breaking news
Cooperative Dairy
-
పునరుద్ధరణ దిశగా ప్రకాశం డెయిరీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో సహకార డెయిరీ పునరుద్ధరణకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే దేశంలోనే రెండో అతిపెద్ద పాల కర్మాగారంగా పేరొందిన చిత్తూరు విజయ డెయిరీ పునరుద్ధరణకు జూలై 4న సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేసిన విషయం విదితమే. తాజాగా ప్రకాశం డెయిరీని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమూల్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని నవంబర్లో భూమిపూజకు ఏర్పాట్లు చేస్తోంది. అమూల్ రూ.400 కోట్ల పెట్టుబడి ప్రకాశం డెయిరీకి ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 95.42 ఎకరాల భూములతోపాటు కోట్లాది రూపాయల విలువైన యంత్ర పరికరాలు ఉన్నాయి. 2013 ఫిబ్రవరి 13న టీడీపీ హయాంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఇండియన్ కంపెనీస్ యాక్టు–1956 కింద పీడీసీఎంపీయూ లిమిటెడ్ పేరిట కంపెనీగా మార్చిన ఈ డెయిరీని ఆ తర్వాత దశల వారీగా నిర్వీర్యం చేశారు. ఈ డెయిరీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. డెయిరీకి చెందిన పాత బకాయిలు రూ.108.32 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. కాగా, ఇక్కడ రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమూల్ సుముఖత వ్యక్తం చేసింది. పాల ఫ్యాక్టరీతో పాటు వెన్న తయారీ యూనిట్, నెయ్యి ప్లాంట్, మిల్క్ పౌడర్ ప్లాంట్, యూహెచ్టీ ప్లాంట్లతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బాలామృతం తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారు. అప్పట్లో పథకం ప్రకారం నిర్వీర్యం సహకార డెయిరీ రంగాన్ని పథకం ప్రకారం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన పాల యూనియన్లను ప్రభుత్వ అనుమతి లేకుండానే మాక్స్ సొసైటీలుగా.. ఆ తర్వాత కంపెనీలుగా మార్చుకున్నారు. ఇలా 2016 జనవరి 6న విశాఖ మిల్క్ యూనియన్, 2013 జూన్ 18న గుంటూరు, 2013 ఫిబ్రవరి 13న ప్రకాశం జిల్లా యూనియన్లు కంపెనీల యాక్టు–1956 కింద మార్చేశారు. 2017 జనవరి 23న పులివెందుల డెయిరీ, 2018 జూలై 31న రాజమండ్రి డెయిరీ, 2018 నవంబర్ 30న కంకిపాడు మినీ డెయిరీ, 2019 మార్చి 15న మదనపల్లి డెయిరీ ఇలా వరుసగా 8 సహకార డెయిరీలు మూతపడ్డాయి. వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న ప్రభుత్వం.. మూతపడిన డెయిరీలకు పూర్వ వైభవం తెచ్చేందుకు పునరుద్ధరణను వేగవంతం చేసింది. ఇప్పటికే మదనపల్లి డెయిరీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2021 నుంచి దీనిని అమూల్ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను తీర్చిన ప్రభుత్వం అమూల్ సహకారంతో పూర్వవైభవం తెచ్చేందుకు జూలై 4న సీఎం భూమి పూజ చేశారు. ఇక్కడ అమూల్ సంస్థ రూ.385 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్తో పాటు పాల కర్మాగారం, బటర్, పాల పొడి, చీజ్, పన్నీర్, యాగర్ట్ స్వీట్స్, యూహెచ్టీ విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. 10 నెలల్లో లక్ష టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తోంది. -
YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో జోష్
