breaking news
devadula
-
దేవాదుల పనులు వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, జూలై 13: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో తాగునీరు, సాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదుల ఎత్తిపోతల పథకంలోని అన్ని పంపులను నిరంతరం 24 గంటల పాటు నిర్వహించాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ప్రాజెక్టు పరిధిలోని 22 రిజర్వాయర్లను పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యంతో నింపి నీటి భద్రతను కల్పించాలని స్పష్టం చేశారు.సోమవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ–గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి, అనంతరం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ప్రాజెక్టు మూడో దశ పనులను వేగవంతం చేయడంపై అధికారులకు స్పష్టమైన కార్యాచరణను సూచించారు.ప్రస్తుతం గోదావరి నదిలో సుమారు 20 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నందున ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని మంత్రి ఆదేశించారు.ప్రస్తుతం ఏడు పంపులు పనిచేస్తూ తాగునీరు, సాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోస్తున్నాయని అధికారులు వివరించారు.మొత్తం పది పంపులు పనిచేస్తే రోజుకు 0.23 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉండగా, సుమారు నాలుగున్నర రోజుల్లో ఒక టీఎంసీ నీటిని తరలించవచ్చని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గోదావరిలో ప్రవాహం ఉన్నప్పుడల్లా గరిష్ట స్థాయిలో నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపాలని మంత్రి స్పష్టం చేశారు.గోదావరిలోని ఇంటేక్ నిర్మాణాలు, భారీ పంప్ హౌస్లు, రైజింగ్ మెయిన్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, గ్రావిటీ కాలువల పనులను సమీక్షించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయడం ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.మూడు దశల పనులు పూర్తయినప్పుడే ప్రాజెక్టు పూర్తి ప్రయోజనాలు రైతులకు అందుతాయని, ఒక్క ఎకరం కూడా మిగలకుండా ఆయకట్టుకు నీరందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి ప్యాకేజీకి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నెలవారీగా పురోగతిని సమీక్షించాలని ఇంజినీర్లకు ఆదేశించారు.పనులకు ఆటంకంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, భూసేకరణ, చట్టపరమైన అనుమతులు, ఇతర క్లియరెన్సులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన చోట అదనపు యంత్రాలు, సిబ్బందిని నియమించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.ప్రాజెక్టు పనులకు నిధుల కొరత ఉండదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తూ, వెంటనే రూ.146 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు.దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తయిన అనంతరం ములుగు, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, జనగాం, సిద్ధిపేట, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో దాదాపు 5.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.