breaking news
disposables
-
Suchitra Divvela: అరటి ఆకు లేకపోతేనేం.. అరెక్కా పళ్లెం ఉందిగా!
పెళ్లంటే... బంధువులు, స్నేహితులతో కలిసి పచ్చటి ఆరిటాకులో పిండివంటలన్నీ చక్కగా వడ్డించుకుని ఆకు పచ్చిదనాన్ని, పచ్చదనాన్నీ ఆస్వాదిస్తూ భోజనం చేయాలని ఎవరికి మాత్రం ఉండదు? అయితే ఇప్పుడన్నీ నిలబడి తినే బఫే భోజనాలే. అరటి ఆకు లేకపోతేనేం... అరెక్కా ప్లేట్ ఉంది. సుచిత్ర దివ్వెలది మచిలీపట్నం. చదువు, ఉద్యోగం అన్నీ హైదరాబాద్లోనే. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జీతం బాగానే ఉంది. లైఫ్ అంటే నెల చివర బ్యాంకు బాలెన్స్లో మిగులు చూసుకుని సంతృప్తి చెందడం కాదనిపించేది. పిల్లలు వేసే అనేక ప్రశ్నల్లోంచి ఆమెకు అనేక సందేహాలు వస్తుండేవి. ఉద్యోగం, మోడరన్లైఫ్ పరుగులో పడి ఏదో కోల్పోతున్నామని కూడా అనిపిస్తుండేది. ఇప్పుడు మనం కాలుష్యరహితంగా జీవించిన గడచిన తరాన్ని చూస్తున్నాం. రేపటి రోజున పిల్లలకు ఎలాంటి జీవితాన్ని మిగులుస్తున్నాం... అని తనను తాను ప్రశ్నించుకునేది. నిజానికి ఇది తన ఒక్క ఇంటి సమస్య కాదు. కొంత సమయం తీసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తే రాబోయే తరంలో ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులకు పిల్లల నుంచి ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతాయి. ఇంత ఆలోచించిన తర్వాత సుచిత్ర తనవంతుగా ఏదో ఒకటి చేయాలనుకున్నారు. కర్ణాటకలో ఉన్న తన స్నేహితుల ద్వారా అక్కడ విరివిగా లభించే పోకచెట్ల బెరడును ఇలా ఉపయోగించవచ్చని తెలుసుకుంది. ఇక ఆ ప్రయత్నాన్ని ఒక క్రమపద్ధతిలో పెట్టగలిగింది. వెయ్యిలో ఒకరైనా ఇలాంటి ప్రయత్నం చేస్తే ఇకపై ఏ వేడుకలోనూ ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు వాడాల్సిన అవసరం ఉండదంటారామె. చెట్టును కొట్టకుండానే..! ‘‘పోక చెట్టు నుంచి సేకరించిన మెటీరియల్తో ప్లేట్ అనగానే చెట్టుకు హాని కలిగిస్తారని అపోహ పడడం సహజమే. కానీ పోకచెట్టు కూడా కొబ్బరి చెట్టులాగానే కాయల కోసం గెల వేస్తుంది. పూత దశలోనే గెలను కప్పి ఉంచిన పొర విచ్చుకుంటుంది. కాయలు ముదిరి, గెలను కోసే సమయానికి ఈ పొర కూడా ఎండిపోయి రాలిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అలా సేకరించిన బెరడు లాంటి పొరను శుభ్రం చేసి, గుండ్రగా కానీ నలుచదరంగా కానీ కత్తిరించి మౌల్డ్లో పెట్టి వేడి చేస్తే ప్లేట్ రెడీ అవుతుంది. స్పూన్లు, కప్పులకు కూడా ఇదే పద్ధతి. ఈ చెట్లు కర్ణాటకలో దావణగెరె, చెన్నగిరి, షిమోగా, తుమ్కూరులో ఎక్కువ. ఇక కేరళ, అస్సాంలో కూడా ఉంటాయి. కానీ నాకు పరిచయమైన మిత్రులు కర్ణాటక వాళ్లు కావడంతో నేను అక్కడి నుంచి నా యాక్టివిటీని మొదలుపెట్టాను. మనిషి పుట్టినప్పటి నుంచి పోయే వరకు ప్రతి అవసరాన్నీ చెట్టు తీరుస్తుంది. మనం చెట్టుకు హాని కలిగించకుండా, ఇచ్చిన వాటిని ఉపయోగించుకుంటే చాలు. ఆదాయం తక్కువే! అరెక్కా ప్లేట్, కప్పుల యూనిట్లు భారీస్థాయిలో రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఇందులో లాభాలు పరిమితంగా ఉంటాయి. నాలాగ ఉద్యోగం చేసుకుంటూ, ప్రవృత్తిగా వీటిని ప్రచారంలోకి తీసుకురావడమే తప్ప, పూర్తిస్థాయి వృత్తిగా చేపట్టాలంటే కొంచెం ముందువెనుకలు ఆలోచిస్తారు. అందుకే పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి ఉన్న వాళ్లు, పర్యావరణ పరిరక్షణ కోసం పని చేయాలనుకునే వాళ్లు తమ వంతు బాధ్యతగా ఇలాంటి ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాను. ’’ అన్నారు సుచిత్ర. మనకు వేడుకలు చాలానే ఉంటాయి. శ్రావణ మాసం నోముల నుంచి, గణేశ చతుర్థి, దసరా వేడుకల్లో ప్రసాదాలు పంచుకుంటారు. దేవుడి వేడుకలకు విరాళాలిచ్చే వాళ్లు తమవంతు విరాళంగా ఇలాంటి కప్పులను ఇవ్వడం అలవాటు చేసుకుంటే ‘ప్లాస్టిక్ని వాడవద్దు’ అని గొంతెత్తి చాటే పనే ఉండదు. ప్లాస్టిక్ దానంతట అదే కనుమరుగవుతుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తున్నారా? జర జాగ్రత్త..