సాక్షి, అమరావతి: ‘వ్యవసాయమే కాకుండా వ్యవసాయ ఆధారిత రంగాలలో కూడా రైతులకు, అక్కచెల్లెమ్మలకు అవకాశాలు చూపించగలిగినప్పుడే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరుగెత్తగలుగుతుందని నమ్మాను. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగానే రాష్ట్రంలోకి అమూల్ని తీసుకు వచ్చాం. పాల సేకరణ ద్వారా అక్కచెల్లెమ్మలందరికీ మరింత ఆదాయం వచ్చేలా చేస్తున్నాం. తద్వారా వచ్చే రెండేళ్లలో గ్రామీణ ముఖ చిత్రం పూర్తిగా మారబోతోంది’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. జగనన్న పాల వెల్లువలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ–అమూల్ పాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్ధేశించి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఆమూల్ పాల సేకరణను విస్తరించనున్నామని చెప్పారు. తద్వారా పాడి రైతులైన అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా బలోపేతం కానున్నారని పేర్కొన్నారు. ‘పాదయాత్రలో నేను చూసిన పరిస్థితులు ఇప్పటికీ గుర్తున్నాయి. దాదాపు ప్రతి జిల్లాలోనూ ఒక లీటరు పాలు తీసుకుని వచ్చి నాకు చూపించేవారు. ఒక లీటరు పాల రేటు రూ.23 ఉంది. ఒక లీటరు మినరల్ వాటర్ రేటు ఇంత కన్నా ఎక్కువుంది.. ఇదీ మా పరిస్థితి అని అక్కచెల్లెమ్మలు, పాడి రైతులు చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతు బాగుండాలని, వ్యవసాయ ఆధారిత రంగాల ద్వారా అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా బలపడాలని వెంటనే రాష్ట్రంలోకి అమూల్ని తీసుకొచ్చాం’ అన్నారు. అమూల్కు లాభాపేక్ష లేదని, లాభాలన్నీ ఏడాదికి ఒకసారి తిరిగి అక్క చెల్లెమ్మలకే ఇస్తూ గొప్ప పని చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. అమూల్ దేశంలో నంబర్ వన్ సహకార సంస్థ ► అమూల్ సంస్థ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అనసరంలేదు. దేశంలోనే నంబర్ వన్ సహకార రంగ సంస్థ. దాదాపుగా రూ.50 వేల కోట్లు టర్నోవర్ చేస్తున్న ఈ సంస్థలో వాటాదారులు ప్రైవేటు వ్యక్తులు కాదు. వాటాదారులు అందరూ కూడా పాలుపోసే అక్కచెల్లమ్మలే. మిగిలిన వాళ్లతో పోలిస్తే పాల సేకరణ ధరను అక్కచెల్లెమ్మలకు అమూల్ అధికంగా ఇస్తోంది. ► అమూల్ సంస్థ ప్రపంచంతో పోటీ పడుతుంది. ఈ సంస్థ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. అమూల్కు మిగతా సంస్థలకు తేడాను కూడా గమనించాలి. అమూల్ సంస్థలో పాల నుంచి నేరుగా చాక్లెట్లు తయారే చేసే విధంగా వారి ప్రాసెసింగ్ ఉంది. ► సహకార సంస్థను బాగా నడిపితే, ప్రైవేటు వ్యక్తులు ఆ సంస్థను ఆక్రమించకపోతే, రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందో చెప్పడానికి అమూల్ సజీవ ఉదాహరణ. ఇలాంటి అమూల్ సంస్థతో 2020 జూలై 21న ఒప్పందం కుదుర్చుకున్నాం. అదే సంవత్సరం డిసెంబర్ 2న అమూల్ పాలవెల్లువ ప్రాజెక్టు ప్రారంభించాం. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో పాల సేకరణ ► చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే 722 గ్రామాల్లో విజయవంతంగా పాలసేకరణ జరుగుతోంది. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ అడుగు పెడుతోంది. 153 గ్రామాల్లో పాల సేకరణ ప్రారంభిస్తున్నాం. ► రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 2,600 గ్రామాల్లో, రెండేళ్లు పూర్తయ్యేలోగా మొత్తంగా 9,899 గ్రామాల్లో అమూల్ను విస్తరించి, అక్క చెల్లెమ్మలకు ప్రతి లీటరు పాలకు రూ.5 నుంచి రూ.15 వరకు ఎక్కువ రేటు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాం. ► మిగతా డెయిరీలతో పోల్చితే అధిక ధర చెల్లించడమే కాకుండా పాల బిల్లును కేవలం పది రోజుల్లోనే పాడి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ‘ప్రైవేట్’ స్వార్థంతో సహకార డెయిరీలు మూత ► సహకార రంగంలోని డెయిరీలు నష్టాలలో కూరుకుపోయాయి. ప్రైవేటు డెయిరీలు అటు పాడి రైతులను, ఇటు వినియోగదారులను దోపిడీ చేయగలిగే పరిస్థితి నెలకొంది. ఇలా ఎందుకు జరిగిందంటే సహకార రంగంలో ఉన్న డెయిరీలకు అమూల్ మాదిరిగా పూర్తి స్థాయి ప్రాసెసింగ్ యూనిట్లు ఉండాల్సిన పరిస్ధితిలో లేకపోవడమే. ► మార్కెట్ను పెంచుకోవడంలో సహకార డెయిరీలు ఆ స్థాయికి ఎదగలేదు. కొన్ని మంచి డెయిరీలను ప్రైవేట్ వ్యక్తులు పూర్తిగా ఆక్రమించేసుకుని, వాటిని ప్రైవేట్ ఆస్తుల కింద మార్చుకున్నారు. ► ప్రభుత్వంలోని వ్యక్తులకు ప్రైవేటు డెయిరీల్లో ప్రయోజనాలు ఉన్నందు వల్ల వాళ్ల ఆదాయాలు పెంచుకునేందుకు, రాష్ట్రంలో సహకార వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసిన పరిస్ధితులు మన కళ్లెదుటే కనిపించాయి. ఈ పరిస్థితిని మార్చి.. అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలన్న అన్న తపన, తాపత్రయం, ఆరాటంతో ఈ కార్యక్రమం పుట్టుకొచ్చింది. కళ్లెదుటే పాలల్లో నాణ్యత పరీక్ష ► 2,600 గ్రామాల్లో మనం బీఎంసీలు అంటే బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్(ఏఎంసీ) తీసుకొస్తున్నాం. దీనివల్ల అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుంది. గతంలో పాలు పోసేటప్పుడు నాణ్యత ఏమిటన్నది అక్కచెల్లెమ్మలకు ఎప్పుడూ తెలిసేది కాదు. ► ఇప్పుడు బీఎంసీలు, ఏఎంసీల వల్ల మన కళ్ల ఎదుటే మనం పోసే పాల నాణ్యత తెలిసిపోతుంది. అలా తెలిసిన వెంటనే ఒక స్లిప్ కూడా ఇస్తారు. దీనివల్ల అక్కచెల్లెమ్మలు ఏ ఒక్కరూ కూడా దోపిడీకి గురికారు. ఆ నాణ్యతకు తగ్గట్టుగా అక్కచెల్లెమ్మలకు అమూల్ మంచి రేటు ఇవ్వగలుగుతుంది. ► ఇంతకు ముందు కూడా అక్కచెల్లెమ్మలు అదే నాణ్యత పాలు పోసినా, మోసపోయేవాళ్లు. మంచి రేటు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు అమూల్ మోసం చేయడం లేదు కాబట్టి, నాణ్యత అక్కడికక్కడే బయటపడుతోంది. ప్రతి లీటరుకు రూ.5 నుంచి రూ.15 వరకు ప్రతి అక్కచెల్లెమ్మకు అదనంగా లబ్ధి కలుగుతోంది. అక్కచెల్లెమ్మల మేలు కోసం రూ.4 వేల కోట్ల పెట్టుబడి ► అక్కచెల్లెమ్మలకు ఈ మేలు ప్రతి గ్రామంలో జరగాలన్న తపన, తాపత్రయంతో దాదాపుగా 9,899 గ్రామాలను గుర్తించాం. ఈ గ్రామాల్లో రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. బీఎంసీ, ఏఎంసీల ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. ► అక్కచెల్లెమ్మల మహిళా సాధికారత కోసం చేస్తున్న కార్యక్రమాలు మీకందరికీ తెలిసినవే. అమ్మ ఒడి, ఆసరా, చేయూత, వడ్డీలేని రుణాలు, సంపూర్ణ పోషణ.. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇవ్వడం, ఇళ్లు కట్టించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవి కాకుండా దిశ బిల్లు కానివ్వండి, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్లతో పాటు మద్య నియంత్రణ దిశగా మనమంతా అడుగులు వేస్తున్నాం. పనులు, పోస్టుల్లో 50 శాతం అక్కచెల్లెమ్మలకే ► వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగ నియామకాల్లో 50 శాతం పై చిలుకు అక్కచెల్లెమ్మలను తీసుకొచ్చాం. నామినేటెడ్ పోస్టులతో పాటు నామినేటెడ్ కాంట్రాక్టుల్లో ఏకంగా చట్టం చేసి 50 శాతం వారికే కేటాయించాం. ► కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, బీసీ కార్పొరేషన్లు.. ఇలా ఎక్కడ చూసినా కచ్చితంగా సగం అక్కచెల్లెమ్మలకు వచ్చే