ఉత్తర తెలంగాణలోని అనేక గ్రామాలకు తాగునీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించిన తుది డిజైన్లకు ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకే బ్యారేజీల నిర్వహణ ఉంటుందని, ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, దేవాదుల ప్రాజెక్టు ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్య కార్యక్రమాల్లో ఒకటని, అవసరమైన నిధుల విడుదలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణను వేగవంతం చేశామని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాయని తెలిపారు.దేవాదుల ఎత్తిపోతల పథకం మొత్తం 16 ప్యాకేజీలతో మూడు దశల్లో అమలవుతోందని మంత్రి వివరించారు.మొదటి దశలో 1.23 లక్షల ఎకరాలు, రెండో దశలో 1.93 లక్షల ఎకరాలు, మూడో దశలో 2.39 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్టులో 642 కిలోమీటర్ల పైప్లైన్లు, 57.16 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 306 కిలోమీటర్ల ప్రధాన కాలువలు, 2,185 కిలోమీటర్ల పంపిణీ కాలువల నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు.ఆసియాలోనే అత్యంత పొడవైన 49 కిలోమీటర్ల ‘డి’ ఆకారపు సాగునీటి సొరంగం ఈ ప్రాజెక్టులో భాగమని ఆయన పేర్కొన్నారు.ప్రాజెక్టుకు అవసరమైన 495.55 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, భవిష్యత్తులో సమ్మక్క బ్యారేజీతో అనుసంధానం ద్వారా ఏడాది పొడవునా నీటి లభ్యత మరింత మెరుగుపడుతుందని చెప్పారు.ప్రస్తుతం దేవాదుల ప్రాజెక్టు భౌతిక పురోగతి 87.70 శాతానికి చేరుకుందని ఆయన తెలిపారు.పంప్ హౌస్లు, పైప్లైన్లు, సొరంగ తవ్వకాల వంటి ప్రధాన నిర్మాణాలు పూర్తయ్యాయని, కాలువల లైనింగ్, పంపిణీ కాలువలు, కొన్ని కీలక నిర్మాణాలు, పెండింగ్ భూసేకరణ పూర్తయిన వెంటనే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.మొదటి దశలోని ప్యాకేజీ–45 పూర్తిగా పూర్తికాగా, ప్యాకేజీ–46 పనులు 96.86 శాతం పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు.ఈ సమీక్ష సమావేశంలో ఇంజినీర్-ఇన్-చీఫ్ (జనరల్) రమేష్ బాబు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, సీనియర్ ఇంజినీర్లు పాల్గొన్నారు.నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కార్యాలయం నుండి విడుదల చేయడమైనది -
కూలిన దేవాదుల సొరంగం
ములుగు/వెంకటాపురం(ఎం): దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన సొరంగం కూలి ఇద్దరు కార్మికులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని ఇంచె చెర్వుపల్లి సమీపంలో జరుగుతున్న మెయిన్ జంక్షన్ టన్నెల్ పాయింట్ వద్ద శనివారం అర్ధరాత్రి జరిగింది. మృతుల్లో నేపాల్కు చెందిన ఫోర్మన్ దిలీప్రాయ్(32), వెల్డర్ కరణ్బిస్తా(45) ఉన్నారు. వీరు 12 ఏళ్లుగా నవోదయ కోస్టల్ ప్రాజెక్టులో భాగంగా స్వదేశంలో పనిచేశారు. గత ఫిబ్రవరిలో బదిలీపై ఇంచె చెర్వుపల్లి సమీపంలో జంక్షన్ మెయిన్ టన్నెల్ ఆడిట్–1ఏకి వచ్చారు. కాగా, మూడు రోజుల క్రితమే ఇక్కడ నూతన జంక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సొరంగంలో కార్మికులు పనులు చేయడానికి ముందు మట్టి కూలకుండా రాక్ బోల్టులను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాతే ఇనుప రిబ్బులను వేస్తారు. అయితే, రాక్బోల్టులు వేయడానికి టన్నెల్లోకి అర్ధరాత్రి సమయంలో వెళ్లిన ఇద్దరు పైభాగంలో వదులుగా ఉన్న మట్టి ప్రాంతాన్ని గమనించలేదు. సుమారు 3 నుంచి 4 