breaking news
deo enquiry
-
ఆరుగురు విద్యార్థుల సస్పెన్షన్
నల్లమాడ: శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను పాఠశాల నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీన పాఠశాలలోని తరగతి గదిలో కొందరు విద్యార్థులు ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మంగళవారం డీఈఓతో పాటు డిప్యూటీ డీఈఓ మీనాక్షి, ఏడీ రామకృష్ణ, ఎంఈఓ వేమనారాయణ పాఠశాలలో విచారణ చేపట్టారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ... ఘటనపై సమగ్ర నివేదికను కలెక్టర్కు అందజేస్తామని, తదుపరి ఆదేశాలిచ్చే వరకూ ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే... ? ఏప్రిల్ 30న ఎస్ఏ పరీక్షలు ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులు ఓ తరగతిలో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, డెస్క్, వైర్కుర్చీ(చైర్) ధ్వంసం చేశారు. ఆ రోజు విధుల్లో ఉన్న ఇన్చార్జ్ హెచ్ఎం శ్యాంప్రసాద్ ఫిర్యాదు మేరకు హెచ్ఎం రమణప్ప మరుసటి రోజు ఘటనకు బాధ్యులైన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. తమ పిల్లలు చేసిన పనికి తాము క్షమాపణలు కోరుతున్నామని, మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా చూసుకోవడంతో పాటు ధ్వంసమైన ఫర్నీచర్ మరమ్మతులకు అయ్చే ఖర్చు తామే భరిస్తామని చెప్పడంతో అప్పట్లో సమస్య సద్దుమణిగింది. తాజాగా ఈ నెల 2న ఇలాంటి సంఘటనే అనంతపురం జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. అయితే అది నల్లమాడ ఉన్నత పాఠశాలలో జరిగినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు హల్చల్ చేశాయి. దీంతో ఏప్రిల్ 30న నల్లమాడ పాఠశాలలో జరిగిన ఘటన మళ్లీ తెరపైకొచ్చింది. ఈ నేపథ్యంలో డీఈఓ పాఠశాలకు విచ్చేసి విచారణ చేపట్టారు. సామగ్రి ధ్వంసం చేసిన విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడారు. విద్యార్థులు తరగతి గదిలోని సామగ్రి ధ్వంసం చేసిన విషయం వాస్తవమేనని తేలడంతో డీఈఓ వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఆ విద్యార్థులను సస్పెండ్ చేయాలని హెచ్ఎం రమణప్పకు ఆదేశాలిచ్చారు. (చదవండి: వదినతో గొడవ.. పల్సర్ బైకుకు నిప్పు.. ఆపై పోలీస్స్టేషన్కి వెళ్లి..) -
సారూ..ఇదేమి తీరు!
వారిది సమాజంలో ఉన్నత స్థానం. భావిభారత పౌరులను తయారు చేసే బాధ్యత గల ఉద్యోగం. అలాంటి స్థానంలో ఉన్న కొందరు అడ్డదారులు తొక్కారు. పదోన్నతి కోసం ఏకంగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు. తద్వారా ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించారు. 2009 ఫిబ్రవరి నుంచి ఈ దందా సాగింది. సాక్షి,అనంతపురం: ఉపాధ్యాయుల నియామకం కోసం 2009 సంవత్సరంలో మెగా డీఎస్సీ నిర్వహించారు. ఆ సమయంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో 70 శాతం పదోన్నతుల ద్వారా, 30 శాతం నేరుగా భర్తీ చేశారు. భారీ స్థాయిలో పదోన్నతులకు అవకాశం కల్పించడంతో కొందరు పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చదవకపోయినా.. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) నుంచి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందారు. అప్పట్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్లో 380, ఫిజికల్ సైన్స్లో 398, మేథమేటిక్స్లో 412, బయలాజికల్ సైన్స్లో 370, సోషల్ స్టడీస్లో 450 మందికి పదోన్నతులు దక్కాయి. ఇంగ్లిష్లో అక్రమాలు అత్యధికం.. స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి దక్కాలంటే బీఈడీలో సంబంధిత సబ్జెక్టు (మెథడాలజీ) చదివి ఉండాలి. అయితే ఇంగ్లిష్ సబ్జెక్టుకు మాత్రం బీఈడీలో సంబంధిత మెథడాలజీతో పాటు డిగ్రీలో ఇంగ్లిష్ లిటరేచర్ లేదా ఎంఏ ఇంగ్లిష్ చదివి ఉండాలి. ఒకే దఫా 380 మందికి ఇంగ్లిష్ ఎస్ఏలుగా పదోన్నతులు వచ్చాయి. దీంతో పీజీ పూర్తి చేయని వారు కూడా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందారు. 