విధంగా చట్టాలు తీసుకొచ్చినందువల్ల ఈ రోజు మహిళా సాధికారత అనేది ఏ స్థాయిలో ఉందనేది కనిపిస్తోంది. మనందరి ప్రభుత్వం మహిళ పక్షపాత ప్రభుత్వం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఉపాధికి ‘చేయూత’ ► చేయూత పథకం కింద అక్కచెల్లెమ్మలకు ఇచ్చే డబ్బులు మరింత మెరుగ్గా ఉపయోగపడే విధంగా ఉపాధి అవకాశాలను వాళ్ల ఇంటి ముందుకే తీసుకొస్తున్నాం. వారు పెట్టిన పెట్టుబడి నష్టపోకూడదనే ఉద్దేశంతో పెద్ద, పెద్ద సంస్థలతో టై అప్ చేశాం. ► ఐటీసీ, అమూల్, రిలయన్స్, ప్రొక్టర్ అండ్ గాంబిల్, హిందుస్థాన్ లీవర్ వంటి పెద్ద పెద్ద సంస్థలతో టై అప్ చేసి ఆ అక్కచెల్లెమ్మలకు నేరుగా వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నాం. లక్షా 12 వేల యూనిట్ల ఆవులు, గేదెలు కొనుగోలు చేయించి, రూ.75 వేల మొత్తాన్ని ‘చేయూత’కు టై అప్ చేసి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీ అందరికీ మరింతగా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కష్ణ శ్రీనివాస్ (నాని), పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమూల్ ఎండీ ఆర్ ఎస్ సోధి, సబర్ డెయిరీ ఎండీ డాక్టర్ బీఎం పటేల్ హాజరయ్యారు. అమూల్ సంస్థ రాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగు జిల్లాల్లో 13,739 మంది మహిళా రైతుల దగ్గర నుంచి 52,93,000 లీటర్ల పాలు సేకరించింది. అందుకు రూ.24 కోట్ల 54 లక్షల చెల్లింపు జరిగింది. తద్వారా ఇంతకు ముందు ఆ అక్కచెల్లెమ్మలు అమ్ముతున్న ధర కంటే ప్రతి లీటరు మీద రూ.5 నుంచి రూ.15 వరకు అదనంగా అమూల్ సంస్థ చెల్లించింది. ఈ లెక్కన రూ.4 కోట్ల 6 లక్షలు ఆ అక్కచెల్లెమ్మలకు అదనంగా ఆదాయం వచ్చిందని ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు అన్నగా ఈరోజు సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇంత మంచి రేటు ఎప్పుడూ రాలేదు గతంలో పాల కేంద్రం నిర్వహణ మహిళల వల్ల కాదు అన్నారు. మీ వల్ల నేడు మా గ్రామంలో మేమే దానిని నిర్వహించగలుగుతున్నాం. మీరు ఉన్నారనే ధైర్యం ఇప్పుడు మాకు వచ్చింది. అమూల్ పాల వెల్లువను ఇంకా ముందుకు తీసుకుపోతాం. అమూల్కు పాలు పోయడం వల్ల మా సభ్యుల్లో ఒకరికి లీటర్కు 75 రూపాయలు వచ్చాయి. గతంలో ఇంత మంచి రేటు ఎప్పుడూ రాలేదు. – సుజాత, కొమ్ముగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా -
అప్పులు తెస్తాం.. అభివృద్ధి చేస్తాం
భీమదేవరపల్లి: ‘‘చెట్లకు పైసలు కాయడం లేదు.. మనకు అప్పులు చెల్లించే స్తోమత ఉంది కాబట్టే దేశవ్యాప్తంగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముం దుకు వస్తున్నాయి. అందుకే అప్పులు తీసుకొస్తాం.. అభివృద్ధి చేస్తాం’’ అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సహకార డెయిరీ ఆవరణలో పాడి పశువుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ బి.వినోద్కుమార్తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఈటల మాట్లాడారు. అప్పుతీర్చే ఆర్థిక స్తోమత ఉన్నందున రైతులు, పేదల సంక్షేమం కోసం అప్పు లు చేస్తూ వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నా మని చెప్పారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 2.13 లక్షల మంది డెయిరీ రైతులకు రూ.1500 కోట్లతో పాడి పశువుల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు మంత్రి తలసాని వెల్లడించారు. కొమురవెల్లి మల్లన్న, బీరప్ప దేవుళ్ల స్వరూపమే కేసీఆర్ అని అన్నారు. -
విన్న‘పాల’పై సానుకూలం!