టిప్పర్ల మట్టి ఒక్కసారిగా వీరి మీద పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. తోటికార్మికులు మట్టి తొలగించినా అప్పటికే వారు చనిపోయారు. జియాలజిస్ట్ అనుమతులు ఇచ్చాకే రాక్బోల్టుల ఫిట్టింగ్ పనులు చేపట్టాలని, కానీ ఉన్నతాధికారుల పరిశీలన పూర్తి కాకముందే పనులు చేపట్టడానికి లోపలికి వెళ్లడంతో ప్రమాదం జరిగిందని తోటికార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కోస్టల్ ప్రాజెక్టు డీఎం ప్రసాద్, ప్రాజెక్టు మేనేజర్ నాయుడు, ములుగు సీఐ సాయిరమణ, వెంకటాపురం(ఎం) ఎస్ఐ పోగుల శ్రీకాంత్ పరిశీలించి వివరాలు సేకరించారు. ఆదివారం పనులను నిలిపివేశారు. -
కొత్త పోస్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
-
13,445 కోట్లు
భారీ ఎత్తిపోతల పథకంగా దేవాదుల - ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచేందుకు, డిజైన్ల మార్పునకు కేబినెట్ ఆమోదం - కంతనపల్లికి బదులుగా తుపాకులగూడెం వద్ద బ్యారేజీ - కొత్తగా మల్కాపూర్ రిజర్వాయర్ - ఇందిరాసాగర్, రాజీవ్సాగర్ ప్రాజెక్టులు రద్దు - తక్షణం సాగునీరందించే ప్రాజెక్టులపై అధ్యయనం - జైళ్ల సంస్కరణలపై సబ్ కమిటీ - కొత్త జిల్లాల్లో ఏడాదిలోగా కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాలు - కరీంనగర్లో ఫిషరీస్ కాలేజీ ఏర్పాటు - పలు శాఖల్లో కొత్త పోస్టులకు గ్రీన్ సిగ్నల్ సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై నిర్మిస్తున్న దేవాదుల ప్రాజెక్టును భారీ ఎత్తిపోతల పథకంగా మార్చాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. మూడు దశల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.9,427 కోట్ల నుంచి రూ.13,445 కోట్లకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై చేపట్టదలచిన కంతనపల్లి బ్యారేజీకి బదులుగా తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించింది. ఆయకట్టు స్థిరీకరణతో పాటు బహుళ ప్రయోజనాలు ఉండేలా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మల్కాపూర్ దగ్గర 10 టీఎంసీల సామర్థ్యంతో భారీ రిజర్వాయర్ నిర్మించాలని తీర్మానించింది. ఖమ్మం జిల్లాల్లో అసంపూర్ణంగా ఉన్న రాజీవ్సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్సారెస్పీ రెండో దశ పనులకు రూ.1,303 కోట్ల అంచనాతో సవరణ ప్రతిపాదనలను ఆమోదించింది. గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గం భేటీ అయింది. సుదీర్ఘంగా మూడున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లు, అంచనాల సవరణలకు సంబంధించి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ శాఖల పరిధిలో పలు పోస్టుల భర్తీ, ఇతర అంశాలకు ఆమోదం తెలిపారు. జైళ్ల సంస్కరణలపై సబ్ కమిటీ జైళ్లలో తీసుకురావాల్సిన సంస్కరణలపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అధ్యక్షతన మంత్రులు కేటీఆర్, ఈటల, ఇంద్రకరణ్రెడ్డిలతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. యాసిడ్ దాడులకు పాల్పడిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకునేలా చట్ట సవరణ చేయాలని నిర్ణయించారు. ఈ నేరస్తులకు పదేళ్ల నుంచి జీవిత కాల శిక్ష విధించడంతో పాటు నేరస్తులకు జరిమానా విధించి ఆ డబ్బును బాధితులకు అందజేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఎత్తిపోతలపై హరీశ్ నేతృత్వంలో బృందం రాష్ట్రంలో తక్షణం సాగునీటిని అందించే అవకాశమున్న ఎత్తిపోతల పథకాలపై మంత్రి వర్గంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా భక్త రామదాసు ప్రాజెక్టు తరహాలో త్వరగా నీటిని అందించగల ప్రాజెక్టులను గుర్తించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్రావులకు అధ్యయన బాధ్యతలను అప్పగించింది. ఏడాదిలోగా కొత్త కలెక్టరేట్లు అన్ని కొత్త జిల్లాల్లో ప్రభుత్వ, పోలీసు కార్యాలయాలను ఏడాదిలోగా నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది. సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలు, పోలీసు ఆఫీసు కాంప్లెక్స్ల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు, ప్రతిపాదనల తయారీ వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వివిధ శాఖల్లో అదనంగా ఉన్న ఉద్యోగులను పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న శాఖల్లోకి మార్చాలని ఆదేశించారు. వివిధ శాఖల్లో కొత్త పోస్టులు గ్రామీణ నీటి సరఫరా విభాగంలో 480 కొత్త పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీకి 519 పోస్టులు మంజూరు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)కు ఒక్కోదానికి 9 పోస్టుల చొప్పున మంజూరు చేసింది. పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో 10 రెగ్యులర్ పోస్టులు, 7 ఔట్ సోర్సింగ్ పోస్టులు.. అప్గ్రేడెడ్ బీసీ రెసిడెన్షియల్ కాలేజీల్లో 240 బోధన, బోధనేతర పోస్టుల ర్యాటిఫికేషన్.. జైళ్ల శాఖలో ఐజీ, అసిస్టెంట్ డైరెక్టర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల మంజూరు.. వరంగల్ జిల్లా మామునూరు వెటర్నరీ కాలేజీలో బోధన, బోధనేతర పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆరుగురు మంత్రుల పేషీల్లో తాత్కాలిక పోస్టులకు కూడా ఓకే తెలిపింది. కరీంనగర్లో ఫిషరీస్ కాలేజీ కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ) వద్ద ఫిషరీస్ కాలేజీ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. స్కూల్ అసిస్టెంట్లుగా భాషా పండితులు, పీఈటీలు విద్యా శాఖలో 2,487 మంది భాషా పండితులు, 1,047 పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. -
21 అడుగులకు ‘రామప్ప’ నీటిమట్టం
వెంకటాపురం : మధ్యతరహా నీటి ప్రాజెక్టు అయిన రామప్ప సరస్సులోకి దేవాదుల జలాలను గత మూడు రోజులుగా ఎయిర్ వాల్వ్ల ద్వారా పంపింగ్ చేస్తున్నారు. దీంతో సరస్సులో నీటిమట్టం 21 అడుగులకు చేరుకుంది. మంగళవారం ఉదయం ఐదు ఎయిర్వాల్వ్లలో రెండింటికి 600 ఎం.ఎం వ్యాసార్ధం కలిగిన పైపులను బిగించి, భీంఘన్పూర్ వద్ద మోటార్లను ప్రారంభించారు. దీంతో ఎయిర్వాల్వ్ల ద్వారా పెద్ద మొత్తంలో దేవాదుల జలాలు సరస్సులోకి చేరాయి. దీంతో ఆయకట్టు రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. -
దేవాదుల, ఎస్సారెస్పీపై దృష్టి
