breaking news
The Constitution of India
-
భారత రాజ్యాంగ రచన
సాధారణంగా రాజ్యాంగ రచనకు రెండు పద్ధతులు అనుసరిస్తారు. అందులో ఒకటి ఆ దేశ పార్లమెంటుతో రాజ్యాంగాన్ని రూపొందించడం కాగా, రెండోది ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ లేదా సంస్థను ఏర్పాటు చేసి దానికి రాజ్యాంగ రచనా బాధ్యత అప్పగించడం. ►మొదటిసారిగా రాజ్యాంగ రచనకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన దేశం అమెరికా. ఆ దేశంలో 1787లో జరిగిన ఫిలడెల్ఫియా సమావేశంలో రాజ్యాంగ రచనకు పూనుకున్నారు. ►ఫ్రాన్స్లో(1789లో) ‘కాన్స్టిట్యుయంట్ అసెంబ్లీ’ని ఏర్పాటు చేసి రాజ్యాంగ రచన చేశారు. తొలి డిమాండ్ ‘భారత ప్రజాప్రతినిధులతో కూడిన రాజ్యాంగ పరిషత్’ అనే భావన.. స్వాతంత్య్రోద్యమంలో అత్యంత ముఖ్యమైన అంతర్గత డిమాండ్గా ఉంది. మొదటిసారిగా ఈ డిమాండ్ను భారత జాతీయ కాంగ్రెస్ చేసింది. ఈ మేరకు 1918 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ‘స్వయం నిర్ణయాధికారం’ అనే భావనతో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ► మహాత్మాగాం«ధీ 1922, జనవరి 5న ‘యంగ్ ఇండియా’ పత్రికలో ‘స్వరాజ్ అనేది బ్రిటిషర్లు ఇచ్చే ఉచిత కానుక కాదు. అది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణ’ అని పేర్కొన్నారు. ► 1927, మే 17న జరిగిన బాంబే సమావేశంలో మోతీలాల్ నెహ్రూ రాజ్యాంగ రచన, దాని ఆవశ్యకతను ప్రస్తావించారు. ఇందులో భాగంగానే అఖిలపక్ష కమిటీ 1928, మే 19న రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను ‘నెహ్రూ రిపోర్ట్’ అంటారు. దీన్ని భారతీయులు సొంతంగా రాజ్యాంగ రచనకు చేసిన తొలి ప్రయత్నంగా చెప్పవచ్చు. ► ప్రముఖ అభ్యుదయ, మానవతావాదైన ఎం.ఎన్.రాయ్ 1934లోనే (మొదటిసారిగా) రాజ్యాంగ పరిషత్ అనే భావాన్ని ప్రకటించారు. ఆ తర్వాత 1935లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేసింది. ►1942లో క్రిప్స్ రాయబారం రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అనంతరం 1946లో కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. రాజ్యాంగ పరిషత్ నిర్మాణం కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య, ఎన్నిక విధానం, ఇతర ప్రక్రియలను నిర్ణయించారు. 1946 జూలై, ఆగస్టు నెలల్లో రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగాయి. ► ప్రతి ప్రావిన్స్ నుంచి దాదాపు 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడి చొప్పున రాజ్యాంగ పరిషత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. ►బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లోని మూడు ప్రధాన వర్గాలైన ముస్లిం, సిక్కు, జనరల్ కేటగిరీ ప్రజలకు జనాభా దామాషా మేరకు సీట్లు కేటాయించారు. ► రాజ్యాంగ పరిషత్తులోని మొత్తం సభ్యుల సంఖ్య 389. ఇందులో 292 మంది బ్రిటిష్ ఇండియా నుంచి ఎన్నికయ్యారు. వీరిని బ్రిటిష్ పాలిత ప్రాంతాలు లేదా గవర్నర్ ప్రావిన్స్ల నుంచి ఎన్నికైన శాసనసభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నుకున్నారు. ఆ సమయానికి దేశంలో మొత్తం 11 ప్రావిన్స్లు ఉన్నాయి. అవి.. మద్రాస్, బాంబే, యునైటెడ్ ప్రావిన్స్, బీహార్, సెంట్రల్ ప్రావిన్స్, ఒరిస్సా, పంజాబ్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, సింధ్, బెంగాల్, అస్సాం. ►93 మంది ప్రతినిధులు