేయలేదు.నల్లగొండ,, భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ, రామన్నపేట, హుజూర్నగర్ తాలూకాలతో కొనసాగింది. అయితే 2016లో కొత్తగా యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలను ఏర్పాటు చేశారు. మెదక్మెదక్ సుభాగా వందల ఏళ్లు కొనసాగిన ఈ జిల్లాలో సంగారెడ్డి, మెదక్, ఆందోలు, వికారాబాద్, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్ తాలూకాలుండేవి. 1956 పునర్విభజనలో వికారాబాద్ను హైదరాబాద్లో కలిపి, గుల్బర్గాలో ఉన్న జహీరాబాద్, నారాయణఖేడ్లను మెదక్ జిల్లాలో చేర్చారు. 2016లో కొత్తగా సిద్దిపేట, మెదక్ జిల్లాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఎలగందల్ జిల్లా ఆపై కరీంనగర్గా మారిపోయింది. 1956లో ఈ జిల్లా సిరిసిల్ల, మెట్పల్లి, జగిత్యాల, సుల్తానాబాద్, మహదేవ్పూర్, హుజూరాబాద్ తాలూకాలతో కొనసాగింది. 2016లో కొత్తగా పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలను ఏర్పాటు చేశారు. వరంగల్వరంగల్ సుభాగా కాకతీయుల రాజధానికిగా ఉన్న వరంగల్లో 1956 నాటికి, పాకాల, ములుగు, మహబూబాబాద్, పరకాల తాలూకాలుండగా, 1952 అనంతరం జనగామ తాలూకాను వరంగల్ జిల్లాకు మార్చారు. 1953కు ముందు ఖమ్మం జిల్లా మొత్తం వరంగల్లో ఉండేది. 2016–19లలో కొత్తగా హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం 1953 అక్టోబర్ ఒకటిన ఏర్పాటైన ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మధిర, ఇల్లందు, బూర్గుంపహాడు, పాల్వంచ తాలూకాలుండగా, 1959లో భద్రచాలం సబ్ డివిజన్ గ్రామాలను తూర్పుగోదావరి నుండి ఖమ్మం జిల్లాకు మార్చారు. 2016లో కొత్తగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేశారు. నిజామాబాద్చాలా కాలం పరిపాలన కేంద్రంగా ఉన్న ఈ జిల్లాలో నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్, ఆర్మూర్ తాలూకాలుండేవి. 1956 పునర్విభజనలో బొంబాయి రాష్ట్రంలోని నాందేడ్ జిల్లాలో తెలుగు మాట్లాడే బిచ్కుంద, మద్నూర్, జుక్కల్లను నిజామాబాద్ జిల్లాలో విలీనం చేశారు. 2016 తర్వాత కామారెడ్డి జిల్లా ఏర్పాటయ్యింది. ఆదిలాబాద్ఆదిలాబాద్, ఉట్నూరు, ఖానాపూర్, నిర్మల్, బో«థ్, చెన్నూరు, సిర్పూరు, లక్సెట్టిపేట, ఆసిఫాబాద్ తాలూకాలతో పాటు పాటు ఇదే జిల్లాలో భాగంగా కొనసాగిన కిన్వత్, రాజూరా తాలూకాలతో ఈ జిల్లా కొనసాగింది. కానీ 1956లో మరాఠి మాట్లాడే వారు అధికంగా ఉన్న కిన్వత్, రాజూరాలను బొంబాయిలో కలిపారు. నాందేడ్ నుండి ముధోల్ను ఆదిలాబాద్లో కలిపారు. 2016లో కొత్తగా మంచిర్యాల, కుమ్రుం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి 1978 ఆగస్టు 15న ఏర్పాటైన హైదరాబాద్ రూరల్ జిల్లాను అదే సంవత్సరం అక్టోబర్లో కేవీ రంగారెడ్డి జిల్లాగా మార్చారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడైన కొండా వెంకట రంగారెడ్డి పేరు మీద ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. 2106లో మహబూబ్నగర్ నుండి షాద్నగర్, ఆమనగల్ తదితర ప్రాంతాలను అదనంగా రంగారెడ్డి జిల్లాలో చేర్చి, కొత్తగా మేడ్చల్–మల్కాజిగిరితో పాటు వికారాబాద్ కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేసి మహబూబ్నగర్ నుండి కొడంగల్ను కొత్తగా విలీనం చేశారు. అశాస్త్రీయంగా 33 జిల్లాలు చేశారు కేవలం కుటుంబ ఆధిపత్య పాలనను స్థిరీకరించడానికి రాష్ట్రాన్ని ఆశాస్త్రీయంగా 33 జిల్లాలు చేసి రాజకీయ చైతన్యాన్ని, అభివృద్ధిని అడ్డుకునే కుట్ర చేశారు. అందులో భాగంగానే వరంగల్ జిల్లాను ముక్కలు చేశారు. మహానగరాన్ని ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఒక పెద్ద అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలి. గత శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ జిల్లాలను శాస్త్రబద్ధంగా పునర్వ్యవస్థీకరణ చేస్తామంది. సీఎం రేవంత్రెడ్డి మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం ఉంది. – ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ, తెలంగాణ ఉద్యమ కారుల వేదిక, వరంగల్ చిన్న జిల్లాలతో సుపరిపాలనకు చాన్స్ నేను అతిపెద్ద అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కలెక్టర్గా పనిచేశా. ఎంత పెద్దవంటే నా బదిలీ అయ్యే లోపు కొన్ని ప్రాంతాల్లో పర్యటించలేకపోయా. చిన్న జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేయొచ్చు. సివిల్ సర్వీస్ అధికారుల నిరంతర పర్యవేక్షణకు అవకాశం ఉంటుంది. నేరుగా లబ్దిదారులతోనే టచ్లో ఉండే అవకాశం ఉంటుంది. చిన్న జిల్లాలో వ్యయం అధికమైనా.. మంచి పాలనకు చాన్స్ ఉంటుంది. – డాక్టర్.