భూ సేకరణపై అధికారులతో నేడు మంత్రి హరీశ్రావు సమీక్ష వరంగల్: జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్–1, స్టేజ్–2తో పాటు దేవాదుల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంపై నీటిపారుదల మంత్రి హరీశ్రావు దృష్టి సారిం చారు. ఈ రెండు ప్రాజెక్టులపై సంబ«ంధిత శాఖ అధికారులతో శుక్రవారం కలెక్టరేట్లో జరిగే సమావేశంలో సమీక్షిస్తారని తెలిసింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు భూసేకరణలో జరుగుతున్న జాప్యంతో వ్యయం పెరిగిపోతోంది. ఇప్పటికే పలు దఫాలుగా వీడియో కాన్ఫరె¯Œ్సలో మంత్రి జిల్లా భూసేకరణ అధికారులైన జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవ¯ŒSపాటిల్ తదితరులతో సమీక్షించినా ప్రగతి కనిపిం చడం లేదు. ఏఐబీపీ పథకంలో దేవాదుల నిర్మాణానికి చేసే వ్యయంలో 25 శాతం కేంద్రం నిధులను అందించనుంది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రస్తుత అర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు వ్యయం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా కేంద్రం రూ.112 కోట్లు మంజూరు చేసింది. వచ్చే ఏడాది వరకు ఈ పథకం పూర్తి చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చినందున పనులు వేగవంతం చేయాల్సి ఉంది. అందుకోసం ఈ ఏడాది 10 వేల ఎకరాల భూమి సేకరించాలని జిల్లా అధికారులకు లక్ష్యంగా పెట్టారు. ఇందులో ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన 3వేల ఎకరాల భూమి జూ¯ŒSలోగా సేకరించాలని అధికారులను అదేశించారు. అయితే ఆ మేరకు పనులు జరుగకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దేవాదుల ఫేజ్–3 పనులను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫేజ్–3లో టన్నెల్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో ప్రస్తుతం చేపట్టే పనులను కొత్త ఏజెన్సీకి అప్పగించాలని భావిస్తోంది. ఈ పనులవల్ల నష్టపోయినందున ప్రస్తుతం చేపట్టే పనులను అప్పగిస్తే ఇప్పటి వరకు పొందిన బిల్లుల మొత్తాన్ని రానున్న బిల్లుల్లో మినహాయించుకుంటామని సదరు ఏజెన్సీ కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం దష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఎస్సారెస్పీ భూసేకరణతో పాటు దేవాదుల ఫేజ్–3 పనులను ప్రారంభించే విషయాన్ని మంత్రి హరీశ్రావు అధికారులతో చర్చిస్తారని తెలిసింది. -
దేవాదుల పైప్లైన్ లీకేజీ
ములుగు(వరంగల్): దేవాదుల మొదటి దశ పైప్లైన్ ఎయిర్ వాల్వ్ ను రైతులు ధ్వంసం చేశారు. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం నల్లగుంట వద్ద దేవాదుల గేట్వాల్ను శనివారం అర్ధరాత్రి సమీప గ్రామాల రైతులు లీక్ చేశారు. దీంతో పైప్లైన్ ఎయిర్వాల్వ్ ద్వారా భారీగా నీరు ఎగజిమ్ముతోంది. వృథాగా పోతున్న నీటిని సమీపంలోని ఆరెకుంటలోకి మళ్లించడంతో అది నిండిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు. -
దేవాదుల పైప్లైన్ గేట్వాల్వ్ లీకేజీ
శాయంపేట : భీంఘన్పూర్ రిజర్వాయర్ నుంచి ఫేజ్–1 పైప్లైన్ ద్వారా గోదావరి జలాలను పులుకుర్తి పంప్హౌస్కు దేవాదుల అధికారులు కొద్దిరోజులుగా పంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని గోవిందాపూర్, పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామాల శివారులో ఉన్న ఫేజ్–1 పైప్లైన్ గేట్వాల్వ్ వద్ద రెండు రోజులుగా లీక్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, సోమవారం పూర్తి స్థాయిలో గేట్వాల్వ్ లీకేజీ కావడంతో నీరు ఎగిసిపడింది. ఇలా బయటకు వచ్చిన నీరు పక్కనే ఉన్న ముప్పవాని చెరువులోకి చేరింది. -
తీరనున్న గ్రేటర్ వరంగల్ ప్రజల దాహార్తి