52 మంది ఇలా అక్రమ మార్గంలో పదోన్నతులు తీసుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ సర్టిఫికెట్ల అంశంపై ఫిర్యాదులు వెళ్లడంతో అప్పటి విద్యాశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య విచారణకు ఆదేశించారు. సీబీసీఐడీ దర్యాప్తు కూడా చేయించారు. అయితే సీబీసీఐడీ దర్యాప్తునకు అప్పటి విద్యాశాఖ అధికారులు తగిన సహకారం అందించలేదు. కమిషనర్ నేరుగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనప్పటికీ ఉద్దేశపూర్వకంగానే వివరాలివ్వకుండా జాప్యం చేశారు. ఇద్దరిని సస్పెండ్ చేసి.. భారీఎత్తున సాగిన అక్రమ పదోన్నతుల వ్యవహారాన్ని మరుగున పరిచేందుకు అప్పటి విద్యాశాఖ అధికారులు తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని గుర్తింపు లేని యూనివర్సిటీల పేరిట ఎంఏ ఇంగ్లిష్ పీజీ సర్టిఫికెట్లు సమర్పించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి మొత్తం వ్యవహారాన్ని మరుగున పడేలా చేశారు. ఈ రెండు మాత్రమే నకిలీ సర్టిఫికెట్లు అని పదేపదే ప్రచారం చేయడం ద్వారా మిగిలిన వారి గుట్టురట్టు కాకుండా జాగ్రత్త పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం.. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు దూరవిద్య విధానంలో పీజీ చేయాలంటే ముందస్తుగా అధికారుల అనుమతి తీసుకోవాలి. వారాంతాల్లో జరిగే దూరవిద్య తరగతులకు హాజరుకావాలి. పరీక్షలు జరిగినప్పుడు.. అందుకు సంబంధించిన పూర్వానుమతి తీసుకోవాలి. కానీ ఇవేవీ లేకుండానే యూజీసీ నిషేధం విధించిన అలగప్ప, వినాయక మిషన్స్, మధురై కామరాజ్, భారతీయార్ వంటి వర్సిటీల పేరిట ఎంఏ ఇంగ్లిష్ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీల పేర్లతోనూ సర్టిఫికెట్లు తెచ్చినప్పటికీ ..నిబంధనలు పాటించలేదని పూనం మాలకొండయ్య ఇచ్చిన నివేదికలో స్పష్టం చేశారు. 2009లోనే కాకుండా ఆ తర్వాత చేపట్టిన పదోన్నతుల్లోనూ ఇంగ్లిష్తో పాటు మరికొన్ని సబ్జెక్టుల్లో కొందరు అక్రమ మార్గాలు అనుసరించినట్లు తెలుస్తోంది. అక్రమ పదోన్నతుల వ్యవహారం ఉపాధ్యాయ వర్గాల్లో తరచూ చర్చకు వస్తోంది. ఇటీవల కూడా ఏసీబీకి, విద్యాశాఖ కమిషనర్కు కొందరు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. -
పేపర్ల లీక్ వ్యవహారంపై దర్యాప్తు
కదిరి టౌన్ : టెన్త్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై దర్యాప్తు చేపడుతున్నామని జిల్లా విద్యాశాఖాధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం ఆయన కదిరిలోని పదోతరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికలతోపాటు మున్సిపల్ హైస్కూల్, షిరిడిసాయి, బ్లూమూన్ పాఠశాల పరీక్షా కేంద్రాలను ఆయన పరిశీలించారు. కేంద్రాల్లో విద్యార్థులు రాస్తున్న పరీక్షా విధానాన్ని పరిశీలించి చీఫ్ అధికారులు, డిపార్ట్మెంటల్ అధికారులకు సూచనలందించారు. ఈ సందర్భంగా జిల్లాలోని మడకశిర, కూడేరు, కదిరి పరీక్షా కేంద్రాల నుంచి ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని మీడియా ప్రశ్నించారు. దీనికి డీఈఓ సమాధానమిస్తూ పేపర్ లీక్ వ్యవహారంపై దర్యాప్తు చేపడుతున్నామని, అందుకు పోలీస్ శాఖ కూడా బాధ్యులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోందన్నారు.