స్వదేశీ సంస్థానాల నుంచి నామినేట్ అయ్యారు. ►నలుగురు సభ్యులను చీఫ్ కమిషనర్ ప్రాంతాలైన ఢిల్లీ, అజ్మీర్, మేవార్, కూర్గ్, బ్రిటిష్ బెలూచిస్థాన్ నుంచి తీసుకున్నారు. దాదాపు అన్ని (అప్పట్లో ఉన్న) రాజకీయ పార్టీలు రాజ్యాంగ పరిషత్ ఎన్నికలో పాల్గొన్నాయి. అవి సాధించిన స్థానాలు.. ►జాతీయ కాంగ్రెస్ – 208 ►ముస్లిం లీగ్ – 73 ►యూనియనిస్ట్ – 1 మతాలు, సామాజిక వర్గాల వారీగా సభ్యుల సంఖ్య ► హిందువులు – 160 ►దళితులు – 33 ►సిక్కులు – 5 ►ఆంగ్లో ఇండియన్లు – 3 ► క్రిస్టియన్లు – 7 ►మహిళలు – 15 ►పారశీకులు (పార్సీలు)– 3 ►ముస్లింలు – 3 ప్రత్యేక వివరణ ముస్లింలీగ్ ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్తో భారత రాజ్యాంగ పరిషత్ నుంచి వైదొలిగింది. అనంతరం దేశ విభజన జరగడంతో రాజ్యాంగ పరిషత్లోని సభ్యుల సంఖ్య 299కి తగ్గింది. ఇందులో 229 మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి ఎన్నిక కాగా, 70 మంది స్వదేశీ సంస్థానాల నుంచి ఎన్నికైన వారున్నారు. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన వివిధ వర్గాల్లోని ప్రముఖులు: ►ముస్లింలు: మౌలానా అబుల్ కలాం ఆజాద్, సయ్యద్ సాదుల్లా. ►సిక్కులు: సర్దార్ బలదేవ్ సింగ్, హుకుం సింగ్ ►మైనారిటీలు: హెచ్.సి.ముఖర్జీ ►యూరోపియన్లు: ఫ్రాంక్ ఆంథోని ► అఖిల భారత షెడ్యూల్డ్ కులాలు: బి.ఆర్. అంబేద్కర్ ►కార్మిక వర్గాలు: బాబూ జగ్జీవన్ రామ్ ► పార్సీలు: హెచ్.పి.మోదీ ►అఖిల భారత మహిళా సమాఖ్య: హన్సా మెహతా ►హిందూ మహాసభ: డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, ఎం.ఆర్.జయకర్ మహిళా సభ్యులు దుర్గాబాయి దేశ్ముఖ్, రాజకుమారి అమృత్కౌర్, విజయలక్ష్మి పండిట్, సరోజిని నాయుడు, హన్సా మెహతా, అమ్ము స్వామినాథన్, అన్నీ మాస్కెరీన్, బేగం అజీజ్ రసూల్, ద్రాక్షాయణి వేలాయుధన్, కమలా చౌదరీ, లీలా రే, మాలతి చౌదరి, పూర్ణిమా బెనర్జీ, రేణుకా రే, సుచిత్రా కృపలానీ తదితరులు. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన తెలుగు వారు: టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్ముఖ్, కల్లూరు సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్.జి.రంగా, వి.సి.కేశవరావు, ఎం.తిరుమలరావు, రామకృష్ణ రంగారావు (బొబ్బిలి) తదితరులు. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ► రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 1946, డిసెంబర్ 9న ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగింది. మొదటి సమావేశానికి 211 మంది (9 మంది మహిళా సభ్యులతో సహా) సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశం డిసెంబర్ 12 వరకు కొనసాగింది. సమావేశం తొలి రోజున (డిసెంబర్ 9న) డాక్టర్ సచ్చిదానంద సిన్హాను రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా (ఫ్రెంచ్ సంప్రదాయం ప్రకారం), ఫ్రాంక్ అంథోనిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జె.బి.కృపలానీ 1946 డిసెంబర్ 11న డాక్టర్ ఆర్.రాజేంద్రప్రసాద్ను రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్ష పదవికి హెచ్.సి.ముఖర్జీ (పట్టాభి సీతారామయ్య ప్రతిపాదించారు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత వి.