డీసీసీబీ ఉద్యోగుల నిరసన
సాక్షి, గుంటూరు: కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగులకు తాత్కాలిక భృతి మంజూరు చేసి, వేతన సవరణ జరపాలని ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.నాగేశ్వరరావు, ఎంవీఎస్ఆర్ కోటిరెడ్డి డిమాండ్ చేశారు. డీసీసీబీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులందరూ బ్రాడీపేట బ్యాంకు పరిపాలనా కార్యాలయం ఎదుట బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. వారు మాట్లాడుతూ 2012 నవంబర్లో వేతన సవరణ జరపాల్సి ఉండగా, అధికారులు ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోవడం దారుణమన్నారు. 15 శాతాన్ని తాత్కాలిక భృతిగా మంజూరుచేయాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
ఇందుకు నిరసగా బుధవారం నుంచి ఈనెల 25వ తేదీ వరకూ నిరసన ప్రదర్శనలు, తిరిగి 27 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకూ సహాయ నిరాకరణ పాటిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 4న ఉద్యోగులందరూ సామూహికంగా సెలవు పెడతామని, అప్పటికీ స్పందించకపోతే అదే నెల 12న సమ్మె చేపడతామని హెచ్చరించారు. డీసీసీబీ చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య సంఘటన స్థలికి చేరి వారితో మాట్లాడారు. సమస్యల పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రదర్శనలో ఉద్యోగ సంఘ నాయకులు వి.రాధాకృష్ణమూర్తి, రవికుమార్, డేవిడ్, పీవీప్రసాద్, వైఎస్ ప్రసాద్, కె.శ్రీనివాసరావు, జానీ, శివన్నారాయణ, పి. శేషభానురావు, వీవీఎస్ ఫణికుమార్, కె.మాధవి, టి. కృష్ణవేణి పాల్గొన్నారు.