బి.జనార్ధన్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ లోక్సభ యూనిట్గా పునర్విభజన చేయాలి తెలంగాణాలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగింది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని, కొత్త జిల్లాల ఏర్పాటు కోసం విషయ నిపుణులతో కమిటీ వేసి, వారిచ్చే నివేదిక మేరకు విభజన చేయాల్సి ఉండగా అవేవీ జరగలేదు. ఇప్పుడైనా లోక్సభ యూనిట్గా జిల్లాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల విషయంలో మినహాయింపు తీసుకోవచ్చు. – ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి -
Eknath Shinde Govt: త్వరలో కొత్త జిల్లాలు!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర చిత్రపటం (మ్యాపు) రూపురేఖలు త్వరలో మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అనేక కొత్త జిల్లాలు ఏర్పాటుచేయాలని గత అనేక రోజులుగా డిమాండు ఉండటంతో నూతన జిల్లాల ఏర్పాటుకు నూతన ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. కానీ ముఖ్యమంత్రి షిందే నాసిక్ జిల్లా పర్యాటనలో ఉన్నారు. ఆయన శుక్రవారం రాత్రి మాలేగావ్లో బసచేయనున్నారు. దీంతో అక్కడి నాయకులతోపాటు స్థానిక ప్రజలు అనేక సంవత్సరాలుగా డిమాండు చేస్తున్నట్లుగా నాసిక్ జిల్లాను విభజించి మాలేగావ్ను జిల్లాగా చేయాలన్న ప్రతిపాదనను ఆయన ముందు ఉంచనున్నారు. దీనిపై ఆయన కూడా సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం తన పర్యటనలో నూతనంగా మాలేగావ్ జిల్లాను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయిని చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరగనుంది. మాలేగావ్తోపాటు అనేక జిల్లాలను విభజించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదలను మరోసారి కదలికవచ్చింది. దీంతో రాబోయే రోజులలో మరిన్ని జిల్లాలు ఏర్పాటైతే రాష్ట్ర మ్యాప్ మారనుంది. జిల్లాల విభజన డిమాండుకు ప్రధాన కారణం ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, అసౌకర్యం, ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న పనుల జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని జిల్లాలను విభజించి అదనంగా జిల్లాలు, తాలూకాలు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. రాష్ట్రంలో అనేక జిల్లాలను విభజించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ అనేక సంవత్సరాలు ఉంది. దేశంలో అతిపెద్ద జిల్లాగా వెలుగొందుతున్న ఠాణే జిల్లాను 2013లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం రెండుగా విభజించింది. అందులో పాల్ఘర్ జిల్లా కొత్తగా ఆవిర్భవించింది. దీంతో మిగతా జిల్లాల డిమాండ్లు ఆ సమయం నుంచి అధికమయ్యాయి. కానీ ఒక్కో కొత్త జిల్లా ఏర్పాటు చేయడానికి సుమారు రూ.350 కోట్లకుపైగా ఖర్చవుతాయి. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన అటకెక్కింది. కానీ కొత్తగా ఏర్పడిన షిందే ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 36 జిల్లాలు, 288 తాలూకాలు ఉన్నాయి. ఇందులో 18 జిల్లాలను విభిజించి అందులోంచి 22 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయాలనే డిమాండు ఎప్పట్నుంచో ఉంది. ముఖ్యంగా 2015లోనే ఈ అంశంపై ప్రభుత్వం ఓ కమిటీని కూడా వేసింది. అయితే రాష్ట్రంలో మారిన ప్రభుత్వాలు, రాజకీయ సమీకరణాలు తదితరాల అనంతరం మళ్లీ ఈ జిల్లాల విభజన అంశం తెరపైకి వచ్చింది. విభజన కానున్న లాతూరు జిల్లా! లాతూరు జిల్లాను విభజించి లాతూర్తోపాటు ఉద్గీర్ జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని డిమాండు ఉంది. ఈ మేరకు ఉద్గీర్ జిల్లా ఏర్పాటు విషయంపై విభాగ కమిషనర్ సునీల్ కేంద్రేకర్ సూచనలను కోరారు. ముఖ్యంగా జిల్లా ఏర్పాటు అయితే నూతన జిల్లా కేంద్రం ఉద్గీర్లో జిల్లా కలెక్టరేట్ భవనం ఇతర విషయాలపై పరిశీలన కూడా జరగుతున్నట్లు సమాచారం. ఉద్గీర్ పట్టణం కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉంది. లాతూరు నుంచి 70 కిలోమీరట్ల దూరంలో ఉన్న ఉద్గీర్లోని మార్కెట్లు చుట్టుపక్కల పరిసరాల్లో ఎంతో ప్రసిద్ధి. అనేక ఏళ్లుగా లాతూరు జిల్లాను విభజించి ఉద్గీర్ జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండు ఉంది. ఉద్గీర్ జిల్లా ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. నూతనంగా ఉద్గీర్ జిల్లా ఏర్పాటైతే లాతూర్ జిల్లాలోని మూడు తాలూకాలతోపాటు నాందేడ్ జిల్లాలోని లోహా కంధార్ తాలూకాలను కలిపి ఈ జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. దీంతో మరిన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా కొత్తగా 22 జిల్లాలు, 49 తాలూకాలు ఏర్పాటు చేయాలని విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలున్నాయి. అయితే రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎన్ని కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వనుందనేది వేచిచూడాల్సిందే. -
