breaking news
Coolie accident
-
‘ఉపాధి’ ఉసురు తీసింది
మల్లాపూర్ (కోరుట్ల): మూడు గంటల పని పూర్తయింది. మరో గంట గడిస్తే చాలు.. ఇంటికి చేరేవారు. 35 మంది కూలీలు ఎవరి పనిలో వాళ్లున్నారు.. అంతలోనే పై నుంచి మట్టి పెళ్లలు కూలిన శబ్దం.. చుట్టూ దుమ్ము. ఐదు నిమిషాలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు.. తేరుకుని చూసేసరికి మట్టి పెళ్లల కింద ఆరుగురు మహిళలు. వీరిలో ముగ్గురు ప్రాణాలు విడవగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామశివారులో చోటు చేసుకుందీ ఘటన. సొరంగంలా తవ్వడం వల్లే..: కుస్తాపూర్ శివారులోని జానకీకుంట వద్ద మట్టిరోడ్డు పనులను చేపట్టేందుకు 3 గ్రూపులకు చెందిన 36 మంది ఉపాధి కూలీలు వెళ్లారు. మూడు రోజులుగా సమీపంలోని దిబ్బ నుంచి మట్టిని తీసి రోడ్డుకు వేస్తున్నారు. మంగళవారం ఉదయం ఉదయం 7 గంటల నుంచి మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తూ రోడ్డు పనులు చేపట్టారు. సుమారు 8 ట్రాక్టర్ల మట్టిని తరలించారు. మరో రెండు ట్రాక్టర్ల మట్టిని తరలిస్తే.. పని పూర్తి అవుతుంది. కూలీలు దిబ్బ కింది భాగంలో మరింత లోతుగా మట్టిని తవ్వడం ప్రారంభించారు. అది కాస్త సొరంగంలా మారడంతో మట్టిగడ్డలు ఉన్నట్టుండి కూలిపోయాయి. దీంతో దిబ్బ కింది భాగంలో పని చేస్తున్న 35 మంది కూలీలు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. దూరంగా పరుగులు తీశారు. కూలిపడ్డ మట్టిగడ్డల వద్దకు చేరుకుని వాటిలో ఇరుకున్న ఆరుగురిని బయటకు తీశారు. వీరిలో కుస్తాపూర్కు చెందిన సరికెల ముత్తమ్మ (50) అక్కడికక్కడే మృతి చెందింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సరికెల రాజు (55), జెల్ల పోశాని (55)లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదంలో గాయపడ్డ జెల్ల సుజాత (38), గుండ రాజు (40)లకు కాళ్లు విరిగిపోయాయి. మరో మహిళ గంగు(42)కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కూలీల మృతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కుస్తాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ దండు పెద్ద రాజం, టెక్నికల్ అసిస్టెంట్ ప్రణయలను సస్పెండ్ చేశారు. తక్షణ సాయంగా రూ.20 వేలు కూలీల మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జేసీ రాజేశం, సబ్ కలెక్టర్ గౌతమ్ పోట్రు.. మెట్పల్లి ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.20 వేలను అందించనున్నట్లు తెలిపారు. బాధితుల్లో అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇల్లు, ఎకరం వ్యవసాయ భూమి, పిల్లలకు గురుకుల పాఠశాలల్లో ఉచిత విద్య, అపద్బంధ పథకం క్రింద పరిహారం అందించేందుకు కృషి చేస్తామని విద్యాసాగర్రావు హమీ ఇచ్చారు. రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా:జూపల్లి సాక్షి, హైదరాబాద్: మృతి చెందిన ఉపాధి కూలీల కుటుంబాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూలీల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కూలీల మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంట గడిస్తే.. ఇంటికి పోయెటోళ్లం: గడ్డం పోశాని మూడు రోజుల నుంచి మట్టి దిబ్బను తవ్వి ట్రాక్టర్లలో పంపుతున్నం. తవ్వుడు.. మోసుడు.. ఎవరి పనిలో వాళ్లం ఉన్నం.. మరో గంట పని చేస్తే చాలు. ఇంటికి పోయెటోళ్లం. ఇగో అప్పుడే.. మట్టి దిబ్బ కింది భాగంలో సొరంగం లెక్క తయారై మట్టిపెల్లలు మా మీదకి వచ్చి పడ్డయ్. అందరం ఉరికినం.. మన్ను కింద పడ్డవాళ్లు సరిగా కానరాలె. ఏం చేయాలో ఎవరికి తోయలే.. ఏడుసుకుంటనే మట్టి పెల్లలు పక్కకు జరిపి కొంత మందిని తీసినం. ఊరోళ్లకు.. ఉపాధి సార్లకు చెప్పినం. అందరు వచ్చిండ్రు.. మట్టి కింద ఇరుక్కున్న వారిని దవాఖానాకు పంపించిండ్రు. ముగ్గురి ప్రాణాలు పోతయని అనుకోలె. -
'25 శాతం లివర్ తోనే జీవిస్తున్నా.!' : అమితాబ్
33 ఏళ్ల క్రితం కూలీ సినిమా షూటింగ్లో గాయపడిన అమితాబ్, ఇప్పటికీ ఆ ప్రమాదం కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటునే ఉన్నాడు. ఇన్నేళ్ల తరువాత ఆ ప్రమాదం పై మాట్లాడిన అమితాబ్, ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించాడు. 'కూలీ షూటింగ్ ప్రమాదంలో దాదాపు 60కి బాటిల్ల రక్తం ఎక్కించారు. అయితే అదే సమయంలో ఆస్ట్రేలియన్ యాంటిజెన్ హెప్ బి నా శరీరంలోకి ప్రవేశించింది. 2004 - 05లో సాదరణ పరీక్షల సమయంలో నా శరీరంలో ఈ వైరస్ ఉన్నట్టుగా గుర్తించారు. అయితే అప్పటికే ఆ వైరస్ 75 శాతం లివర్ను తినేసింది. ప్రస్తుతం నేను 25 శాతం లివర్తోనే జీవిస్తున్నా. అది కూడా వైద్య సహాయంతో. మామూలుగా ఇలాంటి పరిస్థితి మధ్యం సేవించే వారికి వస్తుంది. కానీ మీ అందరికీ తెలుసు నేను మద్యం తాగను'. సోమవారం హెపటైటిస్ అవేర్నెస్ క్యాంపెయిన్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ తన ఆరోగ్యానికి సంబందించిన విషయాలను వెల్లడించాడు. -
'తొలిసారి నాన్న కళ్లలో కన్నీళ్లు చూశా.. '
ముంబై: హిందీ చిత్రం కూలీ ప్రమాద ఘటన తనకు పునర్జన్మ వంటిదని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అన్నారు. 33 ఏళ్ల క్రితం జరిగిన ఈ ప్రమాదం నుంచి తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. కూలీ ప్రమాద ఘటన వివరాలను 72 ఏళ్ల అమితాబ్ ట్విట్టర్లో తెలియజేశారు. ఆస్పత్రి నుంచి ఇంటి వచ్చాక తన తండ్రి హరివంశ రాయ్ బచ్చన్ కన్నీపర్యంతమయ్యారని గుర్తు చేసుకున్నారు. తండ్రి కళ్లలో తాను కన్నీళ్లు చూడటం అదే తొలిసారి అమితాబ్ ట్వీట్ చేశారు. తండ్రి నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోను అమితాబ్ పోస్ట్ చేశారు. 1982 ఆగస్టు 2న బెంగళూరులో కూలీ షూటింగ్ సందర్భంగా అమితాబ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఆగస్టుల 2 తనకు పునర్జన్మ వంటిదని అమితాబ్ ట్వీట్ చేశారు.