జనగణన మనందరి బాధ్యత
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం 133వ ’మన్ కీ బాత్’కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘ఇప్పుడు జరుగుతున్న జాతీయ జనగణన కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు. ఇది అందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఖచ్చితంగా ఇందులో భాగస్వాములు కావాలి. తొలిసారిగా ప్రజలు తమ వివరాలను స్వయంగా మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించాం. మీ వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుతాం. వివరాలు పూర్తి సురక్షితంగా ఉంటాయి’’ అని ప్రధాని హామీ ఇచ్చారు. స్వదేశీ పరిజ్ఞానంతో తమిళనాడులోని కల్పకంలో నిర్మించిన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ‘క్రిటికాలిటీ’ దశను దాటడం దేశ అణు ఇంధన ప్రయాణంలో చారిత్రక మైలురాయి’’ అని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రకృతి పరిరక్షణపై స్ఫూర్తిదాయక చర్యలు జరుగుతున్నాయని ప్రధాని హర్హం వ్యక్తం చేశారు. కచ్ రాణ్ ప్రాంతంలో జరుగుతున్న ప్రకృతి పరిరక్షణ యత్నాలను ప్రత్యేకంగా అభినందించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపును సూచించే బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాన్ని ‘వేవ్స్’ ఓటీటీ వేదికగా అందుబాటులోకి తెచ్చామన్నారు.