‘బర్ద్వాన్’కు శారదా స్కాం డబ్బు!
బీజేపీ చీఫ్ అమిత్ షా వ్యాఖ్య స్కాం దోషులను రక్షించేందుకు మమత ప్రయత్నం
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అవినీతి పాలన అంతమయ్యేందుకు సమయం దగ్గర పడిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి టీఎంసీని కూకటివేళ్లతో పెకిలించేందుకే తానిక్కడికి వచ్చానన్నారు. లోక్సభ ఎన్నికల విజయంతో ప్రారంభమైన మోదీ విజయ ప్రస్థానం.. 2016లో జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ముగుస్తుందన్నారు. ‘టీఎంసీ లేని పశ్చిమబెంగాల్’ మోదీ తాజా నినాదమని తెలిపారు.
కోల్కతాలో ఆదివారం ఒక భారీ సభలో ఆయన పాల్గొన్నారు. శారద చిట్ఫండ్ కుంభకోణం డబ్బును బర్ద్వాన్ పేలుడుకు ఉపయోగించారని ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పేలుడుతో సంబంధం ఉన్న టీఎంసీ నేతలను రక్షించేందుకు పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని షా ఆరోపించారు. అందులో భాగంగానే ఆ పేలుడుపై విచారణ జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు మమత అనేక అడ్డంకులు కల్పిస్తున్నారని షా పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. తన సభకు హైకోర్టు అనుమతి ఇవ్వడాన్ని ప్రజా విజయంగా అభివర్ణించారు. మమత ఓట్ల కోసం జాతి వ్యతిరేక శక్తులైన బంగ్లాదేశ్ చొరబాటుదారులకు బెంగాల్లో ఆశ్రయం ఇస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. ‘అమిత్ షానా? ఎవరు?’ అంటూ ఇటీవల మమత చేసిన వ్యంగ్య వ్యాఖ్యపై స్పందిస్తూ.. ‘దీదీ.. మీరు వినగలిగితే వినండి.. చూడగలిగితే చూడండి.. నేనే అమిత్ షాను. బీజేపీలో చిన్న కార్యకర్తను. బెంగాల్లో టీఎంసీ అవినీతి పాలనకు ముగింపు పలికేందుకు ఇక్కడికి వచ్చాను’ అని అన్నారు.
నమాజ్ పిలుపుతో ప్రసంగానికి విరామం..
సభా స్థలికి దగ్గర్లోని మసీదు నుంచి నమాజ్ పిలుపు(ఆజా) వినిపించడంతో షా తన ప్రసంగాన్ని మధ్యలో కొన్ని నిమిషాలు ఆపేశారు. ప్రసంగాన్ని కొనసాగించి తనను విమర్శించేందుకు మమతకు అవకాశమివ్వదలచుకోలేదని అన్నారు.