breaking news
deepam connection
-
‘దీపం’ పంపిణీకి 6న మేళా
అనంతపురం అర్బన్ : ‘అనంత’ని పొగరహిత జిల్లా మార్చేందుకు కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు దీపం పథకం కింద కనెక్షన్ల పంపిణీకి ఈ నెల 6వ తేదీన జిల్లాలోని అన్ని పంచాయతీల్లో మేళా నిర్వహించాలని ఇన్చార్జ్ జేసీ సయ్యద్ ఖాజా మొహిద్ధీన్ అధికారులను, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులను ఆదేశించారు. నగరంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించాలన్నారు. దీపం కనెక్షన్ల పంపిణీపై గురువారం ఆయన తన చాంబర్లో పౌర సరఫరాల శాఖ అధికారులు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అంతకు ముందు గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో డీఎస్ఓ టి.శివరాంప్రసాద్ సమావేశమైన సూచనలిచ్చారు. అనంతరం వివరాలను విలేకరులకు ఇన్చార్జ్ జేసీ వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా ఈ నెలలో ఏడు మేళాలు నిర్వహిస్తామన్నారు. మొదటి మేళా ఈ నెల 6వ తేదీన 1003 పంచాయతీల్లో, అటు తరువాత వారానికి రెండు చెప్పున మూడువారాల్లో ఆరు మేళాలు నిర్వహిస్తారమన్నారు. అన్ని గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ సిలిండర్లు, సామాగ్రితో పాటు మేళా హాజరవుతాయన్నారు. అక్కడికక్కడే అర్హులకు కనెక్షన్ మంజూరు చేస్తారని చెప్పారు. గ్యాస్ కనెక్షన్లు అధికంగా పొందిన పంచాయతీని పొగరహిత పంచాయతీగా ప్రకటిస్తూ అవార్డు ప్రదానం చేస్తామన్నారు. సమావేశంలో పౌరసరఫరాల మేనేజర్ డి.శివశంకర్రెడ్డి, ఏఎస్ఓలు ప్రేమ్కుమార్, సౌభాగ్యలక్ష్మి, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు మురళీ, హరికృష్ణ పాల్గొన్నారు. -
కార్డులో ఒక్కరే ఉన్నా ‘దీపం’ కనెక్షన్
అనంతపురం అర్బన్ : జిల్లాలో ఇప్పటి వరకు దీపం పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్లను మహిళల పేరు మీద మాత్రమే ఇచ్చే వారు. ఈ విధానంలో ప్రభుత్వం మార్పు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. జిల్లాలో కొందరు ఒక్కరే తెల్ల రేషన్ కార్డులో సభ్యునిగా ఉన్నారు. అది ముఖ్యంగా పరుషులు మాత్రమే ఇలా (సింగిల్ మెంబర్)ఉన్నారు. సింగిల్ మెంబర్ కార్డులు జిల్లాలో 15 వేల వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు కేవలం మహిళల పేరున మాత్రమే దీపం కనెక్షన్ ఇస్తుండంతో, తెల్లకార్డు కలిగి ఉన్నప్పటికీ పురుషుడు ఒక్కరే కార్డులో సభ్యునిగా ఉన్న కారణంగా గ్యాస్ కనెక్షన్ మంజూరయ్యేది కాదు. ఇలాంటి వారికి కూడా దీపం పథకం కింద కనెక్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి జిల్లా యంత్రాగం పంపింది. ఇందుకు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు అధికారులు తెలిపారు. సింగిల్ మెంబర్ కార్డులకూ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేలా ఉత్తర్వులను త్వరలో జారీ చేస్తామని ఉన్నతాధికారులు నుంచి సమాచారం అందిందని అధికార వర్గాలు తెలిపాయి.