టి. కృష్ణమాచారి కూడా రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు. ►అంతర్జాతీయ న్యాయవాది.. బెనగల్ నరసింగరావును రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారుగా నియమించారు. ఆయన బర్మా (ప్రస్తుత మయన్మార్) రాజ్యాంగ రచనలో కూడా పాల్గొన్నారు. ఆశయాల తీర్మానం ఆశయాల తీర్మానాన్ని 1946, డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించారు. ఇది రాజ్యాంగ తత్వానికి, ఆదర్శాలకు, లక్ష్యాలకు మూలంగా నిలిచింది. ఆశయాల తీర్మానం.. ప్రవేశికకు ప్రధాన ఆధారం. ఈ తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ 1947, జనవరి 22న ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగ పరిషత్ కమిటీలు రాజ్యాంగ పరిషత్లో వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో 12 విషయ కమిటీలు, 10 ప్రక్రియ కమిటీలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 7 ఉప కమిటీలు, 15 మైనర్ కమిటీలను నియమించారు. ఈ కమిటీల్లో అత్యంత ముఖ్యమైనది – డ్రాఫ్టింగ్ (ముసాయిదా) కమిటీ. 1947, ఆగస్టు 29న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్ సమావేశాలు, చర్చలు ►ముసాయిదా కమిటీ రెండు డ్రాఫ్ట్లను తయారు చేసింది. రాజ్యాంగ ముసాయిదాను 1948 ఫిబ్రవరి 21న ప్రచురించారు. రాజ్యాంగ ప్రతిపై 7,635 సవరణలను ప్రతిపాదించగా 2,473 సవరణలు చర్చకు వచ్చాయి. ►రాజ్యాంగ పరిషత్ ఈ ముసాయిదాను 115 రోజుల పాటు పరిశీలించింది. అనంతరం 1949, నవంబర్ 26న ఆమోదించి.. చట్టంగా మార్చింది. ►రాజ్యాంగ రూపకల్పనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. మొత్తం 11 సమావేశాలు జరిగాయి. భారత రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం 1950, జనవరి 24న జరిగింది. దీనికి 284 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నూతన రాజ్యాంగం ప్రకారం గణతంత్ర భారత ప్రథమ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్రప్రసాద్ను ఎన్నుకున్నారు. భారత రాజ్యాంగం 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజునే గణతంత్ర దినోత్సవంగా నిర్వహిస్తారు. ►రాజ్యాంగ అమలు తేదీ: జనవరి 26ను రాజ్యాంగ అమలు తేదీగా నిర్ణయించడం వెనుక చారిత్రక నేపథ్యం ఉంది. నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం (1929, డిసెంబర్ 31) జనవరి 26ను పూర్ణ స్వరాజ్య దినోత్సవంగా ప్రకటించింది. ఆ సంఘటనకు గుర్తుగా జనవరి 26ను రాజ్యాంగ అమలు తేదీగా నిర్ణయించారు. రాజ్యాంగ పరిషత్ ఇతర విధులు భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనతోపాటుగా కొన్ని సాధారణ చట్టాలను కూడా రూపొందించి ఆమోదించింది. అందులోని ముఖ్యాంశాలు: ►1947, జూలై 22న జాతీయ జెండాను ఆమోదించింది. ►రాజ్యాంగ పరిషత్ కేంద్ర శాసనసభగా కూడా పనిచేసింది. స్వతంత్ర శాసనసభగా 1947, నవంబర్ 17న సమావేశమై మొదటి స్పీకర్గా జి.వి.మౌలాంకర్ను ఎన్నుకుంది. ►భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నంగా ఏనుగును గుర్తించింది. ►కేంద్ర ప్రభుత్వ భాషగా దేవనాగరి లిపిలో ఉన్న హిందీని 1949, సెప్టెంబర్ 14న ఆమోదించింది. ►కామన్వెల్త్ 1949 మేలో «భారత సభ్యత్వాన్ని ధ్రువీకరించింది. ►1950, జనవరి 24న జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించింది. రాజ్యాంగ పరిషత్ ముఖ్య కమిటీలు, అధ్యక్షులు ముసాయిదా కమిటీ రాజ్యాంగ పరిషత్లో అతి ముఖ్యమైన, అతిపెద్ద కమిటీ. ►ముసాయిదా కమిటీ సభ్యుల సంఖ్య– 6 ►బి.ఆర్.