జిల్లాల విభజనతో ప్రజలకు పాలన చేరువ
సాక్షి, అమరావతి: చెప్పిన ప్రతి మాటను నెరవేర్చే క్రమంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్ జగన్ ప్రభుత్వం జిల్లాలను విభజించింది. 42 ఏళ్ల తర్వాత ఆంధ్ర ప్రాంతంలో జిల్లాల విభజన జరిగింది. చివరిసారిగా 1979 జూన్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా ఏర్పాటైంది. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో అప్పట్లో విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు. అంతకుముందు 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా ఏర్పాటైంది. కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను విడదీసి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం వచ్చాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రా ప్రాంతంలో ఏర్పడిన జిల్లాలు ప్రకాశం, విజయనగరం మాత్రమే. మిగిలిన 11 జిల్లాలు బ్రిటిష్ హయాంలో ఏర్పాటైనవే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత.. తెలంగాణ విడిపోయిన అనంతరం.. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం శాస్త్రీయంగా జిల్లాలను విభజించింది. ఇప్పుడు కొత్త జిల్లాల్లో పరిపాలన సజావుగా సాగుతోంది. పాలన ప్రజలకు మరింత చేరువైంది. పరిపాలన వికేంద్రీకరణ, భౌగోళిక అనుకూలత, సెంటిమెంట్లకు పెద్దపీట పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించి రాష్ట్రానికి కొత్త రూపు ఇచ్చింది. 51 రెవెన్యూ డివిజన్లను 74కి పెంచి పరిపాలనకు మరింత వెసులుబాటు కల్పించింది. పరిపాలన సౌలభ్యం, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పకడ్బందీగా విభజన ప్రక్రియ చేయడంతో అన్ని వర్గాల ఆమోదం లభించింది. విభజనకు ముందు ప్రభుత్వం విస్తృత అధ్యయనం, సుదీర్ఘ కసరత్తు చేసి పూర్తి శాస్త్రీయతతో నిర్ణయాలు తీసుకుంది. భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంది. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా జిల్లాలను విభజించింది. సాధ్యమైనంతవరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒకే జిల్లాలోకి తెచ్చింది. ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు రెవెన్యూ డివిజన్గా మార్చలేదు. జిల్లాల విభజన సమయంలో చంద్రబాబు కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ను కోరడంతో ప్రభుత్వం అంగీకరించి ఆ డివిజన్ ఏర్పాటు చేసింది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా చేశారు. సంవత్సరాల ఆకాంక్షల మేరకు.. తమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని, అత్యంత ప్రముఖుల పేర్లను జిల్లాలకు పెట్టాలనే డిమాండ్లు పలుచోట్ల అనేక సంవత్సరాలుగా ఉన్నాయి. ఇలాంటి అనేక అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. స్థానిక ప్రాధాన్యాన్ని, కొన్ని ప్రాంతాలకు ఉన్న చారిత్రక నేపథ్యం, స్థానిక పరిస్థితులను గుర్తించి కొత్త జిల్లాల్లో ప్రతిబింబించేలా చూసింది. అదే సమయంలో పాత జిల్లాల ప్రాధాన్యం, ప్రాశస్త్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంది. మన్యం విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర పోరాటం జరిపిన ప్రాంతాన్ని ఆయన పేరుతో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. పాడేరు కేంద్రంగా ఆ జిల్లాను ఏర్పాటు చేసి జగన్ ప్రభుత్వం ఆ డిమాండ్ను నెరవేర్చింది. పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటుతో గిరిపుత్రులకు గౌరవం ఇచ్చింది. గోదావరి జిల్లాల ప్రాశస్త్యం దెబ్బతినకుండా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతం ప్రత్యేకతను తెలియజెప్పేలా కోనసీమ జిల్లా ఏర్పాటు చేసి అక్కడి ప్రజల మనోభావాలను గౌరవించింది. దానికి డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టి రాజ్యాంగ నిర్మాతను గౌరవించింది. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాగా, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాగా మార్చి వాటి ప్రాధాన్యతను కొనసాగించింది. ఎన్టీఆర్ జన్మించిన కృష్ణాజిల్లాకు ఆయన పేరు పెట్టాలని చాలాకాలం నుంచి కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు సుదీర్ఘకాలం సీఎంగా ఉన్నా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వస్తే కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించారు. ఆ మాట నెరవేరుస్తూ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాన్ని కృష్ణాజిల్లాగా కొనసాగించి దాని చారిత్రక ప్రాధాన్యతను నిలబెట్టారు. గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం ప్రత్యేకతను నిలబెడుతూ పల్నాటి పౌరుషాన్ని ప్రతిబింబించేలా నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేసింది. బాపట్లను జిల్లాగా చేయాలని సుదీర్ఘకాలంగా ఉన్న కల నెరవేరింది. పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా, ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య నడయాడిన రాయచోటి ప్రాంతాన్ని ఆయన పేరుతో అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసింది. -
ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్న సీఎం
ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి విమర్శ సాక్షి, హైదరాబాద్: జిల్లాల విభజన విషయంలో ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానిస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఉద్యమాల ద్వారానే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని మరిచిపోయి ప్రజా ఉద్యమాలను కించపరుస్తూ టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి జిల్లాల పేరిట టీఆర్ఎస్ నేతలే రోజుకో మాటతో అతిపెద్ద డ్రామా ఆడుతున్నారని వంశీచంద్ విమర్శించారు. జిల్లాల పేరుతో ప్రజలను విభజించి, నిప్పు రాజేసి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలను చెప్పడానికి కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేని దుస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. టీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా ఒకమాట, బహిరంగంగా మరోమాట మాట్లాడుతున్నారని, ప్రజలే తగిన సమయంలో బుద్ధిచెప్తారని వంశీచంద్ హెచ్చరించారు. -
జిల్లాల విభజన ఏ ప్రాతిపదికన?
హైదరాబాద్: ఏ ప్రాతిపదికన జిల్లాలను విభజిస్తున్నారో అర్థం కావడం లేదని, ఇది ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లాల విభజన ప్రాతి పదికను ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీలకు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అభిప్రాయాలను చెప్పేందుకు నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకముందే విభజన నిర్ణయాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల ప్రాంతాల విషయంలో షెడ్యూల్ 5, భూరియా కమిటీ సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ఆదివాసీలు అనేక రకాలుగా దోపిడీకి గురవుతున్నారని, 1/70 చట్టం అమలు కావడం లేదని అన్నారు. రాజ్యాంగంలో గిరిజనులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, కేసీఆర్కు నిజమైన ప్రేమ ఉంటే గిరిజనులకు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని డియాండ్ చేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ.. రాష్ర్టంలో 12 శాతం ఉన్న ఆదివాసీలు స్వయంపాలిత జిల్లాలు కావాలని ఎంతోకాలం నుంచి డిమాండ్ చేస్తున్నా, విస్మరించడం బాధాకరమన్నారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ.. ముందు తరాల కోసం ప్రకృతి సంపదను కాపాడుతున్న ఆదివాసీల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ర్ట సాధన కంటే ఇది ప్రజాస్వామికమైన డిమాండ్ అన్నారు. కెచ్చల రంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, టీడీపీ రాష్ర్ట నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్, కరుణం రామకృష్ణ, ఆర్ఎస్పీ నాయకుడు జానకి రాములు, న్యూ డెమోక్రసీ నాయకుడు పోటు రంగారావ్, ఆదివాసీ నాయకులు వట్టం నారాయణ, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు ఝాన్సీ, సూర్యం, ఎం. హన్మేష్, గౌతం ప్రసాద్, ఎస్ఎల్ పద్మ తదితరులు పాల్గొన్నారు.