♦ సహకార డెయిరీలకు ప్రోత్సాహకం ♦ కరీంనగర్, మదర్, ముల్కనూర్ ♦ డెయిరీలకు ఇచ్చే యోచనలో సర్కారు ♦ మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించిన మంత్రులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు ఇస్తున్న రూ.4 ప్రోత్సాహకాన్ని సహకార డెయిరీలకూ ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. కరీంనగర్, మదర్, ముల్కనూర్ డెయిరీల విన్నపాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. పాల ప్రోత్సాహకాన్ని ప్రైవేటు డెయిరీలకు చెందిన రైతులకు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ప్రభుత్వంపై పడే భారమెంత? తదితర అంశాలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి హాజరయ్యారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరు కాలేదు. భేటీ అనంతరం పోచారం, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. 86,515 మంది రైతులకు రూ.4 ప్రోత్సాహకం ఇస్తున్నామని మంత్రి పోచారం చెప్పారు. అందులో 98 శాతం మంది 25 లీటర్ల లోపు పాలు పోసే రైతులేనన్నారు. 2 శాతం మంది 25 లీటర్లకు మించి పాలు పోసే వారున్నారన్నారు. విజయ డెయిరీకి జిల్లాల్లో 8 చిన్న డెయిరీలున్నాయని, వాటిని బలోపేతం చేస్తామన్నారు. కల్తీలేని పాలు విజయ డెయిరీవేనన్నారు. ప్రైవేటు డెయిరీల పాలు కల్తీవన్న విమర్శలున్నాయని వ్యాఖ్యానించారు. మదర్, కరీంనగర్, ముల్కనూర్ సొసైటీ డెయిరీలు తమకూ పాల ప్రోత్సాహకం ఇవ్వాలని కోరుతున్నాయని, దీనిపై మరోసారి జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు పాల ప్రోత్సాహకం బకాయిలను వారంలోగా చెల్లిస్తామన్నారు. పాల ఉత్పత్తికి విధానం తీసుకొస్తామని మంత్రి జగదీశ్ పేర్కొన్నారు. ఇతర దేశాల్లోనూ పాల ఉత్పత్తికి సంబంధించి ఉన్న విధానాలను అధ్యయనం చేస్తామన్నారు. వాటికి ప్రోత్సాహకం ఎలా ఇస్తారు? మదర్, కరీంనగర్ డెయిరీలకు ప్రోత్సాహకం ఎలా ఇస్తారని తెలంగాణ ఆదర్శ పాడి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బాల్రెడ్డి విమర్శించారు. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు మాత్రమే ప్రోత్సాహకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికే డబ్బులు ఇవ్వడానికి నిధులు లేవని చేతులెత్తేసిన సర్కారు పెద్ద ప్రైవేటు డెయిరీలకు కూడా ఇవ్వాలనుకోవడం శోచనీయమన్నారు. పాల ప్రోత్సాహకంపై సలహాలతో వారంలో నివేదిక ఇవ్వాలని తమ సంఘాన్ని మంత్రివర్గ ఉపసంఘం కోరిందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు.