breaking news
connecting people
-
అనుసంధాన భాషగా హిందీ అవసరం లేదా?
జాతీయోద్యమ కాలం నుంచీ ఒక ఉమ్మడి భాషగా హిందీ వ్యాపించిన వాస్తవాన్ని కాదనలేం. మరీ ముఖ్యంగా హిందీ సినిమాల జనాదరణ (పాటలతో పాటు) మూలంగా దేశం నలుమూలలా హిందీ భాషను అర్థం చేసుకోగల వాతావరణం ఏర్పడింది. సాహిత్యపరంగా ప్రేమ్చంద్, రాహుల్ సాంకృత్యాయన్, జయశంకర్ ప్రసాద్, దిన్కర్ నిరాలా వంటి రచయితలు – కవులు, తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ పాఠకుల ఆదరణ పొందారు. ప్రస్తుతం హిందీ దేశవ్యాప్తంగా ఒక అధికార భాషగా లేదా అనుసంధాన భాషగా వాడుకలో ఉన్నప్పటికీ... హిందీయేతర ప్రాంతీయులకు ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాలకు అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇంగ్లిష్ ప్రాబల్యం పెరిగిన తర్వాత, హిందీ వెనుకబడిపోయింది. ఇక అసలు వివాదమెక్కడంటే భారతీయ భాషల్లో గుర్తింపు పొందిన (ఇంగ్లిష్తో సహా) 23 భాషలన్నీ జాతీయ భాషలే అనే యథార్థాన్ని హిందీవాదులు విస్మరించడం! ఫలితంగా హిందీ భాష ఆధిపత్యమనే ప్రమాదమున్నదని... ముఖ్యంగా తమిళనాడులో వ్యతిరేకత పెరిగింది. అయినా అక్కడే చెన్నైలో ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ’ చేసిన భాషా సేవను తక్కువగా అంచనా వేయలేం. జాతీయ సమైక్యతకు హిందీ ఒక వాహికగా ఉండగలదనే నమ్మకమే ఆ ప్రచారానికి దోహదపడింది. ఇక ప్రాంతాల పరస్పర సంబంధాల రీత్యా, మన ఫెడరల్ వ్యవస్థకు అనుగుణంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేశారు. కానీ ఆచరణలో మాత్రం దక్షిణాది వారంతా మాతృభాషతోపాటు హిందీ –ఇంగ్లిష్ నేర్చుకొంటే... ఉత్తరాది వాళ్లు మాత్రం తమ హిందీతో పాటు ఇంగ్లిష్తో సరిపెట్టుకొన్నారు. ప్రయోగ రీత్యా హరియాణా– పంజాబ్, బిహార్–ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో దక్షిణాది భాష లను అక్కడి కొన్ని విద్యాలయాల్లో బోధించినా ప్రోత్సాహం లభించలేదు. ఈ వైరుద్ధ్యం వల్ల ఈనాటికీ దక్షిణాది–ఉత్తరాది ప్రజల మధ్య భాషాపరంగా ఒక అగాథం మిగిలిపోయింది. బహుభాషా రాష్ట్రాలుగా ఉన్న ఈ దేశంలో... ప్రాంతీయంగా అక్కడి భాష అధి కార భాషగా ఉన్నప్పటికీ చాలావరకు ఇంగ్లిష్లోనే పరిపాలన సాగుతున్న యథార్థాన్ని కాదనగలమా? తమిళనాడు మరికొన్ని రాష్ట్రాలు తప్ప ఇతరత్రా అక్కడి ప్రజల భాషలో అధికార తతంగ మంతా ఇంగ్లిష్లోనే కొనసాగుతోంది. మరోవైపు హిందీని కేంద్ర ప్రభుత్వం రైల్వే విభాగాల్లో, బ్యాంకు, పోస్టల్ సర్వీసుల్లో సమాంతరంగా ప్రవేశపెట్టి అధికార భాషగా చాలాకాలం కిందటే అమలు చేసింది. ఇక్కడే ఒక ఆచరణా త్మక వాస్తవాన్ని గుర్తించక తప్పదు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల్లో, కేంద్ర పాలనలో మిగతా 22 భాషలను అధికార భాషలుగా అమలు చేయడం ఆచరణలో అసాధ్యం. అందువల్ల ఉమ్మడి భాషలుగా ఇంగ్లిష్–హిందీ భాషలు మన వ్యవహారంలో అనుసంధానంగా కొనసాగుతున్నాయి. ఈ వాస్తవాన్ని తిరస్కరించి, హిందీ పట్ల ద్వేషం పెంచుకోవడం భారతీయ భాషల పట్ల అపచారమే! బ్రిటిష్ సామ్రాజ్య వ్యాప్తి ద్వారా ఇంగ్లిష్ (మనదేశంలో వలస పాలన) ఇండియాలోకి ప్రవేశించిన తర్వాత ఆ భాషను మనం సామ్రాజ్యవాద భాష అని తిరస్కరించామా? ఒకప్పుడు లోహియా సోషలిస్టులు ‘అంగ్రేజీ హఠావో’ (ఇంగ్లిష్ను తొలగించండి) అని ఉద్యమించినా, ఉపాధి రీత్యా, సాంకేతిక తదితర విద్యాబోధనా మాధ్యమంగా ఇంగ్లిష్ అనివార్యమై ప్రాథమిక స్థాయి నుంచే దానిని నేర్చుకోవాలనే స్థితికి చేరుకున్నాం. మరో అతి ముఖ్యమైన అంశం– అనుసంధాన భాషగా హిందీ ఈ దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడుతున్న భాష. భాషా పరంగా అతి సులువుగా నేర్చుకోవచ్చు. ఒక రచయితగా నేను ఈరోజు హిందీలో కూడా రచనలు చేయగలుగుతున్నాను. హైస్కూలు స్థాయి నుంచి ‘త్రిభాషా సూత్రం’లో భాగంగా హిందీ రెండో భాషగా నేర్చు కోవడం వల్ల అది సాధ్యమైంది. గతంలో ఉర్దూ పదాల కలయికతో ‘హిందూస్తానీ’ భాషగా ప్రజల్లోకి వెళ్లిన హిందీని, ఉత్తరాది భాషా దురభిమానులు పనిగట్టుకుని సంస్కృతభూయిష్టంగా, పరిమితు ల్లోకి నెట్టివేశారు. అందువల్లే హిందుత్వ ఛాదస్తుల ప్రమాదం మరిం తగా భాషాపరంగా ఉందని చాలామంది భయపడుతున్నారు. ఇతరత్రా హిందీ మెజారిటీ ప్రజల భాష అనే వాదన పట్ల కొన్ని అభ్యంతరాలున్న మాట కూడా వాస్తవం. ‘ది పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా’ ప్రధాన సంపాదకుడు, ప్రముఖ భాషావేత్త, జీఎన్ దెవీ వివరణ ప్రకారం– 2011లో నమోదైన (సంఖ్యాపరంగా) హిందీ భాషీయులు 52.83 కోట్లు. అయితే ఈ హిందీ అనే ప్రాంతా లలోనే భోజ్పురి, మైథిలి, ఛత్తీస్గఢ్, రాజస్థానీ, పవాడీ మొదలైన స్థానిక భాషలు కలిసి ఉన్నాయి. వీటిని తీసివేస్తే, హిందీ అనేది 32 శాతానికి దిగి వస్తున్నదని దెవీ వాదన. (క్లిక్: ఆంగ్లంతోనే అనుసంధానం) హిందీ ఆధునికమైన భాష. ఇతర ప్రాచీన భాషలతో పోల్చితే వయస్సులో చిన్నదే. దెవీ భావిస్తున్నట్టు హిందీ అందమైన భాష. సాహిత్యపరంగా గౌరవ స్థానాన్ని సాధించుకున్నది. హిందీ సినిమా జనామోదం వల్ల దేశానికి ఎంతో ఖ్యాతిని, విదేశీ మారకాన్ని సంతరించి పెట్టింది. భౌగోళికంగా, చారిత్రక కారణాల వల్ల, పాలనా సౌలభ్య రీత్యా హిందీని అనుసంధాన భాషగా గౌరవించాలి. ఇంగ్లి ష్తో పాటు హిందీ అవసరాన్ని గత వందేళ్ల చరిత్ర నిరూపించింది. (చదవండి: ఒక్క భాషకు పెత్తనమా?) - నిఖిలేశ్వర్ ప్రముఖ కవి, రచయిత -
ఫేస్బుక్ ప్రాబ్లమ్స్
ఈ రోజు మనం ఓ పుస్తకం గురించి మాట్లాడుకుందాం. ఈ పుస్తకం గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది. ప్రపంచంలో దాదాపు అందరి దగ్గరా ఈ పుస్తకం ఉన్నట్టే. ఈ పుస్తకంలో ఎవరికి నచ్చిన పేజీలు వాళ్లు పెట్టేసుకోవచ్చు. ఈ పుస్తకానికి ముఖ చిత్రం ఉండదు.. చిత్రంగా ప్రతి ముఖానికీ ఓ పుస్తకం ఉంటుంది. పుస్తకం కాని ఈ పుస్తకం ఏంటో ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫేస్బుక్ !! ‘నా జీవితం తెరిచిన పుస్తకం’ అని అప్పట్లో ఏ మహానుభావుడు అన్నాడో కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు తమ జీవితాలను పుస్తకాలు తెరిచి మరీ ఎక్కించే అవకాశం కల్పించిన ఘనత ఫేస్బుక్కుదే. చిన్ననాటి స్నేహితులను కలిపేందుకు ఫేస్బుక్.. తెలియని పరిచయాలను పెంచేందుకు ఫేస్బుక్.. ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఏం చేసినా ఫేస్బుక్ వ్యక్తిత్వానికి చిరునామా, అస్తిత్వానికి హంగామా ఫేస్బుక్. కనెక్టింగ్ పీపుల్.. హల్లో, మీరు ఫేస్బుక్లో లేరా..! అంటూ ఆశ్చర్యపోయే ముఖపుస్తకరాయుళ్లు ఓ వైపు.. అసలు ఈ ముఖానికి ఓ బుక్కు అవసరమా అంటూ వాదించే వాళ్లు మరోవైపు. అసలంటూ అందులోకి దిగకుండా దాని సత్తా గురించి అంచనా వేయడం కష్టం. సామాజిక నెట్వర్కుల్లో సంచలనం అయిన ఫేస్బుక్, కోట్లాది నెటిజన్ల ఏకగళమై వినిపించే సామూహిక ఉద్యమంలా మారింది. ఈజిప్ట్ తెహ్రిర్ స్క్వేర్లో ప్రజావిప్లవం వెల్లువెత్తడానికి కారణం ఫేస్బుక్లో ఓ పోస్ట్. నిరసన గళాలను వినిపించడానికి నూతన భావాలను పంచుకోవడానికీ ప్రతి ఒక్కరికీ అవకాశం ఇస్తుందీ పుస్తకం. కొత్త తరానికి తగ్గ సరికొత్త ఆవిష్కరణ అయిన ఈ వేదిక నిస్సందేహంగా ఓ గొప్ప మాధ్యమం. ఏ దిల్ మాంగే మోర్.. ‘అతి సర్వత్ర వర్జయేత్’ ఫిలాసఫీ ఫేస్బుక్కీ వర్తింపజేసే క్రమంలో ఉంది ఇప్పటి తరం. చిక్కు మాధ్యమంతో కాదు వాడుతున్న విధానంతో. ఫ్రెండ్, ఫ్రెండ్కి ఫ్రెండ్, ఫ్రెండ్ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్.. ఇలా ఎలా వచ్చారని కాదన్నయ్యా ఎంతమంది ఉన్నారన్నదే ఇప్పటి ట్రెండ్. అంతేనా లైకుకి ప్రతిలైకు సంస్కారం అలాగని ప్రతీదీ లైక్ చేయడానికి అహంకారం, లైకు రావాలంటే లైక్ కొట్టాలి కానీ అక్కడ లైకులకంటే ఇక్కడ లైకులు ఎక్కువ రావాలి. లైకు లైకుకీ లెక్కలుంటాయి. లైకులు తక్కువైతే తిక్కలుంటాయి. లెక్క ఎక్కువైనా ఫర్లేదు షేర్ఖాన్, షేర్లు తక్కువ కాకుండా చూసుకోవాలి. ఫోన్లో ఫొటో కొట్టాలి, గోడ మీద పోస్ట్ పెట్టాలి, వదల బొమ్మాళీ అంటూ ప్రతి బొమ్మనీ ట్యాగ్ చేయాలి. ఎవరు ఏం పెట్టారో చూడాలి. మనం పెట్టింది ఎంతమంది చూశారో చూడాలి. ఎవరు ఇంకా పెట్టని కొత్తదనాన్ని కనిపెట్టాలి. హమ్మయ్య ! ఇన్ని చేస్తే సోషల్ నెట్వర్కింగ్లో కొంత హోదా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వన్టైమ్ ఇన్వెస్ట్మెంట్ కాదండోయ్. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలంటే ఇది డైలీ డోసు లాగా అలవాటు అవ్వాలి. ఇంత సమయం ఎక్కడుంది అని ఆలోచించేవారికి అదనపు సమాచారం. భారతీయులు సగటున 17 నిమిషాలు ప్రతిరోజూ ఫేస్బుక్లో గడుపుతున్నారట. రోజులో కనీసం మూడుసార్లు తమ పేజీ చూసుకుంటున్నారట. ఇవి కేవలం సగటు లెక్కలు. ఇక ‘సగటు’ అనిపించుకోవడానికి ఇష్టపడని యూత్ రూటే సపరేటు. లైక్ దిస్.. ⇒ ప్రతిసారీ కొత్తగా ఉండాలనే తపనలో కొత్త ఒత్తిళ్లకు లొంగిపోతున్నాం. ఈ కింది లక్షణాలు ఫేస్బుక్ యూజర్స్లో కామన్గా కనిపిస్తాయి. ⇒ మళ్లీ మళ్లీ ఫేస్బుక్ చూడాలనిపించడం ⇒ నోటిఫికేషన్ రాకపోయినా సరే ఫోన్ చూసుకోవడం ⇒ లైక్స్ ఎన్ని వచ్చాయో లెక్క చూడటం ⇒ సెల్ఫీ మనకు నచ్చేంత వరకూ తీసి పోస్ట్ చేయడం ⇒ ఫ్రెండ్స్లో సగంపైన ఇదివరకు కలవని వారు ఉండటం ⇒ రోజుకు రెండుసార్లు స్టేటస్ అప్డేట్ చేయటం ⇒ ఈమెయిల్ మెసేజ్లు తగ్గించడం ⇒ ప్రోఫైల్ లేదా కవర్ ఫొటోలో హీరో/హీరోయిన్ల ఫొటోలు పెట్టడం ⇒ ఫ్రెండ్స్ పెట్టిన స్టేటస్ తప్పనిసరిగా చూడటం వీటిలో ఏ మూడు లక్షణాలు మీలో ఉన్నా ఫెస్బుక్ డిప్రెషన్ సిండ్రోమ్ అనే ఓ కొత్త తరహా జబ్బుకు మీరు దగ్గరైనట్టే. నహి నహి రక్షతి.. లైకులు సంతోషాన్ని ఇచ్చినట్టే ఉంటాయి. ఫ్రెండ్స్ స్టేటస్ నచ్చినట్టే ఉంటుంది. కానీ ఫేస్బుక్ ఎడిక్షన్లా మారితే మాత్రం లైకులు రాలేదని డిప్రెషన్, పక్కోడి స్టేటస్ మనకంటే బావుందని అసూయ, అందంగా లేనేమోనన్న ఆత్మన్యూనత, వీటితో పాటు ఇంకెన్నో నెగెటివ్ ఎమోషన్స్ పెరుగుతున్నాయని రీసెర్చ్లు చెబుతున్నాయి. లైకు రేసులో పోటీపడకుండా ఫేస్బుక్ని వాడండి, ఫేస్బుక్కి బుక్కైపోకండి.