అంబేద్కర్ (చైర్మన్) ►సభ్యులు: ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, డాక్టర్ కె.ఎం. మున్షీ, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు (బి.ఎల్.మిట్టల్ అనారోగ్య కారణంగా రాజీనామా చేయడంతో ఆ స్థానంలో సభ్యునిగా వచ్చారు), టి.టి.కృష్ణమాచారి (డి.పి.ఖైతాన్ మరణించడంతో ఆ స్థానంలో వచ్చారు). సబ్ కమిటీలు కమిటీ పేరు చైర్మన్ ప్రాథమిక హక్కుల ఉప కమిటీ జె.బి.కృపలానీ మైనారిటీల సబ్ కమిటీ హెచ్.సి.ముఖర్జీ ఈశాన్య రాష్ట్రాల గోపీనాథ్ హక్కుల కమిటీ బోర్డోలాయ్ ప్రత్యేక ప్రాంతాల కమిటీ ఎ.వి.టక్కర్ బి. కృష్ణారెడ్డి డైరెక్టర్, క్లాస్–వన్ స్టడీ సర్కిల్ -
తమిళంలోనే రివిజన్ టెస్ట్
హైకోర్టు ఉత్తర్వులు అమలుచేయని ప్రభుత్వం మైనార్టీ భాషల విద్యార్థులకు తప్పని తిప్పలు హొసూరు: తమిళనాడు రాష్ట్రంలో వేలాది మంది మైనార్టీ భాషలు చదువుతున్న విద్యార్థులు వీధుల్లోకి వచ్చి తమ మాతృభాషలో చదువుకొనే అవకాశం కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్నివేడుకున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను తమ మాతృభాషలోనే రాసే అవకాశం కల్పించమని ప్రాధేయపడ్డారు. తమిళనాడు ప్రభుత్వం కనికరించలేదు. విద్యార్థులు రాష్ర్ట హైకోర్టు తలుపులు తట్టారు. హైకోర్టు 2015 నవంబర్ 23వ తేదీ ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలు వారి మాతృభాషలోనే రాసేందుకు అవకాశం కల్పిచమని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, విద్యార్థులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేస్తూ గడువిచ్చింది. వేలాది మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకొన్నారు. కానీ విద్యాశాఖ కార్యదర్శి దరఖాస్తులు చేసుకొన్న ప్రతి విద్యార్థికి లెటర్ అందజేసి తమిళం బోధించాము, తమిళంలో పరీక్షరాయాలని సూచించడంతో ఈ లెటర్ను సవాల్ చేస్తూ మాచినాయకనపల్లి ప్రభుత్వ హయ్యర్సెకెండరీ పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని గౌతమి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఈ కేసును విచారించి రెండవ సారి కూడా విద్యాశాఖకు 25.01.2016న స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కానీ విద్యాశాఖ కోర్టు సూచనలను పెడచెవిన పెట్టి 10వ తరగతి చదుతున్న మైనార్టీ భాషా విద్యార్థులకు నిర్బంధంగా తమిళ పాఠాలు బోధిస్తోంది. వారి మాతృభాషలైన తెలుగు, కన్నడం, ఉర్దూ, మళయాళం భాషలను బోధించకపోవడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనయ్యారు. మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు ప్రారంభమైన రివిజన్ టెస్టులో మైనార్టీ విద్యార్థులకు తమిళంలో ప్రశ్నాపత్రాలు అందజేసింది. తమ మాతృభాషలోపరీక్షలు రాయమని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా తమకు రివిజన్ టెస్టులో తమిళ ప్రశ్నాపత్రం ఇవ్వడమేమిటని కోర్టుకెళ్లిన గౌతమి ప్రశ్నిం చింది. తనకు తమిళం రాదని, తాను తమిళ ప్రశ్నాపత్రానికి జవాబులు రాయలేదని గౌతమి సాయంత్రం భోరున విలపించింది. దీనిపై విద్యార్థులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం పట్టిం చుకోకపోతే భావిభారత పౌరులమైన తమకు కోర్టులపై, తీర్పులపై, భారత రాజ్యాంగంపై ఉన్న గౌరవం ప్రశ్నార్థకంగా మారుతుందని విద్యార్థులు అనుకుంటున్నారు. మైనార్టీ విద్యార్థుల సమస్యలపై నేడు సమావేశం రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను తమిళంలో నిర్వహించడంపై ప్రభుత్వ చర్యలను ఎదుర్కొనేందుకు హొసూరు ఎమ్మెల్యే కే. గోపీనాథ్ అధ్యక్షతన బుధవారం ఉదయం 10 గంటలకు ఆంధ్రసాంస్కృతిక సమితిలో మైనార్టీ భాషా సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగు, కన్నడ భాషాభిమానులు, సంఘాలు, పిల్లల తల్లితండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులకు వారివారి మాతృభాషల్లో విద్యనభ్యసించేందుకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై తదుపరి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. -
జగ్జీవన్రామ్ సేవలు మరువలేనివి
ఇందూరు, న్యూస్లైన్ : భారత రాజ్యాంగం దేశానికి వెన్నెముకలాంటిది. అలాంటి రాజ్యాంగానికి రూపకల్పన చేసిన వారిలో బాబూ జగ్జీవన్రామ్ ఒకరని జిల్లా కలెక్టర్ పీ.ఎస్. ప్రద్యుమ్న అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం బాబూ జగ్జీవన్రామ్ 107వ జయంతి సభలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశం లో రాజకీయ స్వాతంత్య్రం ఉంటే సరిపోదని, ప్రజలకు ఆర్థిక, సామాజిక, సమన్యాయ స్వాతంత్య్రం కావాలని జగ్జీవన్రామ్ పోరాడి సాధించారని అన్నారు. ఆయన పోరాట ఫలి తంగానే రాజ్యాంగంలో పలు అంశాలను చేర్చడంతో నేడు మనమందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. బీహార్లో జన్మించిన జగ్జీవన్ రామ్ కేంద్రానికి మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారని అన్నారు. తరువాత వ్యవసాయ మంత్రిగా ప్రజల మేలు కోరి దేశ చరిత్రలో గొప్ప వ్యక్తిగా నిలి చారని కొనియాడారు. అయితే ప్రస్తుత తరం దేశ కోసం పోరాడిన మహనీయులను మరిచి పోతోందన్నారు. విద్యార్థులకు మహనీయుల పేర్లు కూడా తెలియని పరిస్థితి నెలకొనడం చాలా విచారకరమన్నారు. జిల్లా ఎస్పీ తరుణ్ జోషి మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్ను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. జేసీ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ అంటరాని తనాన్ని రూపు మాపేందుకు పోరాటం చేసిన బాబూ జగ్జీవన్ రామ్ అడుగు జాడల్లో నడవాలన్నారు. అంటరానితనం అక్కడక్కడా ఇంకా ఉందని,దానిని పూర్తి స్థాయిలో నిర్మూలించేదుకు జిల్లా యంత్రాగం చర్యలు చేపడుతుందన్నారు. స్థానిక రైల్వే కమాన్ వద్ద పాత అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ ఖాలేబ్, ఐకేపీ పీడీ వెంకటేశం, ఇన్చార్జి డీఎస్డబ్ల్యూఓ అల్ఫోన్స్, ఏఎస్డబ్ల్యూ జగదీశ్వర రెడ్డి,కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు కలెక్టర్ రైల్వే కమాన్ చౌరస్తాలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేశారు. అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి పూల మాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. మాజీ ఎంపీ మధుయాష్కీ నివాళి.. రైల్వే కమాన్ చౌరస్తాలోని బాబూ జగ్జీవన్రామ్ విగ్రహానికి మాజీ ఎంపీ మధుగౌడ్ యాష్కీ పూల మాలలు వేసి వివాళులు అర్పించారు. అనంతరం అంబేడ్కర్ భవన్లోని చిత్ర పటానికి పూల మాలలు వేశారు. సాంఘిక సంక్షేమాధికారులు భోజనాలు ఏర్పాటు చేయగా, విద్యార్థులు, ఉద్యోగులతో పాటు కలిసి భోజనం చేశారు. కాగా అక్కడున్న ఓ వృద్ధురాలిలో కలిసి ముచ్చటిస్తూ భోజనం చేసి అందరిని ఆకట్టుకున్నారు. -
రాష్ట్ర విభజన పై రాజ్యాంగ భాష్యం