పాఠశాల మరుగుదొడ్లకు నీటి సరఫరా తప్పనిసరి
- వీడియో కాన్ఫరెన్స్లో కడియం
సంగారెడ్డి జోన్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మిస్తున్న మరుగుదొడ్లకు నీటి సరఫరా కల్పించా లని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్లనుఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆయన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రంజీవ్ ఆచార్యతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కడియం మాట్లాడుతూ నీటి సరఫరా లేకుండా మరుగుదొడ్లను నిర్మిస్తే ప్రయోజనం ఉండబోదన్నారు. నిధుల సమస్య ఉంటే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, గ్రామ పంచాయతీ నిధులను ఉపయోగించుకొనేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట సీఎస్ఆర్ నిధులను కూడా వాడుకొని నీటి సౌకర్యాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ రోనాల్డ్రాస్ మాట్లాడుతూ... జిల్లాలో 2646 పాఠశాలల్లో మరుగుదొడ్లకు నీటి వసతి లేదని, ఇందులో 853 పాఠశాలల్లో ఆర్డబ్ల్యూఎస్ ద్వారా మరో 51 పాటశాలల్లో ఎస్ఎస్ఎ ద్వారా నీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 544 మరుగుదొడ్ల నిర్మాణం, నీటి సరఫరా పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. 46 పాఠశాలల్లో పనులు పూర్తయినట్లు చెప్పారు. సమావేశంలో ఆర్వీఎం పీఓ యాస్మిన్ భాష, డీఈఓ రజీమొద్దీన్ పాల్గొన్నారు.
ప్రతి మొక్కనూ రక్షించాలి: సీఎస్
రాష్ట్రంలో హరితహారం కింద నాటిన ప్రతి మొక్కనూ రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాజీవ్శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల వారీగా పెంచి న, నాటిన మొక్కల వివరాలు తెలుసుకున్నా రు. ఇటీవల కురిసిన వర్షాలపై సమీక్షించారు. తదుపరి చర్యలు సూచించారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో నాటిన మొక్కల వివరాలను కంపార్ట్మెంట్ వారీగా వెంటనే జిల్లా కలెక్టర్కు అందించాలని డీఎఫ్ఓలకు సూచించా రు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్రాస్ మాట్లాడుతూ... జిల్లా లక్ష్యం 3.52 కోట్ల మొక్కలని, అందులో 60 లక్షల మొక్కలు నాటామని చెప్పారు. ఈ ఏడాది 40 శాతం వర్షపాతం తక్కువగా నమోదైందన్నారు. జిల్లాలో పండ్ల మొక్కలకు డిమాం డ్ బాగా ఉందని, దూర జిల్లాల నుంచి వాటిని తెప్పించే బదులు స్థానిక హార్టికల్చర్ నర్సరీల నుంచి పంపిణీ చేస్తే ప్రయోజనకరంగా ఉం టుందని ప్రతిపాదించారు. వీడియో కాన్ఫరెన్స్లో హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్పీటర్, సంగారెడ్డి నుంచి డీఎఫ్ఓలు సుధాకర్రెడ్డి, శివానిడోగ్రే పాల్గొన్నారు.