breaking news
Darna before house
-
ప్రేమ పెళ్లి.. ఏమైందో గాని.. ఉద్యోగానికని చెప్పి జారుకున్నాడు
మద్దిపాడు (ప్రకాశం) : ఉద్యోగం చేసే ప్రాంతంలో స్నేహంతో ప్రారంభమై ప్రేమగా మారి పెద్దలకు తెలియకుండా బయటకు వెళ్లి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త తనను వదిలేసి ఇంటికి వచ్చేశాడని ఓ యువతి ఆరోపిస్తోంది. తన భర్త గ్రామానికి వచ్చి నిరసన దీక్ష చేస్తోంది. బాధితురాలి కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన సునంద అనే యువతి బెంగళూరు సమీపంలోని ఓ గార్మెంట్స్ కంపెనీలో పని చేస్తోంది. మండలంలోని దొడ్డవరానికి చెందిన కాట్రగడ్డ అనిల్ అదే కంపెనీలో పని చేస్తూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో గత డిసెంబర్లో వీరు పని చేస్తున్న కంపెనీ నుంచి బయటకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న యువతి తల్లి, ఆమె కుటుంబ సభ్యులు వారిని పట్టుకుని ఈ సంవత్సరం జనవరి 12వ తేదీన బెంగళూరులో వివాహం జరిపించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి నుంచి ఇంట్లోని సామగ్రిని అనిల్ ఒక్కొక్కటిగా అమ్ముకుంటున్నాడు. అనిల్ తన దుస్తులు సర్దుకుని హైదరాబాద్లో ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. చేసేది లేక సునంద బెంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. భర్త ఎంతకూ తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో అనుమానించింది. తన బంధువుల సాయంతో సునంద ఎట్టకేలకు దొడ్డవరం చేరుకుంది. కుమారుడి గురించి అత్తమామలను ప్రశ్నించింది. తమకు సంబంధం లేదని, మీరే మా వాడిని ఏదో చేసి ఉంటారని ఇబ్బందిగా మాట్లాడారు. తనను ఇంట్లోకి కూడా రానివ్వలేదని ఆ యువతి వాపోయింది. విషయం పోలీసుల వరకూ వెళ్లింది. ఎస్ఐ కలగజేసుకుని బాధితురాలితో మాట్లాడారు. అనిల్ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. సునందతో కలిసి తమ కుమారుడి ఆచూకీ కోసం తాము కూడా గాలిస్తామని చెప్పారు. -
ఆలయంలో ఆశ్రయం...ప్రసాదమే ఆహారం!
-
ఆలయంలో ఆశ్రయం...ప్రసాదమే ఆహారం!
చిలకలగూడ: ఆమె కోట్ల రూపాయలకు అధిపతి.. కానీ దేవుని ప్రసాదంతో కడుపు నింపుకోవాల్సిన దైన్య స్థితి. చిన్నతనంలో తన చేతి గోరుముద్దలు తిన్న బిడ్డలు... వృద్ధాప్యంలో ఆదరించకపోవడంతో పదిహేనేళ్లుగా ఆలయం చెంతనే ఆశ్రయం పొందుతోంది. కష్టాలు భరించలేని ఆ తల్లి చివరకు తనకు రావాల్సిన ఆస్తి కోసం కొడుకులు ఉంటున్న అపార్ట్మెంట్ ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె మెట్టుగూడకు చెందిన కిమాబాయి పునేరియా (72). బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన ద్వారకదాసు, కిమాబాయి పునేరియాలు భార్యాభర్తలు. వీరికి నలుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తితోపాటు వ్యాపారంలో రూ.కోట్ల విలువైన చర, స్థిరాస్థులను సంపాదించిన ద్వారకదాసు 2001లో మృతిచెందాడు. అప్పటికే భార్య కిమాబాయితో పాటు బిడ్డలకూ ఆస్తిని సమానంగా పంచి పెట్టాడు. భర్త మరణంతో కిమాబాయికి సమస్యలు మొదలయ్యాయి. ఒత్తిడి చేసి ఆస్తిని చేజిక్కించుకున్న కుమారులు ఆనక అమ్మ ముఖం చూసేందుకు నిరాకరించారు. కుమారులతో పాటు వారి కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఆ తల్లి యాదగిరిగుట్టకు వెళ్లి దైవసేవలో గడుపుతోంది. భక్తులు పెట్టే ప్రసాదంతో కడుపు నింపుకుంటోంది. కుమారులు జల్సాలు చేస్తుంటే...రూ.కోట్లకు అధిపతినైన తానెందుకు కష్టాలు పడాలని భావించింది. తన ఆస్తి ఇవ్వాలని కోరుతూ మెట్టుగూడలో కుమారులు ఉంటున్న అపార్ట్మెంట్ ముందు బుధవారం సాయంత్రం ధర్నాకు దిగింది. ‘నా ఆస్తి ఇస్తే... ఇటువంటి కుమారుల చేతిలో బాధ పడుతున్న తల్లుల కోసం ఏర్పాటు చేసే వృద్ధాశ్రమం, అనాథ శరణాలయాలకు విరాళంగా అందజేస్తానని కిమాబాయి మీడియాకు తెలిపింది. «సన్నిహితుల సలహాతో ధర్నా విరమించి... కుమారులపై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని ఆస్తులపై వివాదం కోర్టులో పెండింగ్లో ఉందని... కొంతమంది కావాలనే తమ తల్లితో కలిసి ఈ విధంగా చేస్తున్నారని ఆమె కుమారులు తెలిపారు.