దేశంలో ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాకంపై కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఒక రోగికి ఒకమారు మాత్రమే వినియోగించాల్సిన మెడికల్ కిట్లను పదేపదే ఇతర రోగులకూ వినియోగిస్తూ ఆరోగ్యానికి ఎసరు పెడుతున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు. ముఖ్యంగా కార్డియాలజీ విభాగంలో మెడికల్ వస్తువులను(ఒకమారు వినియోగించాల్సినవి) ప్రైవేటు ఆసుపత్రులు నెలల తరబడి వాడుతున్నట్లు తెలిసింది. దీనిపై సీరియస్ అయిన ఆరోగ్యశాఖ ప్రైవేటు ఆసుపత్రులకు మెమోరండం జారీ చేసింది. కేవలం కార్డియాలజీయే కాకుండా మిగితా సర్జికల్ వస్తువుల వినియోగంలో కూడా ఆసుపత్రులు ఇదే ధోరణి కొనసాగిస్తున్నట్లు తెలిసింది. మామూలుగా కార్డియాలజీకి సంబంధించిన చికిత్సలకు ఒకమారు ప్రైవేటు ఆసుపత్రికి వెళితే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ బిల్లు వస్తుంది. ఈ బిల్లుల్లో అధిక మొత్తం మిగుల్చుకోవడానికి ఒకసారి వినియోగించిన మెడికల్ కిట్నే అందరికీ వాడుతూ ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తున్నాయి. ఈ మేరకు గతేడాది డిసెంబర్లో కేంద్ర ఆరోగ్య శాఖ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం(సీజీహెచ్ఎస్) కింద ఉన్న ఆసుపత్రులపై చర్యలకు ఉపక్రమించింది. అయితే, సీజీహెచ్ఎస్ కిందకు రాని కార్పోరేట్ ఆసుపత్రుల విషయంలో మాత్రం మిన్నకుండి పోయింది. రోగి అనుమతి లేకుండా ఒకరికి వినియోగించిన మెడికల్ కిట్ను మరొకరికి వినియోగించడం చట్ట రీత్యా నేరమని ఓ కార్డియాలజిస్ట్ చెప్పారు. పేషెంట్ల కళ్లుగప్పి డబ్బు దోపిడికి పాల్పడుతున్న కార్పోరేట్ ఆసుపత్రుల చిట్టా చాలనే ఉందని తెలిపారు. ఆసుపత్రుల్లో నిర్వహించిన యాంజియోప్లాస్టీ సంఖ్యతో అందుకు వినియోగించిన మెడికల్ కిట్ల బిల్లులను అడగడం ద్వారా తప్పు చేస్తున్న వారిని పట్టుకోవచ్చని చెప్పారు. -
మరింత భద్రంగా వైద్య పరికరాలు..
పాలీ మెడిక్యూర్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోగులు, ఆసుపత్రుల సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని మరింత భద్రంగా వైద్య పరికరాలు, డిస్పోజబుల్స్ను రూపొందిస్తున్నట్టు పాలీ మెడిక్యూర్ తెలిపింది. క్యాన్సర్కు దారితీసే డీఈహెచ్పీ, పీవీసీ లేకుండా ఐవీ కాన్యులా, ఐవీ సెట్స్, క్యాథెటర్స్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నామని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ భల్లా శుక్రవారం చెప్పారు. హైదరాబాద్ మార్కెట్లో పలు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టిన సందర్భంగా రీజినల్ బిజినెస్ సీనియర్ మేనేజర్ అరవింద్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు. 100కుపైగా ఉత్పత్తులను భారత్తోసహా 90 దేశాల్లో విక్రయిస్తున్నట్టు తెలిపారు. రూ.400 కోట్ల కంపెనీ ఆదాయంలో ఎగుమతుల వాటా 70 శాతమని వివరించారు.