ఏటూరునాగారం: మంచినీళ్ల కోసం గ్రేటర్ వరంగల్ వాసులు పడుతున్న ఇబ్బందులు అతి త్వరలో తీరనున్నాయి. ఏటూరునాగారం మండలంలోని దేవాదుల నుంచి మంగళవారం నీటి పంపింగ్ ప్రారంభంకానుంది. ఇందుకు వీలుగా అధికారులు గోదావరి ఒడ్డున 16 మోటార్లను ఏర్పాటు చేశారు. గోదావరి నీటిని ఫోర్బేలకు మళ్లించి అక్కడి నుంచి భీంఘన్పూర్కు తరలిస్తారు. అక్కడి నుంచి పులకుర్తి, ధర్మసాగర్కు నీరు చేరుతుంది. అక్కడి నుంచి గ్రేటర్ వరంగల్ ప్రజలకు నీటి సరఫరా జరుగుతుంది. గురువారం నాటికి వరంగల్ ప్రజలకు తాగు నీరు అందనుంది. దీంతో నీటి కష్టాలు తీరనున్నాయి. -
దేవాదుల పైప్లైన్ లీక్
ధర్మసాగర్: వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం జానకిపురం సమీపంలో దేవాదుల ప్రాజెక్ట్ ఫేజ్-2 పైప్లైన్ శుక్రవారం రెండుచోట్ల లీకైంది. ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి గండిరామారానికి ఫేజ్-2 పైప్లైన్ ద్వారా నీటిని తలిస్తున్నారు. ఈ క్రమంలో జానకిపురం గ్రామ సమీపంలో పైప్లైన్ ఎయిర్వాల్వ్లు రెండుచోట్ల లీక్ కావటంతో నీరు పెద్దఎత్తున పైకి చిమ్ముతూ పక్కనే ఉన్నపంటపొలాలకు వెళ్తోంది. -
డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్
తుర్కయాంజల్(రంగారెడ్డి జిల్లా): స్వాతంత్య్ర సమరయోధుడికిచ్చిన భూమిపై తప్పుడు నివేదిక ఇచ్చినందుకు గాను దేవాదుల డిప్యూటీ కలెక్టర్పై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. 2005-06 సంవత్సరాల్లో హయత్నగర్ మండల డిప్యూటీ తహశీల్దార్గా సముద్రాల రామచంద్రయ్య పనిచేశారు. మండలంలోని తుర్కయాంజల్ గ్రామం సర్వేనంబర్-52లోని పదెకరాల భూమిని బండారు లింగయ్య అనే స్వాతంత్య్ర సమరయోధునికి గతంలో ప్రభుత్వం కేటాయించింది. అయితే, ఆ భూమిని లింగయ్య స్వాధీనం చేసుకోలేదు. ఆ మేరకు పొజిషన్లో లేనట్లు రికార్డులున్నాయి. అయితే, ఆయన పొజిషన్లో ఉన్నట్లు 2005లో రామచంద్రయ్య ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిపై గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికారుల విచారణలో తప్పుడు రిపోర్టు ఇచ్చినట్లు తేలటంతో కలెక్టర్ ఉత్తర్వుల మేరకురామచంద్రయ్యఅరెస్టు చేశారు. -
దేవాదుల గేట్ వాల్వును విప్పిన రైతులు
-గ్రామ చెరువులు నింపుకునేందుకు యత్నం స్టేషన్ఘన్పూర్: వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని చిల్పూరు- మల్కాపూర్ గ్రామాల మధ్య నుంచి వెళ్తున్న రెండో దశ పైప్లైన్ గేట్ వాల్వును ఆదివారం రైతులు విప్పి.. చెరువులు నింపుకున్నారు. దేవాదుల పైప్లైన్ ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి మల్లగండికి అధికారులు నీటిని పంపిస్తున్నారు. అయితే, వర్షాభావంతో నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో పాటు మూగ జీవాలు సైతం నీళ్లులేక అల్లాడుతుండడంతో చూడలేక ఆదివారం మల్కాపూర్, వెంకటాద్రిపేట, చిల్పూరు రైతులు సమావేశమయ్యారు. చిల్పూరు-మల్కాపూర్ గ్రామాల మద్య ఉన్న గేట్ వాల్వును విప్పితే సమభాగంగా మూడు గ్రామాల్లోని చెరువుల్లోకి నీరు చేరుతుందని దీంతో మూగ జీవాలను కాపాడుకోవ చ్చని నిర్ణయించుకున్నారు. ఆదిఆవరం రాత్రి సమయంలో గేట్వాల్వును విప్పడంతో ఒక్కసారిగా నీరు ఎగజిమ్మింది. నీరు చెరువుల్లోకి చేరుతోంది. అయితే, తాము ఒకరి కోసం ఈపని చేయలేదని కనీసం మూగ జీవాలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈపని చేశామన్నారు. గేట్వాల్యూ విప్పిన విషయం అదివారం రాత్రి పొద్దుపోయేంత వరకు అధికారుల దృష్టికి రాలేదని సమాచారం.


