breaking news
Digital libraries
-
మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
సాక్షి, అమరావతి: వర్క్ ఫ్రం హోం చేసుకొనే ఐటీ ఉద్యోగులకు అవసరమైన సౌకర్యాలు, విద్యార్థులకు ఆన్లైన్, డిజిటల్ క్లాసులు, వారికి అవసరమైన సమాచారాన్ని గ్రామ గ్రామాన అందుబాటులో ఉంచేలా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష వేగంగా కార్యరూపం దాలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 3,960 డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు జరుగుతోంది. వీటిలో కొన్ని పూర్తవగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. గ్రామ సచివాలయం ఏర్పాటు చేసిన ప్రతి చోటా డిజిటల్ లైబ్రరీ ఉండాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కొత్తగా మరో 6,965 గ్రామాల్లో వీటి ఏర్పాటుకు అనుమతి తెలిపింది. వీటితో మొత్తం 10,925 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో అత్యాధునిక సౌకర్యాలు, ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తారు. ఉద్యోగులు.. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ఇవి వరమనే చెప్పాలి. వర్క్ ఫ్రంహోమ్ చేసే ఉద్యోగులు వారి స్వగ్రామం నుంచే ఉద్యోగం చేసుకొనే వెసులుబాటు కలుగుతుంది. విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరవడానికి, వారికి అవసరమైన సమాచారాన్ని ఆన్లైన్, డిజిటల్ పద్ధతుల ద్వారా సేకరించుకోవడానికి ఈ లైబ్రరీలు ఉపయోగపడతాయి. ఒక్కొక్క లైబ్రరీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.16 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇతరత్రా సదుపాయాలకు మరింత ఖర్చు పెడుతోంది. వీటి భవనాలకు స్థల సేకరణ చేయాలని ఆ శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం డిజిటల్ లైబ్రరీ భవనాల నిర్మాణానికే ప్రభుత్వం రూ. 1,114 కోట్లు ఖర్చు చేస్తోంది. వీటితో కలిపి గత మూడున్నర సంవత్సరాల్లో రూ. 9,630 కోట్ల ఖర్చుతో గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, వంటి వాటితో కలిపి గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 44 వేల భవన నిర్మాణాలు సాగుతున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. -
యుద్ధ ప్రాతిపదికన డిజిటల్ లైబ్రరీలు
-
విలేజ్ డిజిటల్ లైబ్రరీలను సక్రమంగా నిర్వహించాలి: సీఎం జగన్
-
వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలతో గ్రామాలకు కొత్త కళ
సాక్షి, అమరావతి: వర్క్ ఫ్రం హోం విధానాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో 4,530 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ భవనాల నిర్మాణం చేపడుతోంది. ఒక్కో డిజిటల్ లైబ్రరీని రూ.16 లక్షల వ్యయంతో 690 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. తొలి దశలో నిర్మాణం చేపట్టే 4,530 డిజిటల్ లైబ్రరీలకు రూ.724.80 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ డిజిటల్ లైబ్రరీల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం మరో రూ.140 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా. దశల వారీగా ప్రతీ గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గ్రామాలకు మంచి సామర్థ్యం గల ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంతో పాటు అక్కడి నుంచే వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా విధులు నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించనున్నారు. తొలి దశలో చేపడుతున్న డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలతో పాటు ఫైబర్ నెట్ కనెక్టివిటీని డిసెంబర్ నెలాఖరు నాటికి కల్పించాలనే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. తొలి దశలో చేపట్టే డిజిటల్ లైబ్రరీల్లో ఇప్పటికే 2,687 లైబ్రరీల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను గుర్తించారు. మిగతా వాటికి ఈ నెలలోనే స్థలాలను గుర్తించడంతో పాటు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. డిజిటల్ లైబ్రరీల్లో సదుపాయాలు ఇలా.. – మూడు డెస్క్ టాపులు, యూపీఎస్, డెస్క్టాప్ బార్ కోడ్ ప్రింటర్, స్కానర్, లేజర్ ప్రింటర్, సాఫ్ట్వేర్, యాంటీ వైరస్ సాఫ్ట్వేర్, అన్లిమిలెడ్ బ్యాండ్విడ్త్ ఇంటర్నెట్ స్టోరేజీకి సంబంధించి డేటా సెంటర్ ఏర్పాటు. – 3 డెస్క్ టాప్ టేబుళ్లు, సిస్టం, విజిటర్ కుర్చీలు.. ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, ఐరన్ ర్యాక్లు ఉంటాయి. వార్తా పత్రికలు, మేగజైన్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. – కామన్ ఎంట్రెన్స్ టెస్టులతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. – ఎవరైనా సాప్ట్వేర్ ఉద్యోగులు సొంత గ్రామాలకు వెళ్లినప్పుడు ఈ డిజిటల్ లైబ్రరీల ద్వారా వారి లాప్టాప్కు కనెక్టయ్యి పని చేసుకునే అవకాశం ఉంటుంది. -
కోర్సు ఏదైనా.. విజ్ఞానం అనంతం
మచిలీపట్నం (ఈడేపల్లి) : విద్యార్థి లోకానికి ఇ- లైబ్రరీలు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయి. సమయాన్ని, డబ్బును ఆదా చేస్తున్నాయి. బంగారు భవిష్యత్తుకోసం కలలు కనే నేటి యువతరానికి డిజిటల్ లైబ్రరీలు అండగా నిలుస్తున్నాయి. తమ కలల్ని సాకారం చేసుకునేలా ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ఎంతో మంది విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న లక్షల మంది అభ్యర్థులకు ఇప్పుడు డిజిటల్ లైబ్రరీలు కల్పతరువుగా మారాయి. జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కూడా ఈ సదుపాయం వరంగా మారుతోంది. 21వ శతాబ్దపు నవనాగరికత, అత్యాధునిక జీవనవిధానానికి ఇంటర్నెట్ వినియోగం ప్రతీక అనడం అతిశయోక్తి కాదు. మారుతున్న విజ్ఞానానికి అనుగుణంగా.. జిల్లాకు సంబంధించి.. విజయవాడ, మచిలీపట్నం, మైలవరం, లంకపల్లి, పెడన, గుడ్లవల్లేరు ప్రాంతాల్లో పలు ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు ఉన్నాయి. ఆయా కళాశాలల్లో వేలాదిమంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా తమ పాఠ్యాంశాలకు సంబంధించిన అన్ని పుస్తకాలు కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక వేళ కొందామన్నా.. కావాల్సిన పుస్తకాలు లభ్యమవుతాయని ఖచ్చితంగా చెప్పలేం. అందుకే ఈ కోవకు చెందిన విద్యార్థులంతా ఎక్కువ శాతం ఇంటర్నెట్పై ఆధారపడుతున్నారు. చదువుల్లో దూసుకుపోతున్నారు. అలాగే ప్రాజెక్టువర్క్ సమయంలో వివిధ అంశాలకు సంబంధించిన తాజా సమాచారం తెలుసుకోవడానికి డిజిటల్ లైబ్రరీలు సౌలభ్యంగా ఉంటున్నాయి. మారుతున్న బోధన పద్ధతులు, విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా కళాశాలల యాజమాన్యాలు కూడా డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేయడంలో శ్రద్ధ చూపుతున్నాయి. పోటీపరీక్షలకు.. పోటీ పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొనేందుకు విద్యార్థులు డిజిటల్ లైబ్రరీలను ఆశ్రయిస్తున్నారు. ఒకప్పుడు పోటీ పరీక్షలకు సంబంధించిన సమగ్ర సమాచారం మెటీరియల్ రూపంలో దొరకడం చాలా కష్టం. ప్రస్తుతం ఆ భయం లేదు. యూపీఎస్సీ పరీక్షలు మొదలుకొని గ్రూప్-1, గ్రూప్-2 ఇలా అన్ని పోటీపరీక్షలకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలు, సాధన పత్రాలు, మోడల్ పేపర్సు.. ఇలా కావాల్సిన వన్నీ సబ్జెక్టుల వారీగా క్షణాల్లో ఇంటర్నెట్ ద్వారా లభ్యమవుతున్నాయి. వీటితో పాటుగా వివిధ పత్రికలు ప్రతిరోజూ ప్రచురించే సాధన పత్రాలు కూడా అందుబాటులో ఉండడంతో అభ్యర్థుల కెంతో సమయం ఆదా అవడంతో పాటు ప్రయోజనం చేకూరుతోంది. కోర్సు ఏదైనా.. విజ్ఞానం అనంతం పాఠ్యాంశాలను కూలంకషంగా అధ్యయనం చేసేందుకు, వైజ్ఞానిక అంశాలను క్రోడీకరించుకుని సొంతంగా నోట్సు తయారుచేసుకునేందుకు ఇంటర్నెట్ బాగా ఉపయోగపడుతుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. కేవలం వృత్తి విద్యాకోర్సులు చదివే వారికి మాత్రమే కాక ఇంటర్, డిగ్రీ చదివే వారు కూడా ఇ-లైబ్రరీలపై ఆధారపడి తమ జ్ఞానాన్ని మెరుగుపర్చుకుంటున్నారు. లాసెట్, డైట్సెట్, ఎంమ్సెట్, ఎడ్సెట్ ఇలా పలు ఎంట్రన్స్ పరీక్షలకు హాజరయ్యేవారు మోడల్ ప్రశ్నపత్రాలకోసం ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్నెట్ నుంచి పాఠశాల స్థాయి విద్యార్థులు కూడా అవసరమైన సమాచారం పొందవచ్చు. శేషు సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నాడు. మధ్యతరగ తి కుటుంబం కావడంతో అధునాతన మెటీరియల్స్, మోడల్ పేపర్స్ సంపాదించడం కష్టం. కానీ ఇంటర్నెట్ ద్వారా అవసరమైన పుస్తకాలు, ఇతరత్రా సమాచారం అందిపుచుకో గలుగుతున్నాడు. మనోజ్ సాహిత్యాభిమాని. ఆంగ్ల రచయిత షేక్స్పియర్, ప్రముఖ హిందీ కవి సుమిత్రానంద్ పంత్ రచనలంటే వల్లమాలిన అభిమానం. వీరి ప్రఖ్యాత రచనలు కొన్ని పుస్తకాలు బుక్షాపుల్లో ఎంత వెతికినా దొరకలేదు. అంతర్జాలం ద్వారా ఒకే ఒక్క క్లిక్తో కావాల్సిన పుస్తకాలు కళ్లముందు తళుక్కుమన్నాయి. వాటిని సీడీల్లోకి డౌన్లోడ్ చేసుకుని ఆనందించాడు. రమేష్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలన్నీ కొనుగోలు చేయాలంటే ఎంతో ఆర్థిక భారం. అందుకే ఇంటర్నెట్ను వినియోగించుకుని కావాల్సిన పుస్తకాలను చదివి, పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపాడు. కృష్ణావర్సిటీ పరిధిలోడిజిటల్ లైబ్రరీలు ఎలక్ట్రానిక్ డిజిటల్ లెర్నింగ్ రిసోర్సెస్ పాత్ర నేటి విద్యావిధానంలో కీలకంగా మారింది. త్వరలో యూనివర్సిటీ పరిధిలోని కళాశాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించాం. పాఠ్యాంశాలకు అవసరమైన డిజిటల్ గ్రంథాలయాల వివరాల్ని ఎప్పటికప్పుడు విద్యార్థులకు తెలియజేస్తున్నాం. 2002లోనే యూనిసెఫ్ ‘ఓపెన్ ఎడ్యుకేషన్’ మూవ్మెంట్ ప్రారంభించింది.www.oc.w,www.open education.com వెబ్సైట్లలో ఆ వివరాలు ఉన్నాయి. www.mit.ebu.com సైట్లోనే రెండు వేల కోర్సులకు సంబంధించిన గ్రంథాలు నిక్షిప్తమై ఉన్నాయి. - వి.వెంకయ్య, కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి